వీళ్లు మీ ఇంట్లో చెత్తను పట్టుకెళ్లి డబ్బులిస్తారు !

వీళ్లు మీ ఇంట్లో చెత్తను పట్టుకెళ్లి డబ్బులిస్తారు !

Tuesday January 12, 2016,

4 min Read

చెత్త... ! ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిదో అతిపెద్ద సమస్య. వివిధ దేశాల ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారం కోసం కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో చెత్త నిర్వాహణ ఓ అతిముఖ్యమైన వ్యాపారావకాశంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఒక్క ఢిల్లీలోనే ప్రతీ రోజూ 8,360 టన్నుల చెత్త (మునిసిపల్ సాలిడ్ వేస్ట్) ఉత్పత్తవుతోందంటే మన దేశంలో సమస్య ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలు రోజుకు 1,88,500 సాలిడ్ వేస్ట్‌ను (ఏటా సుమారు 68.8 మిలియన్ టన్నులు) భూమిపై వదులుతోందనేది మరో అంచనా. ఈ లెక్కల ప్రకారం చూస్తే.. దేశంలో ప్రతీ ఒక్కరూ ఎంతలేదన్నా అరకిలో దాకా చెత్త పడేస్తున్నారు.

image


బయటపడేసే చెత్తలో ఎంతో కొంత మొత్తాన్ని మళ్లీ రీసైకిల్ చేసి ఉపయోగించుకునేందుకు అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఈ పాయింటే దీపక్ సేథీ, కిషోర్ ఠాకూర్‌లో ఓ వ్యాపార ఆలోచనకు తెరలేపింది. బిజినెస్‌తో పాటు పర్యావరణానికి మేసే బాధ్యతను వీళ్లు భూజానికి ఎత్తుకున్నారు. ఇద్దరూ కలిసి పామ్ పామ్ (Pom Pom) పేరుతో ఓ స్టార్టప్ మొదలుపెట్టారు. ఇప్పటికీ ఊళ్లలో చెత్తను తీసుకెళ్లేవారు ఇళ్ల ముందుకు వచ్చి హారన్ కొట్టే శబ్దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ పేరు పెట్టినట్టు చెబ్తున్నారు.

2015 నవంబర్‌లో ఈ వెబ్ ఆధారిత రీసైక్లింగ్ ప్లాట్‌ఫాం లాంఛ్ అయింది. అప్పటి నుంచి ఓ టన్ను పేపర్‌ను రీసైకిల్ చేయడం వల్ల 17 చెట్లను కాపాడవచ్చని, అలానే ఓ అల్యూమినియం టిన్‌ను తిరిగి ఉపయోగించడం వల్ల ఓ టివి మూడు గంటల పాటు నడిచేంత శక్తిని ఆదా చేయవచ్చు అంటూ జనాల్లో అవగాహన కల్పించడం మొదలుపెట్టారు.

వేస్ట్‌ను బాధ్యతాయుతంగా రీసైకిల్‌ చేసేందుకు జనాల ఇళ్ల దగ్గరికే వచ్చి చెత్తను సేకరించడం వీళ్ల బాధ్యత. అంతే కాదు అందుకు డబ్బులు కూడా చెల్లిస్తారు. దక్షిణ ఢిల్లీలో మొదట కార్యకలాపాలు ప్రారంభించిన ఈ పామ్ పామ్ సంస్థ.. మొదట 10 లక్షల మంది జనాల చెత్త సమస్యను తీరుస్తామని చెబ్తోంది. తమవంతుగా స్వఛ్ భారత్‌ అభియాన్‌కు ఈ విధంగా సహకారం అందిస్తున్నట్టు వ్యవస్థాపకులు చెబ్తున్నారు.

ఎస్ఎంపిఎల్ ఇన్ఫ్రా అనే సంస్థలో ఢిల్లీ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో కీలకపాత్ర పోషించిన ఈ ఇద్దరికీ ఈ రంగంలో 45 ఏళ్ల నిర్వాహణా అనుభవం ఉంది.

బెంగళూరు క్రైస్ట్ కాలేజీ నుంచి కామర్స్ పూర్తి చేసిన 36 ఏళ్ల దీపక్, 2002లో ఆస్ట్రేలియా డీకిన్ యూనివర్సిటీలో ఎంబిఏ పూర్తి చేశారు. ఎస్ఎంపిఎల్ ఇన్ఫ్రాలో డైరెక్టర్‌గా పదేళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉంది.

56 ఏళ్ల కిషోర్‌ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్‌ డిగ్రీ అందుకున్నారు. భారత ఆర్మీలో ఆర్మర్డ్ కార్ప్స్‌ విభాగంలో పనిచేసిన కిషోర్ ఇప్పుడు పామ్ పామ్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఈయన కూడా ఢిల్లీ వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగంతో పాటు ఎస్‌పిఎంఎల్‌ గ్రూపు సంస్థకు ఉన్న మిగిలిన 5కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా పనిచేశారు. జిఎంఆర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ సంస్థ నుంచి ఎస్ఎంపిఎల్ వరుసగా మూడేళ్ల పాటు 'బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్' అవార్డు గెలుచుకుంది. పామ్ పామ్ ఏర్పాటు చేసేందుకు ఇది కూడా ఓ కారణం అంటారు కిషోర్.

