కేరళ టు అమెరికా వయా బార్సిలోనా- ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సక్సెస్ స్టోరీ !!

కేరళ టు అమెరికా వయా బార్సిలోనా- ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సక్సెస్ స్టోరీ !!

Wednesday January 20, 2016,

3 min Read

వ్యాపారం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. డబ్బుంటే ఎవరైనా చేయొచ్చు. కానీ.. అందులో సక్సెస్ కావాలంటే పట్టుదల కావాలి. కృషి చేయాలి. అన్నిటికంటే ముందు మనం ఇచ్చే సర్వీసు పట్ల కస్టమర్లు సంతోషంగా ఉంటేనే ఎలాంటి బిజినెస్ అయినా ముందుకు వెళుతుంది. అభివృద్ధి చెందుతుంది. అంటే.. సర్వీస్ ఇవ్వడంతో పాటు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంపెనీలు రెస్పాండ్ అయ్యే తీరును బట్టే ఆ కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న మాట. ఈ విషయం అర్ధం అయింది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కాల్‌సెంటర్లు పుట్టుకొచ్చాయి. ఖండాలను దాటుకుని భాషాభేదాల్లేకుండా సర్వీసులు అందిస్తున్నాయి.

అంతవరకూ బానే ఉంది. కానీ.. అదే కస్టమర్ సర్వీసులకు కాస్త టెక్నాలజీని జోడిస్తే.. కేవలం కంప్లయింట్ తీసుకోవడంతోనే వదిలేయకుండా కాల్ చేసిన కస్టమర్‌కు పర్‌ఫెక్ట్ రెస్పాన్స్ అందించగలిగితే? ఇదే ఆలోచన వచ్చిందో యువతికి. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే కాగ్నికోర్ టెక్నాలజీస్!

image


సింధు జోసెఫ్. కేరళకు చెందిన 39 ఏళ్ల మహిళ, కాగ్నికోర్ టెక్నాలజీస్ కోఫౌండర్, సీఈవో. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మీద PhD చేస్తున్న సమయంలో సింధుకు వచ్చిన ఆలోచన.. మహావృక్షమైంది. స్పెయిన్, ఇండియా, అమెరికాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసుకోగలిగే స్థాయికి కంపెనీ వెళ్లింది. తన ఆంట్రప్రెన్యూర్ జర్నీతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలపై సింధు జోసెఫ్‌తో యువర్‌స్టోరీ ముచ్చటించింది.

అలా మొదలైంది..

బ్యాంకులోన్ తీసుకోవడం దగ్గర్నుంచి.. కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయడం, టిక్కెట్ బుక్ చేయడం ఇలా.. ప్రతీ సర్వీసులోనూ ఎక్స్‌పర్ట్ అసిస్టెన్స్ అన్నది చాలా కీలక అంశంగా మారిపోయింది. 2012లో బార్సిలోనా కేంద్రంగా మొదలైన కాగ్నికోర్ సరిగ్గా ఇదే పనిచేస్తుంది. కస్టమర్ల క్వశ్చన్లను అతి త్వరగా రెస్పాండ్ అవడంతో పాటు పర్సనలైజ్డ్ కస్టమర్ అసిస్టెన్స్‌ని అందిస్తోంది. కంపెనీ సీఈవో సింధు చెబుతున్నదాని ప్రకారం.. ప్రతీఏటా 27 వేల కోట్ల కస్టమర్ కాల్స్ లో 60శాతం వరకూ.. అంటే దాదాపు 16,200 కోట్ల కాల్స్‌కు ఎలాంటి పరిష్కారం దొరకడంలేదు.

“ ప్రతీ సక్సెస్‌ఫుల్ బిజినెస్ కూడా..కస్టమర్ కాల్స్‌కు పరిష్కారం చూపడానికే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి,” అంటారు సింధు

ప్రస్తుతం ఉన్న పోటీలో సమస్యకు సమాధానం కాదు.. పరిష్కారం ఇవ్వాలి. సరిగ్గా ఇదే విషయంలో చాలా కంపెనీలు ఫెయిల్ అవుతున్నాయి. కస్టమర్‌గా ఇలాంటి సమస్యను ఫేస్ చేసిన సింధు.. అందుకు కేవలం టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు లేకపోవడమేనన్న విషయాన్ని గుర్తించారు. మధ్యతరహా, పెద్ద పెద్ద వ్యాపారాలకు ఇది మరింత అవసరమంటారు సింధు.

కేరళ నుంచి బార్సిలోనా వరకూ..

కేరళలోని వాయనాడుకు చెందిన సింధు.. అక్కడే పదోతరగతి వరకూ చదువుకున్నారు. చిన్నతనం నుంచి జీవితమంటే ఏంటో తల్లిదండ్రులు నేర్పిన పాఠాలు ఆమెకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. పై చదువుల కోసం ఆంద్రప్రదేశ్‌కు వెళ్లిన ఆమె, భాష సమస్య రావడంతో ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. చెన్నయ్‌లోని స్టెల్లామేరీ కాలేజీలో గ్రాడ్యుయేషన్, కొచ్చిన్ యూనివర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. 

