రవాణా స్టార్టప్‌ని సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న మనీషా

రవాణా స్టార్టప్‌ని సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న మనీషా

Monday July 06, 2015,

4 min Read

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బెర్గ్‌‍ను కార్నెగి మెలన్ యూనివర్సిటీలో కలవడం... మనీషా రైజింఘాని జీవితాన్ని మార్చేసింది. “తన కొలీగ్ షెరిల్ శాండ్‌బెర్గ్ గురించి మార్క్ మాట్లాడేప్పుడే.. నాకు సొంత ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని అనిపించింది. మహిళా నాయకత్వంపై షెరిల్ మాట్లాడినది విన్నాక ఇది మరింత తీవ్రమైంద”న్నారు లాజినెక్స్ట్‌‌ సహ వ్యవస్థాపకురాలు మనీషా.

image


లాజినెక్స్ట్‌‌లో టెక్నాలజీ, ప్రొడక్ట్ విభాగాలను మనీషా నిర్వహిస్తున్నారు. బిజినెస్ మీటింగ్స్, క్లయింట్ బ్రీఫింగ్స్, నెట్వర్కింగ్ ఈవెంట్స్ సమయాల్లో... ఈ సంస్థకు గల మరో మేల్ ఫౌండర్ టెక్నాలజీ విభాగాన్ని చూసుకుంటున్నారని అనుకుంటారు. పురుషాధిక్య సమాజం కావడంతో ఇలాంటి అభిప్రాయాలున్నాయని... తన శక్తియుక్తులతో ఇలాంటి భావజాలాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నానంటారు మనీషా.

ఐబీఎం సంస్థ సీఈఓ గిన్ని రోమెట్టీ, షెరిల్ శాండ్‌బెర్గ్‌లను చూసి తాను స్ఫూర్తిపొందాను అంటారు మనీషా. కోఫౌండర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారామె. ఈ రంగంలో నిలబడేందుకు, తన మార్క్ చూపించేందుకు ఎంతో కష్టపడుతున్నాని అంటున్నారు.

లాజినెక్స్‌ట్‌లోపు మనీషా ఇలా..

సామాజిక, ఆర్ధిక ఒత్తిళ్లు లేని సాధారణ జీవితం కావడంతో.. సవాళ్లను ఎదుర్కొనే తత్వాన్ని అలవర్చుకునేందుకు మనీషాకు తగిన సమయమే చిక్కింది. తన జీవితానికి బాటలు వేసుకునే వ్యక్తిత్వం అలవడింది. పెద్దకొడుకు మాదిరిగా కుటుంబ వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి ఎదిగారామె. అయితే కుటుంబం అంచనాలకు భిన్నంగా... నెంబర్స్, డేటాలతో కుస్తీపట్టే లోకాన్ని ఆమె ఎంచుకున్నారు.

image


ముంబై యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా... మాస్టెక్ యూనివర్సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కోర్స్‌లో చేరారు. కార్పొరేట్ ఉద్యోగం సంపాదించడంతోనే తాను జీవితాంతం బతకలేననే విషయం ఆమెకు ఆరు నెలల్లోనే అర్ధమైంది. ఫలితం... 2009లో కోర్స్ వదిలేసిన వందలాది మందిలో ఆమెకూడా ఒకరు కావడం.

కార్పొరేట్ విభాగంలో భాగం అయ్యేందుకు బదులుగా... కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి పెట్టారు మనీషా. వ్యూహాత్మక అవకాశాలు అందుకోవడం కోసం.. టెక్నాలజీ విశ్లేషించే రంగంపై అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను తనకు అనుకూలమైన కోర్సుగా ఎంచుకుని... కార్నెగీ మెలన్ నుంచి ఇదే విభాగంలో మాస్టర్స్ పట్టా పొందారు. ఇది పూర్తయ్యాక వార్నర్ బ్రదర్స్ సంస్థలో... ఐట్యూన్స్ కోసం డేటా ఎనలిటిక్స్ టీంలో పని చేశారు. సొంత వెంచర్ ప్రారంభించేందుకు ముందు ఐబీఎం సంస్థలోనూ విధులు నిర్వహించారు.

