ఈ- వాహనాల తయారీ రంగంలో ఈమె ఓ సెన్సేషన్

ఈ- వాహనాల తయారీ రంగంలో ఈమె ఓ సెన్సేషన్

Saturday September 26, 2015,

5 min Read

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ ఇప్పటికీ అనుకున్న స్థాయిలో వృద్ధి చెందలేదు. తగిన వాతావరణ పరిస్థితులు లేకపోవడం, ప్రభుత్వం ఈ విషయం మీద అంతగా దృష్టిపెట్టకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆర్ధిక పతనం తర్వాత భారత ప్రభుత్వం చేసిన ఓ ప్రకటనతో చిన్న ఆశ చిగురించింది. 2020 నాటికి 70 లక్షల ఎలక్ట్రిక్, హెబ్రిడ్ వాహనాలను రోడ్లపైకి తీసుకురావటమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికీ ఈ పరిశ్రమ తనంతట తానుగా ఒక గుర్తింపును పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉంది. రెండు కంపెనీలు ఈ రంగంలో భవిష్యత్తు మీద ఆశతో తమ ప్రయాణం కొనసాగిస్తున్నాయి. వినూత్న టెక్నాలజీ రూపొందించడంలో, ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న భారత ఎలక్ట్రిక్ వాహనల పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకను ఏర్పర్చుకున్న అతి కొద్ది కంపెనీల్లో ఆంపియర్ ఎలక్ట్రిక్స్ ఒకటి. ఈ- సైకిళ్లు, ఈ- స్కూటర్లు, ఈ ట్రాలీలు(బరువులు మోయడానికి), చెత్త నిర్వహణకు ఉపయోగించే స్పెషల్ పర్పస్ వెహికల్స్, వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలు ఇలా ఎన్నో ఉత్పత్తులు వీరు తయారు చేస్తున్నారు.

తన భర్తతో కలిసి జపాన్‌లో ఒక కాన్ఫరెన్స్‌కు హాజరైనప్పుడే.. ఈ కంపెనీ పెట్టాలన్న ఆలోచన హేమలత అన్నామలైది వచ్చింది. అక్కడ ఒక వక్త ప్రసంగం అమెను ఆకట్టుకుంది. ‘‘భవిష్యత్తు అంతా ఐసిఈ(ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజన్)లదే’’ అంటూ ప్రసంగించిన అతడు ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తులో ఎలా సంచలనలు సృష్టిస్తాయో సుదీర్ఘంగా వివరించాడు.

5 కోట్ల పెట్టుబడితో ఆరంభం

హేమలత 2007లో ఐదు కోట్ల పెట్టుబడితో ఆంపియర్ ఎలక్ట్రికల్స్ ప్రారంభించారు. కొంత కాలం తర్వాత బయట నుంచి పెట్టుబడిదారులు నిధులు సమకూర్చుందుకు ముందుకొచ్చారు. నాన్ – మ్యానుఫ్యాక్చురింగ్ రంగం నుంచి వచ్చిన హేమలత మొదట్లో చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నారు.

image



‘‘ మా టీంకి ఉన్న తపనతో, వ్యాపార రంగానికి సంబంధించిన మెళకువలు నేర్చుకోగలిగాం. మా ప్రయాణంలో ఎన్నో తప్పులు చేశాం. ఆ తప్పులే మా పునాదిని అత్యంత బలోపేతం చేశాయి. ఈ రోజు మేం ఈ స్థితిలో ఉండటానికి కారణం మేం ఎదుర్కొన్నసవాళ్లే. టాలెంట్‌ను వెతికి పట్టుకోవడం, టీమ్ నిర్మించుకోవడం ఇతర సవాళ్లు ’’ అంటారు హేమలత.

సీరియల్ ఆంట్రప్రెన్యూర్

హేమలత 27 ఏళ్ల వయస్సులోనే వ్యాపారవేత్తగా మారారు. మొదట్లో ఆమె కొన్ని ప్రొఫెషనల్ సర్వీసులను చూసేవారు. టెక్నాలజీ రంగంలో ట్రైనింగ్, టూర్స్ అండ్ టికెటింగ్, టాలెంట్ అక్విజిషన్ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ వంటివి ఆమె నడిపారు. ఒక సీరియల్ ఆంట్రప్రెన్యూర్‌గా ఆమె దాదాపు 15 ఏళ్లపాటు అనేక వ్యాపారాలు నిర్వహించారు. వ్యాపార నిర్వహణలో ఏ రోజుకు ఆ రోజు ఎదురయ్యే సవాళ్లు చాలా విభిన్నంగా ఉంటాయని, విజయాలు కూడా అదే రీతిగా ఉంటాయని ఆమె అంటున్నారు. ఆ అనుభవాలే గొప్ప బహుమతులని ఆమె చెబుతారు.

రాయల్ మెల్‌బోర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆస్ట్రేలియా నుంచి ఎంబిఏ చేశారు హేమలత. కోయంబత్తూర్‌లోని ప్రభుత్వ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేశారు.

