క‌న్‌స్ట్ర‌క్ష‌న్ బిజినెస్‌కు ఆన్‌లైన్ ట‌చ్‌ అదిరిపోయింది

క‌న్‌స్ట్ర‌క్ష‌న్ బిజినెస్‌కు ఆన్‌లైన్ ట‌చ్‌ అదిరిపోయింది

Wednesday March 02, 2016,

4 min Read

ఇప్పుడంతా ఆన్‌లైన్‌ శకం. కూరగాయల నుంచి ఫర్నిచర్ వరకు, లో దుస్తులు నుంచి షూ వరకు అన్ని వస్తువులు ఆన్‌లైన్‌ లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ వ్యాపారాన్ని కూడా ఆన్‌లైన్‌ బాట పట్టించారు ఇద్దరు యువకులు. స్టీల్, సిమెంట్, క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ మెటీరియల్ ను కూడా ఆన్‌లైన్‌ టచ్ ఇస్తోంది సప్లిఫైడ్. అనుకోకుండా ఓ సెమినార్‌లో కలిసిన మోహిత్ గోయల్, నళిన్ సలూజ స‌ప్లిఫైడ్‌ను స్థాపించారు. అంతేకాదు క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ పరికరాలను అద్దెకు కూడా ఇస్తూ కొత్త సంప్రదాయానికి తెరతీశారు.

2009లో రియల్ ఎస్టేట్ పూర్తిగా సంక్షోభంలో ఉంది. అలాంటి సమయంలో మోహిత్, నళిన్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ బిజినెస్‌లోకి ప్రవేశించారు. వీరిద్దరూ 2011లో హైద‌రాబాద్‌లో ఐఎస్‌బీలో తొలిసారిగా కలిశారు. వీరికి నార్త్ ఇండియా యూత్ వింగ్ ఏర్పాటు బాధ్యతలను క్రెడాయ్ అప్పగించింది. క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ రంగంలో ఉన్న సంప్రదాయ సమస్యలు వీరికి కొట్టిన పిండే కాని, భవిష్యత్ లో తమదైన గొంతు వినిపించే ఆలోచనలు ఇవ్వాలని వీరిద్దరూ అనుకున్నారు. ఇందుకోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్ రంగానికి మంచి మార్గాన్ని చూపించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. భాగస్వామ్య కొనుగోలు పద్ధతిని అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నళిన్ కు మోహిత్ వివరించారు. అయితే మోహిత్ కు వచ్చిన ఐడియా అప్పుడే అమలులోకి రాలేదు. అప్పుడు కేవలం విత్తనాన్ని మాత్రమే నాటారు. ఆ ఐడియా నాలుగేళ్ల తర్వాత, అంటే 2015 సెప్టెంబర్ లో సప్లిఫైడ్ పేరుతో కార్యరూపందాల్చింది..

సప్లిఫైడ్ వ్యవస్థాపకులు నళిన్ సలూజ, మోహిత్ గోయల్

సప్లిఫైడ్ వ్యవస్థాపకులు నళిన్ సలూజ, మోహిత్ గోయల్


బ్యాక్ గ్రౌండ్..

మోహిత్, నళిన్ ఇద్దరూ వ్యాపార కుటుంబాల నుంచి వచ్చినవారే. వీరిద్దరికీ వారి తండ్రులే మార్గదర్శకులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫ‌రీదాబాద్‌కు సమీపంలో ఉండే పల్వాల్ పట్టణంలో మోహిత్ (26) జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకాం హానర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. మోహిత్ కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తోంది. జేబులో 500 రూపాయలతో బిజినెస్ ప్రారంభించిన మోహిత్ తండ్రి ఇప్పుడు దాన్ని ఉత్తర భారతదేశంలోనే అతి పెద్ద కంపెనీగా తీర్చిదిద్దారు. ‘‘ప్రతి కొత్త వ్యవస్థాపక పాఠం డిన్నర్ టేబుల్ పైనే మొదలవుతుంది’’ అని మోహిత్ అంటారు.

చదువు పూర్తిచేసిన తర్వాత గ్రాంట్ థార్టన్ లో కన్సల్టెంట్ గా మోహిత్ కెరీర్ ఆరంభించారు. అయితే ఆ జాబ్ ను వదిలి తండ్రి నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 2009లో రియల్ ఎస్టేట్ మార్కెట్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ మోహిత్ నిర్వహిస్తున్న కంపెనీ మాత్రం సక్సెస్ ఫుల్ గా నడిచింది. మరోవైపు నళిన్ ది కూడా ఫరీదాబాదే. గోల్డ్ మన్ సాచ్స్ మాజీ ఉద్యోగి. 2010లో స్వదేశానికి తిరిగొచ్చిన నళిన్.. కుటుంబం నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టారు. అలా మొత్తంగా ఆరేళ్ల రియల్ ఎస్టేట్ అనుభవం సంపాదించారు.

