తీర్థయాత్రలకు దారి చూపిస్తున్న మై హోలీ టూర్

రెలీజియస్ టూరిజం స్టార్టప్ ప్రారంభించిన 41ఏళ్ల రచనా గులాటీ

తీర్థయాత్రలకు దారి చూపిస్తున్న మై హోలీ టూర్

Monday May 02, 2016,

3 min Read


80 బిలియన్ల డాలర్లు.. అంటే రూపాయల్లో అక్షరాలా ఐదులక్షల ఇరవై ఎనిమిది వేలకోట్లు...‍!

ఇది రెండు తెలుగు రాష్ట్రాల రెండేళ్ల బడ్జెట్ తో సమానం...‍!

అయితే కావచ్చు కానీ.. ఈ మొత్తాన్ని దేశ వ్యాప్తంగా ప్రజలు ఏడాదిలో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం చేస్తున్న ఖర్చు.

ఈ అంకెలపై అంత స్పష్టత ఉంది కాబట్టే... 41 ఏళ్ల ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్ రచనా గులాటీ... తన స్టార్టప్ అదృష్టాన్ని ఈ రంగంలోనే పరీక్షించుకోవాలనుకున్నారు. "మైహోలీటూర్" ను ప్రారంభించారు.

అధ్యాత్మిక భారత సమగ్ర సమాచారం

18 ఏళ్ళ పాటు ఆర్థిక నిపుణురాలిగా పని చేసిన రచనా గులాటీ.. 2014లో మైహోలీటూర్ ను ప్రారంభించారు. సహజంగా ఆధ్యాత్మిక విషయాలపై అమితమైన ఆసక్తి ఉండటంతో పాటు...ఆ రంగంలో ఉన్న మార్కెట్ అవకాశాలు కూడా రచనా గులాటీని ఆకర్షించాయి. అయితే అందరిలా తన స్టార్టప్ ను మార్కెట్ ప్లేస్ లా మారిస్తే తన ప్రత్యేకత ఏముంది అనుకున్నారు. అందుకే ముందుగా భారతదేశంలో మరుమూల ప్రాంతాల్లో సైతం ఉన్న గుళ్లూ, గోపురాల సమాచారాన్ని సేకరించి తన వెబ్ సైట్లో నిక్షిప్తం చేశారు. దాదాపు ఇప్పుడు ఆరు వందల పుణ్యక్షేత్రాల వివరాలను మైహోలీటూర్ లో తెలుసుకోవచ్చు. ఆ క్షేత్రం విశిష్టత, చారిత్ర నేపధ్యం, భక్తుల ఆచారాలు ఇలా ప్రతీ విషయాన్ని మైహోలీటూర్ వివరిస్తుంది. వీటితో పాటు వాటిని సందర్శించడానికి ఆన్ లైన్ , ఆఫ్ లైన్ బుకింగ్ లను కూడా నిర్వహిస్తోంది.

విస్త్రత పరిశోధన - టెక్నాలజీ కష్టాలు

రచనా గులాటి భారత ఆధ్యాత్మిక విశేషాల కోసం సమగ్ర పరిశోధన చేసింది. ఈ క్రమంలో ఫిక్కి సాయం తీసుకుంది. సొంతంగా బ్రాండ్ ను డెవలప్ చేయాలనే లక్ష్యం పెట్టుకుని.. ఆమదెస్, గెలీలియో లాంటి ట్రావెల్ ఎజన్సీలతో టై అప్ అయింది. టెక్నాలజీ రంగంలో పెద్దగా అనుభవం లేకపోవడం రచనాకు ఇబ్బందికరంగా మారింది. వెబ్ సైట్ రూపకల్పన కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. వెబ్ సైట్ డెవలపింగ్ విషయంలో చాలా అప్లికేషన్ల అవసరం ఉండటంతో... వెబ్ డెవలపర్లు భారీ మొత్తాలను డిమాండ్ చేసేవాళ్లు. ఇలాంటి సవాళ్ల మధ్య దాదాపు ఇరవై నెలలు నెట్ వర్కింగ్ మీద పనిచేశారు. తనకు పూర్తిగా తెలియని కొత్త ముఖాలు.. అప్పటికే ఇండస్ట్రీలో విజయం సాధించిన వారితో వ్యవహారాలు చక్కబెట్టాల్సి వచ్చింది. అయినా తన ఆలోచన మీద ఉన్న నమ్మకంతో అందర్నీ ఒప్పించారు.

