మురికివాడల ప్రజల కోసం గూగుల్ జాబ్ నే వదిలేశాడు

మురికివాడల ప్రజల కోసం గూగుల్ జాబ్ నే వదిలేశాడు

Wednesday March 02, 2016,

4 min Read

మంచి కార్పొరేట్ జాబ్, అయిదంకెల జీతం, అయిదు రోజుల పని.. వీకెండ్ లో మస్త్ ఎంజాయ్ మెంట్. 40వ వడిలో పడేలోపు సొంత ఇళ్లు.. చక్కని సంసారం. ఇదే చాలామంది యువత కోరుకునేది. కానీ బెగళూరుకు చెందిన అతుల్ సతిజా కాస్త డిఫరెంట్. వ్యక్తి పొజిషన్ ను బట్టి కాకుండా ప్రతి ఒక్కరికి గౌరవంగా బతికే హక్కుందని ఆయన భావిస్తారు. అందుకే మురికివాడల ప్రజలు కూడా మెరుగైన జీవితాన్ని గడిపేందుకు గూగుల్ లో జాబ్ వదిలేశారు. ది నడ్జ్ పేరుతో ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి స్కూల్ డ్రాపౌట్స్ కు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తూ మెరుగైన జీవితాన్ని అందిస్తున్నారు.

ఎన్ఐటీలో బీటెక్, ఐఎస్బీలో ఎంబీఏ పూర్తి చేసిన అతుల్ కొన్నాళ్లపాటు గూగుల్ లో ఉద్యోగం చేశారు. సంస్థ అతడిని జపాన్ కానీ, అమెరికాకు కానీ పంపాలనుకుంది. కానీ అతుల్ మాత్రం ఇండియాను వదిలి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అందరూ 40 లోపు ఉద్యోగంలో మంచి పొజిషన్ లో ఉండాలనుకుంటే, అతుల్ మాత్రం సామాజిక సేవను ఫుల్ టైమ్ గా మార్చుకోవాలని డిసైడయ్యారు. మొదట్లో ఎండ్ పావర్టీ అనే ఎన్జీవోలో వాలంటీరుగా పనిచేసిన అతుల్.. ఆ తర్వాత ఓ సంస్థనే స్థాపించారు. 9-5 జాబ్ కంటే నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారతే తనకు సంతృప్తినిస్తుందని ఆయన అంటారు. గూగుల్ జాబ్ ను వదిలేసి ఇన్ మొబి లో చీఫ్ బిజినెస్ అడ్వయిజర్ గా చేరారు. అటు ఉద్యోగాన్ని చేస్తూనే ఇటు సమాజ సేవకు అంకితమయ్యారు.

ఇది ఆర్నెల్ల క్రితం విషయం.. ఆయేషా సిద్ధిఖి ఓ గార్మెంట్ షాపులో హెల్పర్ గా పనిచేస్తుండేది. కుటుంబంలో ఎనిమిది మంది. అందుకే రోజుకు పది గంటలపాటు షాపులో అడ్డమైన చాకిరీ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందిన వైఎల్జీ సెలూన్ లో ఆమె బ్యూటీషియన్ గా వర్క్ చేస్తున్నది. నెలకు పదివేల వరకు సంపాదన. ఇంగ్లీష్ కూడా చక్కగా మాట్లాడుతోంది. అన్నిటికి మించి ఆమె ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఇది ఆమెకు కొత్త జీవితం. అందుకు కారణం అతుల్ సతిజా స్థాపించిన నడ్జ్ ఫౌండేషనే. ఈ సంస్థలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందిన అయేషా మంచి, గౌరవప్రదమైన ఉద్యోగాన్ని దక్కించుకుంది.

 గ్రాడ్యుయేషన్డే సందర్భంగా పట్టాలతో విద్ద్యార్థులు

 గ్రాడ్యుయేషన్డే సందర్భంగా పట్టాలతో విద్ద్యార్థులు


ఒక్క అయేషానే కాదు నాలుగునెలలపాటు నిర్వహించిన లైఫ్ మేనేజ్ మెంట్ రెసిడెన్షియల్ ప్రొగ్రామ్ నేర్చుకున్న 46 మంది ఇప్పుడు వేర్వేరు కంపెనీల్లో మంచి ఉద్యోగం చేస్తున్నారు. లైఫ్ (పర్సనల్ అండ్ సోషల్ డెవలప్ మెంట్, ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్, హెల్త్ అండ్ వెల్ నెస్, ఎంప్లాయబిలిటీ), లిటరసీ (దినచర్య, ఇంగ్లీష్, న్యూమరసీ), లైవ్లీ హుడ్.. ఈ మూడు విభాగాల్లో నడ్జ్ ఫౌండేషన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

అతుల్ సతిజా, ది/నడ్జ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు

అతుల్ సతిజా, ది/నడ్జ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు


ప్రతియేటా దేశంలో పదిలక్షల మంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో 50% మంది స్కూల్ డ్రాపౌట్సే. ఇలాంటి వారికి ఉద్యోగం సంపాదించే నైపుణ్యం ఉండదు. వీరికోసం నడ్జ్ ఫౌండేషన్ పటిష్టమైన కరికులమ్ ను రూపొందించి, తమ రెసిడెన్షియల్ స్కూల్స్ లో శిక్షణ ఇస్తోంది.

‘‘ఎవరి జీవితాలను వారే బాగు చేసుకోగలరు. కానీ వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చివారికి నేర్చుకునేందుకు మంచి వేదిక ఒకటి అవసరం. ప్రస్తుతం వారు ఉన్న పొజిషన్ నుంచి బయటపడేందుకు వారికి ఇతరుల సహకారం తప్పనిసరి. మా సంస్థ అలాంటి సహకారాన్నే అందిస్తున్నది’’- అతుల్.

