ఐఐటిలో ఆత్మజ్ఞానం
బతకడం కాదు జీవించడం ముఖ్యంఐఐటిలో పిహెచ్.డి.చేసి సన్యాసాశ్రమంవైపువివేకానందుడి స్ఫూర్తే సేవా మార్గానికి మళ్లించిందిబాగా చదువుకున్న వాళ్లు కూడా సామాజిక రంగానికి అవసరంఇప్పుడు వివేకానంద యూనివర్సిటీ డీన్ అతడే స్వామి సర్వోత్తమానంద.. ఒకప్పటి శ్రీష్ జాదవ్
Friday April 17, 2015,
3 min Read
డిగ్రీ పట్టా అందీ అందక ముందే... కాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్టయ్యి.. హయ్యస్ట్ శాలరీ కొట్టేయడమే గొప్పగా భావించే ఈ రోజుల్లో.... చదివింది ఏ బ్రాంచ్ అయినా కళ్లు మూసుకుని.... సాఫ్ట్వేర్ ఇంజనీర్లై పోయే ఈ కాలంలో, ఐఐటిలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్, పీహెచ్ డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్న వాళ్లు ఇంకెంత పెద్ద పొజిషన్లో ఉండాలి ? మరెంతగా డాలర్ల వేట సాగించాలి ?
ఒక గొర్రె వెనకే నడిచే మరో గొర్రెలా నడవాలనిపించలేదతనికి..
సిలికాన్ వ్యాలీలో పడి కొట్టుకు పోదామనిపించలేదు..
వేలాది డాలర్ల సంపాదనే జీవితంగా భావించాలనుకోలేదు..
కంప్యూటర్ సైన్స్ కే కాదు సోషల్ సర్వీస్ కీ విద్యావంతులు అవసరమనిపించింది..
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇచ్చిన స్పీచ్ లకన్నా.. చికాగోలో స్వామి వివేకానంద ఇచ్చిన ప్రసంగమే గొప్పగా అనిపించింది. తనలోని రాయిలాంటి గుండెకు జీవన రాగాలు నేర్పింది.
''బతకడం కాదు జీవించడమంటే ఏంటో తెలియజేసింది. నీకోసం బతికేది బతుకు- పదిమంది కోసం బతికేదే జీవితం.. జీవితానికీ బతుక్కీ మధ్య వ్యత్యాసం ఎప్పుడు తెలిసిందో.. అతని ఆలోచనే మారిపోయింది''.
అతను మరెవరో కాదు.. డాక్టర్ శ్రీష్ జాదవ్.. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం స్వామి సర్వోత్తమానందగా పిలిపించుకుంటున్నారు. బేలూరు రామకృష్ణ మటంలో విద్యా సేవ చేస్తున్నారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్లో 1989- 95 మధ్య విద్యనభ్యసించారు శ్రీష్ జాదవ్. ప్రస్తుతం.. బేలూర్ మఠంలోని రామకృష్ణ మిషన్ వివేకానంద యూనివర్శిటీలో డీన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కోఆర్డినేటర్ ఆఫ్ ద కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నారు.
చదువుకునే రోజుల్లోనే స్వామి వివేకానంద రచనల నుంచి స్ఫూర్తి పొందారు శ్రీష్ జాదవ్. వివేకానంద సమితి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్పంచుకునేవారు. అందరూ వెళ్లే దారిలో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక మార్గం ఎంపిక చేసుకున్నారు జాదవ్. ఉన్నత చదువులు చదివేది తాను ఉన్నత స్థితికి చేరుకోడానికన్న భావన మొదటి నుంచీ ఉండేది కాదు జాదవ్కి.. పదిమంది ఉన్నత స్థితి పొందడంలోనే తాను చదివిన ఉన్నత చదువులకు సార్ధకత అని నిర్ణయించేసుకున్నారు. అందుకే చదువుకునే నాటినుంచే చుట్టుపక్కల పేద విద్యార్ధులకు అక్షరజ్ఞానం నేర్పేవారు. బంధుమిత్రుల నుంచి నిధుల సేకరణ చేసి వారి అభ్యున్నతికి పాటు పడేవారు.
శ్రీష్ జాదవ్ చిన్ననాటి నుంచీ చదువులో మేటిగా ఉండేవారు. జేఈఈలో దేశ వ్యాప్తంగా రెండో ర్యాంకును పొందారాయన. ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ కూడా సాధించారు. అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలనుంచి స్కాలర్షిప్ అవకాశాలు కూడా అందివచ్చాయి. కానీ అవేవీ ఆయన్ను ఆకర్షించలేక పోయాయి. ఐఐటీ కాన్పూర్లోనే పీహెచ్.డీ చేశారు.