తర్వాత వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం మరో సవాల్ గా మారింది. ఎందుకంటే తన స్టార్టప్ కు ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ తేవాలనుకుంటున్న రచనా... స్వయంగా వారి సర్వీస్ ను పరిశీలించిన తర్వాతే ఒప్పందం చేసుకునేది. ఇలా ఏడు నెలల పాటు శోధించి.. అధ్యాత్మిక యాత్రలకు వెళ్లేవారికి ఎవరైతే సరిగ్గా సేవలు అందించగలరో అలాంటి వారితోనే టైఅప్ పెట్టుకుంది. ఆధ్యాత్మక టూరిజంలో చేస్తున్న ప్రయత్నానికి REX గ్లోబల్ ఫెలో షిప్ తో పాటు కర్మ్ వీర్ చక్ర పురస్కారాల్ని కూడా రచనా గులాటి అందుకున్నారు.

అవార్డు అందుకుంటున్న రచనా గులాటి<br>

అవార్డు అందుకుంటున్న రచనా గులాటి


ప్రారంభం.. ఉత్సాహం

సుదీర్ఘ పరిశోధన, మరెన్నో సవాళ్లను అధిగమించి మైహోలీటూర్ బెటా టెస్టింగ్ వెర్షన్ ను ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభించారు. అధ్యాత్మిక, తీర్థయాత్రల రంగంలో తనదైన ముద్రవేసేలా మైహోలీటూర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికి రోజుకు నూటయాభై పేజ్ వ్యూస్ వస్తున్నాయి. మా ప్రయాణం ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభించకముందే వంద టూర్ ఎంక్వైరీలు వచ్చాయని రచనా ఉత్సాహంగా చెబుతున్నారు. ఇక్సిగో టూర్స్ తోనూ మైహోలీటూర్ టై అప్ అయింది.

"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉన్న టూరిజం కార్పొరేషన్లతో ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆధ్యాత్మిక పర్యటనల్లో యాత్రికులకు మంచి సర్వీస్ అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. పెద్దగా ప్రచారంలోకి రాని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలను ప్రమోట్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తాం" రచనా గులాటి

కఠినమైపోటీ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రావెల్, టూరిజం బిజినెస్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనది. జీడీపీలో దీని వాటా 9.4 శాతం. ఈ రంగంలో కొంత కాలం వరకు మార్కెట్ అసంఘటితంగా ఉండేది. కానీ మారుతున్న పరిస్థితుల్లో కొన్ని స్టార్టప్ లు మార్కెట్ ను పెంచుకునేందుకు విశేషంగా శ్రమిస్తున్నాయి. మేక్ మై ట్రిప్, కాక్స్ అండ్ కింగ్స్, హాలీడే ఐక్యూ లాంటివి మంచి వృద్ధిరేటు నమోదు చేస్తున్నాయి. మేక్ మై ట్రిప్ ఆధ్యాత్మిక పర్యటనల రంగంలోనే 30శాతం వృద్ధి సాధిస్తోంది. వీటికి పెద్ద సంస్థలతో ఒప్పందాలు.. వినియోగదారులకు డిస్కౌంట్లు ఇవ్వగలిగిన సామర్థ్యం కూడా ఉంది. వీటితో పాటు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పాతుకుపోయిన లోకల్ ఆపరేటర్లనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అయితే భారతదేశంలో పుణ్యక్షేత్రాల సందర్శన ఎప్పుడూ కొంచెం క్లిష్టమైన వ్యవహారమే. తెలియని భాషలు, తెలియని ప్రాంతాల సందర్శనకు ఓ మంచి నమ్మకమైన తోడు ఉంటే బాగుండు అనుకుంటారు ఎవరైనా. అలాంటి నమ్మకాన్ని మైహోలీటూర్ కల్పించగలిగితే అనంతంగా ఉన్న మార్కెట్ లో తనదైన ముద్ర వేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఈ విషయంలో రచనా గులాటి ఆత్మవిశ్వసంతోనే ఉన్నారు.