ఐటి ఉద్యోగం వదిలి పాల వ్యాపారంలోకి..! డైరీ ఫార్మ్‌లో డేరింగ్ స్టెప్స్

ఐటి ఉద్యోగం వదిలి పాల వ్యాపారంలోకి..! డైరీ ఫార్మ్‌లో డేరింగ్ స్టెప్స్

Sunday August 23, 2015,

4 min Read

సాయం సమయం, సూర్యుడు పడమరన వాలిపోతున్న వేళ.. డైరీఫామ్‌లో జంతువులన్నీ అప్పుడు సేద తీరేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక దూడ మాత్రం ఇంకా ఆడుకుంటూనే ఉంది నిద్రరాక. ఆ సమయంలో యువర్ స్టోరీకి టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇస్తున్న సంతోష్ డి. సింగ్... ఒకవైపు మాట్లాడుతూనే మరోవైపు తాను డైరీలో రోజువారీ పనులను రాసుకుంటున్నారు. బెంగళూర్ - చెన్నై రూట్‌లో దొడ్డబళ్లాపూర్ సమీపంలో ఉన్న హలీనహళ్లి సమీపంలో ఉంది సంతోష్ డైరీ ఫాం. కార్పొరేట్ ఐటీ కెరీర్ నుంచి డైరీ ఫాం వరకూ సాగిన తన ప్రయాణాన్ని... మనతో పంచుకున్నారు సంతోష్. మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీలో పనిచేసిన ఈయన ఇప్పుడు అమృత డైరీ ఫాం ప్రారంభించి.. జీవిస్తున్నారు.

image


ప్రారంభం

బెంగళూర్‌లో పీజీ పూర్తి చేశాక... ఐటీ సెక్టార్‌లో పదేళ్లపాడు పని చేశారు సంతోష్. డెల్, అమెరికా ఆన్‌లైన్ వంటి అగ్రగామి సంస్థల్లో కీలక పదవులు అధిరోహించారు కూడా. ఇండియాలో ఐటీ వెలిగిపోతున్న ఆ రోజుల్లో... తన విధుల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు కూడా చేశారు. ఈ ప్రయాణాల్లో డబ్బు సంపాదనకు కేవలం ఉద్యోగం ఒకటే మార్గం కాదనే జీవిత సత్యం నేర్చుకున్నట్లు చెప్తారు సంతోష్. ఏదైనా కంపెనీ ప్రారంభించి... వారాంతాల్లో దాన్ని చూసుకుందామనుకుని.. చివరకు దానికే పూర్తి ప్రాధాన్యతనివ్వాలనే స్థాయికి చేరుకుంది ఆలోచన. ప్రకృతితో దగ్గరగా ఉండేలా తన భావికార్యాచరణ ఉండాలని తలంచారు ఆయన. ఇదే సంతోష్‌ను డైరీ ఇండస్ట్రీవైపు నడిపించింది.

image


కార్పొరేట్ ఉద్యోగాన్ని, ఆ రంగాన్ని వదిలేయాలన్న తన ఆలోచనను పేరెంట్స్‌కు చెప్పేశారు. ఆ తర్వాత డైరీ రంగానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తేవాలని, దాని సత్తా చాటేందుకు ప్రత్యేకమైన విధానాలు అవలంభించాలని భావించారు. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్. బిజినెస్ ఇంటిలిజెన్స్, అనలిటిక్స్, రీసోర్స్ మేనేజ్‌మెంట్‌లలో తనకున్న అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని.. తన వెంచర్‌లో ఉపయోగించడం మొదలుపెట్టారు సంతోష్.

image


"నేను డైరీ రంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆదాయం, లాభం అన్నీ రుతువుల్లోనూ స్థిరంగా ఉంటుంది. భారతీయ వ్యవసాయ రంగం అంచనా వేయలేనంత స్థాయిలో ఈ రంగంలో లాభాలు గడించొచ్చు. అయితే... సుదీర్ఘకాలంపాటు 24 X 7 ఏసీలో ఉద్యోగం చేసిన నాకు.. డైరీఫాంలో కష్టపడాల్సి రావడం మొదట్లో కాస్త కష్టమనిపించినా... అది ఇష్టంగా చేస్తున్నదే కావడంతో... అడ్జస్ట్ అయిపోయాను."

