మెడికల్ టూరిజంలో ఇండియాకు గుర్తింపు తెచ్చిన డాక్టర్

పదిహేనేళ్ల క్రితం అది కల.. ఇప్పుడది వేల కోట్ల వ్యాపారం..

మెడికల్ టూరిజంలో ఇండియాకు గుర్తింపు తెచ్చిన డాక్టర్

Thursday January 14, 2016,

4 min Read

చాలా దేశాల్లో వైద్యం ఖరీదైన వ్యవహారం. మరి కొన్ని దేశాల్లో డబ్బు ఖర్చుపెట్టినా సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. అధునాతన వైద్య సదుపాయాలు ఉండి, మరీ ఆస్తులమ్ముకునేలా చేయకుండా ట్రీట్ మెంట్ ఇవ్వగలిగే చోటు దొరికితే ఉంటే ఎంత బాగుంటుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అంతా అనేకునే విషయమే. ఇదే ఆలోచన చాల మందిని వైద్యం కోసం భారత్ లాంటి దేశాల వైపు మళ్లేలా చేస్తోంది. భారత్ లో మెడిసిన్ చాలా వేగంగా అడ్వాన్స్ డ్ గా మారటంతో లక్షలాదిమంది వైద్యం కోసం ఇండియా వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారైలు, భారత సంతతికి చెందిన విదేశీ పౌరులు తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోటానికి ఇండియా ఫ్లైటెక్కుతున్నారు. ఇక్కడి డాక్టర్ల చుట్టూ, హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇది మన దేశంలో సరికొత్త అవకాశాలను సృష్టించింది.

ఇండియన్ హాస్పిటళ్లకు మహర్దశ ..

ఇండియన్ హాస్పిటళ్లకు మహర్దశ ..


అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నప్పుడు చాలా మంది రంగంలోకి దిగుతారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే రాళ్లు, రప్పలు, ముళ్లు ఉన్న బాటలో పయనించి గమ్యాన్ని చేరి కొత్త విజయాలు నమోదు చేస్తారు.

డాక్టర్ రాజీవ్ రాణే..

వృత్తి డాక్టర్, ప్రవృత్తి ప్రపంచాన్ని చుట్టేయడం.. విదేశాల్లో పనిచేసే అవకాశం ఆయనకు చాలా సార్లు వచ్చింది. కానీ, ఆయన తన జీవిత భాగస్వామి తో కలసి మాతృదేశంలోనే వైద్య సేవలందించాలని డిసైడైపోయారు. రాజీవ్ జీవిత భాగస్వామి భారతి రాణే గైనకాలజిస్ట్. ఇద్దరూ కలసి గుజరాత్ లోని బార్డోలి జిల్లాలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్న గ్రామంలో 1983లో మెడికల్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1991నాటికి మంచి సౌకర్యాలతో సొంత హాస్పిటల్ ని ఓపెన్ చేశారు.

దాదాపు ఓ పదేళ్ల తర్వాత... ఇండియాకు ట్రీట్ మెంట్ కోసం ఇతర దేశాలనుండి పేషెంట్లు ఎక్కువగా వస్తున్నట్టు గమనించారు రాజీవ్. వారిలో ఎన్నారైలు, భారత సంతతికి చెందిన విదేశీ పౌరులు ఎక్కువగా ఉండేవారు. కానీ,ఇలా ట్రీట్ మెంట్ కోసం వచ్చేవారికి ఎన్నో సమస్యలు. వీసా దొరటం నుంచి, నమ్మకమైన ట్రీట్ మెంట్ ఇచ్చే హాస్పిటల్ ని వెతుక్కోవటం, సమయానికి డాక్టర్ కన్ సల్టేషన్ దొరకటం, ట్రీట్ మెంట్ తీసుకున్నంతకాలం షెల్టర్ చూసుకోవటం వరకు- ప్రతీదీ పెద్ద సమస్యే. అప్పుడే డాక్టర్ రాజీవ్ మదిలో ఓ ఐడియా మెరిసింది. ఇండియాలో మెడికల్ టూరిజానికి సంబంధించి ఓ ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆలోచన కొత్తదే. కానీ అమలు చేయటానికి తగ్గ పరిస్థితులు అప్పటికి లేవు. ఇంటర్నెట్ ఇప్పుడున్నంతగా ఆనాడు డెవలప్ కాలేదు. దాంతో ఆ ప్లాన్ పట్టాలెక్కలేదు.

