సంపద+ఆరోగ్యం...పార్థసారథి స్పెషల్ ప్యాకేజీ

సంపద+ఆరోగ్యం...పార్థసారథి స్పెషల్ ప్యాకేజీ

Wednesday February 03, 2016,

4 min Read

వృత్తి.. జీవితం. ఈ రెండూ రైలు పట్టాల్లాంటివి. ఈ రెండూ సమాంతరంగా ఉన్నప్పుడే పరిపూర్ణ జీవితం సొంతమవుతుంది. అందుకే అంటారు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమని. కానీ కొందరికి మాత్రం వృత్తే జీవితం. జీవితమే వృత్తి. అందులోనే ఆనందం. అంతా పరిపూర్ణం. ఈ అదృష్టం కొందరికే దొరుకుతుంది. అలాంటివారిలో ఒకరు మిమి పార్థసారథి. ఆమె ఎవరు? ఏం చేశారు? ఏం చేస్తున్నారు? తెలుసుకుందామా మరి.

కార్పొరేట్ సెలబ్రిటీ

మిమి పార్థసారథి. బెంగళూరు కార్పొరేట్ సర్కిల్స్ లో చాలామందికి పరిచయం ఉన్న పేరు. సంపదను, ఆరోగ్యాన్ని కలిపి ఒకే ప్యాకేజీగా ఇస్తూ మార్కెట్లో మాయాజాలం చేస్తున్న మాస్టర్. ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ముందు 'సిన్హాసి' గురించి తెలుసుకోవాలి. 'సిన్హాసి' జపనీస్ పదం. శకునాలను, అనారోగ్యాన్ని పారద్రోలే రక్షణ కవచం అని అర్థం. అందుకే తన కన్సల్టెంట్ కు ఆ పేరు పెట్టారు మిమి. ఇన్వెస్ట్ మెంట్ ప్లానింగ్, అడ్వైజరీ సంస్థ ఇది. పేరులోనే తాను అందించే సేవల గురించి తెలియాలన్న ఉద్దేశంతో జపనీస్ పదాన్ని అరువు తెచ్చుకొని 2005లో సిన్హాసి కన్సల్టెంట్స్ ను ప్రారంభించారామె. పెట్టుబడుల విషయంలో క్లైంట్లకు సరైన సలహాలు ఇస్తూ వారి డబ్బుకు రక్షణగా నిలవడం ఆమె మొదటి లక్ష్యం. అంతకుముందు మిమి ఐఎల్ & ఎఫ్ఎస్ ఇన్వెస్ట్ స్మార్ట్ లో పనిచేశారు. ఆ అనుభవంతో సొంత సంస్థ ఏర్పాటు చేశారు.

"సంపాదించిన డబ్బులతో బాగా జీవించాలనుకునే వాళ్లు రెండు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాల్ని స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు డబ్బును ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఎన్నాళ్లు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? అన్నది మొదటి అంశమైతే... పెట్టుబడి నుంచి ఎలాంటి రాబడుల్ని ఆశిస్తున్నారన్నది రెండో అంశం. ఈ రెండు అంశాల్లో ఉండే స్పష్టతే ఎత్తుపళ్లాలను సమతుల్యం చేస్తుంది. ఇది సంపదకే కాదు... వారి ఆరోగ్యానికి కీలకం" అంటారు మిమి.
image


చెన్నై టు బెంగళూరు

తమిళనాడు అయ్యంగార్ కుటుంబంలో పుట్టారు మిమి. బెంగళూరులో పెరిగారు. ఆమె తల్లిదండ్రులు ప్రకృతి, వన్య ప్రాణుల ప్రేమికులు. వీరి కుటుంబం తరచూ వృక్షజాలం, జంతుజాలం ఉన్న ప్రాంతాలకు పర్యటించేవాళ్లు. చిక్ మంగళూరులో వీరికి సుందరమైన కాఫీ ఎస్టేట్ ఉంది. మిమికి సంగీతం, నృత్యం, యోగ లాంటివాటిలో ప్రావీణ్యం ఉంది. ఇవన్నీ తల్లి నుంచి వారసత్వంగా వచ్చాయి ఆమెకు. యోగా, క్లాసికల్ డ్యాన్స్ పై ఉన్న అభిరుచే పని విషయంలో క్రమశిక్షణ పెంచిందని అంటారు మిమి. ఎనిమిదేళ్ల వయస్సు నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందిన మిమి... ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆమె తల్లికి యోగా నేర్పిన గురువు దగ్గరే బేసిక్స్ నేర్చుకున్నారు. అయితే 2011 అక్షర్ పవర్ యోగా అకాడమీలో అక్షర్ జీని కలిసిన తర్వాత మళ్లీ యోగాపై ఆసక్తి పెంచుకున్నారు. మిమి తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమె మనస్సుకు శాంతిని అందించింది యోగానే అంటారామె.

"నేను అనుకున్నట్టుగా జీవించడానికి యోగా పూర్తిగా ఉపయోగపడింది. నా జీవనశైలిలో చాలా మార్పు వచ్చింది. నిరంతరం నన్ను ఎలా మెరుగుపర్చుకోవాలనే దానిపై దృష్టిపెట్టేలా చేసింది. ఫైనాన్షియల్ అడ్వైజరీ, యోగా, డ్యాన్స్, సహజ వనరుల పరిరక్షణ... ఇలా నేనున్న ప్రతీ రంగంలో రాణించడానికి యోగా ఎంతగానో తోడ్పడింది" అంటూ యోగా గొప్పదనాన్ని వివరిస్తారు మిమి.