'చెత్త నిర్వాహణలో మాకు ఉన్న అనుభవమే పామ్ పామ్ ఏర్పాటుకు స్ఫూర్తి అంటారు' దీపక్.

వీళ్ల అనుభవం నుంచి రెండు ముఖ్య పాఠాలు నేర్చుకున్నారు. మొదటిది చెత్త నుంచి రీసైక్లబుల్ వేస్ట్‌ను వేరు చేయడం, ఇది చాలా కష్టమైన, ఆలస్యమయ్యే ప్రక్రియ. చెత్తను వేసేటప్పుడే వాటిని వేరు చేసి వేయాలనే అవగాహన జనాల్లో లేకపోవడం, అందుకు వాళ్లకు తగిన ప్రోత్సాహం లేకపోవడం రెండో కారణం.

'' టన్నుల కొద్దీ రీసైక్లబుల్ వేస్ట్.. అలా గుట్టల్లా పేరుకుపోతోంది. చెత్త నుంచి దీన్ని వేరుచేసినందుకు జనాలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అప్పుడు ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ విషయంపై అవగాహన కల్పించడం మొదలుపెడితే దాని ప్రయోజనం ఎప్పుడో ఒక రోజు తప్పకుండా ఉంటుంది'' - దీపక్.

image


ఏంటి ప్రత్యేకత ?

ఎలక్ట్రానిక్ తూకాలతో రీసైక్లింగ్‌కు అవకాశం ఉన్న చెత్తను బరువు తూచి అందుకు తగ్గట్టు లెక్కగట్టి డబ్బులు ఇవ్వడం, ఇంటి దగ్గరికే వచ్చి వాటిని సేకరించడం, తక్షణమే డబ్బుల చెల్లింపు, ఫోన్ చేయగానే ఇంటికే వచ్చేసే టీమ్, పారదర్శకత వంటివి ఇతరులతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెడతాయనేది పామ్ పామ్ నమ్మకం. సేకరించిన వాటిని బల్క్‌లో ఇండస్ట్రీస్‌కు సరఫరా చేయడం వల్ల కొత్త ఉత్పత్తుల తయారీ అవుతాయి.

''మనం వృధాగా పడేసే ప్లాస్టిక్ బ్యాగ్స్, గ్లాస్, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నింటినీ రీసైకిల్ చేసి మళ్లీ ఉపయోగించుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. కేవలం వాళ్ల దగ్గర ఉండే పాత సామాన్లను అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నాం అనే భావనకే పరిమితం చేయకుండా.. స్వచ్చ్ భారత్‌కు తాము కూడా ఎంతో కొంత చేస్తున్నామనే విశ్వాసం కల్పించడం కూడా తమ బాధ్యతే '' అంటున్నారు దీపక్.

వ్యవస్థాపకులిద్దరూ సంస్థలో కోటి రూపాయల పెట్టుబడి పెట్టారు. యాప్ అభివృద్ధి, బ్రాండింగ్, వాహనాల కొనుగోలు, ఉద్యోగులు, నిల్వ ఉంచుకునే వేర్ హౌజ్‌ వంటి వాటి కోసం నిధులను వెచ్చించారు. రీసైక్లింగ్‌కు అవకాశం ఉన్న చెత్తను అమ్మడం ద్వారా వచ్చేదే కంపెనీకి ఆదాయం. ప్రస్తుతం పామ్ పామ్ దగ్గర 11 వాహనాలు ఉన్నాయి. వీటిలో ఒకటి టాటా కాంటోర్, 10 మారుతి ఈకో కార్లు ఉన్నాయి. 30 మంది స్టాఫ్ సహా మరికొంత మంది కాల్ సెంటర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. మొదట ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిద్దామని చూస్తున్నారు. జనాల్లో అవగాహన పెంచేందుకు మొదట స్కూల్స్, హాస్పిటల్స్‌లో భాగస్వామ్యమయ్యేందుకు చూస్తున్నారు. ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉన్నందుకు టర్నోవర్ గురించి ఆలోచించడం లేదని, మరికొద్ది నెలల్లో లాభ-నష్టరహిత స్థాయికి (బ్రేక్ ఈవెన్) వస్తామని ధీమాగా ఉన్నారు.

పోటీ ఎలా ఉంది

ఈ రంగంలో ఇప్పటికే కొన్ని స్టార్టప్స్‌ సైలెంట్‌గా తమ పని తాము చేసుకుపోతున్నాయి. వీటిల్లో అధిక శాతం పేపర్, ప్లాస్టిక్ వంటివాటికే పరిమితమయ్యాయి.

చెత్త నిర్వాహణ, రీసైక్లింగ్‌కు భారీ మార్కెట్‌ ఉంది. జనాల్లో అవగాహన పెరగడమే ఇప్పుడు ముఖ్యం. చెత్తనూ తిరిగి ఉపయోగించవచ్చని, దాంతో ఎన్నో కొత్త ఉత్పత్తులు తయారు చేయవచ్చనే ఆలోచన జనాల్లో వస్తే ఇక తమ వ్యాపారానికి తిరుగు ఉండదని అంటున్నారు దీపక్.

ప్రస్తుతం పామ్ పామ్‌కు కబాడీవాలా, స్క్రాపోస్, ఈ-కబాడీ, కచ్రాపట్టీ, కచ్రే కా డబ్బా అనే సంస్థలు పోటీదార్లు.