చూడ్డానికి ఎంతో నిరాడంబరంగా ఉంటూ.. అద్భుతాలు సృష్టించేవారు శ్రీష్ జాదవ్. ఇంత సాధారణంగా కనిపించే వ్యక్తిలో ఇంతటి ఆలోచనా శక్తా? అని ఆశ్చర్యపోయేవారు. క్యాంపస్లోని సాటి విద్యార్ధులు. జాదవ్ ఆలోచనలు అసాధారణం. అసలు పరీక్ష కోసం చదవాలనుకునే వారు ఒక్కసారి జాదవ్తో మాట్లాడితే చాలు.. వాళ్లకు పెద్దగా పుస్తకాలు చదవాల్సిన అవసరం రాకపోయేది. జాదవ్ మాటల్లోనే సమాధానాలు దొరికేవి. అంతగా నడిచే గ్రంధాలయంలా పేరు సాధించారు జాదవ్.
ముగ్గురు అమ్మాయిల మధ్య ఒక్కరే అబ్బాయిగా పుట్టారు శ్రీష్ జాదవ్. తనకూ కుటుంబముంది. తన బ్యాచ్మేట్స్ అందరిలాగే డాలర్లతో ఎంతో అవసరముంది. ఈ కారణాలేవీ అతన్ని సేవా మార్గం వైపు నుంచి తప్పించలేక పోయాయి. ఆ మాటకొస్తే కంప్యూటర్ రంగంతో పాటు సామాజిక సేవా రంగానికి కూడా విజ్ఞానవంతుల అవసరముందని అంటారు జాదవ్.
చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష అనే సూత్రాన్ని విడనాడి.. నీ చుట్టూ ఉన్న లోకమే నీ బంధు మిత్ర సపరివారం. వారిలో నీవారిని చూసుకోమన్న వివేకానంద సూక్తిని జీవనమార్గంగా అలవర్చుకున్నారు శ్రీష్ జాదవ్. అందుకే తనకు తెలిసిన సరిత అనే పన్నెండేళ్ల అమ్మాయి అనారోగ్యం పాలవుతుంటే చూసి చలించిపోయారు. మూడు లక్షల రూపాయలు సేకరించి.. ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయించారు. ప్రస్తుతం చిన్నారి సరిత, శ్రీష్ జాదవ్ లక్ష్యంలా సురక్షితంగానే ఉంది. ఆపరేషన్ పూర్తి చేసుకుని ఇల్లు చేరింది.
ఈ లోకంలో చాలా మంది మంచి వారున్నారు. వారికీ- బాధితులకీ మధ్య వారధిలా పనిచేయడమే మిగిలింది. అదే జరిగితే సరితలాంటి ఎందరో చిన్నారుల ముఖాల్లో సంతోషాల హరివిల్లు వెల్లివిరుస్తుందని అంటారు జాదవ్. అందుకే జాదవ్ శాలరీ కోసం పాకులాడకుండా సన్యాసం స్వీకరించారు. తన పూర్తి జీవితాన్ని బతకడం కోసం కాకుండా.. జీవించడం కోసం ఖర్చు చేయడానికి నిర్ణయించుకున్నారు. రామకృష్ణ మిషన్లో చేరి తనకు చేతనైనంత సాయం చేద్దామనుకున్నారు. మిషన్ రూపొందించే కార్యక్రమాల్లో తనవంతుగా పాల్పంచుకుంటున్నారు. వివేకానంద స్ఫూర్తితో ఎందరో విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు.
కాన్పూర్ ఐఐటీ నుంచి ఎందరో మేధావులు దేశ విదేశాల్లో ఎన్నో కంపెనీల్లో.. పెద్ద జీతాలకు పనిచేస్తున్నారు. కానీ, జాదవ్ వారందరికన్నా మించి కనిపిస్తారు. ఐఐటియన్లు సాధించిన విజయాల్లో ఇదే అతి పెద్దదిగా భావిస్తుంటారతని బ్యాచ్ మేట్స్. ఎందుకంటే వారెవరూ ఆలోచించని విధంగా జాదవ్ ఆలోచించారు. ఆచరణ సాధ్యం చేశారు. శ్రీష్ జాదవ్ విజయగాథ సామాజిక సేవలో పాల్పంచుకోవాలని భావించేవారికి మార్గదర్శకం. చదవడం కేవలం డబ్బు సంపాదన కోసం కాదు. కొందరికైనా సామాజిక సేవ వైపునకు నడవాలన్న తలంపు రాక పోవడం నిజంగా శోచనీయం. శ్రీష్ మహరాజ్ లాంటి మరికొందరు పుట్టుకురావాలి. అలా జరగాలీ అంటే మన విద్యా వ్యవస్థలో కచ్చితంగా మార్పు రావాలి.