పేపర్ బాయ్ నుంచి 210 నగరాల్లో కార్ రెంటల్ సర్వీసులు అందించే స్థాయికి ఎదిగిన సచిన్

న్యూస్ పేపర్ అమ్మకాలతో జీవితం ప్రారంభంఆఫీస్ బాయ్‌గా పనిచేసిన ఇనిస్టిట్యూషన్‌లోనే...ఏడాదిలో ఇన్‌స్ట్రక్చర్‌గా ఉద్యోగంకంప్యూటర్ సైన్స్ చదివినా హోటల్, ట్రావెల్ ఇండస్ట్రీలతో అనుబంధంఈ ఔరంగాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాల్సిందే..

పేపర్ బాయ్ నుంచి 210 నగరాల్లో కార్ రెంటల్ సర్వీసులు అందించే స్థాయికి ఎదిగిన సచిన్

Sunday August 23, 2015,

3 min Read

సచిన్ కేట్.. క్లియర్ కార్ రెంటల్ వ్యవస్థాపకుడు. ఇతను ట్యాక్సీ రంగంలో సృష్టించిన విప్లవం అంతా ఇంతా కాదు. ఇది కూడా ఓ కార్ రెంటల్ కంపెనీయే అయినా... ఈ రంగంలో ఇతని పేరు ఎప్పటికీ నిలిచిపోతుందంటే నమ్మకతప్పదు. సచిన్‌కి ఇంత గౌరవం దక్కడానికి గల కారణాలను తెలుసుకోవాల్సిందే. ఓ న్యూస్ పేపర్ బాయ్‌గా మొదలైన ప్రస్థానం.. ఎక్కడెక్కడ ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకుంటే.. మన ఉత్సాహం ఆగదు.

image


ఈ స్టార్టప్ వెనుకా ఒక కథ

మహరాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి సచిన్. ఇక్కడి వాళ్లకి స్టార్టప్ అంటే అదో అసాధ్యమైన విషయంలా అనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఫోర్త్ గ్రేడ్ తర్వాత చదువుకునే అవకాశం కూడా లేదు. అయితే.. తమ బిడ్డని ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో... దగ్గరలో ఉన్న స్నేహితుడి ఇంటికి పంపి అక్కడ విద్యాబుద్ధులు నేర్పించారు. మొదట్లో డబ్బు సంపాదన కోసం న్యూస్ పేపర్స్ విక్రయించిన సచిన్.. 11వ గ్రేడ్‌లో ఉండగా అదృష్టం కొద్దీ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫీస్ బాయ్ ఉద్యోగం దొరికిందని చెబ్తాడు.

కంప్యూటర్లపై ఎంతో మక్కువ ఉన్న సచిన్.. తనకొచ్చిన ఈ అవకాశాన్ని పక్కాగా ఉపయోగించుకుని... ఏడాదిలో అదే ఇనిస్టిట్యూషన్‌లో ఇన్‌స్ట్రక్టర్ అయ్యాడు. 12వ గ్రేడ్ పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం ఔరంగాబాద్ వెళ్లి... అక్కడ ట్రావెల్ ఏజన్సీలో పార్ట్‌టైం ఉద్యోగం చేసేవాడు.

“ట్రావెల్ బిజినెస్‌లో నాకు పరిజ్ఞానం వచ్చేందుకు.. అలాగే, నాకు కొంత పేరొచ్చేందుకు ఈ ఉద్యోగం ఉపయోగపడింది. పార్ట్‌టైమర్ గానే చేరినా.. ఫుల్‌‌టైం వర్క్ చేసి, కంప్యూటర్ వాడకం మొదలుపెట్టి నా పరిజ్ఞానం వాళ్లకు తెలియచేశాను”అని చెప్పాడు సచిన్.

కంప్యూటర్స్‌లో బీఎస్‌సీ చేస్తున్న సమయంలో.. సెర్చ్ ఇంజిన్ అప్టిమైజేషన్ పనితీరుపై ఎంతో ఆసక్తి ప్రదర్శించావారు. ఇది ట్రావెల్ ఏజన్సీ పనితీరు మెరుగుపరిచేందుకు అతనికి ఉపయోగపడింది.

