చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు

ఏడాదిపాటు ఓయూ సెంటినరీ సెలబ్రేషన్స్

చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు

Tuesday January 10, 2017,

3 min Read

తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ప్రభుత్వం, యూనవర్శిటీ సంయుక్తంగా ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో సెంటినరీ సెలబ్రేషన్స్ మూడు రోజుల పాటు ఘనంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికీ గుర్తండిపోయాలా ఏడాది పాటు కూడా ఈ ఉత్సవాలు జరపబోతున్నారు.

మొదటి మూడు రోజుల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనలను తెలంగాణ సాంస్కృతిక సారథి, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు మొత్తం 30 కమిటీలు వేస్తున్నారు. ఇందులో సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ, రిసెప్షన్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీలు ముఖ్యంగా పనిచేస్తాయి.

ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలకు కేంద్ర మానవ వనరుల శాఖ, ఏఐసీటీయు, యుజీసీలను ఆహ్వానించనున్నారు. కేంద్రం నుంచి ఆర్ధిక సాయం కోరాలని నిర్వాహక కమిటీలు భావిస్తున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజున.. అంటే ఏప్రిల్ 27న ఆలిండియా వీసీల సమావేశం జరగబోతోంది. 28న ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ నిర్వహించాలన్న విజ్ఞప్తికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం ఉంది.

ఉత్సవాలను పురస్కరించుకుని విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి నేటి వరకు ప్రచురణ అయిన వంద ఉత్తమ పబ్లికేషన్స్ తో పుస్తకం తీసుకురాబోతున్నారు. అదేవిధంగా ఉస్మానియాలో చదివి వివిధ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన వారి పుస్తకాలను కూడా విడుదల చేస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రను భావితరాలకు తెలియజేసేలా ఒక డాక్యుమెంటరీని కూడా రూపొందిస్తున్నారు

మరో వారం రోజుల్లో శతాబ్ది ఉత్సవాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి మరింత క్లారిటీ వస్తుంది. అనంతర సీఎం సమక్షలోనే ఉత్సవాల లోగో, బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ జరుగతుంది. అదే సందర్భంలో వెబ్ సైట్ కూడా ప్రారంభిస్తారు. మొత్తమ్మీద ఉస్మానియా సెంటినరీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిపేందుకు ఇటు ప్రభుత్వం, అటు విశ్వవిద్యాలయం సంసిద్ధంగా ఉన్నాయి.

image


చదువుల ఒడిలో చైతన్యదీప్తిగా పేరుగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 1918లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేతుల మీదుగా పురుడు పోసుకుంది. మొదటగా గన్ ఫౌండ్రీ ప్రాంతంలో 25 మంది సిబ్బందితో, 225 మంది విద్యార్ధులతో ఇంటర్మీడియెట్ సాయంకాలం కోర్సులతో ప్రారంభమైన విద్యాలయం, 1921లో బీఏ, 23లో ఎంఏ ఎల్‌ఎల్బీ, 1927లో మెడిసిన్, 1929లో ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభించారు. అన్ని విభాగాలు ఒకే ప్రాంగణంలో ఉండాలన్న ఉద్దేశంతో తార్నాక సమీపంలో 1300 ఎకరాల్లో క్యాంపస్ నిర్మించారు. అలా ఆర్ట్స్ కాలేజీ భవనానికి 1923లో పునాది పడింది. 1939నాటికి అది పూర్తయింది. మొదట ఉర్దూ మీడియంలో ఉన్న విశ్వవిద్యాలయం.. హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి మారింది.

ఆర్ట్స్ కళాశాల ఈజిప్టు కైరోలోని సుల్తాన్ హసన్ కళాశాలను పోలి ఉంటుంది. భవనం విస్తీర్ణం 2.5 లక్షల చదరపు అడుగులు. అన్ని వైపులా వెలుతురు ప్రసరించేలా నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. భవనం మధ్యలో లాండ్‌ స్కేప్ గార్డెన్లుంటాయి. పైభాగంలో రెండు విమానాలు నిలుస్తాయంటే ఆశ్చర్యపోతారు. పింకిష్ రాతి కట్టడాలు అజంతా, ఎల్లోరా శిల్పాలను పోలి ఉంటాయి. మొదటి, రెండవ అంతస్తులను పూర్తిగా షాబాద్ బండలతో నిర్మించారు. సెక్యులర్ భావాలను ప్రతిబింబించేలా ఈ కట్టడాన్ని నిర్మించారు. హిందూ దేవాలయ నిర్మాణాలను పోలి ఉండే సరెసనిక్, ఉస్మాన్ షాహీ, మధ్యఇస్లామిక్, అరబిక్, మూరిష్‌ లతో పాటు గోతిక్ శైలిలో దీని నిర్మాణం జరిగింది.

ఇక ఫ్యాకల్టీ, కోర్సుల వివరాల్లోకి వెళ్తే ఓయూలో మొత్తం 53 విభాగాలున్నాయి. 638 మంది టీచింగ్ స్టాఫ్ ఉంటే, నాన్ టీచింగ్ స్టాఫ్ 2428 మంది ఉన్నారు. 158 కాంబినేషన్లతో కూడా యూజీ ప్రోగ్రామ్స్ 25 ఉంటే, పీజీ కోర్సులు 75 ఉన్నాయి. పీజీ డిప్లొమాలో 27 కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎంఫిల్, పీహెచ్ డీ స్థాయిలో రెండు రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. క్యాంపస్ కాలేజీలు 8 ఉండగా, పీజీ సెంటర్లు 4, అకాడమిక్ సెంటర్లు 8 ఉన్నాయి. అతిపెద్ద లైబ్రరీ ఉస్మానియా సొంతం. అందులో 5.5లక్షల పుస్తకాలుండగా.. అందులో 5500 అరుదైన రాతలను భద్రపరిచారు. వెయ్యి అనుబంధ కాలేజీల్లో కలిపి ఐదున్నర లక్షల మంది విద్యార్ధులన్నారు.