బడుగు జీవితాలకు భద్రత, భరోసా - అదే పరిణామ్ ఆశయం
పట్టణాల్లోని పేదల జీవితాల్లో వెలుగును నింపుతున్న సంస్థ. తల్లి ప్రారంభించిన ఈ సంస్థను ఒంటిచేత్తో విజయవంతంగా నడుతున్నారు మల్లికా ఘోష్. ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి కెరీర్ను వదులుకుని.. పేదల కోసం పాటుపడుతున్నారు.
Friday May 01, 2015,
7 min Read
మల్లికా ఘోష్.. కొన్నాళ్ల కిందటి వరకు ఆమె లక్ష్యం వేరు. ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ కావాలన్నది ఆమె కల. ఇందుకోసం ఇంగ్లండ్, అమెరికాల్లో కొత్త కొత్త కోర్సులను నేర్చుకుంది. మెక్కాన్ ఎరిక్సన్లో సౌతిండియా ఫిల్మ్ హెడ్గా కూడా పనిచేసింది. ఐతే వీటన్నింటిని పరిణామ్ కోసం వదిలేసుకుంది. ఇప్పుడు ఆమె లక్ష్యమంతా నిరుపేదల్లో వెలుగులను నింపాలనే.
మల్లిక తండ్రి సమిత్ ఘోష్.. పేదలను ఆదుకోవాలన్నతలంపుతో 2005లో ఉజ్జీవన్ మైక్రో ఫైనాన్స్ సంస్థను ఆరంభించారు. ఐతే ఆర్థిక సాయం ఒక్కటే పేదల జీవితాల్లో మార్పు తీసుకురాదని వీరు త్వరగానే గ్రహించారు. ఈ ఆలోచనే వీరిని పరిణామ్ను ఏర్పాటు చేసుకునేందుకు పురికొల్పింది. పరిణామ్ను మల్లికా తల్లి ఎలైన్ ఘోష్ ప్రారంభించారు. ఆమె 2013లో చనిపోయారు. ఇప్పుడు మాత్రం మల్లికనే సంస్థ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సంస్థ లక్ష్యాలను అందుకోవడం అంత సులభం కాదని ఆమె అంటున్నారు. పేదరికం వివిధ రూపాల్లో ఉంటుంది. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, సమాజాభివృద్ధి రంగాల్లో పరిణామ్ సేవలు అందిస్తున్నది. పేదరికాన్ని నిర్మూలించేందుకు అవసరమైన అన్ని అంశాల్లోనూ పరిణామ్ సహకరిస్తుంది. ఉజ్జీవన్ కస్టమర్లకే కాకుండా మరెంతో మందికి సేవలు అందించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న నిరుపేదల జీవితాలను బాగుచేయడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. సూక్ష్మ రుణాలకు కూడా అర్హులు కాని వర్గానికి చేయూత అందించింది.
ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై..
కార్పొరేట్ రంగంలో విజయవంతంగా పనిచేసిన మల్లిక ఆ తర్వాత పూర్తి సమయాన్ని సేవా రంగానికే కేటాయించింది. వాస్తవానికి మల్లికకు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే పిచ్చి. అందుకే దాన్నే కెరీర్గా ఎంచుకుంది. ప్రత్యేక కోర్సులను విదేశాల్లో పూర్తి చేసి ఇండియాలో ఏడేళ్ల పాటు అడ్వర్టయిజింగ్ రంగంలో పనిచేసింది. ఇంటికి వెళ్లినప్పుడల్లా తల్లిదండ్రులు పరిణామ్, ఉజ్జివన్ల ద్వారా ప్రజలకు చేస్తున్న సేవల గురించి వింటుండేది. ఆరోగ్యం, ఆర్థిక అక్షరాస్యత వంటి అంశాలపై పేదలకు.. తల్లిదండ్రులు అవగాహన కల్పించడం వంటి అంశాలు మల్లికకు ఆసక్తి కలిగించాయి. చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నా.. తల్లిదండ్రులు చేస్తున్న సేవ అంత తేలికైనదేమీ కాదని మల్లికకు తెలిసొచ్చింది.