ఇదీ లాజినెక్స్ట్‌ ప్రయాణం

లాజినెక్స్ట్‌ సహ వ్యవస్థాపకుడు ధ్రువిల్‌ను కార్నెగీ మెలన్‌లో 2010లోనే కలిసిన మనీషా... 2013 జూలైలో న్యూయార్క్‌లో కలిసినపుడు సొంత వెంచర్‌పై మాట్లాడుకున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రవాణా వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు, సమస్యలపై డిస్కస్ చేశారు. ఇంటర్నెట్ అధారంగా వీటికో పరిష్కారం చూడచ్చని, సొంత వెంచర్ ద్వారా తమ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై మాట్లాడుకున్నారు ఇద్దరు. అమెరికాలో ఉన్నపుడే దీనికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడం ప్రారంభించినా... 2014మొదట్లోనే.. ఇండియాకు వచ్చారు మనీషా.

టెక్నాలజీ రంగంలో ఉన్నత శిఖరాలకు

'టెక్నాలజీ రంగంలో మహిళలు' అన్న అంశంపై తన అనుభవాల నుంచే చాలా నేర్చుకున్నాను అంటారు మనీషా. 

“టెక్నాలజీలో మహిళలు ఎక్కువగా లేకపోవడానికి కారణాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. టెన్త్ క్లాస్ వరకూ.. బాలురు, బాలికల సంఖ్యలో పెద్ద వ్యత్యాసం ఉండదు. లెవెన్త్, ట్వెల్త్ గ్రేడ్ కోసం నేను సైన్స్ విభాగంలో జాయిన్ అయ్యాను. తర్వాత మాస్టర్స్ చేశాను. లెవెన్త్ గ్రేడ్‌లో 40శాతం, అండర్ గ్రాడ్యుయేషన్‌లో 30శాతం, మాస్టర్స్‌లో అయితే 20శాతం కంటే తక్కువగా ఉన్నారు బాలికలు” అని వివరించారు మనీషా.

బాలికలకు చిన్న వయసునుంచి మార్గదర్శకత్వం, స్ఫూర్తి నింపే సమాజ తత్వం లేకపోవడమమే... ఉన్నత స్థాయిల్లో మహిళల సంఖ్య అతి తక్కువగా ఉండడానికి కారణమంటారు మనీషా. సామాజికంగానూ మహిళలు ఎక్కువ బాధ్యతలు వహించాల్సి రావడం మరో కారణంగా చెబ్తున్నారు.

ఎదుర్కున్న సవాళ్లు

“బీ2బీ, లాజిస్టిక్స్... ఈవిభాగాల్లో మహిళల సంఖ్య చాలా తక్కువ. ఇది చాలా కఠినమైన రంగం. అయినా సరే ఈ విభాగంలో పని చేయడం నాకు చాలా ఉత్సాహాన్నిస్తోంది” అంటున్నారు 

రవాణా సంబంధిత కంపెనీల అధికారులతో మీటింగ్స్‌లో పాల్గొంటున్న వారిలో మహిళ.. మనీషా ఒక్కరే. ఇది తాను సమర్ధంగా ఎదుర్కొన్న సవాలే అయినా... ఈ స్థాయిలో పని చేసే మహిళల భాగస్వామ్యం లేకపోవడం.. తనకు చాలా నిరుత్సాహాన్ని కలిగించిందని చెప్పారామె.

తన టీంలో.. పురుషులు, మహిళల సంఖ్యలో సమతుల్యం పాటించడం కూడా ఓ మహిళా వ్యవస్థాపకురాలిగా ఆమె ఎదుర్కున్న మరో ప్రధాన సమస్యే.

“చాలా వర్క్‌ప్లేస్‌లలో... ముఖ్యంగా స్టార్టప్‌లలో మగవారే అధికంగా ఉంటారు. వారే వీటిని ప్రారంభించడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తాన్నేను. వీరి నుంచి మహిళలకు తగిన ప్రోత్సాహం లభించకపోయి ఉండవచ్చు. లాజినెక్స్ట్‌లో మహిళా టీం మెంబర్లు రేపటి లీడర్లుగా ఎదిగి, సొంత స్టార్టప్‌ల స్థాయికి చేరేలా ప్రోత్సాహమిస్తున్నాం” అని చెప్పారు మనీషా.

ఓ బాస్‌గా, అధికారిగా, స్వార్ధపరురాలిగా, తన పని కోసం కఠినంగా వ్యవహిరించేదానిగా ఉండడం కంటే... లక్ష్యం కోసం పని చేసే వ్యక్తిగా, నిబద్ధత గల లీడర్‌గా ఉండడానికే ఇష్టపడతానంటున్నారు మనీషా.

