డిజిటల్ తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలి- మోహన్ దాస్ పాయ్

Monday April 04, 2016,

1 min Read


తెలంగాణ డిజిటల్ ఎంపర్మెంట్ సాధించాలంటే ప్రతీ పౌరుడు వెబ్ కు కనెక్ట్ అవ్వాలని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ మోహన్ దాస్ పాయ్ అన్నారు. తెలంగాణ స్టార్టప్ పాలసీని లాంచ్ చేసిన మోహన్ దాస్ పాయ్.. రాష్ట్రవ్యాప్తంగా వెబ్ కనెక్టివిటీ జరగాలని అన్నారాయన. రాష్ట్రంలో ఐటి పెట్టుబడులతో పాటు స్టార్టప్ పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. 

1.డిజిటల్ శకం మొదలు కావాలి

తెలంగాణకి వస్తున్న పెట్టుబడులు హైదరాబాద్ కే పరిమితం కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెకి విస్తరించాలని మోహన్ దాస్ పాయ్ అన్నారు. దీనికోసం ప్రభుత్వం నడుం బిగించాలని ఆయన సూచించారు. స్టార్టప్ లపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడులను గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇకో సిస్టమ్ విస్తరించడానికి ఉపయోగించాలని అన్నారాయన. వెబ్ కనెక్టివిటీ ఉన్నప్పుడే అన్ని రంగాల్లో దూసుకు పోడానికి అవకాశాలుంటాయని మోహన్ దాస్ అన్నారు.

2. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ మారాలి.

విద్యాలయాలతో పాటు విద్యార్థులకు అందుబాటులోకి టెక్నాలజీ రావాలని మోహన్ దాస్ అన్నారు. సరికొత్త ఆలోచన ఆవిష్కరణగా మారాలంటే అది విద్యార్థులతోనే సాధ్యమవుతుందన్నారు. వారికి ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పుడు ఇది పెద్ద కష్టమేమి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు అన్ని విషయాలపై ఇంటరాక్ట్ కావాలంటే వారికి ఆన్ లైన్ సౌకర్యాలు అందించినప్పుడే అది సాధ్యపడుతుందని అన్నారాయన.

3.20వేల స్టార్టప్ లు

ప్రభుత్వం ఇదే తరహాలో ముందుకుపోతే తెలంగాణ నుంచి 20వేల స్టార్టప్ కంపెనీలు రావడం పెద్ద సమస్య కాదన్నారు. దేశ వ్యాప్తంగా లక్ష స్టార్టప్ లు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఇప్పుడు స్టార్టప్ లకు అనుకూల వాతావరణం దేశవ్యాప్తంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం ఆ రంగంలోనే పెట్టుబడులు పెట్టి అందరికంటే ఒక అడుగు ముందుకు వేయడం శుభ పరిణామంగా అభివర్ణించారు.