ప్రకృతిని డిఫరెంట్ యాంగిల్‌లో చూపే జర్నలిస్ట్

ప్రకృతిని డిఫరెంట్ యాంగిల్‌లో చూపే జర్నలిస్ట్

Saturday October 10, 2015,

4 min Read

ఆర్తీ కుమార్ రావ్... ఈమెను మంచి ఫొటోగ్రాఫర్ గా రచయితగా పరిచయం చేయవచ్చు. అయితే ఆర్తీ మాత్రం తనను ఓ ఫొటోగ్రాఫర్‌గానో.. ఓ రచయితగానో ఏమాత్రం పరిగణించుకోరు. తాను వాస్తవ కథలు చెప్తానంటారు. ప్రజల సంప్రదాయక జీవితాల్లోని మార్పులను ప్రతిబింబించేందుకు కృషిచేస్తానంటారు. సాధారణ మీడియా ప్రచురించని అంశాలపైనే తాను దృష్టిసారిస్తానని ధృడమైన విశ్వాసం ఆమెది. మాటలను మించి చిత్రాలు, వాక్కులకు మించి వీడియోలు... వ్యాఖ్యలకు బదులు వాళ్ల వాయిస్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.


పర్యావరణం, జీవనోపాధిని ప్రభావితం చేస్తున్న భూ వినియోగాన్ని దశాబ్దకాలంగా ఆర్తి పరిశీలిస్తున్నారు. ఈ ఫొటో జర్నలిస్ట్ తీసిన ప్రదేశాలు, ప్రజలు, జంతువుల ఫొటోలుఅంత త్వరగా ఎవరి మదిలో నుంచి తొలగిపోవు. ధ్వంసమవుతున్న ప్రకృతితో పాటు ఎన్నో అద్భుతాలకు అవి నిదర్శనాలు. తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రివర్ డైరీస్' ప్రాజెక్ట్ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు, పర్యావరణ తీరుతెన్నులపై లోతైన విశ్లేషణలు అందిస్తాయి.

image


అందరి కంటే భిన్నంగా..

డాక్యుమెంటరీ ప్రారంభించాలని అనుకున్నప్పుడు ఆర్తి దృష్టి బ్రహ్మపుత్ర నదిపై పడింది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. డిగ్రీ పూర్తైన తర్వాత జీవితకాలంలో తాను చేయాలనుకుంటున్న పనులన్నింటి జాబితా రాసుకున్నారు. ప్రపంచంలోని ప్రధాన నదీ వ్యవస్థలను, సముద్ర పరివాహక ప్రాంతాల్లోని జీవజాతిని చిత్రీకరించాలనుకున్నారు. చివరికి టాప్ ఫైవ్‌లో ఉన్న ఈ ఆప్షన్‌ను ఎంచుకున్నారు ఆర్తి. ఈ క్రమంలో తొలిసారిగా టిబెట్ లాసాలోని యార్లంగ్ సాంగ్పో నదికి వెళ్లారు. టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిని యార్లంగ్ సాంగ్పొగానే వ్యవహరిస్తారు. దీని జన్మస్థలం నుంచి సముద్రంలో కలుస్తున్న రీతిని చిత్రీకరించాలని అనుకున్నారు. 

భారత ప్రభుత్వం బ్రహ్మపుత్రపై 160 ఆనకట్టులు నిర్మించాలనుకుంది. ఇది కూడా ఈ నదిని స్టడీ చేసేందుకు ఓ కారణమని ఆర్తి తెలిపారు. కష్టతరమైన ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్‌కు ఆమెకు చాలా ఏళ్లే పట్టింది. ఓ నదినీ, ఓ జీవజాతిని డ్యాములు ఏం చేయగలవు ? అనే అంశాలను తెలుసుకోవాలనే ఉబలాటం నానాటికీ పెరిగిపోతూ వచ్చింది. డాక్యుమెంటేషన్ సందర్భంగా తాను తెలుసుకున్న విషయాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని ఆర్తి చెబుతారు.

