ఎస్టీడీ బూత్ నడిపే వ్యక్తి కోట్ల రూపాయల వ్యాపారి ఎలా అయ్యాడు..?!

ఎస్టీడీ బూత్ నడిపే వ్యక్తి కోట్ల రూపాయల వ్యాపారి ఎలా అయ్యాడు..?!

Thursday October 20, 2016,

2 min Read

ఎస్టీడీ బూత్. పదేళ్ల క్రితం ఓ మాదిరిగా నడిచిన బిజినెస్. నష్టాలు పెద్దగా ఉండవు. అలాగని లాభమూ ఏమంత గొప్పగా ఉండదు. తర్వాత్తర్వాత స్మార్ట్ ఫోన్స్ ఎంట్రీ ఇచ్చాయి. వాట్సప్, వైబర్, ఆపై సోషల్ మీడియా. వీటి దెబ్బకు వీధి చివరన ఉండే ఎస్టీడీ బూత్ కనుమరుగైపోయింది.

ఇలాంటి బిజినెస్ లో ఉండి కోట్ల రూపాయలు సంపాదించడమంటే మాటలు కాదు. అరుణ్ కారత్ అలాంటి విజయమే సాధించాడు. పుణెలో ఒక ఎస్టీడీ బూత్ పెట్టి కోట్ల రూపాయల వ్యాపారానికి అధిపతి అయ్యాడు. ఒక మంచి పోష్ ఏరియాలో ఇల్లుంది. వింగ్స్ పేరుతో ట్రావెల్స్ స్థాపించాడు. అందులో రెంటల్ కార్స్, రేడియో క్యాబ్స్, 600 మంది ఉద్యోగులు.. మొత్తంగా 140 కోట్ల రూపాయల టర్నోవర్. ఇదంతా ఎలా సాధ్యమైంది?

అరుణ్ కారత్. 49 ఏళ్లుంటాయి. చిన్నప్పుడు చదువు వంటబట్టలేదు. సోదరుడు మాత్రం పుస్తకాల పురుగు. అతనిప్పుడు డాక్టర్. కానీ అరుణ్ మాత్రం పదో క్లాస్ దగ్గరే ఆగిపోయాడు. మామయ్యకు ఒక చిన్న చెప్పుల షాప్ ఉండేది. పొద్దంతా దాంట్లోనే గడిపేవాడు. ఎలాగైనా సొంతంగా ఒక బిజినెస్ రన్ చేయాలన్న ఆలోచన ఒక పట్టాన ఉండనిచ్చేది కాదు. కానీ బిజినెస్ చేయాలంటే పదో తరగతి సరిపోదని భావించాడు. వెంటనే వెళ్లి పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా కంప్లీట్ చేశాడు.

తర్వాత అక్కడా ఇక్కడా కొన్ని ఉద్యోగాలు. నచ్చక మానేశాడు. రోజులు గడిచాయి. ఇక లాభం లేదని సొంత వ్యాపారానికి సంకల్పించాడు. మొదట వచ్చిన ఐడియా ఎస్టీడీ బూత్. కొన్నాళ్లు రన్ అయిన తర్వాత ఓ ప్రైవేట్ ట్రావెల్స్ తో మాట్లాడుకుని టికెట్ బుకింగ్ ఏజెన్సీ కూడా జతచేశాడు. అంతో ఇంతో కూడబెట్టాడు. 1993-94లో కార్లు అద్దెకు తీసుకుని తిప్పాడు. 96 వరకు బిజినెస్ బాగానే సాగింది. ఆ తర్వాత సొంతంగా కార్లు కొనుక్కున్నాడు.

image


కట్ చేస్తే.. వింగ్స్ ట్రావెల్స్ ఇండియాలో తొమ్మిది నగరాల్లో విస్తరించింది. ముంబై, పుణె, గుర్గావ్, చెన్నయ్, హైదరాబాద్, బెంగళూరు, చండీగఢ్‌, అహ్మదాబాద్, బరోడాలో వింగ్స్ ట్రావెల్స్ స్వింగ్ మీదుంది. థాయ్ లాండ్‌ లో కూడా ఇటీవలే బ్రాంచ్ ఓపెన్ చేశారు. కంపెనీలో సొంతకార్లు 475 ఉన్నాయి. 800పైగా బండ్లు మాలిక్ చలాక్ స్కీం కింద తీసుకున్నాడు. ఇవి కాకుండా 5,500 క్యాబ్స్ కాంట్రాక్ట్ బేస్ మీద నడిపిస్తున్నాడు.

ఇప్పుడు అరుణ్ స్థాపించిన వింగ్స్ ట్రావెల్స్ ఒక యునిక్ వెంచర్. ఈ సంవత్సరమే ముంబైలో ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్) కమ్యూనిటీకి చెందిన ఓ 300 మందికి డ్రైవింగ్ లో తన కంపెనీ తరపున ట్రైనింగ్ ఇప్పించారు. ఆ నేపథ్యంలోనే వింగ్స్ ట్రావెల్స్ ఎల్జీబీటీ కమ్యూనిటీ ఆర్గనైజర్ హమ్సఫర్‌ ట్రస్టుతో కొల్లాబరేట్ అయింది. ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఔత్సాహికులకు మంచి అవకాశాలు ఇవ్వాలన్నది వీరి కాన్సెప్ట్.

ఇదే కాకుండా, ప్యాసింజర్ల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తూ.. ఇటీవలే బెంగళూరులో బ్రాంచిలో ఎస్‌వోఎస్ ఫీచర్స్ ఉన్న క్యాబ్‌లను ప్రవేశపెట్టాడు. దానివల్ల కస్టమర్లకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే గుర్తిస్తారు. నిమిషాల్లో అక్కడికి స్టాఫ్ చేరుకుని ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది.

ఇటు వ్యాపారానికి వ్యాపారం.. అటు సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలనే దృక్పథం.. ఇలా అరుణ్ కంపెనీ దూసుకుపోతోంది.