మొదట్లో కొన్ని రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి, పేదల జీవితాలను దగ్గరినుంచి పరిశీలించింది . పిల్లలన్నా, జంతువులన్నా మల్లికకు ఎంతో ఇష్టం. అందుకే పిల్లలలతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు మల్లిక. తల్లిదండ్రులు ప్రారంభించిన ఉజ్జీవన్, పరిణామ్లతో కాకుండా పిల్లలతో కలిసి పనిచేయాలని భావించారు. రెండువారాలపాటు నర్సరీ స్కూల్లో పనిచేశారు. ఒకేరకమైన సిలబస్ ఉండటం.. చెప్పిందే చెప్పడం మల్లికకు నచ్చలేదు. ఈ రంగంలో న్యాయం చేయలేనని నిర్ణయానికి వచ్చేసి, పిల్లల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల కోసం పరిశోధన చేశారు. ఏదీ కూడా తను అనుకున్న స్థాయిలో లేకపోవడంతో నిరాశ చెందారు. ఈ సమయంలో తండ్రి ఇచ్చిన సలహా మల్లిక జీవితాన్నే మార్చేసింది. తల్లి ప్రారంభించిన ఎన్జీవోలో పనిచేయమని తండ్రి ఇచ్చిన సూచనను పాటించాలని నిర్ణయించుకున్నది. మల్లికను ఇంటర్న్గా తీసుకోవాలని ఆమె తల్లి భావించింది. ఐతే అప్పటికే ఏడు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండటంతో ఇంటర్న్గా కాకుండా తనను కన్సల్టెంట్గా పిలవాలని తల్లికి సూచించారు మల్లిక. మూడు నెలలపాటు తల్లితో కలిసి పనిచేశారు. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమ ప్రాజెక్ట్లో మల్లిక పనిచేశారు. అలాగే పిల్లలకు వేసవి శిక్షణా శిబిరాల బాధ్యతను కూడా మల్లికకు అప్పగించారు ఎలైన్. అక్కడి పరిస్థితులు ఆమెను కట్టిపడేశాయి. దీంతో మళ్లీ అడ్వర్టయిజింగ్ రంగంలోకి వెళ్లకూడదని మల్లిక నిర్ణయించుకున్నారు. పరిణామ్ మరింత విజయవంతమయ్యేందుకు మరిన్ని అర్ధవంతమైన కార్యక్రమాలను చేయాలని ఆమె భావించారు.
25 ఎన్జీవో సంస్థల్లో పరిణామ్ కూడా ఒకటి. వీరికి ప్రధానంగా విరాళాలు ఇస్తున్నది మైఖెల్ సుసాన్ డెల్ ఫౌండేషన్, సిటీ ఫౌండేషన్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, మరికొంతమంది పెద్దమనసున్న వ్యక్తులు. ఎన్జీవోగా పరిణామ్ ఎంతో మంచి పేరు సంపాదించింది. మొదటి నుంచి ఆర్థిక వ్యవహారాల్లో మల్లికా చాలా నిజాయితీగా ఉండేవారు. అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలకు కొద్దిమాత్రమే ఖర్చు చేసి, మిగతా మొత్తాన్ని లబ్ధిదారులకు కేటాయించాలన్నదే ఆమె విధానం. అలాగే సహాయం పొందిన వారి నుంచి ఎలాంటి డబ్బు తీసుకునేవారు కాదు. ఉజ్జీవన్ సంస్థతో కలిసి పరిణామ్ పనిచేసేది. ఉజ్జీవన్ ఎలాంటి ఆర్థిక సాయం చేయకపోయినా.. ఇతర రంగాల్లో మాత్రం సేవలందించేది. పరిణామ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మల్లిక ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటగా సంస్థ రిజిస్ట్రేషనే ఆమెకు పెను సవాలుగా మారింది. ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ చేయడం తలకుమించిన భారంగా మారిపోయింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేశారు. ఐతే ఎలైన్ ఎప్పుడు కూడా తన జీవితంలో ఎవరికీ లంచం ఇవ్వలేదు. దీంతో సంస్థ రిజిస్ట్రేషన్ సాధించేందుకే మూడేళ్లు పట్టింది.
