జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతిని అందించే ప్రక్రియ ప్రపంచంలో ఏదైనా ఉందీ అంటే అది యోగా మాత్రమే. ఎలాంటి జీవితాన్నైనా యోగా ఇట్టే ప్రభావితం చేస్తుంది. ఎన్ని దురలవాట్ల బారిన పడినా, ఎలాంటి దశలో ఉన్నా.. యోగా ద్వారా కోల్పోయిన జీవితాన్ని పొందవచ్చు. కేవలం మానసికంగానే కాదు శారీరకంగానూ యోగా ద బెస్ట్ వే.
దీక్షా లల్వానీ. ఒకప్పడు ఆమె చాలా డిస్ట్రబ్డ్ పర్సన్. తీవ్ర ఒత్తిడి. పరిష్కారం దొరకని సమస్యలు. నిరాశ, నిస్సహాయత ఆమెను చుట్టుముట్టాయి. వీటన్నింటి నుంచి బయటపడేందుకు తన అస్తిత్వాన్ని ప్రశ్నించుకునే బాటలో పడింది. ఎక్కడైతే తాను సర్వం కోల్పోయిందో అక్కడే వెతికే పనిలో పడింది.
బాలీవుడ్లో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న దీక్షా లల్వానీ.. రెండుపదుల వయస్సుకే పేరు, డబ్బు సంపాదించింది. కానీ ఏం లాభం.. రొటీన్ వర్క్, పనిఒత్తిడి, షూటింగ్ స్పాట్లో 18 గంటలపాటు పనిచేయడం, విపరీతంగా స్మోకింగ్.. తినడం వీలుకాక భీకరంగా జంక్ ఫుడ్. ఇదీ దీక్ష పరిస్థితి. ఆమె అవస్థ చూసిన పేరెంట్స్.. బాధపడ్డారే తప్ప.. ఏమీ చేయలేకపోయారు.
అదంతా గతం. దీక్ష ప్రస్తుతం మాత్రం జీవన శైలిని పూర్తిగా మార్చేసుకుంది. పొద్దున్నే 6 గంటలకు లేస్తుంది. 8 గంటల వరకు ప్రాణాయామం, యోగా ప్రాక్టీస్ చేస్తుంది. 11 గంటల కల్లా భోజనం పూర్తి చేస్తుంది. ఇలా ఒక డైలీ డైరీని తయారు చేసుకుంది. ఫలితం కళ్ల ముందు కనిపించింది. ఒకప్పటి దీక్షకు ఇప్పుడున్న దీక్షకు అస్సలు పోలికే లేదు.
దీక్ష లల్వానీ ప్రాణాయామంలో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. అంతేకాదు హఠ, అయ్యంగార్ శైలిలో ప్రాణాయామం ప్రాక్టీసు చేసింది. రోజురోజుకు తనలో మార్పును గమనించింది. అలా.. తన జీవితాన్ని మార్చేసిన యోగానే తన కెరీర్గా మార్చాలనుకుంది. అనుకున్నదే తడవుగా గోవా చేరింది. అక్కడే ప్రాణాయమానికి చెందిన మరిన్ని టెక్నిక్స్ నేర్చుకుంది. గోవాలోని ఆశ్వం బీచ్లో క్లాసులను స్టార్ట్ చేసింది. రెండునెలల పాటు యోగా టీచర్గా పనిచేసింది. అనేక మందికి శిక్షణను ఇచ్చింది. అయితే గోవాలో ఆఫ్ సీజన్లో జన సంచారం పెద్దగా ఉండదు. దీంతో దీక్షా తిరిగి సొంతూరు ముంబై చేరింది.
తొమ్మిదేళ్లుగా దీక్షా యోగా ప్రాక్టీసు చేస్తూనే ఉంది. మానసిక ప్రశాంతత కోసం ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంది. ప్రతీ సంవత్సరం ఆశ్రమానికి వెళ్లి ఆసన ప్రక్రియల్లో వీలైనన్ని ఎక్కువ మెళకువలు నేర్చుకుంటూ వస్తుంది.
ముంబై లాంటి పోటీ ప్రపంచంలో దీక్షా తన జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు డిజైన్ చేసుకుంది. ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచానికి టాటా చెప్పేసింది. రోజువారీ పనిని కేవలం ఆరుగంటలు మాత్రమే చేయాలని కుదించుకుంది. అంతేకాదు మిగతా సమయాన్ని నచ్చిన యాక్టివిటీస్తో గడపాలని ప్లాన్ చేసుకుంది. తినే భోజనాన్ని కూడా చాలా అందంగా డిజైన్ చేసుకుంది.
నేర్చుకున్న యోగాను నలుగురికి నేర్పుతోంది. అది కూడా చాలా పరిమితంగా మాత్రమే. యోగా ద్వారా వ్యాపారం చేయడం దీక్షకు ఇష్టం లేదు. ఇప్పుడు దీక్ష ఒక పరిణితి చెందిన వ్యక్తిగా మారింది. యోగా శిక్షకురాలిగా సమాజానికి దిశానిర్దేశనం చేసే స్థాయికి ఎదిగింది.
మన జీవితాన్ని మనమే నిర్దేశించుకుంటే ఎలాంటి బాధలు, ఒత్తిళ్లు ఉండవని దీక్ష అంటారు. ఆత్మ పరిశుద్దంగా ఉంటేనే మన శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని, అందుకు యోగాయే మార్గమని దీక్ష అంటున్నారు.