జీవితమే నాటకం.. నాటకమే జీవితం!

జీవితమే నాటకం.. నాటకమే జీవితం!

Monday September 28, 2015,

4 min Read

“నాన్నగారితో పాటు నాటకాలు చూడ్డానికి వెళ్లేవాడిని. అప్పటి నుంచే నాటకాలంటే ఇష్టం పెరిగింది. ఇప్పుడు నాటకాలే నా జీవితంగా మారిపోయాయి.” నిశుంబిత ఫౌండర్ రామ్మోహన్


హైదరాబాద్‌కు చెందిన ఓ థియేటర్ గ్రూప్ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 సంవత్సరాలుగా నాటక రంగానికి సేవలందిస్తోంది. కానీ ఈ అభిప్రాయంతో రామ్ అసలు ఏకీభవించరు. నాటకానికి, నాటక రంగానికి ఏవరూ ఏమీ చేయలేరు. చాలా మంది పూర్తిగా చనిపోయిన నాటకరంగాన్ని మేం బతికించాం. మా సేవతో దీన్ని పునరుజ్జీవితం చేశాం , అని చెప్పుకుంటారు. కానీ అది తప్పు. అలా చేయడానికి వాళ్లెవరు ? మనిషి జీవించి ఉన్నంత వరకూ ఈ కళ సజీవంగా ఉంటుంది. ఇందులో ఎవరి పాత్రలు వారు చేసుకొని వెళ్లిపోతారు అంతే !


“బహుశా ఈ నాటక రంగమనే నాటకంలో నా పాత్ర నిడివి ఎక్కువగా ఉండటం వల్ల నేను ఇంతకాలం ఈ రంగంలో కొనసాగుతున్న అంటూ ఎంతో వినయంగా చెబుతారు రామ్”
నిశుంబిత ఫౌండర్ రామ్ మోహన్

నిశుంబిత ఫౌండర్ రామ్ మోహన్


వేల సంఖ్యలో పర్ఫార్మెన్స్‌లు, లక్షల మంది కళాకారులు, కోట్లమంది ప్రేక్షకులు. అందరూ కలిస్తేనే ఈరోజు నిశుంబిత మీ ముందు ఇలా కనిపిస్తోంది. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటే చిరునవ్వే రామ్ సమాధానం. ఆయన నవ్వుతూ చెప్పినంత సులువైన విషయమైతే ఇది కాదు. సాంఘిక నాటకాలు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తాయి. అది మరే కళ వల్లా సాధ్యం కాదు. ఒక మనిషిలో మార్పు తీసుకొచ్చేదే కళ. అలాంటి కళ గురించి ఎంత చెప్పినా తక్కువ. అలాంటి కళల్లో ఒకటైన నాటకాన్ని నా ప్రొఫెషన్‌గా ఎంచుకున్నా. అదే నన్ను నడిపిస్తోంది. ఏది సాధ్యం, ఏది అసాధ్యం అనే విషయాలు నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా వరకూ ప్రయత్నం చేశానా లేదా అనేదే ఆలోచిస్తా. స్కూల్లో క్లాసులు బంక్ కొట్టి మరీ స్టేజ్ పెర్ఫార్మన్స్ కోసం వెళ్లే వాళ్లం. ఆ స్థాయి నుంచి ఇప్పుడు నేను ఉన్న స్థాయి వరకూ ఓ సుదూర ప్రయాణమే. కొన్ని సార్లు ఇదంతా నా పనితనమేనా అని ఆలోచించినప్పుడు నన్ను విడిచి వెళ్లిన అన్నయ్య,నాన్నగారు గుర్తొస్తారని చెప్పుకొచ్చారు రామ్.