ఏళ్లుగడుస్తున్నాయి. కానీ, డాక్టర్ రాజీవ్ మదిలో ఆ బిజినెస్ ప్లాన్ అలాగే ఉంది. దాన్ని ఎలాగైనా నిలబెట్టాలనే తపన బలంగా ఉంది. కొన్నేళ్ల తర్వాత ఆ అవకాశం తనయుడి రూపంలో మళ్లీ వచ్చింది.

అనురవ్ రాణే, ఇంజినీరింగ్ తర్వాత పుణె సింబయాసిస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ నుండి ఎంబీఏ పూర్తి చేసి కెరీర్ ప్లాన్స్ లో బిజీగా ఉన్నయువకుడు. అనురవ్ కూడా ఓ మెడికల్ ప్లాట్ ఫామ్ బిల్డ్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ, దురదృష్టవశాత్తూ అదీ వర్కవుట్ కాలేదు. మరికొన్నేళ్లు గడిచాయి. తండ్రీ కొడుకులు జత కలిశారు. ఇద్దరి కలల ప్రాజెక్టులను ఒక్కటి చేసి ఓ బ్రహ్మాండమైన మెడికల్ టూరిజం ప్లాట్ ఫాంని రూపొందించారు. రియాలిటీలో చూసుకున్నారు. ఇద్దరూ సక్సెస్ అయ్యారు. అదే ప్లాన్ మై మెడికల్ ట్రిప్.

ప్లాన్ మై మెడికల్ ట్రిప్..

2012లో లాంచ్ అయిన పుణె బేస్డ్ మెడికల్ సర్వీస్ ప్లాట్ ఫాం. ఇతర దేశాల నుండి భారత్ లో వైద్యం కోసం వచ్చేవారికి ఇక్కడ లభ్యమయ్యే మెడికల్ సర్వీసుల వివరాలతో పాటు ట్రీట్ మెంట్ మొదటి నుంచి చివరి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చూసే సంస్థ. ఇప్పుడా ప్లాట్ ఫాంకు దేశంలోని 1500 ప్రముఖ వైద్యసంస్థలతో ఒప్పందాలున్నాయి.

జస్ట్ ఇంటర్నెట్ ఉపయోగించటం తెలిస్తే చాలు. సేవలను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాట్ ఫామ్ మెడికల్ సర్వీసులను రీజనబుల్ ఛార్జెస్ తో అందించే వైద్య సంస్థలను సూచించటమే కాదు. కొత్త ప్రదేశంలో పేషెంట్ తో పాటు సహాయకులు కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా చూస్తుంది. మెడికల్ వీసాలు, హోటల్ బుకింగ్స్, అంబులెన్స్ సౌకర్యాలు ...ఇలా దేశంలో అడుగుపెట్టినప్పటి నుండి రోగి వెన్నంటే ఉంటుంది. 

డెంటల్, కాస్మెటిక్ మరియు డెర్మటలాజికల్ సర్జరీలు, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్, క్యాన్సర్ ట్రీట్ మెంట్, నీ రీప్లేస్ మెంట్, ఐవీఎఫ్, బైపాస్ సర్జరీ, వెయిట్ లాస్, యాంటి ఏజింగ్ లాంటి అనేక ట్రీటమెంట్లకు ప్లాన్ మై మెడికల్ ట్రిప్ లో ఆకర్షణీయమైన ప్యాకేజీలు అనేకం ఉన్నాయి” - డాక్టర్ రాజీవ్ రాణే. 

డా. రాజీవ్ రాణే ప్లాన్ మై మెడికల్ ట్రిప్ కు కౌ-ఫౌండర్ మాత్రమే కాదు, సీవోవోగా కూడా పనిచేస్తున్నారు. ఈ రంగంలో ఇంకా ముంబయిలోని ట్రాన్స్ ఎర్త్, ఫ్లై ఫర్ సర్జరీ, సింగపూర్ కు చెందిన డాక్ డాక్, జర్మనీ సంస్థ మెడిగో, వాట్ క్లినిక్ సంస్థలు సేవలందిస్తున్నాయి.