2000వ సంవత్సరంలో బెంగళూరులోని హనీవెల్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఒక వ్యక్తిని కలుసుకున్నారు సింధు. ఆయన్నే వివాహం చేసుకున్న తర్వాత వృత్తిరీత్యా బార్సిలోనాలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. అక్కడే స్ధానిక యూనివర్శిటీలో పీహెచ్ డీ చేశారు. రీజనింగ్‌పై ఎక్కువగా ఆసక్తి కనబర్చిన ఆమెకు .. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఏర్పడింది. దాని ప్రభావంతోనే సమస్యలను అధిగమించే తత్వం తనకు అలవాటైంది అంటారు సింధు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ పై అమితంగా ఆసక్తి ఉండేది. అందుకే.. అదే సబ్జెక్ట్స్ పై పీహెచ్ డీ కూడా పూర్తిచేశారు. ఆ తర్వాత ఏదైనా ఛాలెంజింగ్ టాస్క్ తీసుకోవాలని భావించి.. స్టార్టప్‌పై దృష్టిపెట్టారు.


image


బార్సిలోనా - కేరళ - అమెరికా

సింధు, తన భర్తతో కలిసి బార్సిలోనాలో కాగ్నికోర్ కంపెనీని స్థాపించారు. వెంచురా నుంచి రూ.55 లక్షల గ్రాంట్ తీసుకున్న తర్వాత కొన్ని కార్పొరేట్ కంపెనీలు, ఏంజల్ ఇన్వెస్టర్ల ద్వారా 2013లో ఆరున్నర కోట్ల రూపాయల ఫండింగ్ దక్కించుకుంది కంపెనీ. ఈ ఫండింగ్‌తో కొంతమంది యురోపియన్ టెలికామ్ కంపెనీలు క్లయింట్లుగా వచ్చాయి. తర్వాత మెల్లగా కేరళలో కంపెనీ స్థాపించి ఇండియాలో సేవలను ప్రారంభించారు.

"మోస్ట్ ఇన్నోవేటివ్ వెబ్ స్టార్టప్ ఇన్ యూరోప్"-తో సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను కాగ్నికోర్ ఇప్పటికే సొంతం చేసుకుంది. గత అక్టోబర్లో అమెరికాకు షిఫ్ట్ అయిన సింధు.. వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి 3 కార్యాలయాల్లో 20మంది పనిచేస్తున్నారు.

మార్కెట్ పై ప్రభావం

2022 నాటికి ఇంటలిజెంట్ వర్చువల్ ఏజెంట్ మార్కెట్ రూ. 33,930 కోట్లకు చేరుకుంటుంది. ఐబీఎంలాంటి అత్యుత్తమ కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌పై గతంలో ఎన్నడూ లేనంతగా ఫోకస్ పెడుతున్నాయి. ఈ పరిణామం తమలాంటి మరెన్నో కంపెనీలకు బూస్ట్ ఇస్తుందంటారు సింధు.

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ భవిష్యత్తు

మానవజాతిని తుడిచిపెట్టడానికే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వాడతారన్న అపోహ.. దానిలోని పాజిటివ్ కోణాలను చూడనీయకుండా చేస్తోంది అంటారు సింధు. ఇదే టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించవచ్చని, నిత్యజీవితంలో అది ఎంతగానో ఉపయోగపడుతుందని, కొన్ని కోట్లమందికి తమ పనులను సులువుగా చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని అంటున్నారు.

టెక్నాలజీ, మహిళలు

సమస్యల పరిష్కారంలో టెక్నాలజీది ఎప్పుడైనా కీలక పాత్ర అంటారు సింధు. అలాంటి సమస్యల పరిష్కారానికి తాను కృషిచేస్తుంటే.. తన బెటర్‌హాఫ్, కంపెనీ కోఫౌండర్ --దానితో ఒక అత్యుత్తమ ప్రొడక్ట్ ఎలా డెవలప్ చేయాలా అని నిత్యం ఆలోచిస్తుంటారు అని చెబుతున్నారు. చాలామంది మహిళలు పైస్థాయికి రాడానికి ఎంతో కష్టపడుతున్నారని, అందుకు కార్పొరేట్ల నుంచి ఆశించినంత సాయం మాత్రం అందడంలేదు అంటారు ఆమె.

“టెక్నాలజీ అనేది ఒక్కటే మనల్ని బతికించగలదు అని నేను నమ్మను. అందుకే.. ఎక్కువమంది మహిళలు టెక్నాలజీ వైపు రావాలని నేను భావించడంలేదు. కాకపోతే.. అది మహిళ అయినా మగవాళ్లయినా.. ఇంట్రస్ట్ ఉంటే మాత్రం దేనికీ వెనుకాడకుండా అనుకున్నది సాధించి తీరాలి“

మహిళలనే వివక్ష తాను కూడా స్వయంగా ఎదుర్కొన్నారు సింధు. కానీ.. నేను ఫైటర్‌ని, నా చేతలతోనే సమాధానం చెప్తాను అని ధీమాగా సమాధానం ఇచ్చారామె.