తనపై తనకు నమ్మకం పెరిగాక.. ఆ ప్రాంతం నుంచి మారేందుకు ప్రయత్నించారు సచిన్. అయితే.. అతని కుటుంబం మాత్రం దీనికి సుముఖంగా లేదు. దీంతో తిరిగి తన ప్రాంతానికి వచ్చి వెబ్ డెవలప్‌మెంట్ అసైన్మెంట్స్ చేయడం ప్రారంభించారు. ట్రావెల్, హోటల్ సెగ్మెంట్‍‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు సచిన్. ఇప్పటికి 600కుపైగా సైట్లను రూపొందిచారు సచిన్, అతని టీం. ఇన్‌ఫోగ్రిడ్, నెట్‌మ్యాంటిల్ వంటి సైట్లు వెలుగుచూసింది ఇలాగే.

image


బ్రేక్ పాయింట్

సుదీర్ఘకాలంగా ట్రావెల్, హోటల్ పరిశ్రమలతో అనుబంధం ఉండడంతో... ఆ రంగానికి ఏం అవసరమో బాగానే తెలుసుకున్నారు. “ఎయిర్‌లైన్ టికెట్స్, హోటల్ బుకింగ్స్‌లను కూడా ముందుగానే బుక్ చేసుకునేంతవరకూ టెక్నాలజీ అభివృద్ధి సాధించినా.. టూరిజం సెక్టార్‌లో చివరి నిమిషం అవసరాలను గుర్తించడం మాత్రం విస్మరించారు చాలామంది”అంటారు సచిన్. ఈ అంశంపైనా జూలై 2010లో క్లియర్ కార్ రెంటల్ ప్రారంభమైంది. అప్పటికే ఆ రంగంలో మేరు, రేడియో క్యాబ్స్ వంటి బడా కంపెనీలు సత్తా చాటుతున్న రోజులవి.


image


క్లియర్ కార్ రెంటల్ లోకల్(ఫుల్ డే, హాఫ్ డే, ట్రాన్స్‌ఫర్ ప్యాకేజ్‌‌లు), ఔట్‍స్టేషన్(వన్ వే, రౌండ్ ట్రిప్, మల్టీ సిటీ) ట్రావెల్ సర్వీసులను అందిస్తుంది. దేశంలోని మొత్తం 210కి పైగా నగరాల్లో సర్వీసుల అందిస్తోంది సీసీఆర్(క్లియర్ కార్ రెంటల్). వంద మందికి పైగా టీం వీటిని మానిటర్ చేస్తూ ఉంటారు.

ఇదంతా రూపాయి పెట్టుబడి సేకరించకుండానే

మనం చూసే కార్ రెంటల్ కంపెనీలన్నీ పెద్ద మొత్తంలో ఫండింగ్ ద్వారా వచ్చినవే. ఈ వ్యాపారం నిర్వహించడానికి నిధులు చాలా ఎక్కువ అవసరం. అయితే.. 210 సిటీల్లో సర్వీసులు నిర్వహిస్తున్నా.. ఇప్పటి వరకూ ఒక రూపాయి కూడా సంస్థాగత మదుపర్ల నుంచి సేకరించలేదు. 20వేలకు పైగా కార్లు, 1500మంది వెండర్స్ ప్రస్తుతం బోర్డ్‌లో ఉన్నారు. అనేక దేశీయ కంపెనీలతోపాటు.. మేక్ మై ట్రిప్, కాక్స్ అండ్ కింగ్స్, థామస్ కుక్ వంటి కార్పొరేట్లు కూడా సీసీఆర్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాయి.

“ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపై ఎక్కువగా దృష్టి పెట్టాం. ఇప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. చిన్న సిటీల్లో కూడా క్యాబ్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు ప్రజలు. నగరాల్లోనూ మార్కెట్ ఎక్కువగానే ఉన్నా... మా ప్రాధాన్యత చిన్న పట్టణాలకే”అన్నారు సచిన్.

ఔరంగాబాద్‌ నుంచి కంపెనీ

చిన్నపాటి టౌన్స్‌లో ఏర్పాటై సత్తా చాటుతున్న అనేక కంపెనీలను చూశాం. మాది కూడా ఇలాంటి సక్సెస్ స్టోరీనే. ఓ స్టార్టప్ ప్రారంభమవుతుందని ప్రపంచం అనుకోని పట్టణం ఔరంగాబాద్ నుంచి.. విజయతీరాలకు చేరామంటారు సచిన్. అయితే దీని మూలంగా సానుకూల అంశాలతోపాటు ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయని చెప్పారాయన.

ప్రతికూలం : పరిణతి చెందని మార్కెట్, మౌలిక వసతుల కరవు, పెట్టుబడి లేమి, మద్దతు లోపించడం

సానుకూలం : ట్యాలెంట్ గల వ్యక్తులు తగ్గువ వేతనాలకే లభించడం, విజయం సాధించాలనే తపన

సచిన్‌కు తానేం చేస్తున్నాడో, ఏం చెయ్యాలో తెలుసు. అందుకే విజయం అతనికి స్వాగతం పలికింది. ఔరంగాబాద్ కాలింగ్.. అంటూ సచిన్‌పై ఆర్టికల్స్ రాశాయి అనేక వార్తాపత్రికలు. ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉన్నత చదువుల్లో ఉన్న ఎంతోమందికి.. తమ సొంత నగరంలోనూ సత్తా చాటి, స్థిరపడగలమనే నమ్మకాన్ని ప్రేరణను ఇచ్చారు సచిన్.

వెబ్‌సైట్