ఒక్కడితో మొదలైన ప్రయత్నం.. వేల శక్తుల్ని కూడబెట్టేదాక.. అలుపెరుగని ప్రస్థానం

ఒక్కడితో మొదలైన ప్రయత్నం.. వేల శక్తుల్ని కూడబెట్టేదాక.. అలుపెరుగని ప్రస్థానం

Sunday July 30, 2017,

4 min Read

నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రండి అని శ్రీశ్రీ పిలుపునిస్తే యువ ప్రభంజనం హోరెత్తింది. యార్లగడ్డ రత్నకుమార్ నోటి వెంట కూడా అలాంటి పిలుపే వచ్చింది. దేశాన్ని ఊగించేది, శాసించేది ఎవరైనా ఉన్నారూ అంటే అది కచ్చితంగా యువతే. అది రత్నకుమార్ నమ్మిన సూత్రం. అదే సిద్ధాంతం ఇవాళ ప్రతిమండలానికో వ్యాపారవేత్తను తయారుచేస్తున్నది. అదే సూత్రం యువరక్తాన్ని ఉరకలెత్తిస్తున్నది. ఒకప్పుడు అద్దెకు ఇల్లు దొరకని వ్యక్తి.. ఇప్పుడు కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యారో చదవండి.. 

image


యార్లగడ్డ రత్నకుమార్. పుట్టింది తణుకులో. విద్యాభ్యాసమంతా గుంటూరులో. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రాలో ఆంట్రప్రెన్యూర్ షిప్ ప్రోత్సహించాలని మనసులో బలంగా నాటుకుంది. రాజధాని ప్రాంతంలో యువత సాధికారతే ధ్యేయంగా, ఓ పరిశ్రమని స్థాపించాలని సంకల్పించారు. ఆ సంకల్పంతోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. కానీ అనుకున్నదొకటి జరిగింది మరొకటి. పెట్టుబడి సరిపోలేదు. కాన్సెప్ట్ ఎవరికీ నచ్చలేదు. కనీసం అద్దె భవనం కూడా దొరకలేదు. రెంట్ ఇస్తారో ఇవ్వరో అన్నది అవతలివారి సందేహం. అలాంటి గడ్డు పరిస్థితుల్లో రత్నకుమార్ పెట్టిన కంపెనీ ఇప్పుడు తిరుగులేని మార్కెట్ ప్లేయర్ అయింది.

లోకల్ ఆంట్రప్రెన్యూర్లకు దిక్సూచిగా

అపిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫ్రాస్టక్చర్ మేనేజ్మెంట్ సర్వీసెస్) 5 రంగాల్లో 5 కంపెనీలుగా అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగింది. లోకల్ ఆంట్రప్రెన్యూర్లకు రత్నకుమార్ సంస్థ ఓ దిక్సూచిగా మారింది. అపిమ్స్ ఇండియా పేరెంట్ కంపెనీగా టూరిజం, ఫుడ్ అండ్ ఆగ్రో, ఐటీ, మీడియా అండ్ ఎంటర్టయిన్మెంట్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనే విభిన్న రంగాల్లో అగ్రభాగాన నిలిచింది. వినూత్న ఆలోచనలతో, విభిన్నమైన రీతిలో వచ్చే ప్రాజెక్టులకు అంకురార్పణ మొదలుకొని, రాబడుల బాటలో దూసుకు పోయేంతవరకు పూర్తి సహకారం అందిస్తున్నారు.

వైస్క్రీన్స్ ఎంటర్ టైన్మెంట్ ఇండియా లిమిటెడ్, యాగ్జాన్ మెషీన్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వైస్క్వేర్ బిజినెస్ ఇంక్యుబేటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, క్యాపిటల్ కల్చరల్ క్లబ్ ప్రైవేట్ లిమిటెడ్. వీటన్నిటికీ వారధి, సారధి, వ్యూహకర్త రత్నకుమారే.

image


తక్కువ టికెట్ రేటుతో వినోదాన్ని అందించే వైస్క్రీన్స్

ఫస్ట్ ప్రాజెక్ట్ వైస్క్రీన్స్. అంతా కొత్త కాన్సెప్ట్. అదీ యువతతోనే నడిపించాలనే తాపత్రయం. ఈ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 20 నుంచి 21 ఏళ్ల మధ్య యువతను టీంగా తయారు చేసుకొన్నారు. తొలి అడుగుపడింది విజయవాడ నెహ్రూ బస్ స్టేషన్లో. ఊహించినట్టే ప్రయోగం విజయవంతమైంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వైస్క్రీన్స్ ప్రారంభించారు. తక్కువ టికెట్ రేటుతో సామాన్యుడికి వినోదాన్ని అందించడమే సంస్థ లక్ష్యం. మినీప్లెక్స్ థియేటర్ల ద్వారా వేలాదిమంది యువతకి ఉపాధి ఇవ్వాలన్నది రత్నకుమార్ సంకల్పం.

వల్లకాదు అన్నవాళ్లే చేతులు కలిపారు

వేలకోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు కూడా సాహసం చేయలేక పోయాయి. మీ వల్ల కాదు అన్న UFO లాంటి సంస్థలే ముందుకొచ్చి వైస్క్రీన్స్తో ఒప్పందం చేసుకున్నాయి. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో 600 గజాల స్థలంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన వైస్క్రీన్స్, ఇవాళ కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకి మోడల్ ప్రాజెక్ట్గా మారింది. వైస్క్రీన్స్ వర్కవుట్ కావడంతో ఏపీఎస్ ఆర్టీసీ మరో 60 బస్టాండుల్లో ఈ తరహా బిజినెస్ కాన్సెప్ట్ కోసం టెండర్లు పిలిచింది.