గేమ్ ప్లాన్..

పీడబ్ల్యూసీ 2013 నివేదిక ప్రకారం భారత మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో ఎనిమిది శాతం రియల్ ఎస్టేట్ రంగం నుంచే వస్తున్నది. 150 బిలియన్ డాలర్ల విలువైన కన్ స్ట్రక్షన్ మెటీరియల్, హోమ్ డెకార్స్ అప్లయెన్సెస్ ను మార్కెట్ ను సప్లిఫైడ్.కామ్ ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. స్థిరాస్తి మెటీరియల్స్ కు ఇది బిజినెస్ టు బిజినెస్ మార్కెట్ ప్లేస్. కన్ స్ట్రక్షన్ మెటీరియల్స్, మెషనరీ కొనుగోలును జేఐటీ ఇన్వెంటరీ మోడల్ లో సులభతరం, సౌకర్యవంతం, సమర్థవంతం చేయడమే వీరి గేమ్ ప్లాన్. ఇందులో ప్రామాణిక ఇన్వెంటరీ కాలం కేవలం మూడు నెలలు మాత్రమే.

బీ2బీ విధానంలో రెండు మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి. దీన్ని మొత్తం సొంతం చేసుకోవాలన్నదే మోహిత్ ఉద్దేశం. సప్లిఫైడ్ ఓ ఈ-కామర్స్ సంస్థ. దాని ప్రభావం అప్పటికే కనిపిస్తోంది. మరోవైపు దాని అనుబంధశాఖను భాగస్వామ్య ఆర్థిక వ్యవస్థలోకి పంపి మార్కెట్ మొత్తాన్ని కైవసం చేసుకోవాలన్నదే ఆయన లక్ష్యం. ఈ ఆలోచన మోహిత్ బ్రెయిన్ చైల్డ్. సిస్టమ్ ను ఆప్టిమైజ్ చేసుకుంటే భారీ అవకాశాలుంటాయని మోహిత్ గుర్తించారు. ఇలా చేస్తే తన ఒక్క కంపెనీయే కాకండా, మొత్తం ఇండస్ట్రీనే బాగుపడుతుందన్నది ఆయన ఉద్దేశం.

డెవలపర్లు, కాంట్రాక్టర్ల కోసం రూపొందించిన ఈ షేరింగ్ ఎకానమీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. పెద్ద సంఖ్యలో మెటీరియల్, పరికరాలు అద్దె ప్రాతిపదికన ఒకరితో ఒకరు పంచుకునే అవకాశం ఈ-షేరింగ్ ఎకానమిలో ఉంటుంది.

‘‘ప్రజలను ఆఫ్‌లైన్‌ నుంచి ఆన్‌లైన్‌లోకి తీసుకురావడమే మా ఉద్దేశం’’ అని నళిన్ అంటారు. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ‘‘దేశంలోని 20-30% నిర్మాణ కార్యకలాపాలు ఢిల్లీ-ఎన్ సీఆర్ కేంద్రంగానే జరుగుతాయి. అందువల్లే ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం’’ అని నళిన్ చెప్పారు.

ఢిల్లీలోని సప్లిఫైడ్.కామ్ కార్యాలయం

ఢిల్లీలోని సప్లిఫైడ్.కామ్ కార్యాలయం


‘‘మేం అన్ని రకాల క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీలను టార్గెట్ చేశాం. చిన్నస్థాయి, మధ్యస్థాయి కంపెనీల నుంచి బడాబడా డెవలపర్లు, బిల్డర్ కమ్యూనిటీని ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాం. సాధారణంగా కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉండే పర్చేజ్ మేనేజర్లకు అంతగా కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండదు. అందుకే వారిని దృష్టిలో పెట్టుకుని, కాంట్రాక్టర్ ఫ్రెండ్లీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నాం’’ అని నళిన్ వివరించారు.

సంప్రదాయ నిర్మాణరంగంలో ఉన్నట్టుగానే.. ఈ ఆన్‌లైన్ వ్యాపారంలోను 20 మంది బిజినెస్ డెవలప్‌మెంట్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది సప్లిఫైడ్ కంపెనీ. వీరంతా చిన్న, మధ్య తరగతి కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ కంపెనీ ఉద్దేశాలను తెలియజేస్తారు.