image


కుటుంబ ప్రోత్సాహం 

ఆర్తి కెరీర్ పద్ధతి ప్రకారం సాగడంలేదని భావిస్తే పొరబడినట్టే. తన రంగంలో రాణించడానికి ఆమె చాలాకాలం పాటే శ్రమించారు. తన కెమెరాతో పాటూ ప్రయాణించారు. చిన్నప్పటి నుంచే తనలో తెలుసుకోవాలన్న తపన ఎక్కువగా ఉండేదని ఆ ఉత్సాహంతోనే ఇటువైపుగా వచ్చానంటారు ఆర్తి. ఆమె తల్లితండ్రులు కూడా ఎప్పుడూ ఆంక్షలు విధించలేదు. పైగా కొత్త విషయాలు తెలుసుకునేందుకు, ప్రయత్నించేందుకు ప్రోత్సహించారు.

ఆసక్తి ఉన్న విషయాలను నేర్చుకోవడమే కాకుండా చదువులోనూ ముందే ఉండేవారు ఆర్తి. బర్డ్ వాచింగ్, క్యాలిగ్రఫీపై కూడా ఎంతో ఆసక్తి చూపించారు. పాఠశాల స్థాయిలోనే సైన్స్-ఆంగ్ల సాహిత్యంలో ప్రావీణ్యం చూపేవారు.

image


చిన్నప్పుడే భౌతికశాస్త్రం, రచనల్లో ఏదో ఒకదానిని కెరీర్‌గా మలచుకోవాలనుకున్నారు. కానీ ఈ రెండు రంగాల్లో మాస్టర్స్ డిగ్రీ సాధించడం ఇండియాలో అసాధ్యం. దీంతో జీవ భౌతికశాస్త్రంలో పీజీ చేశారు. సబ్జెక్ట్‌ను అమితంగా ఇష్టపడినప్పటికి ప్రయోగశాలల్లోనే జీవితం గడపడం తన ధ్యేయం కాదని గుర్తించారు. అంతే... వెంటనే విలేకరిగా ఓ వార్తాసంస్థలో చేరిపోయారు. ఎలాంటి అనుభవం లేకుండానే తనకు ఉద్యోగం లభించడంపై ఆర్తి ఇప్పటికీ ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు తనకెందుకు ఉద్యోగమిచ్చారో తెలుసుకునేందుకు ఎడిటర్‌ను ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.

image


ఆశించిన మార్గంలోకి

రిపోర్టర్ గా ఏడాదిన్నర కాలం గడిచిన తర్వాత ఆర్తికి వివాహమైంది. భర్తతో పాటే అమెరికా వెళ్లిపోయారు. అక్కడా మాస్టర్స్ డిగ్రీలు చేశారు. ఎనిమిదేళ్లు ఓ కార్పోరేట్ సంస్థలో పనిచేశారు. తాను కోరుకున్నది ఇది కాదని తెలుసుకుని తిరిగి పాత పనిలోనే చేరాలనుకున్నారు. రాయడం, వీడియోలు తీయడం, వివరించడం ఇదే తన లక్ష్యం కావాలని ఆశించారు. కొత్తగా గుర్తించిన రంగంలోకి అడుగిడిన ఆర్తికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. సృజనాత్మక మెండుగా ఉన్న ఈ విభాగంలో ఎప్పుడూ నిలిచి ఉండడం ప్రధాన అంశమే.

image


సంపాదించుకున్నదంతా నావ మునిగిపోకుండా కాపాడుకోడానికే వినియోగించాల్సిన పరిస్థితి. కార్పోరేట్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఆర్తికి కలిసొచ్చింది. కన్సల్టింగ్ ఉద్యోగాల ద్వారా సంపాదించిన ఆదాయం మొదట్లో ఉపయోగపడింది. కొన్ని నెలల పాటూ ఎలాంటి అంశాలు దొరకలేదు. ఆర్ధిక సాయం కోసం ఫెలోషిప్స్, గ్రాంట్స్ కోసం ఆర్జీలు పెట్టుకున్నప్పటికి ఆశించిన ఫలితం రాలేదు. తాను చేస్తున్న పనిలో నమ్మకం ఉంచిన ఇతరుల మంచితనం వారు అందించిన ధనసాయంపైనే ఆధారపడాల్సి వచ్చిందని చెప్పారు. 

