కేంద్రం ప్రకటించిన 30 స్మార్ట్ సిటీల్లో తెలంగాణ నుంచి కరీంనగర్, ఏపీ నుంచి అమరావతి ఎంపికైంది. మొత్తం 30 స్మార్ట్ సిటీల్లో తమిళనాడు నుంచి 4, కేరళ నుంచి 1, ఉత్తరప్రదేశ్ నుంచి 3, కర్ణాటక నుంచి 1, గుజరాత్ నుంచి 3, ఛత్తీస్గఢ్ నుంచి 2 నగరాలకు చోటు దక్కింది. దీంతో ఇప్పటివరకూ 90 నగరాలు స్మార్ట్ సిటీ మిషన్ కిందకు చేరాయి. స్మార్ట్ జాబితాలో ఎంపికైన నగరాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 57,393 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు.
2015లో దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్ సిటీ కింద ఎంపిక చేశారు. ఫస్ట్ ఫేజ్ లో 20 నగరాలను తీసుకున్నారు. ఆ తర్వాత మరో 13 సిటీలను యాడ్ చేశారు. రెండో దశలో 27 ఎంపిక చేశారు. లాస్ట్ ఫేజ్ కింద తాజాగా 30 నగరాల లిస్టు విడుదల చేశారు. ఈ లిస్టులో తిరువనంతపురం, నయా రాయ్పూర్ టాప్ టూ స్థానాల్లో నిలిచాయి. జమ్ము, శ్రీనగర్, డెహ్రాడూన్ కూడా చోటు దక్కించుకున్నాయి
స్టార్ట్ సిటీలో చోటు దక్కడంతో కరీంనగర్ లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక ఇప్పుడు స్మార్ట్ సిటీ హోదా కూడా రావడంతో త్వరలోనే చారిత్రక నగరం మేటి సిటీగా తయారవుతుందని పట్టణవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.