ఈయనకు వ్యవసాయంతో కానీ, పశువుల పెంపకంతోకానీ.. గతంలో ఎలాంటి అనుబంధం, అనుభవం లేవు. అందుకే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఒక పూర్తి టర్మ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ కోర్సులో భాగంగా... ఓ డైరీఫాంలో ఉండాల్సి వచ్చింది. కాస్త కష్టంగా ఉన్నా.. అక్కడి పరిస్థితులను వాస్తవంగా అనుభవంలోకి తెచ్చేందుకే ఈ సెషన్ ఏర్పాటైందని తెలుసుకుని సర్దుకుపోయారు. అలా కొన్నాళ్ల పాటు డైరీఫాంలలో ఉండడంతో.. ఆవులతో తన మిగిలిన భవిష్యత్తును నిర్మించుకోగలననే నమ్మకం తనకు ఏర్పడింది.

మూడు ఆవులు, మూడు ఎకరాలు

మూడు ఎకరాల పొలంలో.. మూడు ఆవులతో ఈ డైరీ ప్రారంభమైంది. నిజానికి వారాంతంలో నగర జీవితానికి దూరంగా.. రిఫ్రెష్ అయేందుకుగాను మూడేళ్లక్రితం సంతోష్ నిర్మించుకున్న ఫాంహౌస్ ఇది. పాలు పితకడం, ఆవులకు గడ్డి వేయడం, వాటిని శుభ్రం చేయడం, షెడ్స్ క్లీన్ చేయడం వంటి పనులను దగ్గరుండి చూసుకునేవారు సంతోష్.

మొదటి ఏడాది పూర్తయ్యేసరికి డైరీలో ఆవుల సంఖ్య 20కి చేర్చాలనే లక్ష్యం సంతోష్ మనసులో ఉండేది. అందుకే 20 పశువులకు సరిపోయేంతలా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు. ఎన్‌డీఆర్ఐలో ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి... నా డైరీని చూడ్డానికి వచ్చినపుడు.. నాబార్డ్ నుంచి సాంకేతిక సహకారం తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే నాబార్డ్‌ అధికారులతో మాట్లాడాక.. తన లక్ష్యాన్ని వంద ఆవులకు పెంచుకోవాలనే విషయం అర్ధమైంది సంతోష్‌కి. ఇలా చేయడం ద్వారా డైరీఫాం సామర్ధ్యం రోజుకు 15వందల లీటర్ల పాలకు చేరుకోవడంతోపాటు... ఏటా ఒక కోటి రూపాయల టర్నోవర్ సాధ్యమవుతుందనే విషయం తెలుసుకున్నారు.

చేతనైనంతలో సమాజానికి సాయం

చేతనైనంతలో సమాజానికి సాయం


ప్రతీ ఏటా పాలు, పాల ఉత్పత్తుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత ఐదారేళ్లుగా.. ఈ రంగంలో మార్జిన్లు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఆ వ్యాపారం ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇష్టమైన రంగంలోనే పని చేస్తున్నాననే సంతోషంతోపాటు... డైరీ ఫాం ప్రారంభానికి ముందుకొచ్చినందుకు, సంతోష్‌కి నాబార్డ్ సిల్వర్ మెడల్ బహూకరించింది. ఇది తనలో నమ్మకాన్ని మరింతగా పెంచిందని చెబ్తారాయన. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తనంతట తానే ముందుకొచ్చి... ఈ ప్రాజెక్టుకుని రుణసహాయం చేస్తామని చెప్పడం విశేషం. దీంతో ఉత్సాహంగా అడుగులేసిన సంతోష్.. వంద ఆవులకు అవసరమైన మౌలిక వసతులను నిర్మించుకున్నారు. ప్రస్తుతం అమృత డైరీ ఫాంలో 100కు పైగా ఆవులున్నాయి. తన డైరీఫాంను 10నుంచి 30 ఆవులుండేలా ఐదు భాగాలుగా విభజించకున్నారు.

