కెరీర్ రీస్టార్ట్ చేయాలనుకునే మహిళల కోసం నాలుగు స్పెషల్ వెబ్ సైట్లు..
Wednesday March 02, 2016,
3 min Read
మనదేశంలో తరతరాలుగా అన్ని రంగాల్లోనూ లింగవివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఇటీవలి కాలంలో విద్యకు సంబంధించిన గణాంకాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఆడ, మగ మధ్య ఉన్న వివక్షను చెరిపివేస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో.. డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న మొత్తం విద్యార్థుల్లో మహిళలు 45.9 శాతం మందిగా ఉన్నట్లు తేలింది. అలాగే పీహెచ్ డీ చేస్తున్న వారిలో సైతం 40.5 శాతం మంది మహిళలే ఉన్నట్లు వెల్లడైంది. అయితే మొత్తం పనిచేస్తున్న కార్మికుల సంఖ్యలో మాత్రం మహిళల భాగస్వామ్యం మాత్రం గణనీయంగా పడిపోయింది.
2004-05 సంవత్సరంలో మహిళా కార్మికుల సంఖ్య 37 శాతంగా ఉంటే, ఈ సంఖ్య 29 శాతానికి పడిపోయింది. ఇక 2011-12 సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో వర్కింగ్ విమెన్ శాతం 14.7 శాతంగా ఉంది. ఈ సంఖ్య 1972-73 సంవత్సరంలో 13.4 శాతంగా ఉంది. అంటే గడిచిన నాలుగు దశాబ్దాల్లో పట్టణ ప్రాంతాల్లో వర్కింగ్ విమెన్ శాతం స్వల్పంగా పెరిగినట్లు అర్ధమవుతోంది. ఇక భారత శ్రామికశక్తిలో అదనంగా మరో పదిశాతం మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ జీడీపీలో 16 శాతం వృద్ధి కనిపించే అవకాశం ఉంది.
మహిళలు ఉద్యోగం వదులుకోడానికి అనేక కారణాలు. ముఖ్యంగా ఇండియా లాంటి దేశంలో ఇంకా సిల్లీ రీజన్స్ కనిపిస్తాయి. సెంటిమెంట్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, పురుషాధిక్యం, అనారోగ్యం.. ఇలా కారణాలేవైతేనేం.. స్త్రీలు ఉద్యోగాలను, వారు చేరుకున్న ఉన్నత స్థానాలను అవలీలగా వదిలేసుకుంటారు. అలాంటి వారు మళ్లీ తమ కెరీర్ను తిరిగి స్టార్ట్ చేసుకునేందుకు పలు సంస్థలు సహాయం చేస్తున్నాయి. ముఖ్యంగా చాలా గ్యాప్ తర్వాత తిరిగి కెరీర్ లోకి ప్రవేశించాలంటే చాలా సమస్యలు వస్తాయి. అలాంటి వారికి సహకారం అందిస్తున్నాయి ఓ నాలుగు వెబ్ సైట్లు..
బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న JobsForHer సంస్థను నేహా బగారియా స్థాపించారు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం భారతీయ శ్రామికశక్తిలో మహిళల వాటాను పెంచటమే. ఇందులో భాగంగా కెరీర్ను అర్థాంతరంగా వదిలివేసిన మహిళలు తిరిగి జాబ్స్ పొందేలా JobsForHer కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మార్చి 7 నుంచి 11 వరకు మెగా డైవర్సిటీ డ్రైవ్ పేరిట ఓ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. దేశంలోని టాప్ కంపెనీలైన సెపియంట్, టార్గెట్, మేక్ మై ట్రిప్, రిలయన్స్ , మైండ్ ట్రీ, మంత్రి డెవలపర్స్ లాంటి సంస్థలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. త్వరలోనే JobsForHer సంస్థ డిల్లీ, ముంబై, చెన్నై నగరాలకు సైతం విస్తరించనుంది.
