ఇంటి దగ్గరే కార్ స్టీం వాష్..! ఇదీ ఓ అద్భుత వ్యాపారమే...
స్టీమ్ వాష్తో కార్లను క్లీన్ చేస్తున్న మై పిట్స్టాప్..డోర్ టు డోర్ సేవలను అందిస్తున్న సంస్థ..30 నిమిషాల్లో 8 లీటర్ల నీటితో కార్ వాష్ ఫినిష్..ముంబైలో తొలి స్టీమ్వాష్ సర్వీస్ అందిస్తున్న మైపిట్స్టాప్..త్వరలో యాక్ససరీస్ వ్యాపారంలోకి మైపిట్స్టాప్..
Wednesday August 19, 2015,
3 min Read
ఆలోచించే ఓపిక ఉండాలే కానీ.. సమస్యలు కూడా సరికొత్త ఆవిష్కరణలకు కారణమవుతాయి. బతికేందుకు కొత్త మార్గాలను చూపెడతాయి. తాము ఎదుర్కొన్న ఇబ్బందికి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నంలో నలుగురు స్నేహితులు ఏకంగా ఓ సంస్థనే ప్రారంభించారు.
అదే మై పిట్స్టాప్ స్టార్టప్ కంపెనీ. స్టీమ్వాషింగ్తో కార్లను క్లీన్ చేస్తున్న ఈ సంస్థ ముంబైలో బిజి బిజీ కార్ ఓనర్ల పాలిట వరంగా మారింది.
కొన్ని సమస్యలు మనుషులను బెంబేలెత్తిస్తాయి. మనం ఎక్కడికి వెళ్లినా మనవెంటే వస్తుంటాయి. మర్చిపోవడం కష్టం, మరికొన్ని సమస్యలు మాత్రం అప్పటికప్పుడే మర్చిపోతుంటాం. మనను వెంటాడే సమస్యలను పరిష్కరించేందుకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తాం. అలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే మై పిట్స్టాప్ స్టార్టప్ కంపెనీ.
అదో చల్లని సాయంత్రం. నలుగురు స్నేహితులు రోహిత్ మాథూరు, అమిత్ థాపర్, సంజీవ్ సిన్హా, తైనా డి క్రూజ్... కోవలంలో స్విమ్మింగ్పూల్ పక్కన నడుస్తూ సరదాగా ముచ్చటించుకుంటున్నారు. కార్ను సింపుల్గా, ఈజీగా ఎలా వాష్ చేయాలన్న అంశాన్ని చర్చిస్తున్నారు. సెలవులు పూర్తయిన తర్వాత కార్లను క్లీనింగ్కు ఇవ్వడంపై చర్చించుకుంటున్నారు. కారు క్లీనింగ్కు అయ్యే సమయాన్ని గుర్తుచేసుకుంటూ ఆందోళన చెందుతున్నారు.
ఉదయం కారును వాషింగ్కు ఇస్తే క్లీనింగ్ పూర్తయ్యే సరికి సాయంత్రం అవుతుందని, హాలీడే మొత్తం వృథా అవుతుందని రోహిత్ తన గత అనుభవాన్ని స్నేహితులకు వివరించారు. కార్ వాషింగ్కు ఇవ్వడం, దాన్ని తిరిగి తెచ్చుకోవడం, డెయిలీ లగేజ్ మళ్లీ కారులో పెట్టుకోవడం వీకెండ్లో ఒక రోజు ఇలాగే పూర్తయిపోతుంది. ఇది రోహిత్ ఆందోళన
అందరి సమస్యకు సాధారణ పరిష్కారం
ఇలా అంతా తమ వ్యక్తిగత సమస్యలను ఏకరువుపెట్టి, ఈ రంగంలో ఉన్న సమస్యలను చర్చించుకున్నారు. ఈ సమయంలోనే మై పిట్స్టాప్ ఐడియా పురుడుపోసుకుంది. రోహిత్ ప్రారంభించిన ఈ సంస్థలో అమిత్ థాపర్ బిజినెస్ హెడ్గా, సంజీవ్ సిన్హా ఆపరేషన్స్ హెడ్గా వ్యవహరిస్తుండగా, తైనా డి క్రూజ్కు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు.
డోర్ సర్వీస్ సౌకర్యం
అందరిదీ ఒకే లక్ష్యం. కారు ఓనర్లకు ప్రభావవంతమైన పరిష్కారాన్ని వారి ఇంటివద్దే చూపించడం. 12 ఏళ్లపాటు ఎంటర్టైన్మెంట్ రంగంలో పనిచేసిన రోహిత్ దేశంలో తొలి టెన్పిన్ బౌలింగ్ సెంటర్ను నెలకొల్పిన రికార్డును సంపాదించాడు. తమ సంస్థ గురించి రోహిత్ ఇలా చెప్తారు.
