4000 కోట్ల మీల్ ఓచర్స్ మార్కెట్ - తెనాలి అబ్బాయి టార్గెట్

4000 కోట్ల మీల్ ఓచర్స్ మార్కెట్ - తెనాలి అబ్బాయి టార్గెట్

Sunday February 07, 2016,

5 min Read

మీల్ ఓచర్స్. పెద్ద కంపెనీల్లో పనిచేసే వాళ్లందరికీ వీటి గురించి తెలిసే ఉంటుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే సోడెక్సో పాసుల వంటివి. సాధారణంగా ఐటి కంపెనీ ఉద్యోగులకు వీటిని విరివిగా వాడడం చూస్తూ ఉంటాం. పన్ను భారం తగ్గించుకోవడానికి కంపెనీలు.. తమ ఎంప్లాయీస్‌కు ఇచ్చే ఓచర్స్ ఇవి. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.4,000 కోట్లు ఉంటుందంటే ఆశ్చర్యపోకతప్పదు. అయితే ఈ ఓచర్స్ అన్నీ ఇప్పటికీ పేపర్ల రూపంలోనే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ యుగంలో కూడా ఇంకా పేపర్లను పట్టుకుని.. వేలాడటాన్ని జీటా అనే సంస్థ మార్చబోతోంది. సింపుల్ యాప్ ద్వారా డిజిటల్ మీల్ ఓచర్ బుక్స్‌ను తీసుకొచ్చింది. ఈ మార్కెట్లో ఇప్పుడీ కాన్సెప్ట్ ఓ ట్రెండ్ క్రియేట్ చేయబోతోంది.

image


జీటా కంపెనీ సహ వ్యవస్థపాకుల్లో తెనాలి అబ్బాయి రాంకీ గడ్డిపాటితో పాటు భవిన్ తురాఖియా ఉన్నారు. దశాబ్దాల తరబటి రొటీన్‌గా సాగుతున్న ఈ రంగంలో పెనుమార్పులు తీసుకురావడానికి వీళ్లిద్దరూ ప్రయత్నిస్తున్నారు.

ఇంతకీ ఏంటీ జీటా ?

జీటా అనేది మీల్ ఓచర్స్‌కు డిజిటల్ వర్షన్ లాంటిది. వీటిని సింపుల్‌గా ఎక్కడికైనా తీసుకోవచ్చు, అది కూడా జస్ట్ చేతిలో మొబైల్ ఉంటే చాలు. ఇవి పేపర్ పాసులకు, ఎలక్ట్రానిక్ మీల్ కార్డ్స్‌కు పూర్తిగా ప్రత్యామ్నాయం. చేతిలో మొబైల్, అందులో యాప్ ఉంటే చాలు.. ఆ ఓచర్స్‌ను ఎప్పుడైనా, ఎక్కడైనా క్యాష్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు. అవసరాన్ని బట్టి ఫుడ్, నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ కొనుగోలు చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

సాధారణంగా పేపర్ మీల్ ఓచర్స్ అన్నీ డినామినేషన్స్‌తో ఉంటాయి. ఇప్పుడు ఉదా. 117/- రూపాయల వస్తువు ఎక్కడైనా కొనుగోలు చేశామని అనుకుందాం. అప్పుడు కూపన్లలో ఉన్న వంద, పది, ఐదు లాంటి పేపర్ స్లిప్స్ చింపి షాపు వాళ్లకు ఇవ్వాలి. పైన ఎక్స్‌ట్రా డబ్బుకు సరిపడా మిగిలిన వస్తువులను ఏదైనా తీసుకోవడమో.. లేకపోతే.. చేతి నుంచి ఎక్స్‌ట్రా డబ్బు కట్టడమో చేయాల్సి ఉంటుంది. చిల్లర సమస్యలతో ప్రతీసారీ ఈ ఇబ్బందిని పేపర్ మీల్ ఓచర్స్ ఉపయోగించేటప్పుడు ఎదుర్కొంటారు. కానీ జీటా పనిచేసే విధానం వేరు అంటారు కంపెనీ ప్రతినిధులు.

ఈ స్టోరీని కూడా చదవండి

జీటా వ్యవస్థ ప్రతీ మర్చెంట్‌కు ఓ కోడ్ ఇస్తుంది. సదరు షాపులో బిల్లింగ్ అయిపోయిన తర్వాత మన మొబైల్‌లో ఆ షాప్ కోడ్, చెల్లించాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేస్తే చాలు. ఆ డబ్బు మర్చంట్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. పేపర్, డినామినేషన్, చిల్లర వంటి సమస్యలే ఉండవు అనేది జీటా కాన్సెప్ట్. ఒక వేళ సదరు షాప్, మర్చెంట్ లిస్ట్‌లో లేకపోయినా సమస్య లేదు. ఆ షాపు బిల్లును ఫోన్‌ యాప్‌ ద్వారా కెమెరాలో క్లిక్ చేసి అప్ లోడ్ చేస్తే, ఆ మొత్తం బ్యాంకు ఖాతాలోకి వస్తోంది, మీల్ ఓచర్స్ నుంచి డిడక్ట్ అయ్యాక. దీనివల్ల ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ మీల్‌ ఓచర్స్‌ను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు వెసులుబాటు కలిగినట్టు అవుతుంది.


మార్కెట్ సైజ్

'' మీల్ ఓచర్స్ మార్కెట్ సైజ్ సుమార్ రూ.4 వేల కోట్ల రూపాయలని ఓ అంచనా. ప్రస్తుతం దేశంలో 4 కోట్ల మందికి పైగా ఉద్యోగులున్నారు. వీళ్లలో 3.6 కోట్ల మంది పన్ను చెల్లిస్తూ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే అందులో 2 కోట్ల మంది వరకూ శాలరీడ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్లలో కొద్ది మంది మాత్రమే ఓచర్స్ ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మీల్ ఓచర్స్ ద్వారా పన్ను ఆదా చేసుకుని ఉద్యోగులు ఏటా 8 నుంచి 10 వేల రూపాయల మొత్తాన్ని మిగిలించుకోవచ్చు'' - రాంకీ.

సోడెక్సో, టికెట్, ఆటమ్జ్, ఈడెన్‌రెడ్ వంటి సంస్థలు డైరెక్ట్ కాంపిటీటర్స్ అయితే, ప్లాస్టిక్ కార్డ్స్ విభాగంలో ఐసిఐసిఐ బ్యాంక్ అందిస్తున్న పాకెట్స్ ఉన్నాయి.

ఇంత పెద్ద మార్కెట్‌ సైజ్‌ ఉన్న ఈ రంగంలో సోడెక్సోది ఏకఛత్రాధిపత్యం. అధిక మార్కెట్ వాటా ఉన్న కంపెనీగా కూడా అదే. కానీ పద్నాలుగేళ్లుగా ఆ కంపెనీ పేపర్లకే పరిమితమవడమే తమకు కలిసొస్తుందని జీటా చెబ్తోంది. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం కంపెనీలు తమ ఉద్యోగులకు వర్కింగ్ అవర్స్‌లో భోజన సదుపాయాల కోసం మీల్ ఓచర్స్‌ను ఇవ్వొచ్చు. అందుకే కంపెనీలు ఇలాంటి మీల్ ఓచర్స్‌ను ఇస్తూ ఉంటాయి. వీటి వల్ల ఏటా గరిష్టంగా రూ.10 వేల వరకూ ఉద్యోగులు సేవ్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.

image


కంపెనీలకు ప్రయోజనం ఏంటి ?

ప్రతీ నెలా మీల్ ఓచర్స్‌ను ఉద్యోగులందరికీ పంపడం ఓ పెద్ద టాస్క్. హెచ్ ఆర్ మేనేజర్లకు ఇదో తలనొప్పిలాంటి వ్యవహారం. నెలలో కనీసం రెండు, మూడు రోజుల పనిగంటలు ఇందుకోసం వృధా అయ్యేందుకు అవకాశాలున్నాయి. కొన్ని చోట సదరు మీల్ ఓచర్స్ కంపెనీలే ఆఫీసులకు వచ్చి ఆ బాధ్యతలను చూసుకుంటున్నా ఇది కష్టతరమైన ప్రాసెస్. ప్రతీ ఉద్యోగి టేబుల్ దగ్గరికి వెళ్లి ఓచర్స్‌ను అందించడం ఓ పెద్ద కార్యక్రమం. జీటా వల్ల అలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు రాంకీ. ఉద్యోగుల వివరాలు చెప్పేస్తే నేరుగా వాళ్ల ఖాతాల్లోకి డబ్బులు ఆన్‌లైన్‌లో జమ అయిపోతాయి. పనిభారం కూడా తగ్గిపోతుంది.