ప్రస్తుతం ప్రతి నెలా 50 వేల మంది JobsForHer వెబ్ సైట్ విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం JobsForHer వెబ్సైట్ తో సుమారు 750 సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. వాటిలో కార్పొరేట్ దిగ్గజాలైన సిటీ బ్యాంక్, ఫ్యూచర్ గ్రూప్, జీఈ, గోద్రేజ్ గ్రూప్, కొటక్ మహీంద్రా గ్రూపు, స్నాప్ డీల్, యూనిలివర్ లాంటి సంస్థలు ఉన్నాయి. వీటిలో ఫుల్ టైం/పార్ట్ టైం ఆప్షన్లు సైతం ఉన్నాయి. అలాగే వర్క్ ఫ్రం హోం, ఫ్రీలాన్స్ ఉద్యోగావకాశాలను సైతం మహిళలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న Avtar I-Win సైతం మహిళలను తిరిగి తమ కెరీర్లను ప్రారంభించేందుకు సహకారం అందిస్తోంది. 2005 లో డాక్టర్ సౌందర్య రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన Avtar I-Win కార్పొరేట్ కంపెనీల్లో లింగ వివక్షను తొలగించేందుకు కృషి చేస్తోంది. 2006 సంవత్సరంలో కన్సల్టెన్సీ ద్వారా సుమారు 450 మంది మహిళా ఉద్యోగులు ఫ్యూచర్ గ్రూపులోకి ప్రవేశించారని సంస్థ అధినేత్రి సౌందర్య తెలిపారు.
భారత్లో సుమారు 48 శాతం మంది మహిళలు 30 ఏళ్ల తర్వాత తమ కెరీర్లకు బ్రేక్ ఇస్తున్నారు. సుమారు 60 శాతం మంది టెక్నాలజీకి సంబంధించిన కెరీర్లకు బ్రేక్ ఇస్తున్నారు. వాళ్లు తిరిగి తమ వర్కింగ్ లైఫ్ ప్రారంభించాలంటే కాస్త ఇబ్బందే. అందుకే Avtar I-Win సంస్థ సుమారు 40 వేల మందిని తన నెట్ వర్క్లో భాగస్వామ్యం చేసుకుంది. అంతేకాదు సుమారు 8 వేల మందిని తిరిగి కెరీర్లను ప్రారంభించేందుకు కృషి చేసింది.
సైరీ చాహల్ అనే ఔత్సాహికురాలు నోయిడాలో SHEROES.in పేరిట వెబ్ సైట్ ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా మహిళలకు కెరీర్లను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన అంశాలను SHEROES.in అందిస్తున్నారు.
SHEROES సంస్థ సుమారు 5 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేసింది. పలు అవకాశాలను మహిళలకు అందుబాటులో తెచ్చేందుకు SHEROES మెంటర్లను సైతం ఏర్పాటు చేసింది. అలాగే అనేక అవగాహనా కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేస్తోంది.
HerSecondInnings వెబ్ సైట్ ద్వారా మహిళలకు కెరీర్ను ప్రారంభంలో మాత్రమే కాదు.. పలు దశల్లో తోడ్పాటును అందిస్తోంది. జాబ్ చేసే ముందు, వదిలేసి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు మహిళలు వర్క్ కల్చర్, మారిన మార్కెట్ ను చూసి అయోమయంలో పడతారు. వారందరికీ HerSecondInnings తోడ్పాటు అందిస్తోంది. ఇప్పటికే సుమారు 2000 మంది మహిళలు ఈ పోర్టల్ ద్వారా అవగాహనా తరగతులకు హాజరయ్యారు. అంతేకాదు మహిళలకు ఈ - లెర్నింగ్ కోర్సులను సైతం అందిస్తోంది.
ఈ పోర్టల్ ను మంజుల ధర్మలింగం, మాధురి కాలే 2014 నవంబర్లో ప్రారంభించారు. ముంబై, బెంగుళూరులో HerSecondInnings కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా పార్ట్ టైం, వర్క్ ఫ్రం హోం అవకాశాలను మహిళలకు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే మహిళల్లో నాయకత్వ పటిమ పెంచేందుకు అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.