‘‘మా సంస్థలో పనిచేసే కీలక ఉద్యోగులకు ఆటోమొబైల్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవముంది. ఆటోమొబైల్ రంగంలో కొత్త మార్గాలను సృష్టించేందుకు నేను ఎప్పుడూ మా టీమ్ మెంబర్స్ను ప్రోత్సహిస్తుంటాను’’ అని చెప్పారు.
స్టీమ్ వాష్
కార్లను శుభ్రం చేసేందుకు నీళ్లకు బదులుగా ఆవిరి (స్టీమ్)ను ఉపయోగిస్తున్నారు మై పిట్స్టాప్ సిబ్బంది. కారును కడిగేందుకు సాధారణంగా 200 లీటర్ల నీరు అవసరం. అయితే స్టీమ్ వాష్ కారణంగా కేవలం ఏడెనిమిది లీటర్ల నీళ్లతోనే పని పూర్తవుతుంది. అంతేకాదు క్లీన్ చేసిన వెంటనే కార్ వాడుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. స్టీమ్వాష్ చేసేందుకు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.
అడ్డంకులు.. సవాళ్లు..
ప్రస్తుతం మార్కెట్లో యూజర్ ఫ్రెండ్లీ, త్వరగా కారును శుభ్రం చేసే విధానాలు పెరిగాయి. ఈ రంగంలో సేవలందిస్తున్న మరో సంస్థ స్పీడ్ కార్. కార్ వాషింగ్, క్లీనింగ్ రంగం నిర్మాణాత్మకమైనదేమీ కాదు.. ఈ రంగంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే నైపుణ్యం కలిగిన క్లీనర్లు దొరకకపోవడం.
‘‘మేం కారు క్లీన్ చేసి, దానికి ఫీజుగా వసూలు చేసిన రూ.400ను ప్రజలు ఇతర సంస్థల సేవలతో పోలుస్తారు. సంప్రదాయ కార్ వాషింగ్ రంగం కూడా దూసుకుపోతోంది. మా అడ్వాంటేజ్ ఏంటంటే.. మేం కేవలం స్టీమర్ మిషిన్లపై మాత్రమే పెట్టుబడి పెడుతున్నాం. జనరేటర్లు, ఎంయూవీ వంటి ఇతర పరికరాలను అద్దెకు తీసుకుంటున్నాం’’ అని రోహిత్ వివరించారు.
మార్కెట్ అండ్ గ్రోత్
ఈ రంగంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, అభివృద్ధి కూడా అదే స్థాయిలో ఉంది. నెలనెలా వంద శాతం వృద్ధి కనిపిస్తుంది.
‘‘స్టీమ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూడాలని ప్రజలంతా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. గ్రీస్ వంటి మొండి మరకలను కూడా కొన్ని నిమిషాల్లోనే స్టీమ్ వాష్ క్లీన్ చేస్తుంది. ఒక్కసారి మా వద్దకు వచ్చిన కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తున్నారు’’ అని రోహిత్ వివరించారు.
ఈ కామర్స్ రంగం నానాటికీ విస్తరిస్తోంది. అందుకే కస్టమర్ల ఇళ్ల వద్దే సేవలను అందించనుండటంతో భవిష్యత్లో మరింత మంది కస్టమర్ల దగ్గరికి చేరుతామని మై పిట్స్టాప్ ఆశిస్తోంది. నీటితో శుభ్రం చేసినదానితో పోలిస్తే స్టీమ్ వాష్ ఎంత బాగుంటుందో కస్టమర్లు వ్యత్యాసాన్ని చూస్తున్నారని, అది కూడి ఇళ్ల వద్దే వాషింగ్ చేస్తుండటంతో సమయం కూడా కలిసొస్తోందనే భావన కస్టమర్లలో ఉందనేది నిర్వాహకుల విశ్లేషణ.
స్టీమ్ వాష్ క్లీనింగ్ అందరి వద్దకు చేరాలంటే ఇంకా సమయం పడుతుంది. భారత్లో ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య ప్రస్తుతం 20 శాతం మాత్రమే. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా.
‘‘మా సేవలను ముంబైకే పరిమితం చేయకుండా మరింత విస్తరించాలనుకుంటున్నాం. కార్ క్లీనింగ్ స్టేషన్లకు వెళ్లే సమయంలేని వర్కింగ్ క్లాస్ కుటుంబాలు ఎక్కువగా ఉండే నగరాలకు మా సంస్థను త్వరలోనే విస్తరిస్తాం. అలాగే ఫోర్ వీలర్ యాక్ససరిస్ వ్యాపారంలోకి త్వరలోనే అడుగుపెడతాం’’ అని రోహిత్ వివరించారు.