స్వర్ణదేవాలయ నిర్వాహణ నుండి మీరు ఏం నేర్చుకోవచ్చో తెలుసుకోండి ?
అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో రోజూ లక్షమందికి భోజనాలు..చెప్పుల స్టాండ్లు, వంటశాల, డైనింగ్ హాల్ అన్ని ప్రదేశాల్లోనూ వాలంటీర్ల సేవాతత్పరత..వంటపాత్రలనూ శుభ్రం చేస్తూ మానవత్వం చాటుతున్న సేవకులుప్రతీక్షణం సేవామయంతో మార్మోగిపోతున్న స్వర్ణదేవాలయం..
Wednesday June 03, 2015,
4 min Read
ఇది సాధారాణ కిచెన్ కాదు. ప్రతిరోజు 24 గంటలపాటు, ఏడు రోజులూ విరామం లేకుండా అక్కట వంటలు వండుతూనే ఉంటారు. ప్రతిరోజూ లక్షమందికి ఆకలి తీరిస్తున్న వంటగది ఇది. కులం, మతం పట్టింపులు లేకుండా అన్ని వర్గాల వారికీ కడుపునిండా భోజనం పెడుతున్న ఫుణ్య కిచెన్ ఇది. అందరూ దేవుని ముందు సమానమే అన్న సందేశమే ఇక్కడ రాజ్యమేలుతున్నది.
స్వర్ణదేవాలయం వంటగదిలో సగటున ప్రతిరోజు 5 వేల కిలోల వంట చెరుకు, 100 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను ఆహారాన్ని తయారుచేసేందుకు ఉపయోగిస్తుంటారు. పెద్ద సంఖ్యలో సేవకులు ఆహారాన్ని భక్తులకు వడ్డిస్తుంటారు. వంటగదిలో పనిచేసే 400 మందికి తోడు ప్రతిరోజు ఎంతోమంది సేవకులు (వాలంటీర్లు) ఆహారాన్ని తయారుచేసేందుకు సాయం చేస్తుంటారు. మంచి మనసుతో వచ్చే ఎవరైనా ఈ పుణ్య కార్యంలో పాలుపంచుకోవచ్చు.
అందరూ సమానమే అనే కాన్సెప్ట్ స్వర్ణదేవాలయంలో ప్రతి అడుగులోనూ ప్రతిబింబిస్తుంది. భక్తులు బసచేసే గురుద్వారా కాంప్లెక్స్ నుంచి, భోజనం చేసే "లుంగార్" వరకూ అంతటా అందరూ సమానమే.
భక్తుల చెప్పులను భద్రపరచడంలో కావొచ్చు, లేదంటే నీటి సరఫరా కావొచ్చు. సేవాతత్పరతే స్వర్ణ దేవాలయం సేవకులకు జీవితం. దేవుడి ముందు శరీరం రంగు, మతం, కులం అన్ని మాయమైపోతాయి. కేవలం మానవత్వం మాత్రమే పరిమళిస్తుంది. అంతకుమించి ఏమీ ఉండదు.
పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ (స్వర్ణదేవాలయం) ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచింది. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 30 ఏళ్లయిన సందర్భంగా అక్కడ మరోసారి హింస చెలరేగి వార్తల్లో నిలిచింది. నాస్తికులైనా సరే ఓ సారి స్వర్ణదేవాలయాన్ని సందర్శించాల్సిందే. అక్కడికి ఒక్కసారి వెళ్లొస్తే సేవ అంటే ఏమిటో తెలుస్తుంది. సంస్థ (చిన్న, మధ్య తరహా పరిశ్రమ కావొచ్చు, స్టార్టప్ కంపెనీ కావొచ్చు)ను ఎలా నిర్వహించాలో అర్థమవుతుంది. స్వర్ణ దేవాలయంలో ఒక్క "లుంగార్" నిర్వహణకే కోట్లాది రూపాయలు ఖర్చవుతాయి. అవన్నీ విరాళాల రూపంలోనే వస్తాయి.
అమృత్సర్లో ఉన్న ఈ స్వర్ణ దేవాలయం సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. కానీ కులమతాలకు తావులేకుండా ఎవ్వరైనా ఈ దేవాలయాన్ని సందర్శించొచ్చు. అక్కడి వాలంటీర్ల సేవలను పొందొచ్చు.
ప్రతిరోజు లక్షమందికి లుంగార్లో భోజనం పెడతారు. వాలంటీర్ల సాయంతో ఈ భోజనశాల ప్రతిరోజూ 24 గంటలు పనిచేస్తుంది. దేవాలయాన్ని సందర్శించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ సేవకులు సేవలందిస్తారు.
వందలాదిమంది సేవకులు ఆహారాన్ని తయారుచేయడంలో సాయం చేస్తారు. అది కూరగాయలను తరగడం కావొచ్చు, లేదంటే వాటిని వేరు చేయడం కావొచ్చు. అన్ని రకాల పనులను చేస్తారు. కిచెన్ అంటే ఒక్క మహిళలే కాదు. మగవారు కూడా వంటగదిలో తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించవచ్చు.