ఇవీ సప్లిఫైడ్ లక్ష్యాలు..

సాధారణంగా ఏదైనా కంపెనీ పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయాలంటే నేరుగా మానుఫాక్చరింగ్ కంపెనీతోనే సంబంధాలు పెట్టుకుని మంచి బల్క్ డిస్కౌంట్స్ పొందుతుంది. అలాగే ఆఫ్‌లైన్ మార్కెట్‌లో చాలావరకు క్రెడిట్ ఫెసిలిటీ ఉంటుంది. స్టీల్, సిమెంట్ వంటివి చాలావరకు పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేస్తారు. భారీగా ఇన్సెంటీవ్స్ కూడా పొందుతారు. మరి సప్లిఫైడ్ వీటితో ఎలా పోటీ పడగలుగుతుంది?

‘‘ఉత్పత్తి సంస్థలతో నేరుగా జరిపిన చర్చల తర్వాత, అదే ధరను మా కస్టమర్లకు కూడా ఇప్పించేందుకు వారిని ఒప్పించగలిగాం. అలాగే పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేవారికి క్రెడిట్ సదుపాయం కూడా ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించాయి. ఓవరాల్‌గా మార్కెట్‌లో 80% మేం కొల్లగొట్టగలం’’- నళిన్ 

సాధారణంగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే కాంట్రాక్టర్లను సైతం సప్లిఫైడ్.కామ్ సేల్స్ టీమ్ ఇప్పటికే తమ మార్గంలోకి మళ్లించుకుంది.

సొంత మూలధనంతోనే..

మోహిత్, నళిన్ సొంత మూలధనంతోనే సంస్థను ప్రారంభించారు. తమకు తెలిసినవారు, కుటుంబసభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా తెలిసినవారి ద్వారా మొత్తం ఒక మిలియన్ డాలర్లు సేకరించి పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతానికి సప్లిఫైడ్ కు 654 మంది రిజిస్టర్డ్ క్లయింట్స్ ఉన్నారు. ఫిబ్రవరి ఒక్క నెలలోనే 56 లక్షల టర్నవోర్ చేశారు. ప్రతి నెలా 110 పర్సెంట్ వృద్ధి నమోదవుతున్నది.

విస్తరణ..

ఢిల్లీలో మంచి డిమాండ్ ఉండటంతో దేశంలో మరికొన్ని నగరాలకు కూడా సంస్థను విస్తరించాలని మోహిత్, నళిన్ యోచిస్తున్నారు. ‘‘చండీగఢ్, లుధియానాలతోపాటు టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా ఈ ఏడాది చివరికల్లా సంస్థను విస్తరిస్తాం. మెషినరీ, పరికరాలు రెంట్ కివ్వడం, క్రెడిట్ రేటింగ్స్ మెకానిజం ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉంది’’ అని నళిన్ చెప్పారు. ప్రస్తుతం సొంత మూలధనంతోనే సంస్థను నడుపుతున్నప్పటికీ నిధులను కూడా సమీకరించాలని వీరు యోచిస్తున్నారు.

పోటీ..

కన్‌స్ట్రక్షన్ రంగంలో ఇప్పటికే గట్టి పోటీ ఉంది. బిల్డ్‌జర్ నుంచి సప్లిఫైడ్‌కు గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఈ సంస్థ ఇప్పటికే ప్రతినెలా 11 కోట్ల రూపాయలకు పైగా మార్కెట్ చేస్తున్నది. ఇతర సంస్థలు కూడా పోటీ ఇస్తున్నాయి. M-సప్లయ్ ఇటీవలే సిరీస్ ఏ ఫండ్ ను, బెంగళూరుకు చెందిన బిల్డ్ కర్ గత నెలలో సీడ్ రౌండ్ ఫండ్ ను సమీకరించగలిగాయి. అన్నిటికంటే వేగంగా ఈ కన్‌స్ట్రక్షన్‌మార్ట్ కంపెనీ దూసుకెళుతోంది. ఈ సంస్థ గుజరాత్, రాజస్థాన్ లతోపాటు ఉత్తరప్రదేశ్ లలో కొన్ని నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ఇప్పటి వరకు కేవలం ఆఫ్‌లైన్‌కే పరిమితమైన కన్‌స్ట్రక్షన్ వ్యాపారం ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా దూసుకెళుతోంది. మోహిత్, నళిన్ బాటలోనే మరికొందరు యువకులు ఈ రంగంలోకి ప్రవేశిస్తారని యువర్ స్టోరీ ఆశిస్తోంది.