నడ్జ్ సంస్థ 2015 జూలైలో ఏర్పాటైంది. సమాజ శ్రేయస్సు ఆకాంక్షించే మరికొందరు కూడా అతుల్ వెంట నడిచారు. దీంతో అనుకున్న వెంటనే నడ్జ్ తమ తొలి శిక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. లీడ్ ఆఫ్ లైవ్లీహుడ్ ట్రైనింగ్ అండ్ పార్టనర్ షిప్ శిక్షణ ఇచ్చే జాన్ పాల్ ఇలా అంటారు..

బెంగళూరులోని 20 స్లమ్ లను పూర్తిగా చుట్టేశారు. డోర్ టు డోర్ మెథడాలిజీని అడాప్ట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఉపయోగాలు, శిక్షణ తీసుకుంటే ఎలాంటి లాభం ఉంటుంది అన్న విషయాలను వారికి వివరిస్తారు. శిక్షణ పొందిన 46 మందిలో కొందరు వైఎల్జీ, నాచురల్స్, ఉబర్ సలూన్, డ్రైవ్ యూ,ఇన్నర్ చెఫ్, కార్టిసన్ లలో పనిచేస్తూ ఏడు వేల నుంచి 15 వేల వరకు సంపాదిస్తున్నారు. ఇందులో చాలామందికి ఇదే తొలి ఉద్యోగం.

స్థిరత్వం.. ముందడుగు..

‘‘మరింత సమయం, వనరులు, ప్రత్యామ్నాయమే మా మోడల్. ఇతర నైపుణ్య శిక్షణలతో పోలిస్తే మేం ఇచ్చే శిక్షణ కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ విద్యార్థులపై మా ట్రైనింగ్ అద్భుతమైన ప్రభావం చూపింది. మా పైలట్ బ్యాచ్ విద్యార్థుల ప్రతిభతో ఎంప్లాయర్స్ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపై మా మోడల్ ను మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నాం’’ అని అతుల్ చెప్పారు.

2020 కల్లా పదిలక్షల మందిని పేదరికం నుంచి బయటపడేయడమే ఈ సంస్థ లక్ష్యం. ‘‘మేం ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వచ్చే కొన్ని నెలల్లో కరిక్యూలమ్ ను రీఫైన్ చేయాలన్న వ్యూహంతో ఉన్నాం. ప్రొగ్రామ్ ను మరింత ప్రామాణీకరించి, మా మాదిరిగానే ఆలోచించే వ్యక్తులు, ఫౌండేషన్స్, ఎన్జీవోలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. మా లక్ష్యాన్ని చేరుకునేందుకు మాతో సహకరించేవారందరితో కలిసి నడుస్తాం’’ అని అతుల్ వివరించారు.

ప్రతి నాలుగు నెలలకో బ్యాచ్ చొప్పున గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న వారందరి జీవితాల్లో స్థిరత్వం నింపాలన్నదే నడ్జ్ ఉద్దేశం. ఇందుకోసం ‘ది బాంబో ఇన్షియేటివ్’ పేరుతో నడ్జ్ గ్రాడ్యుయేట్స్ జీవితకాలం ఉపయోగించుకునేలా ఓ ప్రొఫెషనల్, పర్సనల్, సోషల్ నావిగేషన్ సపోర్ట్ ను అతుల్ ఆవిష్కరించారు. 

‘‘ఐవీఆర్ సర్వీస్ (హెల్ప్ లైన్ నంబర్), ఓ మొబైల్ యాప్, ఫిజికల్ సర్వీస్ లను రూపొందించాం. పూర్వ విద్యార్థులంతా తమ జీవితకాలం వీటి సాయంతో ఆరోగ్యం, విద్యా, కెరీర్ సమాచారంలతోపాటు ఎలాంటి సేవనైనా పొందొచ్చు. ఉదాహరణకు పూర్వ విద్యార్థి సంబంధికులైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే.. వారి కోసం సరైన డాక్టర్/హాస్పిటల్ ను సూచిస్తాం. అంతేకాదు ఆన్ లైన్ లోనే ప్రచారం చేసి నిధులు కూడా సమీకరించి ఇస్తాం’’ అని అతుల్ వివరించారు. 

ఈ సంస్థ గ్రాడ్యుయేషన్ ఈవెంట్ కు పద్మభూషన్ అవార్డీ, టాటా స్టీల్ మాజీ వైస్ చైర్మన్ ముత్తురామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘భారత దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మానవ అభివృద్ధి. అందుకే యువత అభివృద్ధికి, వారు సరైన అవకాశాలు పొందేందుకు కృషి చేస్తున్న నడ్జ్ లాంటి సంస్థలు అవసరం సమాజానికి ఎంతో ఉంది’’ అని అన్నారు. మానవాభివృద్ధికి కృషి చేస్తున్న ఈ సంస్థకు నందన్ నీలేకనీ రెండు లక్షల డాలర్లను ఫండింగ్ చేశారు.

సమాజ అభివృద్ధికి అందమైన కెరీర్ ను వదిలేసిన అతుల్ ఆదర్శనీయులు. ముత్తురామన్ చెప్పినట్టుగా నడ్జ్ లాంటి సంస్థలు మరిన్ని ఆవిర్భవిస్తేనే భారత్ లో పేదరికం తగ్గుతుంది. అతుల్ ను ఆదర్శంగా తీసుకుని మరింత మంది ప్రజా సేవకు ముందుకు రావాలని యువర్ స్టోరీ ఆకాంక్షిస్తోంది.