తల్లి మరణంతో తల్లడిల్లకుండా బాధ్యతలు భుజానికి !
పరిణామ్లో చేరిన ఆరునెలల తర్వాత మల్లికను నిర్వహణ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఎలైన్ కోరారు. ఫైనాన్స్, రైటింగ్ రిపోర్ట్స్, నిధులు సంపాదిం చడం, ప్రతిపాదనలు పంపడం వంటి విభాగాలకు మల్లిక ఇంచార్జ్గా వ్యవహరించారు. మల్లిక సంస్థలో చేరిన సమయంలో కేవలం ఆరోగ్య శిబిరాలు, విద్యా సంబంధ కార్యక్రమాలు మాత్రమే పరిణామ్ నిర్వహించేది. ప్రస్తుతం వాటితోపాటు వేసవి శిక్షణా శిబిరాలు, ఆర్థిక అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక అక్షరాస్యతా కార్యక్రమం ద్వారా 50 వేల బ్యాంక్ ఖాతాలను తెరిపించారు. పరిణామ్కు అవార్డు తెచ్చిపెట్టిన కార్యక్రమం అర్బన్ అల్ట్రాపూర్ ప్రోగ్రామ్. సంస్థ అభివృద్ధిలో మల్లిక కూడా భాగస్వామి అయింది. ఐతే హఠాత్తుగా 2013 నవంబర్లో ఎలైన్ చనిపోవడంతో మల్లికకు కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. తల్లి చనిపోవడం తనకు చాలా నష్టం కలిగించిదని మల్లిక అంటున్నారు.
'' మా అమ్మ చనిపోయిన తర్వాత ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఆమె లేని లోటును పూరించడం అంత సులభమైనదేమీ కాదు. ఆర్థిక వ్యవహారాలను చూసుకోవడం, విరాళాలు ఇచ్చే వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతుండటం, నిధులు, విరాళాలు తగ్గకుండా చూసుకోవడం చాలా కష్టం'' అని మల్లిక అంటున్నారు.
తల్లి మరణించిన తర్వాత మల్లికకు పరిణామ్ సంస్థ ఉద్యోగులు ఎంతో సహకరించారు. ఆరంభంలో ఏ కష్టానైనా ఎదుర్కోవడం కష్టమే. కానీ దాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ వెళితే సమస్యలు వాటంతటవే తొలిగిపోతాయన్నది మల్లిక ఆలోచన. మల్లిక అదే బాటలో పయనించింది.
"దీక్షా" దక్షత
దీక్ష.. పరిణామ్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం. ఆర్థిక అక్షరాస్యత అంటే డబ్బు నిర్వహణలో శిక్షణ. బ్యాంక్ ఖాతాలను తెరవడం, డబ్బును దాచుకోవడం వంటి విషయాలను దీక్ష ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకు ఈ అంశాలపై అవగాహన కల్పించాలని మల్లిక చెప్తారు. ప్రజల ప్రాథమిక అవసరాలేమిటో తెలుసుకోవడం, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన వాటిని ప్రాక్టికల్గా తెలియజేయడం వల్లే దీక్ష విజయవంతమైందన్నది ఆమె భావన. తాను బ్యాంక్ ఖాతాను తొలిసారిగా తెరిచినప్పుడు ఎంతో భయపడ్డానని మల్లిక చెప్పారు.
" తొలిసారిగా నేను బ్యాంక్ ఖాతా తెరిచినప్పుడు ఎంతో భయపడ్డాను. చదువుకున్న వ్యక్తి అయి ఉండి కూడా గాభరా పడ్డాను. అప్పటికే నేను బోర్డింగ్ స్కూల్లో చదివేందుకు ఇంగ్లండ్ వెళ్లాను. పెద్ద అద్దాల బిల్డింగ్లోకి ప్రవేశించడం ఇప్పటికీ నాకు గుర్తుంది. నా ధృవ పత్రాలు అడిగినప్పుడు నాకు చాలా భయమేసిది. నాతో పాటు మా అమ్మ బ్యాంక్కు వచ్చి నాకు అన్నీ నేర్పించింది. నాకు ఏటీఎం కార్డు వచ్చినప్పుడు దాన్ని తొలిసారి వాడేందుకు నాకు నెల సమయం పట్టింది. ఏటీఎం మెషిన్ వద్దకు వెళ్లాలంటేనే భయమేసింది ".
