అటు వ్యాపారం.. ఇటు సామాజిక సేవ..

Friday March 11, 2016,

3 min Read


నది ఎటువైపు పయనించాలో… మార్గం ఎక్కడ మార్చుకోవాలా తానే నిర్ణయించుకుంటుంది. వ్యాపార రంగంలో రాణిస్తున్న ఈ ముగ్గురు మహిళలు కూడా తమ భవిష్యత్ కు తామే శిల్పులుగా మారారు. భర్తల చాటున ఉండాలనుకోలేదు… తమకంటూ పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు. అదే సంకల్పంతో విజయతీరాలను ముద్దాడారు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు తమను తాము మార్చుకుని.. ఆకాశంలో సగంకాదు… అంతకన్నా ఎక్కువే అంటున్నారా ముగ్గురు.

లత

1992లో భర్త పాండ్య రాజన్ తో కలిసి లత మాఫోయ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ కంపెనీ స్థాపించారు. అందులో ఆమె హెచ్చార్ హెడ్. అయితే ఏడాది తర్వాత తనను ఎవరైనా ఎండీగారి భార్య అనిపిలిస్తే ఉద్యోగం మానేస్తానని కండిషన్ పెట్టారు. ఎందుకంటే అలా పిలిపించుకోవడం ఇష్టం లేదు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఎన్నాళ్లు ఉద్యోగులంతా ఇంకా ఎండీగారి వైఫ్ అని పిలిచేది..? పైగా లత క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. సొంతంగా ప్రాక్టీస్ ఉంది. అన్నీ వదులుకొని భర్త కంపెనీలో చేశారు. అనుకున్నట్టే రెండేళ్లలోనే కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

మాఫోయ్ కంపెనీ ఎదుగుదలలో లత పాత్ర ఎంతో ఉంది. ఆ మాటకొస్తే భర్త కంటే ఎక్కువ బాధ్యతలు ఆమెనే మోశారు. ఈ విషయాన్ని భర్త కూడా అంగీకరిస్తారు. కంపెనీ అంతర్గత వ్యవహారాలన్నింటికీ ఆమెదే బాధ్యత. భర్త బిజినెస్ డెవల్ మెంట్, కస్టమర్ డీలింగ్స్ చూసుకుంటారు. బిజినెస్ తో పాటు మాఫోయ్ కంపెనీ సామాజిక బాధ్యత కూడా తలకెత్తుకుంది. దక్షిణ చెన్నైలో పేద చిన్నారులను ఆదుకుంటున్నారు. మరోవైపు మహిళా సాధికారతకోసం మైక్రో ఫైనాన్స్ యూనిట్ ను ప్రారంభించారు.

వరం పేరుతో మైక్రో ఫైనాన్స్ ప్రారంభించారు. 60వేల మంది మహిళలకు రుణాలిచ్చారు. దానికోసం ఏడున్నర కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. పూలు అమ్మేవారి నుంచి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారి వరకు.. ఎంతో మందికి తక్కువ వడ్డీకే అప్పులిస్తున్నారు. వారరందరికీ వరం ఒకరకంగా వరం అనుకోవాలి. స్వయంఉపాధి పొందాలనుకుని… సొంతంగా ఏమైనా చేద్దామనుకునే మహిళలను వరం ఆపన్నహస్తంలా ఆదుకుంటోంది. ఉత్తర చెన్నైలో ప్రారంభమైన వరం మైక్రోఫైనాన్సింగ్…   చత్తీస్ గడ్, మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాల్లోనూ సేవలందిస్తోంది.

అంతేకాదు ఏకం అనే ట్రస్ట్ ను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. చెన్నైలో స్పోర్ట్స్ అకాడమీని స్థాపించి అబ్బాయిలకు బాక్సింగ్ లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఈ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందినవారు జాతీయ స్థాయిలోనూ సత్తా చాటారు.

వీపీ రజనీరెడ్డి

చిన్నప్పుడు ఆర్కిటెక్ట్ కావాలని కలలు కనేవారు. పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉండే సివిల్ ఇంజనీరింగ్ లోనే పట్టుబట్టి చేరారు. కోర్స్ పూర్తయిన తర్వాత తన అంకుల్ కంపెనీలో చేరారు. మర్చెంట్ బ్యాంకర్ జీఆర్కే రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఢిల్లీలో కొంతకాలం ఉన్నాక చెన్నై షిప్ట్ అయ్యారు. భర్త అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. అయినా కానీ భర్త అడుగుజాడల్లో నడవాలనుకోలేదు. సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ కంపెనీ స్థాపించారు. 