కరువొచ్చినపుడు పశువులకు కష్టకాలం

ఒక్కో సమస్యకు పరిష్కారం వెతుకుతూ.. అడుగులు ముందుకేస్తున్న సమయంలో... అనూహ్యంగా ఒకసారి.. పచ్చగడ్డి సమస్య ఏర్పడింది. అకాల వర్షాల కారణఁగా.. 18నెలల పాటు కరువు పరిస్థితి ఏర్పడింది. దీంతో పచ్చగడ్డి ధర విపరీతంగా పెరిగిపోయింది. పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి మరీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డైరీ అభివృద్ధి నెమ్మదించడానికి ఇదీ ఒక కారణమే అంటారు సంతోష్.

నేను దాచుకున్న చివరి రూపాయి వరకూ ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా సరే వెనక్కు తగ్గకుండా.. కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాను. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకడం ప్రారంభించాను. చివరకు హైడ్రోపొనిక్స్ ద్వారా పచ్చగడ్డిని మొలిపించాలనే ఐడియాకు మొగ్గు చూపాను. పూర్తిగా నియంత్రిత వాతావరణంలో తక్కువ ఖర్చుతో, రోజుకు ఒక టన్ను గడ్డి పెంచే అవకాశం ఇస్తుంది హైడ్రోపోనిక్స్. ఇలా పెంచిన పచ్చగడ్డి.. సాధారణంగా పెంచిన రకంతో పోల్చితే ధర చాలా తక్కువ కావడం విశేషం.

కరువు కాలం ముగిసి వానలు పడ్డం ప్రారంభమయ్యాక.. మళ్లీ తన ప్రణాళికల్లో వేగం పెంచారు సంతోష్. అప్పటికే హైడ్రోపొనిక్స్ ద్వారా గడ్డి పెంపకం చేస్తుండడంతో.. వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. భవిష్యత్తులో ఏర్పడే సమస్యలకు కూడా వారి దగ్గర ఇప్పుడు పరిష్కారం ఉంది. గడ్డి పెంచాల్సిన భూమి వైశాల్యం కూడా తగ్గడంతో.. దాన్ని కూడా ఆవుల మందకే కేటాయించే అవకాశం చిక్కింది. బ్యాంకు అధికారుల నుంచి సహకారం పెరగడంతో డైరీఫాంని మరుసటి లెవెల్‌కి తీసుకెళ్లడం ప్రారంభించారు సంతోష్.

ప్రస్తుతం ఈ సంస్థ డైరీ ఫామింగ్‌లో శిక్షణ కూడా ఇస్తోంది. ఇప్పటికే 50కి పైగా బ్యాచ్‌లు పూర్తి కాగా... 400మందికి శిక్షణ ఇచ్చారు. 100 మంది బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్లు, 500మంది కాలేజ్, స్కూల్ విద్యార్ధులకు కూడా డైరీ రంగంపై అవగాహన కల్పించారు. దేశంలోని ప్రతీ నగరంలోనూ ఇలాంటి శిక్షణలను ఏర్పాటు చేస్తున్నారు. తాను సక్సెస్‌ఫుల్‌గా వ్యాపారం నిర్వహించడంతోపాటు... అనేక మందికి సలహా, సూచనలు కూడా ఇస్తున్నారు. అవసరమైతే కన్సల్టింగ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో కూడా సంతోష్ తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. దీని వల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్లు పొందేందుకు సులువుగా ఉంటుందనేది అతని సలహా.

తన ప్రయాణంలో భవిష్యత్తుకు బాటలు వేసే ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు సంతోష్. దాదాపు 18నెలల పాటు కరువు నెలకొన్న పరిస్థితుల్లో అనే చిన్న డైరీఫాంలు ప్రకృతిని నిందిస్తూ మూతపడిపోయాయి. వేరే వెంచర్‌లలోకి మారిపోయాయి. అయితే.. సమస్యలను తట్టుకుని నిలబడ్డ కాలంలోనే.. వేరే ఇతర ఆలోచనలు, మార్గాల ద్వారా బైటపడే అవకాశాన్ని నేర్చుకున్నానంటారు సంతోష్. సానుకూల ఆలోచనలతో ఉంటే.. ప్రకృతి కూడా సహకరిస్తుందని.. అద్భుతమైన ఫలితాలు సాధించచ్చని చెబ్తున్నారు సంతోష్.

వెబ్‌సైట్