అలాగే అన్ని వయసుల వారు స్వర్ణదేవాలయంలో సేవకులుగా తమ సేవలను అందిస్తారు. ఎనిమిదేళ్ల కుర్రాల నుంచి 80 ఏళ్ల ముదసలి వరకు స్వర్ణదేవాలయంలో తమ చేతనైనంత పనిచేస్తారు.
భోజనం తర్వాత వంటపాత్రలను చిన్నవి (చెంచాలు), మధ్య తరహా (కంచాలు, గిన్నెలు) పాత్రలుగా వాలంటీర్లే వేరు చేస్తారు. సులభంగా శుభ్రం చేసేందుకు ఇలా వేర్వేరు చేస్తారు సేవకులు.
ఇలా వేరు చేసిన తర్వాత పలుసార్లు వాటిని నీటితో శుభ్రం చేస్తారు. వంటపాత్రలకు ఎలాంటి ఆహారం కూడా లేకుండా జాగ్రత్త పడ్తారు. ఈ పనులు కూడా వాలంటీర్లే చేస్తారు.
సేవ చేసేందుకు వచ్చే భక్తుల కోసం స్వర్ణదేవాలయం మేనేజ్మెంట్ అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. వంటపాత్రలను శుభ్రం చేసే సేవకుల వస్తువులు నీటిలో తడువకుండా సురక్షితంగా ఉంచుతుంది. వాలంటీర్లను యాజమాన్యం చక్కగా చూసుకుంటుంది.
భోజనం చేసిన తర్వాత కొంతమంది భక్తులు దివాన్ హాల్ మాంజీ సాహిబ్ దిశగా తలపెట్టి కొద్ది సేపు సేదతీరుతారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. పేదైనా, ధనవంతుడైనా దేవుడి ముందు సమానమే. ఎవరికైనా ఇలా పడుకొని ప్రార్థన చేసేందుకు కేవలం ఆరడగులు కంటే ఎక్కువ అవసరముండదు.
ఆహారాన్ని(చపాతీలను) తయారుచేసేందుకు ప్రతిరోజు ఏడు వేల నుంచి పదివేల కిలోల పిండిని ఉపయోగిస్తారు.
దేవాలయం సిబ్బందితోపాటు సేవకులు కూడా చపాతీలు( ప్రసాదం) తయారు చేసేందుకు సాయం చేస్తారు. ప్రతిరోజు రెండు లక్షల నుంచి మూడు లక్షల చపాతీలను తయారుచేస్తారు.
సేవచేసేందుకు భక్తులు ఎంతో ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఎలాంటి అరమరికలు లేకుండా భక్తితో తమ వంతు పనిచేస్తారు.
స్వర్ణదేవాలయంలోకి అడుగుపెట్టగానే అక్కడ ప్రవహిస్తున్న నీటిలో తమ పాదాలను శుభ్రం చేసుకుంటారు భక్తులు. ఇలా చేయడం ద్వారా తమ స్వార్థచింతన, పక్షపాతాలను వదిలి వేస్తున్నట్టు భక్తులు నమ్ముతారు.
స్వర్ణదేవాలయం వద్ద ఉన్న కొలనులో స్నానమాచరిస్తారు మరికొందరు.
సేవ అంటే ఎలాంటిదైనా కావొచ్చు సంతోషంగా చేస్తారు భక్తులు. అది చెప్పులు భ్రదపరిచే గది కావొచ్చు. లేదంటే ఆహారాన్ని సరఫరా చేసే ప్రదేశం కావొచ్చు. సేవలో చిన్నా పెద్ద అనే తారతమ్యం అస్సలే ఉండదు.
ఈ దేవాలయం నిర్వహణకు సాయం చేసే భక్తుల మంచి మనసుకు కృతజ్ఞతలు చెప్పాలి. కొంతమంది సేవ చేస్తుంటే, మరికొంతమంది తమ విరాళాలతో స్వర్ణదేవాలయ నిర్వహణకు సహకరిస్తారు. మరికొందరు తక్కువ ధరకే కూల్డ్రింక్స్ను అందజేస్తూ భక్తుల దాహాన్ని తీరుస్తారు.
ఇక స్వర్ణ దేవాలయాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తులు అక్కడికి దగ్గరలోని గురుద్వారాల్లో ఉచితంగా బసచేస్తారు. చాలామంది గురుద్వారాల్లోని వరండాల్లోనే రాత్రిళ్లు నిదురిస్తారు. లక్షలాదిమంది భక్తులు ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఒకేచోట బసచేయడం చూస్తుంటే ప్రతి ఒక్కరి మనసు ఉప్పొంగిపోతుంది అనడంలో సందేహం లేదు. స్వర్ణ దేవాలయంలో వాలంటీర్లను చూస్తుంటే మానవసేవే మాధవసేవ అన్న భావన ప్రతిఒక్కరిలోనూ మెదలడం ఖాయం.