image


అంత కష్టంలోనూ ఆప్యాయత

ఆర్తి తలపెట్టిన పని మానసికంగా-శారీరకంగా కష్టతరమైనదే. అయితే, ఈ పని ద్వారానే ఆమె అనుకున్నది సాధించగలిగారు. దీనికి సంబంధించి ఓ సంఘటనను ఆమె ఉదహరించారు.

" బ్రహ్మపుత్ర ఉత్తర తీరం వద్ద కోతకు గురైన ప్రాంతం నుంచి కాలినడకన తిరిగి వస్తుండగా ఓ వృద్ధుడు నన్ను ఆపారు. 60ఏళ్ల వయసున్న ఆయన చిన్న పాల వ్యాపారి. అస్సామీ యాసలో హిందీలో మాట్లాడుతూ మరోసారి ఇక్కడికి వచ్చినప్పుడు తనకు ఫోన్ చేయాలని చెప్పారు. జేబులో కొద్ది సెకన్లు తడిమి చిన్న ఫోన్ బుక్ తీసి ఆయన ఫోన్ నంబర్ ఇచ్చారు. మళ్లీ వచ్చినప్పుడు తనకు తప్పకుండా కాల్ చేయాలని, నా కోసం భోజనం సిద్ధం చేస్తానని చెప్పారు. మీరు తప్పకుండా నా కుటుంబంతో కలిసి భోజనం చేయాలని అన్నారు. ఈ పాల వ్యాపారి బీహార్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ జాదవ్.

మాటల మధ్యలో రెండు నెలల క్రితమే పోటెత్తిన వరదలు, భూమి కోత వల్ల ఈయన తన పాడిపశువులు, వ్యవసాయ భూమి, ఆస్తిని కోల్పోయినట్లు తెలిసింది. ఎలాంటి ఆర్ధిక చేయూత లేకుండానే ఈ అభాగ్యుడు అన్నింటినీ కొత్తగా సమకూర్చుకోవాల్సి ఉంది. మనసు బాధతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగానే నేను తప్పకుండా ఇంటికి వస్తానని ఆయతో చెప్పాను. ఈ సంభాషణ తర్వాత 45 నిమిషాల దూరంలో ఉన్న ఆయన తన తాత్కాలిక గృహానికి బయలుదేరాం. ఇసుక మేటలు, నీటిని దాటుకుంటూ వెళ్లారు". 

image


ఓ ఒంటరి ప్రయాణికురాలికి భారత్ ప్రమాదకర ప్రాంతమే కానీ ఆర్తీ ఆ ఉద్దేశాన్ని మరో కోణంలో చూశారు. రాజస్థాన్, అస్సాంల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఏ క్షణంలోనూ అభద్రతకు గురికాలేదని చెప్తారు. తన సొంత పట్టణం బెంగుళూరులో ఉన్నట్టే అనిపించిందంటారు. ఇతర ప్రాంతాల వారికి సాయం చేయాలనే స్థానికులు అనుకుంటారని వివరిస్తారు. 

ఇప్పుడు ఆర్తి కావేరీ నదిపై దృష్టిసారించారు. ప్రస్తుతం ఈమె బెంగుళూరు సిటీ జల చరిత్రను ప్రజంట్ చేసే పనిలో ఉన్నారు. ఒకప్పుడు సౌభాగ్యాలతో అలరారిన రాజ్యం 40ఏళ్లుగా క్షామాన్ని ఎదుర్కొంటున్న తీరును ప్రపంచానికి వివరిస్తున్నారు. ఆమె త్వరలోనే మళ్లీ బ్రహ్మపుత్ర, సుందర్బన్స్ కూడా వెళ్లనున్నారు.