ఇలాంటి చిన్న చిన్న విషయాలను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తారు. కానీ మురికివాడల్లో ఉండే ప్రజలకు డబ్బుల గురించి ఇలాంటి ఆలోచనే ఉండదు. వారు సంపాదించేదానిపై వారికి నియంత్రణ ఉండదు. అందువల్ల పొదుపుపై అంతగా దృష్టిపెట్టరు. ఆ రోజు గడిచేందుకు అవసరమైన వాటికి ఖర్చుపెట్టేయడమే తప్ప.. భవిష్యత్ అవసరాలకు డబ్బులను పొదుపు చేయాలన్న ఆలోచనే ఉండదు. అందువల్ల వారికి ఈ అంశాలపై పరిణామ్ సంస్థ శిక్షణ ఇచ్చింది. ముఖ్యమైన ఖర్చులేవీ.. వాటిని ఎలా నిర్వహించాలి.. వాటికి డబ్బులెలా సమకూర్చాలి ? అనే అంశంపై పేదలకు ట్రైనింగ్ ఇచ్చారు. ప్రస్తుతం పరిణామ్ 16 రాష్ట్రాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తూ ఆర్థిక నిర్వహణలో వేలాదిమందికి శిక్షణ ఇచ్చింది.
అమేజింగ్.. అల్ట్రాపూర్ ప్రోగ్రాం
పరిణామ్ సంస్థ నిర్వహిస్తున్న అల్ట్రా పూర్ ప్రోగ్రామ్ మల్లికా తల్లి ఎలైనా మానసపుత్రిక. అనేక రంగాల్లో నైపుణ్యమున్న మహిళ ఆమె. గ్రాడ్యూయేషన్ చేస్తున్న సమయంలో ఇంగ్లిష్, సైకాలజీ సబ్జెక్ట్లను ఆమె ఎంచుకొన్నారు. ఆ తర్వాత సిటిబ్యాంక్లో ఫైనాన్షియల్ అడ్వయిజర్గా కెరీర్ ఆరంభించారు. పెళ్లి తర్వాత కొంత కాలంపాటు ఆమె ప్రొఫెషనల్ లైఫ్కు విశ్రాంతి ఇచ్చారు. మిడిల్ ఈస్ట్ నుంచి భారత్కు 1996లో వచ్చారు. బెంగళూరులో సమిత్, ఎలైన్ కొంత భూమిని కొనుగోలు చేశారు. అక్కడే ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షించడమే ఎలైన్ ఉద్యోగం. ఇంటి నిర్మాణం సందర్భంగా అనేక విషయాలను ఆమె గ్రహించారు. కార్మికులను కాంట్రాక్టర్లు ఎలా మోసం చేస్తున్నారో ఎలైన్ గుర్తించారు. ఈ సమయంలోనే నిరుపేదలను ఆదుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఆ తర్వాతే పరిణామ్ సంస్థను స్థాపించారు. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు ఎంత పేదలంటే.. కనీసం సూక్ష్మరుణాలకు కూడా అర్హులు కారు. వారి తలసరి ఆదాయం నెలకు రూ.1500 కంటే తక్కువే. వారు నివసిస్తున్న మురికివాడల్లో విద్యుచ్ఛక్తి, నీటి సరఫరా వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. కొన్ని మురికివాడల్లో ప్రజలు నీటి కోసం సమీపంలోని భవనాల వద్దకు వెళ్లి అడుక్కునే పరిస్థితి. ఇక పిల్లల పరిస్థితైతే మరి దారుణం. స్కూళ్లకు వెళ్లేవారి సంఖ్య అతి తక్కువగా ఉండేది. దీంతో ఎలైన్, మల్లిక ఇతర సంస్థలు నిర్వహిస్తున్న అల్ట్రా పూర్ ప్రోగ్రామ్లపై పరిశోధన చేశారు. చాలా సంస్థలు