ఒకసారి రజనీ రెడ్డి భర్త జీఆర్కే రెడ్డిని ఒకసారి విలేజ్ మాఫియా కిడ్నాప్ చేసింది. డబ్బులు భారీగా డిమాండ్ చేశారు. లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. అయినా రజనీ అదరలేదు బెదరలేదు. దాదాపు ఐదు రోజులు భర్త కిడ్నాపర్ల చెరలో ఉన్నాడు. అతని ప్రాణాలకు ఏమాత్రం హాని కలగకుండా.. చాలా చాకచక్యంగా డీల్ సెట్ చేశారు. ఐదురోజుల తర్వాత భర్త సేఫ్ గా ఇంటికొచ్చారు. ఆ ఫైవ్ డేస్ భర్తను విడిపించే టెన్షన్ లో ఉండి కూడా.. వ్యాపారం తాలూకు రోజువారీ వ్యవహారాలను చక్కగా నిర్వర్తించారు. 

ఇంతలో అట్లాంటా సాఫ్ట్ వేర్ కంపెనీ దాదాపు దివాలా తీసింది. పెట్టుబడులు పెడతామన్న ఇద్దరు పార్ట్ నర్స్ మధ్యలోనే హ్యాండిచ్చారు. అయినా వెనక్కి తగ్గలేదు. సాఫ్ట్ వేర్ కంపెనీని ఔట్ సోర్సింగ్ కంపెనీగా మార్చేశారు. 1999లో ఆర్ఆర్ ఇన్ఫోటెక్ స్థాపించారు. 2008లో దానిపేరును ఎగ్జెంప్లర్ గా మార్చారు. అమెరికా క్లైంట్ల కోసం మెడికల్ బిల్లింగ్, మెడికల్ ట్రాన్స్ క్రిప్షన్ సేవలందిస్తోందా కంపెనీ. ఒకప్పుడు ఏం పనిలేక వ్యాపారం చేస్తున్నది అని అనుకున్నవారంతా.. ఇప్పుడు రజనీ ప్రతిభను, ఆమె ధైర్యాన్ని గుర్తిస్తున్నారు. 

కొంతకాలం తర్వత రజనీరెడ్డి విట్ అనే సంస్థను ప్రారంభించారు. ఐటీ రంగంలో అమ్మాయిలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో దాన్ని స్థాపించారు. శిక్షణతో పాటు పేదల పిల్లల కోసం మహిళా సాధిరాతకోసం రజనీ పాటుపడుతున్నారు.

అముధ

రిటైల్ రంగం దిగ్గజం కెవిన్ కేర్ గ్రూప్ ఛైర్మన్ రంగనాథన్ పెద్ద కుమార్తె అముధ. తన కజిన్ ను స్ఫూర్తిగా తీసుకుని విజువల్ కమ్యూనికేషన్స్ చదివారు. తర్వాత కెవిన్ కేర్ గ్రూప్ లోని రిటైల్ సేల్స్, రెస్టారెంట్స్, ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేశారు. తండ్రి సంస్థలో పనిచేస్తే తనకేం గుర్తింపు వస్తుందనుకున్నారో ఏమో…ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు. ఫాదర్ సపోర్ట్ కూడా దొరికడంతో చిన్నపిల్లలకోసం ఒక స్కూల్ ప్రారంభించారు. 

చిన్నారుల కోసం స్కూల్ స్టార్ట్ చేసిన అముధ… అంతకన్నా ముందు పిల్లపై రీసెర్చ్ చేశారు. దేశమంతా తిరిగి స్కూల్స్ ను పరిశీలించి కనోపో పేరుతో స్కూల్ స్థాపించారు. తల్లులకు, పిల్లలకు కూడా సరిపోయేలా సొంతంగా కరికులమ్ రూపొందించారు. పది నెలల వయసున్న పిల్లను సైతం స్కూల్ లో చేర్చుకుంటున్నారు. వారి పెంపకం విషయంలో తల్లులకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లలకు ఐదున్నరేళ్ల వయసు వచ్చేటప్పటి నుంచి ప్రకృతితో ఎలా మెలగాలి, పెద్దవారితో ఎలా ఉండాలన్న దానిపై అవగాహన తీసుకొస్తున్నారు. సభ్యత, సంస్కారం అన్నీ స్కూల్స్ స్థాయినుంచే తీసుకురావాలని అముధ ప్రయత్నిస్తున్నారు.

undefined

undefined


కేవలం భర్తల చాటునే ఉండకుండా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనే ఈ ముగ్గుర్నీ ఈ స్థాయిలో నిలబెట్టింది.