జీఎస్టీపై సందేహాలా..? అయితే వార్ రూంకి ఫోన్ చేయండి

జీఎస్టీపై సందేహాలా..? అయితే వార్ రూంకి ఫోన్ చేయండి

Thursday June 29, 2017,

2 min Read

జీఎస్టీ అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. పన్ను విధానంపై వచ్చే సందేహాలను తీర్చేందుకు స్పెషల్ వార్ రూంను ఏర్పాటు చేశారు. జీఎస్టీ అమల్లో ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా నిర్భయంగా ఫోన్ చేయచ్చు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరుగబోయే జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే ఆహ్వానాలు పంపిస్తున్నారు. నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

image


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జులై 30 అర్ధ్రరాత్రి జరిగే జీఎస్టీ లాంఛింగ్ ప్రోగ్రామ్ కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రాష్ట్రపతి, ప్రధాని, మాజీ ప్రధానులు, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొంటారు. చరిత్రలో నిలిచి పోయేలా వేడుకలు నిర్వహించాలని కేంద్రం నుంచి గట్టి ఆదేశాలు వెళ్లాయి.

అయితే, జీఎస్టీ లాంఛింగ్ కార్యక్రమానికి రావడం లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు లాగానే జీఎస్టీ కూడా ఎన్డీయే చేస్తున్న చారిత్రక తప్పిదమన్నారు మమతా. అందుకే జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ తో పాటూ పలు విపక్షాలు జీఎస్టీ లాంఛింగ్ పై తమ అభిప్రాయాన్ని ఇంకా వెల్లడించలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ ఈ కార్యక్రమానికి అతిధిగా హాజరుకావాల్సి ఉన్నందున, కాంగ్రెస్ వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.

ఇక జీఎస్టీపై చిన్న వ్యాపారుల నుంచి బడా పారిశ్రామిక వేత్తల వరకు చాలా సందేహాలున్నాయి. వాటిని నివృత్తి చేసేందుకు .స్పెషల్ వార్ రూం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఒకేసారి వందలాది ఫోన్లు, కంప్యూటర్ సిస్టమ్స్ ఉండేలఆ వార్‌రూమ్‌ను డిజైన్ చేశారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఈ వార్ రూమ్ నుంచి సమాధానం వస్తుంది. జీఎస్టీని ఎలాంటి అవకతవకలు లేకుండా అమల్లోకి తీసుకురావడానికి అన్ని ప్రక్రియలను పాటిస్తున్నట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ తెలిపింది. గతంలో జీఎస్టీ ఫీడ్ బ్యాక్, యాక్షన్ రూంను ఇదే శాఖ ఏర్పాటు చేసింది. దాంతోపాటు అన్ని మంత్రిత్వ శాఖలు, అధికార విభాగాలకు జీఎస్టీ మానిటరింగ్ సెల్స్ ఏర్పాటుచేశారు. మానిటరింగ్స్ సెల్స్ తో వార్ రూమ్ కోఆర్డినేట్ చేసుకుంటుంది.