ఈ స్టోరి కూడా చదండి


వెల్త్+వెల్ నెస్

బెంగళూరుకు చెందిన సిన్హాసి కన్సల్టెంట్స్ లో 11 మంది పనిచేస్తున్నారు. వ్యక్తిగత, కార్పొరేట్ క్లైంట్లను డీల్ చేస్తున్నారు. కిరణ్ మజుందార్ షా, గౌరవ్ గాంధీ, సునీల్ అలఘ్ లాంటి ప్రముఖులు వీరి క్లైంట్లు. కన్సల్టెన్సీ ప్రారంభించిన ఏడాది తర్వాత తాను అందిస్తున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ తో పాటు అదనంగా మరిన్ని సేవలు అందించాలనుకున్నారామె. అది కూడా తనకు అనుభవం ఉన్న రంగాలైన యోగా, డ్యాన్స్ లాంటివి అన్నమాట. జనవరి 2014లో క్రిష్ణ వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా తన కోరిక నెరవేరింది అంటారు మిమి. బెంగళూరు మళ్లేశ్వరంలో ఆమెకున్న విశాలమైన నివాసంలో సిన్హాసి కన్సల్టెంట్స్ ఆఫీసుతో పాటు క్రిష్ణ వెల్ నెస్ సెంటర్ లు ఉన్నాయి. 1960వ దశకం చివర్లో నిర్మించిన పచ్చని విశాలమైన నివాసాలు ఇవి. కొన్ని వేల చదరపు అడుగుల్లో విస్తరించిన ఇలాంటి ప్రదేశం బెంగళూరులో చాలా అరుదుగా కనిపిస్తుంది.

క్రిష్ణ వెల్ నెస్ సెంటర్ లో అందమైన హాల్

క్రిష్ణ వెల్ నెస్ సెంటర్ లో అందమైన హాల్


తన ఇంటి సౌందర్యం గురించి మిమికి బాగా తెలుసు. అందుకే వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఇదే సరైన వాతావరణం అనుకున్నారు. అక్షర్ పవర్ యోగాతో క్రిష్ణ వెల్ నెస్ సెంటర్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న 150 మంది విద్యార్థులకు ప్రతీరోజు క్లాసులు నిర్వహిస్తారు. ప్రముఖ భరతనాట్యం శిక్షకురాలు పద్మిని రవి క్లాసులు చెబుతారు. సెంటర్ లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు మిమి. దాంతోపాటు ఫండ్ మేనేజ్ మెంట్, పెట్టుబడులకు అవకాశాలు, ఎస్టేట్ ప్లానింగ్, ఆరోగ్యం, ఆరోగ్య బీమా, ప్రాణాయామం, మెడిటేషన్ వల్ల లాభాలు, యోగా, డైట్, శారీరక, మానసిక ఆరోగ్యం లాంటి అంశాలపై నిత్యం వర్క్ షాపులు జరుగుతుంటాయి. క్రమశిక్షణ, సమతుల్యతలే ఆర్థికంగా విజయం సాధించడంలో కీలకం అని భావిస్తారు మిమి.

ప్రపంచమంతా చక్కర్లు

తన తండ్రితో కలిసి చిన్ననాటి నుంచే భారతదేశంలో, విదేశాల్లో పర్యటించింది మిమి. స్విట్జర్లాండ్ లో ఉన్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ అండ్ నేచర్ డైరెక్టర్ గా ఆమె తండ్రి పనిచేసేవారు. పర్యావరణ పరిరక్షణపై జరిగే పలు కాన్ఫరెన్సులకు వెళ్లేవారు. మిమి కూడా తరచుగా వెళ్తుండటం వల్ల స్విస్ నగరంలోని కాస్మోపాలిటన్ వాతావరణానికి అలవాటు పడింది. అందుకే స్విస్ నగరమైన జెనీవాలో వెబ్ స్టర్ యూనివర్సిటీలో ఎంబీఏ చదవాలని నిర్ణయించుకున్నారామె. ఇప్పుడు తన పిల్లల్ని అలాగే ప్రయాణాల్లో తోడు తీసుకెళ్తున్నారు మిమి. ఆమె కూతురు సిడ్నీలో జీవ పర్యావరణ పరిరక్షణలో మాస్టర్స్ చేస్తోంది. వీరిద్దరు దక్షిణాఫ్రికా, కెన్యా, స్విట్జర్లాంజ్, స్పెయిన్, మలేషియా, న్యూజీలాండ్, అలాస్కా దేశాలతో పాటు భారతదేశంలో ప్రముఖ దేవాలయాలు, వన్యప్రాణి పరిరక్షణ కేంద్రాలను సందర్శించారు. తన జీవితంలో పని వేరు కాదని అనుకుంటారు మిమి. తల్లీకూతుళ్లిద్దరూ పని విషయంలో ఒకేరకమైన అభిరుచి ఉన్నవాళ్లే. అందుకే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆమెకు ఎలాంటి ఆందోళన లేదు. కొన్నేళ్లుగా ఆమె తల్లి ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు. "నేను ఇష్టంగా చేయాలనుకున్న పనులతోనే నా వృత్తి జీవితం ముడిపడి ఉంది" అంటూ సంతోషంగా చెబుతూ ముగిస్తారామె.


ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి