ఆటోల్లో అడ్వర్టయిజ్మెంట్స్.. వాట్ ఎన్ ఐడియా గురూ..!

లోకల్ బ్రాండ్లకు ప్రచారం కల్పిస్తున్న పుణె స్టార్టప్

ఆటోల్లో అడ్వర్టయిజ్మెంట్స్.. వాట్ ఎన్ ఐడియా గురూ..!

Tuesday March 22, 2016,

2 min Read


అర నిమిషం టీవీ యాడ్ కోసం లక్షలు ఖ‌ర్చు పెట్టాల్సిన ప‌నిలేదు! బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవడానికి ఖరీదైన భారీ హోర్డింగుల అవ‌స‌రం రాదు! ఆ మాటకొస్తే లోకల్ బ్రాండ్ కు నాన్ లోకల్ ప్రచారం శుద్ధ దండగ! మరి ప్రోడ‌క్ట్ జనానికి రీచ్ కావడమెలా? దానికో మార్గం ఉంది. అదేమిటో ఈ స్టోరీ చదివితే మీకే తెలుస్తుంది!

ప్రాక్సిమిటీ అడ్వర్టైజింగ్! అంటే లోకల్ బ్రాండ్లకు ప్రచారం కల్పించడం! వ్యాపార ప్రకటనల్లో ఇదొక సరికొత్త ట్రెండ్! పుణెకు చెందిన అభయ్ బోరా (37), యష్‌ ముథా(35), కమ్లేశ్ సంచేతి (35) అనే ముగ్గురు యువ ఆంట్రప్రెన్యూర్లు కలిసి ఈ కంపెనీని ప్రారంభించారు. పేరు కూడా ప్రాక్సిమిటీ అనే పెట్టారు.

ఇమేజ్ క్రెడిట్; షట్టర్ స్టాక్

ఇమేజ్ క్రెడిట్; షట్టర్ స్టాక్


పుణె లాంటి మహానగరంలో ఏ మూల‌కు వెళ్లాలన్నా ఆటో కంపల్సరీ! సామాన్యుడి నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగి దాకా ఏదో ఒక అవసరం కోసం ఆటో ఎక్కుతుంటారు. ప్రాక్సిమిటీ ఫౌండ‌ర్లు స‌రిగ్గా అదే పాయింట్ ను క్యాచ్ చేశారు! తమ వ్యాపారానికి ఆటోలను ఎంచుకున్నారు. నగరంలోని 300 ఆటో రిక్షాల్లో టచ్ స్క్రీన్ టాబ్లెట్లు బిగించారు. ఆటో లోపల డ్రైవర్ సీటు వెనక భాగంలో దాన్ని అమర్చారు. అందులో లోకల్ బ్రాండ్లకు సంబంధించిన రకరకాల ఇమేజీలు, ఆడియో, వీడియో వ్యాపార ప్రకటనలు ప్లే చేస్తుంటారు. ఈ ట్యాబ్ సిస్టమ్ కు రికీ అని పేరు పెట్టారు.

యాడ్ ఆన్ వీల్స్!

జర్నీలో అందులోనూ ఆటోలో ప్రయాణిస్తూ యాడ్స్ చూడాలంటే మహా బోర్! అందుకే ప్రాక్సిమిటీ నిర్వాహకులు ఒక ఏర్పాటు చేశారు. టాబ్లెట్ పీసీలో మూవీ ట్రైలర్స్, సాంగ్స్, ఇతరత్రా ఎంటర్ టైన్ మెంట్ వీడియోలు అప్ లోడ్ చేశారు. వాటి మధ్యలో యాడ్స్ వచ్చేలా సిస్టమ్ సెటప్ చేసి పెట్టారు. అన్నట్టు ఆటోలో టైం పాస్ కాకపోతే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. గేమ్ మధ్యలో యాడ్ పాప్ అప్స్ వచ్చి పోతుంటాయి. ఏదైనా యాడ్ ఇంట్రస్టింగ్ గా ఉంటే దాని మీద టచ్ చేస్తే సరిపోతుంది. సదరు బ్రాండ్ కు సంబంధించిన సమాచారమంతా డిస్ ప్లే అవుతుంది. యాడ్ నచ్చకపోతే ఇంకో యాడ్ చూసే వెసులుబాటు కూడా ఉంది. లోకల్ బ్రాండ్స్ కు సంబంధించి ప్రయాణికులు తమ సలహాలు సూచనలు కూడా ఇవ్వొచ్చు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. టాబ్లెట్ పీసీలో సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. జీపీఎస్ సాయంతో ఆటో ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకోవచ్చు.

ఆటో డ్రైవ‌ర్ల‌కూ ఆదాయం!

ఈ కొత్త కాన్సెప్ట్ ద్వారా ఆటో యజమానులు కూడా నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు, యజమానులకు పది నుంచి 15 శాతం దాకా అదనంగా ఆదాయం వస్తోంది. టాబ్లెట్ పీసీలు అమర్చిన తర్వాత ట్రాఫిక్ జామైనా ప్యాసింజర్లు పెద్దగా ఇబ్బంది పడటం లేదంటున్నారు ఆటో డ్రైవర్లు.

ఇండియన్ స్టార్టప్ సిస్టమ్ నిరంతరాయంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో మా ప్రాక్సిమిటీ కంపెనీ కూడా ఒకటి. మధ్య తరగతి గృహిణులు, స్కూల్ పిల్లల నుంచి మొదలుకొని ప్రొఫెషనల్స్, సీనియర్ సిటిజన్స్ వరకు మా వ్యాపార ప్రకటనలను చేరవేస్తున్నాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది- అభయ్ బోరా

ఫ్యూచ‌ర్ ప్లాన్ ఇదీ..!!

ముగ్గురితో ప్రారంభమైన ప్రాక్సిమిటీ కంపెనీలో ప్రస్తుతం 16 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రాక్సిమిటి బిజినెస్ ఐడియా నచ్చి తాము కూడా అందులో పెట్టుబడి పెట్టామని వన్ క్రౌడ్ కో ఫౌండర్ అనిల్ గుదిబండే చెప్తున్నారు. ప్రాక్సిమిటీ సంస్థ తొలి రౌండ్ ఫండింగ్ లోనే కోటి రూపాయల నిధులు సేకరించింది. పుణెతో పాటు ఇతర నగరాలకు స్టార్టప్ ను విస్తరించడానికి ఈ నిధులను ఉపయోగించుకుంటామని ఫౌండర్లు చెప్తున్నారు. మరిన్ని ఆటోల్లో టచ్ స్క్రీన్లు బిగించి, ముందు ముందు క్యాబ్స్ తో పాటు ఇతర భారీ రవాణా వాహనాలకూ తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని అభయ్ యువర్ స్టోరీకి చెప్పారు. ఆల్ ది బెస్ట్ టు ప్రాక్సిమిటీ!!

వెబ్ సైట్; ప్రాక్సిమిటీ