గ్రామీణప్రాంతాల్లోని ప్రజల కోసం నిర్వహస్తున్నవే. దీంతో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు నాణ్యమైన జీవితాన్ని, జీవనోపాధిని కల్పించాలని, మైక్రో ఫైనాన్స్ లోన్లకు వారిని అర్హులను చేయాలని పరిణామ్ నిర్ణయించింది. కుటుంబం మొత్తాన్ని యూనిట్గా ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. మొదటగా ఇంట్లో పెద్దలకు ఉపాధి పనులు కల్పించడంపై దృష్టిసారించింది. డబ్బు అవసరమున్నప్పుడే పనిచేయడం కాకుండా, వారానికి ఆరేడు రోజులు పనిచేశాలా వారిని మల్లికా, ఎలైన్ ప్రోత్సహించారు. పిల్లలను స్కూళ్లకు పంపడం తొలి ప్రాధాన్యంగా గుర్తించాలని వారికి సూచించారు.
తక్కువ ఫీజుకే ఖరీదైన విద్య
జీవనోపాధిలో జోక్యం చేసుకోవడం, ఆర్థిక అక్షరాస్యతలో శిక్షణ ఇప్పించి అడ్డదిడ్డంగా ఉన్న ఆర్థిక వ్యవహారాలను వారు సరిగ్గా నిర్వహించుకునేలా తయారు చేశారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికెట్ వంటి పత్రాలు లేవు. ఈ డాక్యుమెంట్స్ను కూడా పరిణామ్ ఇప్పించింది. మురికివాడల్లో ఎంతోమంది చిన్నారులు చదువుపై ఆసక్తితో ఉన్నారు. వారిలోని టాలెంట్ను గుర్తించేందుకు ట్యూషన్ సెంటర్స్ను కూడా ప్రారంభించింది. విద్యా సంబంధ కార్యక్రమాల్లో తమ పిల్లలను చేర్పించేందుకు కొంతకాలంపాటు తల్లిదండ్రులు ముందుకు రాలేదు. కొన్నాళ్ల తర్వాత పిల్లలు తమ ఇండ్లలో ఏబీసీడీ చదువుతుంటే తల్లిదండ్రులకు కూడా ముచ్చటగా అనిపించింది. ట్యూషన్ సెంటర్ల నుంచి పిల్లలను క్రిస్టల్ హౌజ్, ఇండస్ కమ్యునిటీ స్కూల్, హోప్ ఫౌండేషన్, బిల్డింగ్ బ్లాక్స్ వంటి స్కూళ్లలో చేర్పించిందీ సంస్థ. క్లాస్ రూముల్లో లాప్టాప్స్, పాఠశాలలో స్మిమ్మింగ్ పూల్స్, హార్స్ రైడింగ్ ఫెసిలిటి కలిగినటువంటి అత్యున్నత స్కూళ్లివి. అత్యుత్తమ విద్యను మురికివాడల పిల్లలకు చాలా తక్కువ ఫీజుకు అందించేందుకు ఈ పాఠశాలలు ముందుకొచ్చాయి. అయితే ఆ తక్కువ ఫీజును కూడా భరించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులున్నారు. దీంతో వ్యక్తిగత స్పాన్సర్ల వెతికి పెట్టిందీ సంస్థ. తన తల్లి సూచనల వల్లే తమ సంస్థ విద్య కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టిందని మల్లిక చెప్తున్నారు.
" అమ్మ ఎప్పుడూ చెప్తుండేది ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక అక్షరాసత్య వంటి కార్యక్రమాలు మంచివే అయినా మురికివాడల్లోని ప్రజలను బాగు పరిచేది విద్యేనని నొక్కి చెప్పేది ".