“ఆంగిక, వాచక, సాత్విక, ఆహార్యాలు కలగలిస్తేనే నాటకం. డ్యాన్స్, మ్యూజిక్‌లో కూడా ఈ గుణాలు కనిపిస్తాయి. కానీ అన్నీ కనపడే ఏకైక కళ నాటకం.” రామ్
నిశుంబిత టీం వేసిన జంగిల్ బుక్ నాటకం

నిశుంబిత టీం వేసిన జంగిల్ బుక్ నాటకం


బాధ్యతను పెంచిన అన్నయ్య మరణం

నిశుంబిత అంటే రామ్మోహన్, క్రిష్ణ మాధవ్. కానీ ఇప్పుడు నేను ఒంటరిని అయిపోయాను. 2011లో అన్నయ్య చనిపోవడంతో మా థియేటర్ గ్రూప్‌కి కళ తగ్గింది. స్కూల్లో చదువుకునే రోజుల నుంచి అన్నయ్య నా ప్రాణ స్నేహితుడు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం. స్కూల్లో క్లాసులు బంక్ కొట్టి మరీ పెర్ఫార్మన్స్‌లకు వెళ్లేవాళ్లం. నా జీవితంలో ఎక్కువసార్లు నేను మాట్లాడింది అన్నయ్యతోనే. సాంఘిక నాటకాలు, వీధినాటకలు వేసేటప్పుడు అన్నయ్య స్క్రిప్ట్ విషయాలను చూసుకునేవారు. నేను కో ఆర్డినేషన్ చేసుకునే వాడిని. నాటకాల్లో కళాకారులు చెప్పే కొన్ని డైలాగులు అన్నయ్య మనసు నుంచి వచ్చినవి. నాటకాల్లో ఆహార్యం ఎంత ముఖ్యమో , చెప్పే డైలాగ్ కూడా దాన్ని అంతగా ప్రభావితం చేస్తుంది. మంచి స్క్రిప్ట్‌కి నటనతోడైతేనే అది రక్తి కడ్తుంది. స్క్రిప్ట్ అనేది షోకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందనేది మాటల్లో చెప్పలేను. అన్నయ్య హఠాన్మరణం మా నాటకానికి ఓ రకంగా షోడౌన్ అయిపోయిందనే చెప్పాలి.

“ఒక క్షణం పూర్తిగా నాటకాలను విడిచిపెడదామనే అనుకున్నానంటే అన్నయ్య మరణం నన్నెంతలా కలిచి వేసిందో మీరు అర్థం చేసుకోవచ్చు '' - రామ్
అదరగొట్టే నిశుంబిత విద్యార్థుల పెర్ ఫార్మన్స్

అదరగొట్టే నిశుంబిత విద్యార్థుల పెర్ ఫార్మన్స్


నాన్నగారు చిన్నప్పటినుంచి మమ్మల్ని నువ్వు అది చేయ్,ఇది చేయి అని ఏనాడూ అనలేదు. నాన్నగారు చనిపోయిన తర్వాత అన్నయ్య సలహా ప్రకారమే నేను ముందుకు సాగాను. నా మాటకు సైతం ఆయన ఎంతో విలువిచ్చేవారు. జీవితంలో ఏదైనా మిస్సయ్యనంటే అది అన్నయ్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. మళ్లీ నేను మామూలు మనిషిని అయ్యానంటే అది నాటకాల వల్లే సాధ్యపడింది. తనులేని లోటు నిశుంబితలో కనపడకూడదని పనిచేయడం ఆరంభించా. ఆయన కోరుకున్నట్లే నిశుంబిత మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నా.

'నటోత్సవ్'తో కొత్త ఉత్సాహం

నటోత్సవ్ అనే ఉత్సవానికి మేం ఆర్గనైజర్లు కావడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం , సాంస్కృతిక శాఖతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. డిసెంబర్‌లో జరగబోయే ఈ ఫెస్ట్‌లో చాలా నాటకాలను ప్రజెంట్ చేస్తారు. సామాజిక కోణంలో చేసే ఎన్నో నాటకాలకు వేదికనిచ్చే ఇలాంటివి మరిన్ని జరగితే ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుంది. గతంలో ఇలాంటి ఉత్సవాలను చేపట్టాం కానీ ఈసారి చేపట్టే ఉత్సవాలు ప్రత్యేకమైనవే చెప్పాలి. సినీనటి అమల మా నటోత్సవాలకు సంబంధించిన లోగో లాంచ్‌కు విచ్చేసారు. నాటక కళాకారులను ఉత్సాహపరిచేదిగా నటోత్సవం నిలుస్తుందని ఆశిస్తున్నా. ప్రతీ ఏడాది ఇలాంటి ఫెస్ట్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రభుత్వం తరుపునుంచి సహకారం ఉన్నంత వరకూ దీనికేం ఢోకాలేదని నేను భావిస్తున్నా అన్నారాయన.

