ముగ్గురు భారత పైలట్ల సాహసయాత్ర గురించి తెలుసుకోవాలనుందా..?!
భారత్-పాక్ యుద్ధం సమయంలో ముగ్గురు భారత పైలట్ల వీరోచిత ప్రయాణమే ఈ కథ!
Friday January 29, 2016,
3 min Read
భారతదేశంలో అన్ని పోరాటాలు అహింసాత్మకంగా జరిగాయనీ.. సత్యం, శాంతి అందుకు పునాదులనీ మనం పుస్తకాల్లో చదువుకున్నాం. అందులో నిజమెంత అన్నది చెప్పడానికి స్వాతంత్ర్యోద్యమంతో పాటు.. యుద్ధాల్లో పాల్గొన్న వాళ్లలో చాలామంది ఈ తరంలో మనకు అందుబాటులో లేరు. ఏ మూల్యం చెల్లించకుండానే, ఎలాంటి వీరోచితమైన నిర్ణయాలు తీసుకోకుండానే.. ఏ రక్తం చిందించకుండానే ఆయాచితంగా స్వేచ్ఛ మనల్ని వరించిందన్న భ్రమల్లో నుంచి ఒకసారి బయటకు వస్తే వాస్తవాలు చాలా భయంకరంగా ఉంటాయి. లెక్కలేనన్ని పోరాటాలు.. సాహసోపేత నిర్ణయాలు.. వేలమంది బలిదానాలు.. కక్షలు.. కార్పణ్యాలు.. ఇలా ఎన్నో అంశాలు మన భారత చరిత్రతో ముడిపడి ఉన్నాయి. అలాంటి వందలాది కథలను తడిమి తెలుసుకోవాలి. అలాంటి ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అది 1971 భారత్, పాకిస్తాన్ యుద్ధం సమయం. 16మంది ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్లను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. రావల్పిండిలోని ఒక క్యాంప్లో బందీలను చేసింది. అందులో ముగ్గురు పైలట్లు చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. శత్రుమూకల చెరలో నుంచి బయటపడేందుకు పథకం రచించారు.
గ్రూప్ కెప్టెన్, అప్పటి ఫ్లయిట్ లెఫ్టినెంట్ దిలీప్ పారుల్కర్ మరో ఇద్దరికి ధైర్యం నూరిపోశారు. ఆపరేషన్కు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు ఫ్లయిట్ లెఫ్టినెంట్ ఎం ఎస్ గెరెవాల్, ఫ్లయింగ్ ఆఫీసర్ హరీష్ షింజీ తోడయ్యారు. అప్పటికి యుద్ధం ముగిసిపోయినా కూడా పాకిస్తాన్ వారిని యుద్ధ ఖైదీల పేరుతో ఇంకా బందీలుగానే ఉంచుకుంది. ఇదే సమయంలో ఒక పిడుగులాంటి వార్త! భారత సైన్యం చెరలో ఉన్నముగ్గురు పాక్ ఖైదీల్లో ఒకరు జైలు నుంచి తప్పించుకునేందుకు జైలు గోడలకు రంధ్రం తవ్వారు. వారిని గుర్తించిన భారత సైన్యం ఒక ఖైదీని చంపేయగా.. మరో ముగ్గురు రెండు గంటల వ్యవధిలో రావల్పిండి చేరిపోయారు. పరిస్థతి చేయిదాటిపోతోంది. ఏం చేయాలో మన పైలట్లకు తోచడంలేదు.
ఎలాగైతేనేం పాకిస్తాన్లోని జైలు నుంచి బయటపడిన ముగ్గురు భారత పైలట్లు ఆలోచనలో పడ్డారు. ఇండియావైపు ప్రయాణమైతే రెండుదేశాల సైన్యం మధ్య నలిగిపోవాలి. ఉత్తర దిక్కుగా ప్రయాణమైతే మంచిదని నిర్ణయించుకున్నారు. పెషావర్లో ఒక మ్యాపును పరిశీలిస్తుండగా.. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లోని టోర్కామ్ పట్టణం అక్కడి నుంచి 34 మైళ్లేనని గ్రహించారు. జామ్రూద్ మీదుగా వెళితే సేఫ్గా చేరుకోవచ్చు. పాకిస్తాన్లో బందీలుగా ఉండగా లభించిన యుద్ధఖైదీల అలవెన్స్తో పాటు భారత్లో తీసుకున్న జీతాన్ని దాచిపెట్టుకోవడంతో.. వాటితో ప్రయాణం చేయచ్చనుకుని మొదట కాస్త దూరం బస్లో.. ఆ తర్వాత జామ్రూద్కి రోడ్డుపై ప్రయాణమయ్యారు.