పెట్టుబడుల ప్రవాహం

ఈ మధ్యకాలంలో రతన్ టాటా కోయంబత్తూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్టప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆ మొత్తం ఎంతన్నది బయటకు ప్రకటించలేదు. ఆ పెట్టుబడులను పూర్తి స్థాయిలో దేశీయ సామర్ధ్యాల కోసం వినియోగించుకోవడంలో ముందుంటుంది ఆంపియర్. ఈ స్టార్టప్ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనం తయారీలో కీలకమైన నాలుగు విడిభాగాలను దేశీయంగా తయారు చేయడం. అవి బ్యాటరీ, మోటార్, చార్జర్, కంట్రోలర్.

ఇప్పటికే మేం 36వి, 48వి బ్యాటరీలను ఈ-సైకిళ్లు, ఈ-స్కూటర్ల కోసం తయారు చేశాం. దీని సాయంతో మేం మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం, ఎలక్ట్రిక్ కార్ల తయారీ విభాగంలో ఆంపియర్‌ను ఒక నమ్మకమైన సప్లయిర్‌గా నిలబెడతాం అంటారు హేమలత.

బిజినెస్ టూ కస్టమర్ (బిటూసి) విభాగంలో వీరి ప్రాధమిక ఉత్పత్తులు ఎలక్ట్రిక్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు. బిజినెస్ టూ బిజినెస్ (బిటూబి) విభాగంలో ఈ స్టార్టప్ ఈ-స్కూటర్లను కొరియర్ డెలివరీ, డోర్ డెలివరీ ఉత్పత్తుల సరఫరా కోసం వాహనాల శ్రేణిని రూపొందిస్తోంది.

image


తయారీ విధానం

ప్రారంభం నుంచి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం ఆంపియర్‌కి వెన్నుముకగా నిలుస్తోంది. ఎందుకంటే తమంతట తాముగా ఛార్జర్లు (36వి, 48వి) తయారు చేసుకుంటున్న భారతదేశపు తొలి స్టార్టప్ ఈ-వాహనాల కంపెనీ ఇదే.

‘‘భారతదేశంలో, చార్జర్లే పెద్ద సమస్య. ఇక్కడి రోడ్ల స్థితిగతులకు విదేశీ చార్జర్లు ఏమాత్రం అనుకూలంగా ఉండవు. పవర్ సప్లయ్‌లోనూ భరోసా ఉండదు. అందుకే మన దగ్గర మన అవసరాల కోసం ఛార్జర్లను మేమే ఇక్కడ తయారు చేసుకుంటున్నాము ’’ అంటున్నారు హేమలత.

ప్రస్తుతం ఏంపియర్ ఎలక్ట్రిక్‌లో తయారై రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలన్నింటిలోని మోటార్లు, కంట్రోళ్లు అన్నీ కూడా వారి ఆర్ ఆండ్ డి టీమ్ డిజైన్ చేసినవే. ఈ టీమ్ ఒక ఇంటిలిజెంట్ బ్యాటరీ చిప్ రూపొందించింది. దీని వల్ల బ్యాటరీ ఉబ్బిపోవడం అనే సమస్య నుంచి భరోసా లభిస్తుంది. బ్యాటరీ వినియోగ కాలం కూడా మరింత పెరుగుతుంది.

తమ కంపెనీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆర్ ఆండ్ డి కోసమే కేటాయించిందని, ఆదాయంలో అధిక భాగం కూడా వాటికే ఖర్చుపెడుతున్నామని హేమలత చెబుతున్నారు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం బ్యాటరీల్లో వాడే లెడ్, మోటార్లలో వాడే మాగ్నైట్‌లను చైనా నుంచి తెప్పించుకుంటున్నాయి. అవి భారత్‌లో తయారైనవి కాదు. ఇతరుల మీద ఆధారపడటాన్ని వీలైంత వరకు తగ్గించే మార్గాన్ని మేం వెతుకుతున్నాం అంటారు హేమలత. ప్రస్తుతం మాకు ఏడాదికి 30,000 వాహనాల్ని తయారు చేసే సామర్ధ్యం ఉందన్నారు.

వ్యాపార అవకాశాల్ని గుర్తించడం

ఈ పరిశ్రమను దేశీయంగా తీర్చిదిద్దాలని, ఇక్కడి మార్కెట్ పరిస్థతులకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయాలని ప్రభుత్వం ప్రేరేపిస్తోంది. వ్యాపార అవకాశాలు భారీగానే ఉన్నాయి. మేం నిర్దేశించుకున్న చిన్న మార్గంలో, భవిష్యత్తులో ఈ రంగానికి 100 శాతం స్థానికంగా తయారు చేసిన వాహనాలను అందించగలుగతాం అంటున్నారు హేమలత.

ఎక్కవ మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల మీద ఆసక్తి చూపేలా ప్రేరణ కలిగించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ మీద ప్రజల్లో ప్రభుత్వం మరింత అవగాహన కలిగించాలి. అప్పుడే ఎక్కువ మంది వీటిని వాడేందుకు ముందుకు వస్తారు.

ఈ పరిశ్రమ అభివృద్ధికి సాయపడే మరికొన్ని ఇతర సంగతలను కూడా హేమలత తెలియజేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పన్ను విధానం ( ఎలక్ట్రిక్ వాహనాల కోసం సిఎస్టి/వ్యాట్/ఎల్బిటి వంటివి) అమలు చేయాలి. పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేయాలి. రోడ్ల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాలి, అవకాశం ఉన్న చోట సైకిళ్ల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి.ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించే కుటుంబాలకు ఇన్‌కమ్ ట్యాక్స్ రాయితీలు ఇవ్వాలి, ట్యాక్స్ ఎస్ఓపిలు కల్పించడం ద్వారా ఎక్కువ మందిని ఇటువైపు ఆకర్షించొచ్చు అంటున్నారు హేమలత.

image


గ్రామీణ మార్కెట్లలో సామాజిక పరివర్తన

ఆంపియర్ ఎలక్ట్రిక్ ప్రధానంగా తక్కవ వ్యయంతో ఇంజన్లు తయారు చేయడం కోసం ఆర్ అండ్ డి విభాగం మీద దృష్టిపెడుతోంది. దీనివల్ల ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. ప్రధానంగా గ్రామీణ మార్కెట్లకు ఇది ఉపయుక్తం. తమిళనాడు, కేరళలో ఉన్న కొన్ని ప్రత్యేక పనులు చేసేవారికి అనుకూలంగా ఎలక్ట్రిక్ వాహనాల్ని డిజైన్ చేయడంలో తమ స్టార్టప్ దృష్టిపెడుతోంది, ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్న మొట్టమొదటి స్టార్టప్ తమదేనని వీరు చెబుతున్నారు.

టెక్స్ టైల్, స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేసే కార్మికుల కోసం త్రిశూల్ అనే ప్రత్యేక వాహనాన్ని ఆంపియర్ రూపొందించింది. ఈ కార్మికుల్లో ప్రధానంగా 20 నుంచి 30 ఏళ్లు ఉన్న మహిళలే అధికంగా ఉంటారు. సాధారణంగా వీరంతా ఫ్యాక్టరీ లోపల షాప్ ఫ్లోర్ మీద స్పిండిల్స్ నిర్వహణ కోసం రోజుకి 12,15 కిలోమీటర్ల మేర నడుస్తారు.

ఆంపియర్ ఆరంభం నుంచి కూడా మహిళా స్వావలంబనకు బలంగా కట్టుబడిన సంస్థ అని చెబుతున్నారు హేమలత. తమ వర్క్ షాపులో పనిచేసే కార్మికుల్లో 30 శాతం మంది మహిళలే ఉంటారంటున్నారు ఆమె.

ధరల నిర్ణాయక వ్యూహం

మార్కెట్ పరిస్థితులు, ఎలక్ట్రిక్ వాహనాన్ని నడపగలిగే స్థోమత అన్న అంశాల్ని ఆధారంగా చేసుకుని ఆంపియర్ ఎలక్ట్రిక్ ధరల నిర్ణాయక వ్యూహం అమలు చేస్తారు. ఈ- సైకిల్ రూ. 20,000 నుంచి 30,000 వరకు అందుబాటులో ఉంది. ఈ-స్కూటర్ ధర రూ.20,000 ల నుంచి 45,000 వరకు ఉంది.

ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవటంతో ఆంపియర్ కీలక పాత్ర పోషిస్తోందంటున్నారు హేమలత. మొత్తం 70 లక్షల వాహనాల్లో 15 నుంచి 20 శాతం మేర ఈ-వాహనాల్ని ఉత్పత్తి చేయాలన్నది ఆంపియర్ లక్ష్యమని ఆమె ప్రకటించారు. తక్కువ దూరాల ప్రయాణానికి, ప్రతి ఇంట్లోనూ ఒక ఈ-బైక్ ఉండేలా ప్రోత్సహిస్తున్నాం, తద్వారా ప్రభుత్వం యొక్క మేకిన్ ఇండియాను బలోపేతం చేయవచ్చు. అదే విధంగా పర్యావరణాన్ని కాపాడొచ్చు అంటారామె.

విస్తరణ ప్రణాళిక

ఆంపియర్ ఎలక్ట్రిక్ నెలకు 200 వాహనాల్ని అమ్మేది. 2010-12 మధ్య కాలంలో ప్రభుత్వం ఈ స్కూటర్లకు మధ్యంతర సబ్సిడీ ఇవ్వడంతో అమ్మకాల సంఖ్య 687కి పెరిగింది.

వ్యాపార అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ఆపింయర్ వచ్చే మూడేళ్లలో 10 రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. ఈ ఏడాది పూర్తయ్యే లోపు రెండు కొత్త మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే మూడేళ్లలో పూర్తిగా మహిళలతో నడిచే క ఈ-సైకిల్ తయారీ ఫ్యాకర్టీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.