పెట్టుబడులకి జవాబుదారీగా

పెట్టుబడిదారుల్లో ఎప్పటికప్పుడు నూతనోత్తేజాన్ని నింపుతూ శరవేగంగా దూసుకుపోతున్న వైస్క్రీన్స్ టెక్నాలజీ.. అప్డేషన్పై దృష్టిపెడుతూనే, వై స్క్రీన్స్ ట్రేడ్ డెవలప్మెంట్ సెంటర్లుగా (YSTD Centers) రూపాంతరం చెందింది. ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ పెట్టుబడులకి జవాబుదారీగా నిలిచింది. ఇప్పటికే ఏపీలో 45 సెంటర్లకి మౌఖిక ఒప్పందాలు, 15 సెంటర్లలో రాతపూర్వక ఒప్పందాలు జరిగిపోయాయి. రాబోయే ఆరేళ్లలో 145 మేజర్ మున్సిపాలిటీ సెంటర్లలో, 175 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 670 మండలాల్లో ట్రేడ్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్మించాలని రత్నకుమార్ పట్టుదలతో ఉన్నారు.

సాధారణంగా పారిశ్రామిక వేత్తలకి ప్రభుత్వాలు రాయితీలు కల్పిస్తాయి. కానీ రత్నకుమార్ తన సంస్థ ద్వారా ప్రభుత్వానికి, యువతకి మేలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు అద్దెలు, ట్యాక్స్ చెల్లింపుల ద్వారా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.

యువ పారిశ్రామికవేత్తలకోసం వైస్క్వేర్ ఇంక్యుబేషన్ సెంటర్

మేథో వలస లేకుండా, జీవనోపాధి కోసం విదేశాలకి వెళ్లకుండా సొంత గడ్డమీదననే వ్యాపారం నిర్వహించుకునేందుకు నూటికి నూరు శాతం మద్దతు ఇస్తున్నారు రత్నకుమార్. ఐడియాలకు రెక్కలు తొడిగి, ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా, యువ పారిశ్రామిక వేత్తలకోసం వైస్క్వేర్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభించారు. విద్యార్థుల ఆలోచనలను వ్యాపారంగా మార్చే క్రమంలో పెట్టుబడులు, ఇతర సదుపాయాలని సమకూర్చడంలో వైస్క్వేర్ ఇంక్యుబేషన్ సెంటర్ ముందుంది. ఆంధ్రప్రదేశ్లో తొలి ప్రైవేట్ ఇంక్యుబేషన్ సెంటర్ ఇదే. గ్రామీణ యువత ఆలోచనల్ని కూడా వ్యాపారంగా మార్చడానికి వైఎస్టీడీ సెంటర్లలోనే ఇంక్యుబేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

బిగ్ డేటా అనాలిసిస్ కోసం యాగ్జాన్ మెషీన్ లెర్నింగ్

ఎప్పుడైనా సరే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతామంటారు రత్నకుమార్. ఈ వ్యాపార ప్రయాణంలో నిత్యం దేశ , విదేశాలనుంచి అపరిమితంగా వస్తున్న డేటాను విశ్లేషించడానికి సిలికాన్ వ్యాలీలో విశేష అనుభవం ఉన్న నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. బిగ్ డేటా అనాలిసిస్ కోసం పుట్టుకొచ్చిన సంస్థ యాగ్జాన్ మెషీన్ లెర్నింగ్. రత్నకుమార్ వ్యాపార సామ్రాజ్యంలో ఇదో కలికితురాయి.

image


వాస్తవాలు, వినోదాల సమహారంగా పీపుల్స్ టెలివిజన్

యువతని సంఘటితం చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించొచ్చు తద్వారా ప్రభుత్వాలు చేసే అభివృద్ధికి తమవంతు సహకారం అందించొచ్చు. ప్రజల ఆకాంక్షల్ని బలంగా వినిపించడానికి ప్రసారమాధ్యమమే సరైన ఆయుధమని రత్నకుమార్ భావించారు. అందుకే వాస్తవాలు, వినోదాల సమహారంగా పీపుల్స్ టెలివిజన్ ప్రారంభిస్తున్నారు. దానిపేరే ఏపీటీవీ. యువకుల సారథ్యంలో వినూత్న ఒరవడితో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది ఏపీటీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె గొంతుకగా వస్తున్న శాటిలైట్ టెలివిజన్ అది. తర్వాత కాలంలో దేశమంతా ప్రాంతీయ భాషల్లో విస్తరించడానికి పూర్తి ప్రణాళికతో ఉన్నారు. ఛానల్ ను ఈ దసరాకి లాంఛ్ చేయబోతున్నారు.

రూ. 800 కోట్ల టర్నోవరే లక్ష్యం

ఎన్నో ప్రశంసలు, మరెన్నో సత్కారాలు అందుకున్న రత్నకుమార్ కు ఇదంతా ఎలా సాధ్యం అని అడిగితే కేవలం సంకల్పబలమే అంటారు . మనం చేయగలం అన్న భావనకి దేవుడి చూపు ఉంటే చాలు అంటారాయన. 2020 నాటికి 800 కోట్ల టర్నోవర్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రత్నకుమార్.