ఆరంభంలో 17 మంది చిన్నారులు మాత్రమే విద్య కార్యక్రమంలో పాలుపంచుకొనేవారు. ఆ మరుసటి సంవత్సరం ఆ సంఖ్య120కి చేరింది. ఈ ఏడాది ఆ సంఖ్యమరింత పెరిగింది. అల్ట్రా పూర్ ప్రోగ్రాం వ్యవధి పన్నెండు నెలలు. ఈ కాలంలో అన్ని కుటుంబాలతోనూ మంచి పరిచయం ఏర్పడింది. వారిలో కనిపిస్తున్న అభివృద్ధి స్పష్టంగా గోచరించింది. పిల్లలు కూడా నెమ్మదిగా స్కూళ్లకు వెళ్లడం ఆరంభించారు.
పరిణామ్ స్వచ్ఛభారత్
కాలనీల్లో శుభ్రత పాటించకపోవడంపై కూడా పరిణామ్ దృష్టిసారించింది. శుభ్రతపై ప్రత్యేక శిక్షణ నిర్వహించింది. మరోవైపు ఆ మురికివాడల్లో రాత్రైందంటే చిమ్మ చీకట్లే. కనీసం దీపావళి రోజు కూడా కరెంట్ లేదు. పరిణామ్ దివాలీ క్యాంపైన్ను నిర్వహించి సోలార్ ల్యాంప్లను అందజేసింది. ప్రతిరోజు మురికివాడల ప్రజల్లో ఏదో ఓ కొత్త సమస్య వచ్చేది. దాన్నుంచి బయటపడేందుకు పరిణామ్ కొత్త కొత్త ఐడియాలను సృష్టించేంది.
అవార్డు విన్నింగ్ ప్రోగ్రాం.. అల్ట్రాపూర్
ఎలైన్, మల్లికలకు ప్రచారమంటే పడదు. అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి వీరిద్దరూ ససేమీరా అంటారు. మంచి పనులు చేస్తే మంచి అదే జరుగుతుందన్నది వీరి నమ్మకం. కానీ సంస్థ ఉద్యోగి తెచ్చిన దరఖాస్తు తో ఫైనాన్షియల్ టైమ్స్ అండ్ సిటీ బ్యాంక్ ఇన్జెన్యుటీ అవార్డుకు మల్లిక దరఖాస్తు చేశారు. సంస్థలకు ఇచ్చే అవార్డు కాదది. పట్టణాలను మెరుగుపరిచేందుకు నిర్వహించే కార్యక్రమాలకు ఇచ్చే అవార్డు అది. దీంతో మల్లిక మొదట ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ పేరిట దరఖాస్తు చేసుకోవాలనుకున్నప్పటికీ ఆ ప్రయత్నాన్ని విరమించి, అల్ట్రా పూర్ ప్రోగ్రామ్ పేరిట దరఖాస్తు చేసింది. తొలుత ఫైనల్కు, ఆ తర్వాత అవార్డు అల్ట్రా పూర్ ప్రోగ్రామ్ గెలుచుకుంది. ఆ తర్వాత ఈ అద్భుత కార్యక్రమానికి విస్తృత ప్రచారం కలిగింది. మీడియాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం గురించి వార్తలు వచ్చాయి. పరిణామ్ 2009లో ప్రారంభమైనప్పటికీ ఎలాంటి అవార్డులకు దరఖాస్తు చేయలేదు. కానీ మురికివాడల్లో పేదలకు చక్కగా ఉపయోగపడే అల్ట్రా పూర్ ప్రోగ్రామ్ దరఖాస్తు చేసిన తొలిసారే అవార్డును గెలుచుకుంది. ఇప్పటివరకు పరిణామ్ కేవలం 700 కుటుంబాలతోనే పనిచేసింది. ఈ కుటుంబాలు మెరుగైన జీవితాన్ని అనుభవించేందుకు కొంతకాలం పడుతుంది. ఇకపై మరిన్ని అవార్డులకు దరఖాస్తు చేసుకుంటామని మల్లిక ధీమాగా చెప్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలని చూస్తున్న మల్లిక మరిన్ని అవార్డులు, రివార్డులు గెలుచుకుంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు.