కరకరలాడే రోల్స్ బిజినెస్కు కోటి రూపాయల ఫండింగ్
Monday October 12, 2015,
5 min Read
కొన్ని విషయాలను మనం తేలిగ్గా తీసుకుంటాం. కానీ అవే పెద్ద పెద్ద రికార్డులు సృష్టిస్తాయి. సాధారణంగా చపాతీల (రోల్స్) తయారీ దేశంలో చాలా చోట్ల చిన్నపాటి వ్యాపారం. కానీ సహాయ్ సోదరులు మాత్రం చపాతీలతోనే కోట్లు గడిస్తున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరూ చదవండి..
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. కోల్కతా గల్లీల్లో లభించే రుచికరమైన రోల్స్ను ఇతర ప్రాంతాలకు విస్తరించి కోట్లు గడిస్తున్నారు ఇద్దరు సోదరులు. ఈ రుచికరమైన ఆహార పదార్థాన్ని ఇతర ప్రాంతాల్లో ఎందుకు అందించకూడదన్న వీరి ఆలోచనే వారిని ఇప్పుడు వ్యవస్థాపకులను చేసింది. రెండు నగరాల్లో రోల్ మాఫియా విస్తరణకు అంకురార్పణ చేసింది. అంతే కాదు కోటి రూపాయల ఫండింగ్ కూడా సాధించారు వరుణ్, విశాల్ సహాయ్.
రోల్ మాఫియా.. రుచికరమైన కతి రోల్స్, దమ్ బిర్యానీ, ఇతర వంటకాలను కస్టమర్ల వద్దకే సరఫరా చేస్తుంది. ఈ సంస్థకు పుణె, పాట్నాలలో చైన్స్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి.
పాట్నాకు చెందిన 33 ఏళ్ల వరుణ్ సహాయ్కు గోల్ఫ్ అంటే ఎంతో ఇష్టం. అలా గోల్స్పై ఇష్టమే ఆయనను వ్యవస్థాపకుడిని చేసింది. సోదరుడు విశాల్తో కలిసి వ్యాపారంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. ‘ కోల్కతా గ్రీన్స్లో గేమ్ ముగిసిన తర్వాత రుచికరమైన కోల్కతా రోల్స్ను రుచిచూశాం. ఇంత రుచికరమైన రోల్స్ గురించి ఎక్కువమందికి తెలియకపోవడం మాకు ఆశ్చర్యమనిపించింది. మిగతా వాటిలా కాకుండా మేం తయారు చేసిన రోల్స్ ఎంతో రుచికరంగా ఉంటాయి. సాస్తో పూర్తిగా నింపకుండా నోరూరించే, ఆసక్తిదాయకంగా కనిపించేవే కతి రోల్స్’’ అని వరుణ్ వివరించారు.
‘‘ముంబై, పుణెలో ఉన్నప్పుడు ఈ రోల్స్ రుచిని నేను ఎంతో మిస్సయ్యాను. మేం పెరిగిన నగరం రుచిని ప్రపంచానికి అందించే సమయం ఆసన్నమైందని నాకు అనిపించింది’’ అని విశాల్ చెప్పారు.
ఆరు నెలలకే అటకెక్కింది !
మొదట్లో ఈ రోల్స్ను ఇంట్లోనే తయారు చేసి కస్టమర్లకు అందించేవారు. వీరు తయారు చేసిన ఆహార పదార్థాలకు మంచి పేరు రావడం ప్రారంభించింది. దీంతో తమ వ్యాపారాన్ని విస్తరించారు. వరుణ్ భార్య ఈ ఔట్లెట్కు రోల్ మాఫియాగా పేరు పెట్టారు. ఒక్కసారి రుచి చూస్తే అబ్బా ఏం టేస్ట్ గురూ అనడం ఖాయం. రుచి చూసిన ప్రతి ఒక్కరూ ‘‘క్రిమినల్లీ టేస్టీ’’ అంటూ ఉంటారు. తొలిసారిగా 2012లో ఈ వంటకాన్ని పాట్నా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. రాయ్పూర్లోని ఓ మాల్లో ప్రారంభమైన ఔట్లెట్ త్వరగానే మూతపడింది.
‘‘మా తొలి ఔట్లెట్ ఆరు నెలలు మాత్రమే నడిచింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాన్ని మూసేయాల్సి వచ్చింది. అయితే ఆ అనుభవం ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ కొన్ని నెలల్లోనే ఎంతో నేర్చుకున్నాం. సెంట్రల్ కిచెన్ అవసరం ఎంతుందో తెలిసొచ్చింది. అలాగే ప్రతీదీ రుచికరంగా, నాణ్యమైనదిగా ఉండాలని తెలుసుకున్నాం. మేం ఆర్థికంగా ఎంతో నష్టపోయినప్పటికీ మా ఆహార పదార్థాలకు మాత్రం మంచి పేరొచ్చింది.’’ అని వరుణ్ చెప్పారు.