పాకిస్తాన్లో ప్రయాణమేమీ అంత సాఫీగా జరగలేదు. అనుమానం వచ్చిన వాళ్లకు అబద్ధాలు చెప్పి.. ఎలాగోలా తప్పించుకున్నారు. వెంట తీసుకువచ్చిన మ్యాప్ అంతా తప్పుల తడకగా ఉంది. 1932లో బ్రిటీష్ పాలకులు కట్టించిన లాండీ ఖానా రైల్వే స్టేషన్ గురించి విచారిస్తున్న ప్రతీసారి ఎవరో ఒకరికి వారిపై అనుమానం కలిగింది. అలానే ఒక వ్యక్తి దగ్గర ముగ్గురు భారత పైలట్లు పట్టుబడ్డారు. స్ధానిక తహసీల్దార్ దగ్గరకు తీసుకువెళ్లగానే ప్రశ్నల వర్షం మొదలైంది. మనవాళ్లు చెప్పినవేమీ నమ్మని పాకిస్తాన్ తహసీల్దార్.. అరెస్ట్ చేయమని హుకుం జారీ చేశారు. తాము పాకిస్తాన్ పైలట్లమని, పదిరోజుల సెలవుపై లాండీఖానాకు విహారయాత్రకు వెళుతున్నామన్నా వినలేదు. ఇంతలో ముగ్గురు పైలట్లలో ఒకరైన దిలీప్కు ఐడియా వచ్చింది. కావాలంటే పెషావర్లోని ఎయిర్ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్కు ఫోన్ చేయమని.. తామెవరో కనుక్కోగమని అన్నాడు. అక్కడున్న తహశీల్దార్.. ఫోన్ చేసి దిలీప్కు ఫోన్ ఇచ్చాడు. " సార్.. మేం సెలవుతీసుకుని ఇక్కడ విహారయాత్రకు వచ్చాం, వీళ్లేమో మమ్మల్ని అరెస్ట్ చేశారు. కాస్త మాట్లాడండి" అన్నాడు. పాకిస్తాన్ కమాండెంట్ ఏం ఆలోచించాడో ఏమో.. " వాళ్లు మా వాళ్లే.. వదిలేయండి"అని తహశీల్దార్ని ఆజ్ఞాపించాడు.
అంతా బాగానే జరిగిందనుకునే సమయానికి ఏడీసీకి అనుమానం వచ్చింది. పూర్తిగా ఎవరు ఏంటో తెలుసుకోకుండా విడిచిపెట్టద్దని హుకుం జారీచేశాడు. కాస్త ఆరా తీయగానే ముగ్గురూ భారత పైలట్లన్న విషయం తెలిసిపోయింది. స్వేచ్ఛకు సరిహద్దుల్లో ఉన్న ముగ్గురినీ మళ్లీ తిరిగి పెషావర్ తీసుకెళ్లారు. కధ మళ్లీ మొదటికి వచ్చింది.
ఇది జరిగిన మూడు నెలల తర్వాత పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో.. పాకిస్తాన్లో ఉన్న యుద్ధ ఖైదీలందరికీ విముక్తి కల్పిస్తున్నట్టు ప్రకటించడంతో ముగ్గురూ విడుదలయ్యారు. ప్రాణాలను పణంగా పెట్టి అతిపెద్ద సాహసానికి ఒడిగట్టిన మన భారత పైలట్లకు 1972 డిసెంబర్ 1న వాఘా సరిహద్దుల్లో సంబరాల మధ్య స్వాగతం లభించింది.
అత్యంత వీరోచితంగా వ్యవహరించిన గ్రూప్ కెప్టెన్ దిలీప్ పారుల్కర్ జైలు కథను ఇప్పుడు తరంజీత్ సింగ్ నందారీ అనే వ్యక్తి సినిమాగా తీస్తున్నాడు.