అమలా తో నిశుంబిత టీం

అమలా తో నిశుంబిత టీం



నిశుంబిత టీం

రామ్మోహన్ హోలగుండి నిశుంబిత ఫౌండర్ మెంబర్. హైదరాబాద్‌లోనే ఆయన విద్యాభ్యాసం పూర్తయింది. థియేటర్స్‌లో మాస్టర్స్ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి పూర్తి చేశారు. తనకు నాటకాలతో పరిచయం అయి ఇప్పటికి దాదాపు 26 సంవత్సరాలు పూర్తయ్యాయి. రామ్‌తో పాటు ఆయన భార్య సౌమ్య కూడా నిశుంబిత టీం మెంబరే. ఈమె ప్రధానంగా స్పెషల్ చిల్డ్రన్స్ కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక సెషన్స్ లాంటివి చూస్తుంటారు. నిశుంబిత ఆర్గనైజ్ చేసే స్టేజ్ షోలల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తారు. వీరితోపాటు చాలా మంది స్టూడెంట్స్, ఇంటర్న్స్ , ఫ్రీలాన్సర్స్ నిశుంబిత టీంలో పనిచేస్తున్నారు.

సాంఘిక నాటకాలకు ప్రాధాన్యం

నిశుంబిత అంటే పూర్తిగా సాంఘిక నాటకాలకు కేరాఫ్ అనే చెప్పాలి. వీధినాటకాలు నిశుంబిత ప్రత్యేకత. సామాజికంగా ఆలోచింపజేసే కధలను వీరు నాటకాల్లో చూపిస్తారు. నిశుంబితలో కమర్షియాల్టీకి ఎలాంటి ప్రాధాన్యం లేదు. నిశుంబితలో యాక్టింగ్, డైరెక్షన్ లాంటివి నేర్చుకున్న వందల మంది టీవి, సినిమా లాంటి మాధ్యమాల్లో రాణించారు. నిశుంబిత విద్యార్థి అయిన యాక్టర్ సంజీవ్, సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘వెల్కమ్ ఒబాబా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. నాటకరంగంలో సాంఘిక నాటకాలకు ఉన్నంత ప్రాధాన్యం వేరే వాటికి లేవు. మన సాంప్రదాయాలను కాపాడుతూ నిశుంబిత తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది.

నిశుంబిత సాంఘిక నాటకం

నిశుంబిత సాంఘిక నాటకం


భవిష్యత్ ప్రణాళికలు

థియేటర్ మీడియం అనేది మరుగు పడిపోతోందని చెప్పుకొనే వారి అభిప్రాయం తప్పు అనడానికి నిశుంబిత ఉదాహరణ. రెండు దశాబ్దాలుగా కళాకారులను నాటకరంగానికి పరిచయం చేసిన ఈ థియేటర్ గ్రూప్ పూర్తి స్థాయి సామాజిక విలువలతో దూసుకుపోతోంది. మరింత మంది కళాకారులను ఇండస్ట్రీకి అందించాలనేదే నిశుంబిత లక్ష్యం. నాటక,కళారంగాల్లోకి రావాలనుకున్న చిన్నారులను ఈ రంగంలోకి వచ్చేలా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఈ సంస్థ యోచిస్తోంది. దీనికోసం ఈవెంట్స్, స్టేజ్ షోలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

“ మీకు యాక్టింగ్ రాకపోయినా ఫర్వాలేదు. మీలో క్రియేటివిటీ ఉందోలేదో పక్కనపెట్టండి. నాటకాలంటే ఇష్టం, కళపై డెడికేషన్ ఉంటే చాలు. మిమ్మల్ని చక్కని కళాకారులుగా తీర్చి దిద్దే బాధ్యత మాది అంటూ ముగించారు రామ్.”