“నా వ్యక్తిత్వానికి లేబుల్స్, బ్రాండ్స్ అంటగట్టడం నాకు ఇష్టం ఉండదు. నన్ను ఓ బాస్‌గా కాకుండా... నా విధానాన్ని అనుసరించి నా లీడర్‌షిప్‌లో పని చేసే వారిని ఇష్టపడతాన”ని చెప్పారు మనీషా.

టెక్... ఇట్స్ ఏ గేమ్

టెక్నాలజీ, ప్రోడక్ట్స్ విభాగాలను లీడ్ చేస్తుండడంతో... ఆమె తన దృష్టిని కొత్త ఆవిష్కరణలు, ఉన్నవాటిని అప్‌డేట్ చేస్తూండడం వంటి అంశాలపై కేంద్రీకరించాల్సి ఉంటుంది. తన టీం మొత్తం అంది వచ్చే ప్రతీ అవకాశాన్నీ ఉపయోగించుకుని... ప్రొఫెషనల్‌గాను, వ్యక్తిగతంగాను ఎదగాలన్నదే తన ప్రాథమిక లక్ష్యంగా చెబ్తున్నారు మనీషా.

“జాతీయంగాను, అంతర్జాతీయంగాను టెక్నాలజీలో టాలెంట్ గల వ్యక్తులను రిక్రూట్ చేసుకుంటున్నాం. పశ్చిమ దేశాలనుంచి... దేశంలోని స్టార్టప్స్‌లో పని చేసేందుకు ఉత్సాహం చూపుతున్న భారతీయుల సంఖ్య ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగింది. మాకు మేమే ఇలా దేశానికి వచ్చేసిన వ్యక్తులం కావడం గమనించాల్సిన విషయం. ఇలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తులను తీసుకోవడం ద్వారా... ఉన్నత శిఖరాలను అధిరోహించగలమనే నమ్మకం ఉంది”అంటున్నారు మనీషా.

అనుక్షణం లక్ష్యం కోసం పోరాటం

గణాంకాల ఆధారంగా తాను క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను అమితంగా ఇష్టపడతారు మనీషా. ఇదంతా ఆమె మనసులోనూ, మునివేళ్లపైనే ఉంటుంది ఎప్పుడు. అలాగే వ్యవస్థాపక రంగంలో ఆమె చూపుతున్న చొరవకు... తన కుటుంబం మనస్ఫూర్తిగా మద్దతు పలకడం విశేషం.

“ కో ఫౌండర్ ధ్రువిల్ సంఘ్వి, ఇన్వెస్టర్ సంజయ్ మెహతా, అడ్వైజర్ మారక్ డెశాంటిస్.. మేథస్సు గల ఈ ముగ్గురు మగవారు... నేను ఈ లక్ష్యాన్ని సాధించగలలని నమ్ముతున్నారు. ప్రతీ అడుగులోనూ నాపై నాకు నమ్మకం విపరీతంగా పెరుగుతోంది. ఈరోలార్ కోస్టర్ గేమ్‌లో సక్సెస్ సాధించడగలగడం నాకు చాలా ముఖ్యం”అని చెప్పారు మనీషా.

లాజినెక్స్ట్‌.. వాట్‌నెక్స్ట్‌

మనీషా ప్రస్తుత లక్ష్యాలు, భవిష్యత్ గోల్స్.. రెండూ ఒకటిగానే ఉన్నాయి. భారత్‌తోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో... లాజిస్టిక్స్, సప్లై చైన్ విభాగాల్లో... ప్రస్తుతమున్న విధానాలను సమూలంగా మార్చాలని అంటున్నారామె.

“డేటా... ఇది గేమ్ ఛేంజర్ పాత్ర పోషించనుందని టెక్నాలజీ నిపుణులుగా మేం చెప్పగలం. ముందు జాగ్రత్తలు తీసుకుంటూ మరింత ఉత్పాదకత సాధించగలగేలా.. వేగవంతమైన ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం. లాజిస్టిక్స్‌కు సంబంధించిన అన్ని విభాగాలకూ... వన్ స్టాప్ షాప్‌గా లాజినెక్స్‌ట్‌ను అంతర్జాతీయంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలున్నాయి మా దగ్గర”అని చెప్పారు మనీషా.