మహిళా శక్తి, మేథస్సు, సామర్ధ్యాలకు ప్రతిరూపం ఇంద్రానూయి
వ్యాపార రంగంలో వెలుగుతున్న మహిళా శక్తిజాన్సన్ అండ్ జాన్సన్లో ప్రోడక్ట్ మేనేజర్ నుంచి... పెప్సీకో సీఈఓ స్థాయికి ఎదుగుదలనూయి హయాంలో రెట్టింపైన కంపెనీ లాభాలుటేకోవర్ వ్యూహాలతో వ్యాపార వృద్ధి
Saturday May 02, 2015,
3 min Read
ప్రపంచ వ్యాపార రంగంలో వెలుగుతున్న మహిళా శక్తి.. ఇంద్రా నూయి. అక్టోబర్ 28, 1955లో తమిళనాడులోని చెన్నైలో నూయి జన్మించారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో 1974లో భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలలో బ్యాచ్లర్ డిగ్రీని అభ్యసించిన నూయి..1976లో కలకత్తాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి మేనేజ్మెంట్లో పిజి డిప్లొమాను పూర్తి చేశారు. తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్తోపాటు, మెట్టుర్ బియర్డ్సెల్ అనే వస్త్ర పరిశ్రమలలో ప్రోడక్ట్ మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ 1978లో ఏల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చేరి పబ్లిక్, ప్రైవేట్ మేనేజ్మెంట్ నిర్వహణలో మాస్టర్ డిగ్రీని పూర్తిచేసిన నూయి.. ఆ సమయంలోనే బూజ్ అల్లెన్ హామిల్టన్ లో సమ్మర్ ఇంటర్షిప్ పూర్తి చేశారు. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపులో చేరారు. 1980లో ఏల్లో చదువు పూర్తయిన తరువాత మోటరోలా, ఆసియ బ్రౌన్ బొవెరీ సంస్థలలో కీలకమైన పదవీ బాధ్యతలు నిర్వహించారు.
ఇలా కొంతకాలం ప్రముఖ సంస్థలకు ప్రాతినిథ్యం విహస్తూ సాగిన నూయి ప్రయాణం.. 1994లో పెప్సి సంస్థలో చేరే వరకు వెళ్ళింది. ఏడేళ్ళ తర్వాత 2001లో ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్తోపాటు సంస్థ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. సంస్థ ఆదాయాన్ని పెంచుతూ.. వ్యాపార కార్యకలాపాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. ఇంద్రా నూయి పెప్సి సంస్థకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి నేటి వరకు సంస్థ ఏటికేటా పెరుగుతూనే ఉన్నాయంటే ఆమె వ్యాపార దక్షతను అర్థం చేసుకోవచ్చు. వ్యాపారాభివృద్ధికి నూయి తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా, సూటిగా ఉంటాయి. 45 ఏళ్ళ చరిత్ర కలిగిన పెప్సీ సంస్థకు ఐదవ సీఈఓ అయిన నూయి సుదీర్ఘకాలంగా ఆ అధ్యక్ష పదవిలో ఉంటున్నారు.
వ్యూహాలే కీలకం
పెప్సీకో అనేక రంగాల్లో కాలుమోపడంలో... నూయి వ్యూహాలు చాలానే ఉన్నాయి. దశాబ్దకాలంలో పెప్సీకో దశ, దిశ మార్చి వేశారామె. సంస్థను రీస్ట్రక్చర్ చేయడంలోనూ నూయి కృషి అపారం. వ్యూహాత్మక మార్పుల్లో భాగంగా 1997లో పెప్సీకో ఆధీనంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లను ట్రైకాన్ అనే ఒక కొత్త సంస్థగా విభజించారు. ఈ ట్రైకాన్ సంస్థే ఇప్పుడు యమ్ బ్రాండ్స్గా మారింది. 1998లో ట్రాపికానాను పెప్సీకోలో విలీనం చేయడం, అలాగే క్వేకర్ ఓట్స్ సంస్థ, గేటరేడ్ విలీనాలు కూడా నూయి కృషే. బిజినెస్ వీక్ పత్రిక కథనం ప్రకారం, 2000 సంవత్సరంలో ప్రధాన ఆర్థికాధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత పెప్సీకో రాబడి 72 శాతం వృద్ధి చెందింది. లాభాలు రెట్టింపయ్యి 5.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
భారత్లో కొత్త పెట్టుబడులు
గ్లోబల్ బెవరేజెస్ కంపెనీ పెప్సీకో ఇప్పటికే దేశంలో భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. "2020నాటికి భారత్లో రూ. 33,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నాం. కొత్త పెట్టుబడులతో సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుంటాం. 1989లో దేశీయంగా కార్యకలాపాలను ప్రారంభించిన పెప్సీ.. ఇప్పటి వరకూ భారత్లో 200 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్చేసింది. ప్రస్తుత కరెన్సీ మారకం ప్రకారం ఇది 12వేల 600 కోట్ల రూపాయలకు సమానం. వివిధ వ్యూహాత్మక విభాగాలలో పటిష్టతను సాధించేందుకు పెట్టుబడులను వినియోగించనున్నా" పెప్సీకో ఛైర్మన్ ఇంద్రా నూయి వివరించారు. తయారీ సామర్థ్యం, కొత్త ఉత్పత్తులు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ విభాగాలపై దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ చెబుతోంది.