తొలి ప్రయత్నంలో వచ్చిన ఓటమితో వారు నిరాశ చెందలేదు. తమను తాము ప్రోత్సాహపర్చుకుని రాయ్పూర్ నుంచి పాట్నాకు మకాం మార్చారు. తమ నాణ్యమైన ప్రాడక్ట్లను అందించేందుకు పాట్నాలోని పీ అండ్ ఎం మాల్ను వేదికగా ఎంచుకున్నారు. ‘‘సరైన ప్రదేశాన్ని, కిచెన్ను ఎంచుకోవడమే ఎంతో ముఖ్యం. రాయ్పూర్లో రోజూ 60 రోల్స్కు మించి విక్రయించడం సాధ్యమయ్యేది కాదు. అయితే పాట్నాలో తొలిరోజే సాయంత్రం నాలుగు గంటలలోపే 75కుపైగా రోల్స్ విక్రయించడం అద్భుతంగా అనిపించింది’’ అని వరుణ్ తెలిపారు.
పాట్నా ఐఐటీకి షిఫ్ట్..
పాట్నాలో మంచి రెస్పాన్స్ రావడంతో తమ ఔట్లెట్లను విస్తరించారు వరుణ్, విశాల్. ఐఐటీ పాట్నాకు సమీపంలోనే ఔట్లెట్ను ఆరంభించారు. రోల్స్ రుచికరంగా ఉండటంతో ఐఐటీ విద్యార్థులు క్యూ కట్టేవారు. నెలాఖరులో విద్యార్థుల పాకెట్స్లో డబ్బు తగ్గిపోయేది. ఆ సమయంలో కూడా తక్కువ మొత్తానికే ఎక్కువ పరాఠాలు అందించారు వరుణ్. ఈ ప్రయత్నంతో విద్యార్థులతో మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి.
‘‘మా ఔట్లెట్కు పాట్నా ఐఐటీ క్యాంపస్లో మంచి పేరు వచ్చింది. ఎక్కడ చూసినా మా గురించే చర్చ. దీంతో మా అవుట్ లెట్ మొత్తం విద్యార్థులతో నిండిపోయేది’’ అని వరుణ్ చెప్పారు. అలా అలా ఈ రోల్ మాఫియా టేస్ట్ గురించి ఐఐటీ కాలేజీ డీన్ వరకూ పాకింది. రోల్ మాఫియాను ఐఐటీ క్యాంపస్లోనే ఏర్పాటు చేయాలని డీన్ చేసిన విజ్ఞప్తిని వీరిద్దరూ అంగీకరించారు. ఆరంభంలో 1200 మంది విద్యార్థులకు వీరు రోల్స్ అందించేవారు. రెండేళ్లలోనే ఆ క్యాంపస్లో విద్యార్థుల సంఖ్య 12 వేలకు చేరింది. వీరిలో ఎక్కువమంది విద్యార్థులు రోల్ మాఫియా కస్టమర్లే.
ఈస్ట్ టు వెస్ట్..
పాట్నాలో తమ ప్రయత్నం సక్సెస్ కావడంతో తమ బ్రాండ్ నేమ్ను మరింత విస్తరించాలని వరుణ్, విశాల్ నిర్ణయించారు. విశాల్ పుణె సింబయాసిస్ పూర్వ విద్యార్థి. ఎన్నో ఏళ్లు అక్కడ గడిపినప్పటికీ పుణెలో ఆహార పదార్థాలు మాత్రం అంత రుచిగా ఉండవని ఆయన అనుకుంటుంటారు. నగరం రోజు రోజుకు విస్తరిస్తున్నప్పటికీ ఆహార విషయంలో మాత్రం అంత పెద్దగా మార్పు కనిపించలేదు. దేశంలో ఎక్కడికక్కడే రుచులు వేర్వేరుగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ‘‘ మనం ఔట్లెట్ ఎక్కడైతే ప్రారంభించాలనుకుంటామో, ఆ నగరం గురించి మనకు పూర్తిగా తెలిసుండాలి. ఉదాహరణకు పుణెనే తీసుకుందాం. ఈ నగరంలో అల్లం, మిర్చి ఎక్కువగా లభిస్తుంది. దీంతో ఇక్కడి రుచులే కాస్త భిన్నంగా ఉంటాయి. కాబట్టి, రుచికరమైనది అందించాలంటే ప్రాంతాన్ని బట్టి మారాల్సి ఉంటుంది’’ అని విశాల్ వివరించారు.
రెండు నగరాల్లో హవా..
పాట్నాలో ప్రారంభమైన వీరి ప్రస్థానం ఇప్పుడు 11 లోకేషన్లకు విస్తరించింది. 11 ప్రాంతాల్లో వీరు ఇప్పుడు స్టోర్స్, హబ్ కిచెన్స్ నిర్వహిస్తున్నారు. ఆరంభంలో కేవలం రోజుకు 75 ఆర్డర్స్ మాత్రమే వచ్చేవి. ఇప్పుడది 500కు చేరింది. ఇందులో 80 శాతం రిపీటెడ్ కస్టమర్లే.
‘‘ ఆహార సంబంధిత వ్యాపారం రాకెట్ సైన్స్ కాదు. ఇందులో బేసిక్స్ సరిగ్గా ఉండాలి. కొన్ని ఐటమ్సే తయారు చేసినా, వాటిని సరిగ్గా డెలివరీ చేయగలగాలి. రెండేళ్ల క్రితం ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా మేం తయారు చేసే రోల్స్ ఎంతో రుచికరంగా ఉంటాయని కస్టమర్లు అంటుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. వచ్చే ఏడాది మార్చిలోగా మా ఔట్లెట్స్ సంఖ్యను 50కు పెంచాలనుకుంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి అయిదు కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తాం ’’ అని విశాల్ ధీమాగా చెప్పారు. రోల్స్ మాఫియాలో సిబ్బంది సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తతం రోల్స్ మాఫియా ద్వారా 75 మందికి ఉపాధి లభిస్తోంది. 2016కల్లా ఈ సంఖ్య 250కు చేరే అవకాశాలున్నాయి.
గోల్ఫ్ కోర్స్తో రిలేషన్..
సహాయ్ సోదరుల ప్రయాణం మొదలైంది గోల్ఫ్ కోర్సులోనే. అప్పటి నుంచి వీరు గోల్ఫ్ కోర్స్తో సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. గోల్ఫ్ మైదానంలోనే వీరికి వ్యాపార ఆలోచన వచ్చింది. అలాగే వీరి తొలి ఇన్వెస్టర్ కూడా గోల్ఫ్ కోర్స్లోనే దొరికారు. గోల్ఫ్ మైదానంలో ఉండగా తమ వ్యాపారం గురించి నిరావ్ చోక్సీకి వీరు వివరించారు. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు నిరావ్ ఆసక్తి ప్రదర్శించారు. పాట్నాకు వచ్చి రోల్స్ రుచి చూసిన తర్వాతే పెట్టుబడులకు ఓకే చెప్పారు. భోజన ప్రియుడైన నిరావ్ ఈ విషయాన్ని తన వ్యాపార భాగస్వామి రాజీవ్ రామ్నారాయణకు కూడా వివరించారు. సింగపూర్లో ఈక్వెంటియా న్యాచురల్ రిసోర్సెస్ సంస్థను నిర్వహిస్తున్న వీరిద్దరూ రోల్స్ మాఫియాతో భాగస్వామ్యులయ్యారు.
‘‘వారు పెట్టుబడులు పెట్టడమే కాదు సింగపూర్కే చెందిన HHC ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సీడ్ ఫండ్ కూడా అందేలా చేశారు. వీరితోపాటు భవిన్ షా, మానవ్ ఖన్నా, రామ్ కెవల్రమణి వంటి వ్యవస్థాపకులు కూడా కోటి రూపాయల సీడ్ ఫండింగ్ పెట్టేందుకు ముందుకొచ్చారు’’ అని ఆ సోదరులిద్దరూ సంతోషంగా చెప్పారు. ఈ నిధులను మార్కెటింగ్, టెక్నాలజీ, సిబ్బంది నియామకాల కోసం, సంస్థ విస్తరణ కోసం ఉపయోగించనున్నారు.
డిజిటల్ రోల్ మాఫియా..
స్టార్టప్ కంపెనీ పనితీరు మొత్తం ఇంటర్నెట్ ఆధారంగానే సాగుతోంది. ఇందులో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. వీరిప్పుడు ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్ ద్వారా కూడ సేవలందిస్తున్నారు. ‘‘మా సంస్థకు చెందిన యాప్ కూడా త్వరలోనే రాబోతున్నది. ఎవరికి ఎలాంటి ప్రాంతీయ రుచులు కావాలన్న అందించేందుకు మేం సిద్ధం. గతంలో ఎప్పుడూ రుచి చూడని ప్రాంతీయ ఆహార పదార్థాలు మా మెనూలో చేర్చాలనుకుంటున్నాం’’ అని రోల్స్ మాఫియా నిర్వాహకులు వివరించారు.