ఈ తరహా సేవలను కొన్ని సంస్థలు అందిస్తున్నప్పటికీ వాటికంటే తమ ప్లాట్ ఫాం చాలా యునిక్ అంటారు డాక్టర్ రాజీవ్. ఇతర సంస్థల్లో లేని విధంగా పలు సిటీలు, ఆస్పత్రులు, డాక్టర్ల సర్వీసులను కంపేర్ చేసి చూసుకునే అవకాశాన్ని ఇస్తున్నామంటారాయన. దీనివల్ల రోగులకు సరైన ఛాయిస్ ని ఎంచుకునే అవకాశం దక్కుతోంది. 2007లో ఈ ప్లాట్ ఫామ్ మొదలైననాటి నుంచి ఇప్పటివరకు 3వేల మంది దేశంలోని పలు హస్పిటళ్లలో వైద్య సేవలందుకున్నారు. ఇంత సర్వీస్ ఇస్తున్నందుకు పేషంట్లకు ఎంత ఛార్జ్ చేస్తారో కదా.. అనే సందేహం రావచ్చు.. కానీ ప్లాన్ మై మెడికల్ ట్రిప్ రోగులనుంచి నయాపైసా తీసుకోదు. రోగులను రిఫర్ చేసినందుకుగాను ఆస్పత్రులనుంచే రిఫరల్ ఛార్జీలను వసూలు చేస్తుంది.

పెట్టుబడి పెట్టారు.. లాభాలు చూస్తున్నారు

ఈ ప్లాట్ ఫాం ఇప్పటివరకు రూ.80 లక్షలు ఖర్చు చేసింది. ఈ మొత్తంలో ఎక్కువ భాగం దేశ వ్యాప్తంగా పలు వైద్య సంస్థలతో ఎఫిలియేషన్ పెట్టుకోవటానికి, ఆన్ లైన్ లో కస్టమర్లకు మరింత దగ్గరయ్యేలా డిజిటల్ ప్రజెన్స్ ఏర్పాట్లు చేసుకోవటానికే ఉపయోగించారు.

• సగటున రోజుకు 70 మంది ఎంక్వైరీ..

• నెలకు 15వేల నుంచి 20వేల హిట్స్..

• రోజుకి 50 నుంచి 100మంది ఫోన్ల ద్వారా సంప్రదింపులు..

ఇలా నాలుగేళ్లలో అనూహ్యమైన వృద్ధి సాధించిన ప్లాన్ మై మెడికల్ ట్రిప్ అతి తక్కువ నిధులతో మొదలై అనతి కాలంలోనే దేశంలోని పలు నగరాలకు విస్తరించటమే కాదు.. టర్కీలో కూడా ఆపరేషన్స్ మొదలు పెట్టింది. 2015-16 సంవత్సరానికి 6 కోట్ల టర్నోవర్ కూడా సాధించింది.

కొత్త ఆలోచనలకు సవాళ్లు సహజమే..

ప్లాన్ మై మెడికల్ ట్రిప్.. అంత తేలిగ్గా ఏం నిలబడలేదు. ఆదినుంచి ఎన్నో సమస్యలు. మరీ ముఖ్యంగా డాక్టర్లను ఒప్పించటమే అన్నిటికీ మించిన పెద్దపని. అంతే కాదు.. టెక్నికల్ గా కూడా చాలా సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. నిరంతరం విస్తరిస్తున్న సర్వీసుల దృష్ట్యా, కస్టమర్లకు అవసరమైనట్టుగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ప్లాట్ ఫాంను రూపొందించటానికి చాలా కష్టపడ్డాం అంటారు డాక్టర్ రాజేష్. ఇక ఇప్పుడైతే మార్కెటింగ్ పెద్ద ఛాలెంజింగ్ మారిందని చెప్తున్నారాయన.

భారత్ లో మెడికల్ టూరిజానికి ఫ్యూచర్ ఉందా..?

ఈరోజుకి ఇండియాలో మెడికల్ టూరిజమ్ ఇండస్ట్రీ విలువ 3 బిలియన్ డాలర్లకు పైబడి ఉంది. ఏటా 2లక్షల 30వేల మంది విదేశాల నుంచి వైద్యానికి వస్తున్నారు. పంజాబ్ హర్యానా ఢిల్లీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అంచనాల ప్రకారం 2018 కల్లా భారత మెడికల్ టూరిజమ్ విలువ 6 బిలియన్ డాలర్లను చేరుతుంది. వచ్చే నాలుగేళ్లలో వైద్యానికొచ్చే టూరిస్టుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. దీన్నిబట్టి చూస్తే ప్లాన్ మై మెడికల్ ట్రిప్ ప్లాట్ ఫాంకి మాత్రమే కాదు.. నిబద్ధతతో పనిచేసే వారికి ఈ రంగంలో మంచి అవకాశాలున్నాయన్నమాటే.