కోక్ పై ఫైర్
రానున్న ఏడేళ్ల కాలంలో ఇటు పానీయాలు, అటు ఆహార ఉత్పత్తులపై ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఇంద్రానూయి చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఫ్రాంచైజీలతో కలిపి పెప్సీకోకు 42 ప్లాంట్లున్నాయి. పెప్సీ, 7అప్, స్లైస్ తదితర శీతల పానీయాలతోపాటు లెహర్, కుర్కురే, అంకుల్ చిప్స్ వంటి ఆహార ఉత్పత్తుల బ్రాండ్లను కంపెనీ కలిగి ఉంది. ఇదే సమయంలో కోక కోలా బ్రాండ్లపై విమర్శలు చేసేందుకు కూడా పెప్సీ వెనకాడలేదు. ధమ్సప్, మాజా, లిమ్కా వంటి దేశీయ పాత బ్రాండ్లను కోకకోలా కొనుగోలు చేసిందని, వాటితోనే ఇప్పటికే కాలం వెళ్లబుచ్చుతోందని పెప్సీ వర్గాలు విమర్శించాయి. తమ సంస్థ మాత్రం సొంతంగా అభివృద్ధి చేసిన బ్రాండ్లను మాత్రమే విక్రయిస్తున్నామని ఇంద్రానూయి అంటున్నాన్నారు.
అవార్డులు- రివార్డులు
వ్యాపార రంగంలో ప్రభంజనం సృష్టిస్తున్న నూయికి వ్యాపార పరంగా ఎన్నో అవార్డులు దక్కగా భారత ప్రభుత్వం 2007లో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్తో సత్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది మహిళల జాబితాలో ఫోర్బ్స్ మ్యాగజైన్ వరుసగా 2008, 09లలో స్థానం లభించింది. అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో ఫార్చ్యూన్ మ్యాగజైన్ 2006 నుంచి ఇప్పటివరకు స్థానం కల్పిస్తూ వస్తోంది. అమెరికాకు చెందిన న్యూస్, వరల్డ్ నివేదిక సైతం 2008లో నూయికి ఉత్తమ నాయకత్వ లక్షణాలు గల ప్రముఖుల జాబితాలో చోటిచ్చింది. ఇక నూయి వ్యక్తిగత జీవితానికొస్తే..రాజ్కాంతీలాల్ను వివాహమాడి ఇద్దరు పిల్లలకు మాతృ ప్రేమను అందిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు గ్రీన్విచ్, కనెక్టికట్లో నివసిస్తున్నారు. పెద్దమ్మాయి యేల్ విశ్వవిద్యాలయంలో చదువుతుండగా... నూయి ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన మాతృమూర్తుల జాబితాలో మూడో స్థానంలో నిలవడం విశేషం.
విపరీతమైన ప్రజాదరణ పొందిన టీవీ ప్రోగ్రాం.. గాసిప్ గర్ల్ రెండు ఎపిసోడ్లలో నటించారు నూయి. బ్లైర్ వాల్డార్ఫ్ ఈమె దగ్గర శిష్యరికం చేయడానికి ప్రయత్నించిన సన్నివేశాల్లో కనిపించారు.
ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకున్న ముఖ్య కార్యనిర్వహణాధికారిగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ ఇంద్రానూయి. పెప్సీకో అధ్యక్షురాలిగా 2014 లో ఈమె అందుకున్న మొత్తం వేతనం 19 మిలియన్ అమెరికన్ డాలర్లను వేతనంగా పొందారు ఇది మన రూపాయల్లో అయితే అక్షరాలా ₹120 కోట్లు.