'' ఈ డిజిటల్ ఓచర్స్‌ను దాచుకోవాల్సిన అవసరం ఉండదు. బయటకు వెళ్లినప్పుడల్లా పట్టుకెళ్లాల్సిన టెన్షన్ లేదు. డినామినేషన్ తలనొప్పి ఉండదు. ఎక్స్‌పైర్ అయ్యే అవకాశం కూడా తక్కువ. వాళ్లకు ఇచ్చే ఓచర్లలో కనీసం 5-7 శాతం ఓచర్స్ మిస్ కావడమో, ఉపయోగించుకోకపోవడమో చేస్తుంటారు ఉద్యోగులు. దీని విలువ కూడా సుమారు కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా - జీటా ప్రోడక్ట్ టీమ్ మేనేజర్ ఫెలిక్స్.
image


రెవెన్యూ మోడల్

ఏప్రిల్ 1, 2015లో మొదలైన ఈ సంస్థ అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నో ప్రయోగాలు చేసింది. నాలుగు నెలల పాటు టెక్నాలజీపై పనిచేసిన టీం, ఆర్బీఐ - ఐటి నిబంధనలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దింది. ఈ అండ్ వై, కెపిఎంజి సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిబంధనలు రూపొందించింది. ఇక రెవెన్యూ మోడల్ విషయానికి వస్తే.. కంపెనీ, ఉద్యోగుల నుంచి ఈ సేవలకు కోసం ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయరు. మర్చంట్స్‌ నుంచి మాత్రమే కమిషన్‌ను జీటా వసూలు చేస్తుంది. సోడెక్సో లాంటి సంస్థలు ఒక్కో ట్రాన్సాక్షన్ కు 4 నుంచి 7 శాతం వరకూ ట్రేడర్ల నుంచి కమిషన్లను తీసుకుంటున్నాయి. అది కూడా 45 రోజుల తర్వాత పేమెంట్ మర్చంట్స్ కు పేమెంట్ అందుతుంది. ఈ క్యాష్ ఫ్లో ఆలస్యం వల్ల మరో 1 శాతం ఖర్చు పెరిగినట్టు భావించాల్సి ఉంటుంది. కాంపిటీటర్స్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు రెండు శాతానికి మాత్రమే తమ మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను పరిమితం చేస్తోంది కంపెనీ.

'' ఇప్పటివరకూ 30 పెద్ద కంపెనీలతో పైలట్ ప్రాజెక్టును సక్సెస్‌ఫుల్‌గా ముగించాం. వేగంగా కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు చూస్తున్నాం. హెచ్ ఆర్ మేనేజర్లకు ఈ ప్రోడక్ట్ గురించి వివరించేందుకు ప్రధాన నగరాల్లో రోడ్ షోస్ నిర్వహిస్తున్నాం. మర్చంట్స్ బేస్ పెంచుకోవాలని చూస్తున్నాం '' - జీటా కో ఫౌండర్ రాంకీ చెబ్తున్నారు.

ప్రస్తుతానికి సెల్ఫ్ ఫండింగ్‌తో నడుస్తున్న జీటా, ఇప్పట్లో ఈక్విటీని డైల్యూట్ చేయడానికి మాత్రం సిద్ధంగా లేదు. ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కావడంతో అప్పుడే తొందరపడట్లేదని చెబుతోంది. వేల్యూ అన్ లాకింగ్ తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని వివరిస్తోంది.

జీటా కాన్సెప్ట్ వెనుక

డైరెక్టీ గ్రూప్ సంస్థల నుంచి వస్తున్న కంపెనీ జీటా. సీఈఓ, కో ఫౌండర్ భవిన్ తురాఖియా ఇప్పటికే రింగో, ఫ్లాక్, రాడిక్స్, మీడియా నెట్ సంస్థలను స్థాపించారు. మరో కో ఫౌండర్ రామకృష్ణ గడ్డిపాటి (రాంకీ). ఇతనిది ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి ప్రాంతం. బిట్స్ పిలానీలో మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్, మాస్టర్స్ ఇన్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ చదివిన రాంకీ 2004లోనే BRIDLE పేరుతో ఓ స్టార్టప్ ప్రారంభించారు. బిట్స్ ఇంక్యుబేట్ చేసిన మొదటి కంపెనీ ఇది. 2008లో ఈ సంస్థను ఎడ్యుసర్వ్ అక్వైర్ చేసింది. 2006లో బిజినెస్ వీక్ రాంకీని 'ఏషియాస్ బెస్ట్ ఆంట్రప్రెన్యూర్స్ అండర్ 25'గా గుర్తించింది.

image


మోర్గాన్ స్టాన్లీలో కూడా పనిచేసిన రాంకీ 2009లో డైరెక్టీ గ్రూపులో చేరారు. అప్పటి నుంచి భావిన్‌తో ఫ్రెండ్‌షిప్ పెరిగి అదే గ్రూపులో ఇప్పుడు సీనియర్ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. ఇద్దరికీ టెక్నాలజీపై గట్టి పట్టుంది. ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం టెక్నాలజీకి మాత్రమే ఉందని బలంగా నమ్ముతారు. సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలనే తాపత్రయపడే మనస్తత్వం ఉన్నవాళ్లే.

website, APP

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి