30 ఏళ్ల క్రితమే 'మేక్ ఇన్ ఇండియా'

లెదర్ యాక్సెసరీస్ లో ట్రెండ్ సృష్టిస్తున్న 'టొరెరో'టాప్ బ్రాండ్ల లైసెన్సులు పొందడమే లక్ష్యంఫ్యూచర్ లో బ్రాండ్లనూ సొంతం చేసుకుంటామని ధీమా

30 ఏళ్ల క్రితమే 'మేక్ ఇన్ ఇండియా'

Thursday July 02, 2015,

5 min Read

మేనేజ్ మెంట్ కుర్రాళ్లకు చెప్పే పాఠాల్లో ఒకటి విన్-విన్ ఫార్ములా. అంటే మనం గెలవాలి. ఎదుటివాళ్లను గెలిపించాలి. ఎదుటివారి గెలుపుతోనే మన గెలుపు సాధ్యం. మన గెలుపుతో ఎదుటివారి విజయం ముడిపడి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఫార్ములాను అమలుపరిచి ప్రపంచవ్యాప్తంగా లెదర్ యాక్సెసరీస్ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది టొరెరో గ్రూప్. ఈ సంస్థది 30 ఏళ్ల శ్రమ. కొత్త ఒరవడిని అందిపుచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేయడంలో పెద్ద కష్టమే దాగి ఉంది. ఇంతకీ టొరెరో కథ ఎక్కడ మొదలైంది? ఎలా మొదలైంది?

30 ఏళ్ల క్రితమే 'మేక్ ఇన్ ఇండియా'

మేక్ ఇన్ ఇండియా... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుపెట్టిన క్యాంపైన్ ఇది. కానీ... 30 ఏళ్ల క్రితమే ఇలాంటి ఆలోచన ఒకరికి వచ్చిందంటే ఎంతటి ముందు చూపో అర్థం చేసుకోవచ్చు. నాలుగువేల మంది ఉద్యోగులు, 30 ఏళ్ల చరిత్ర, ఏటా 20 మిలియన్ డాలర్ల వ్యాపారం ఈ కంపెనీ సొంతం. వాల్డ్ క్లాస్ లెదర్ యాక్సెసరీస్ తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చెయ్యడం వీరి పని. లెదర్ యాక్సెసరీస్ బిజినెస్ లో టొరెరో గ్రూప్ కు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ క్లూజీవ్ లైసెన్స్ ఉంది. యువ పారిశ్రామికవేత్త సారథ్యంలో టొరెరో గ్రూప్ పరుగులు తీస్తూ నలభై దేశాలకు లెదర్ ఉత్పత్తులను ఇండియా నుంచి ఎగుమతి చేస్తోంది.

image


ఎలా మొదలైందంటే...

రాజేష్ గుప్తా. కాన్పూర్ వాసి. తన భూమిని తిరిగి సొంతం చేసుకోవడం కోసం 1985లో కలకత్తా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అతని కుటుంబం రెండు తరాలుగా వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. రాజేష్ గుప్తా కూడా వ్యాపారం వైపు అడుగులు వేశాడు. 1988లో మెట్రోపోలి ఫ్యాషన్స్ ను ప్రారంభించాడు. సరిగ్గా అప్పుడే భారత ప్రభుత్వం తోలు పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ఇది రాజేష్ కు కలిసివచ్చింది. చవకైన లెదర్ యాక్సెసరీస్ ను తయారు చేసి అమెరికా, యూరప్ దేశాలకు పెద్ద సంఖ్యలో ఉత్పత్తులను ఎగుమతి చేశాడు. కానీ అప్పుడే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో ఓ దిగుమతిదారుడు డబ్బులివ్వకుండా చేతులెత్తేసి కంపెనీని దివాలా తీశాడు. దీంతో మెట్రోపోలి ఫ్యాషన్స్ కు చిక్కులు తప్పలేదు. కానీ రాజేష్ గుప్తా ఏమాత్రం చెక్కుచెదర్లేదు. తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ కంపెనీని కాపాడాడు. 1991లో తిరిగి పరిశ్రమను ప్రారంభించాడు.

ధర నుంచి క్వాలిటీ వైపు...

అప్పటి వరకు ధరల విషయంలో పోటీపడ్డ కంపెనీ... అమెరికాలో జరిగిన అనుభవం నుంచి మంచి గుణపాఠం నేర్చుకుంది. ఈసారి నాణ్యతపై దృష్టిపెట్టి ఉత్పత్తులను తయారుచెయ్యడం మొదలుపెట్టారు. తర్వాత పదేళ్లలో కంపెనీలో చాలా మార్పుచేర్పులు చేశారు. అంతకుముందు యూఎస్ కు ఎగుమతి చేసిన తక్కువ ధర ఉత్పత్తులపై అసలు దృష్టే పెట్టలేదు. ఫోకస్ అంతా యురోపియన్ దేశాలతో పాటు స్కాండినేవియన్ ప్రాంతాలపై నిలిపారు. హై క్వాలిటీ లెదర్ తయారీకి కావాల్సిన శక్తి సామర్థ్యాలను సమకూర్చుకున్నారు. కొద్ది కాలంలోనే కీర్తిప్రతిష్టలను సంపాదించుకుంది ఈ కంపెనీ. అంతే కాదు... గ్లోబల్ బ్రాండ్స్ అయిన హ్యుగో బాస్, డీకేఎన్ వై లాంటి సంస్థల కోసం లెదర్ యాక్సెసరీస్ తయారీని ఇండియాలో చేయడం మొదలుపెట్టింది. మెట్రోపోలి ఫ్యాషన్స్ లీడర్ షిప్ టీమ్ ఆశావాహ దృక్పథంతో అభివృద్ధివైపు అడుగులు వేసింది.

image


స్పానిష్ తో భాగస్వామ్యం... టర్నింగ్ పాయింట్

కొన్ని దశాబ్ధాలుగా ప్రపంచానికి లగ్జరీ ఉత్పత్తులు అందిస్తున్న మారోక్వినేరియా సంస్థ... భారతదేశంలో మెట్రోపోలి ఫ్యాషన్స్ అభివృద్ధి చూసి అబ్బురపోయింది. మెట్రోపోలి ఫ్యాషన్స్ తో చేతులు కలిపింది. మారోక్వినేరియా సంస్థకు చెందిన పెడ్రో మాంటెరో అప్పటికే గాగో మాంట్ బ్లాంక్, బాలెన్సిగా, హ్యుగో బాస్ లాంటి కంపెనీలకు ఉత్పత్తులను అందిస్తున్నారు. 1990వ దశకంలో స్పెయిన్ లో నిర్మాణ రంగంలో బూమ్ వచ్చింది. కానీ ఆ బూమ్ ని అందిపుచ్చుకోవడానికి కావాల్సిన స్కిల్డ్ లేబర్ పెడ్రోకు దొరకలేదు. అందుకే ఇండియాకు చెందిన మెట్రో పోలి ఫ్యాషన్స్ పై ఆధారపడాల్సి వచ్చింది. 2000 వ సంవత్సరంలో ఈ రెండు కంపెనీల మధ్య భాగస్వామ్యం కుదిరింది. అప్పట్నుంచీ ఈ రెండు కంపెనీలు జోడు గుర్రాల్లా అభివృద్ధి వైపు దూసుకెళ్లడం మొదలుపెట్టాయి. ఉత్పత్తుల్లో హై క్వాలిటీ కోసం సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు పెడ్రో. 15 ఏళ్లపాటు స్పానిష్ మేనేజర్లు ఇండియాకు రావడం, టెక్నాలజీని అందించడం, శిక్షణ ఇవ్వడం, క్వాలిటీ తగ్గకుండా చూసుకోవడంతో వీరి ఉత్పత్తులకు మంచి గిరాకీ లభించింది. మెటీరియల్, డిజైన్లు స్పెయిన్ నుంచి వచ్చేవి. ఉత్పత్తులు ఇండియాలో తయారయ్యేవి. అలా... దశాబ్దాల క్రితమే మేక్ ఇన్ ఇండియాకు శ్రీకారం చుట్టారు రాజేష్ గుప్తా. 2007 నాటికి మెట్రోపోలి అతిపెద్ద లెదర్ యాక్సెసరీస్ తయారీ సంస్థగా పేరు తెచ్చుకుంది. స్పెయిన్ లోని డిపార్ట్ మెంట్ స్టోర్లల్లో లెదర్ ఉత్పత్తులను అమ్మే అతి పెద్ద సంస్థగా మారోక్వినేరియా పేరు మార్మోగింది. మారోక్వినేరియా సంస్థకు 11 ఫ్యాక్టరీలు ఉంటే వాటిలో ఎనిమిది ఇండియాలోనే ఉన్నాయి

పాత ప్రపంచం VS కొత్త జోరు

రాజేష్ గుప్తా తనయుడు యశోవర్ధన్ గుప్తా ఎంట్రీతో కంపెనీ రూపురేఖలన్నీ మారిపోయాయి. యశోవర్ధన్ గుప్తా కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేశాడు. పీజీ తర్వాత జేఎస్ పీఎల్ ఛైర్మన్ నవీన్ జిందాల్ తో కలిసి ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా పనిచేశాడు. తన వ్యూహాలతో 18 బిలియన్ డాలర్ల మల్టీనేషనల్ కంపెనీ అభివృద్ధికి తోడ్పడ్డాడు. "జిందాల్ తో కలిసి రెండున్నరేళ్లు కలిసి పనిచెయ్యడం నా జీవితంలో ప్రేరణగా నిలిచింది." అంటాడు యశోవర్ధన్. 2009 వ సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన యశోవర్ధన్ ఫ్యామిలీ బిజినెస్ లో అయిన మెట్రోపోలి ఫ్యాషన్స్ లో అడుగుపెట్టాడు. అలా అడుగుపెడుతూనే కంపెనీలో లోటుపాట్లు, లాభనష్టాలు, ఆదాయ వ్యయాల లెక్కలపై ఓ అంచనాకు వచ్చాడు. ఇన్నాళ్లూ క్వాలిటీపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కంపెనీ వ్యయం పెరిగిందని గుర్తించాడు. 2500 మంది ఉద్యోగులున్న కంపెనీ ఎలాంటి వ్యూహం లేకుండా పనిచేస్తుందని తెలుసుకున్నాడు. సంస్థకు సపోర్ట్ గా నిలిచిన ఐటీ సిస్టమ్స్ కూడా పురాతనమైనవని అర్థమైంది. సంస్కరణలు చేసేందుకు రంగంలోకి దిగాడు. అవసరమైన ఉద్యోగులను నియమించుకోవడం, బద్ధకస్తుల్ని వదిలించుకోవడం లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. టెక్నాలజీని సంస్కరించాడు. పురాతనమైన బిజినెస్ మోడల్ ఈ కాలానికి పనికిరాదని గుర్తించి కొత్త దృక్పథంతో రంగంలోకి దూకాడు. చేయాల్సిన సంస్కరణలపై స్పానిష్ వ్యాపారి పెడ్రోకు మొత్తం వివరించాడు. యశోవర్ధన్ పెడ్రోకు బాగా నచ్చాయి. ప్రపంచస్థాయి లైసెన్సులు సంపాదించడానికి చేయాల్సిన వాటికల్లా గ్రీన్ సిగ్నల్ దొరికింది.

image


బర్త్ ఆఫ్ టొరెరో

మెట్రోపోలి ఫ్యాషన్స్ నుంచి మరో సంస్థను పుట్టించాడు యశోవర్ధన్. అదే టొరెరో. మెట్రోపోలికి ఉన్న గుర్తింపు తగ్గకుండా టొరెరోను మార్కెట్లోకి తీసుకొచ్చాడు. ప్రపంచస్థాయి బ్రాండ్లతో టై-అప్ కోసం యశోవర్ధన్ పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు.

"రెండేళ్ల పాటు నేను సెలవు కూడా తీసుకోలేదు. 24 గంటలు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాను. ప్రపంచంలోని పలు బ్రాండ్ల దగ్గరకు వెళ్లాను. నేవ మైళ్లు ప్రయాణించాను" అని ఆ రెండేళ్ల కష్టం గురించి చెబుతాడు యశ్.

ప్రముఖమైన బ్రాండ్ ఉండి... ఉత్పత్తి అవకాశాల్లేని సంస్థ కోసం వెతుకుతుండగా క్రాస్ సంస్థ కనిపించింది. 1846లో రోడ్ ఐలాండ్ లో క్రాస్ సంస్థ మొదలైంది. లెదర్ ఉత్పత్తుల్లో వారి బ్రాండ్ ను అభివృద్ధి చేద్దామనుకున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇదే టొరెరో గ్రూప్ కు ప్లస్ పాయింట్ అయింది. అలా క్రాస్ సంస్థతో భాగస్వామ్యం కుదిరింది. క్రాస్ హెడ్ క్వార్టర్స్ తో పాటు యూరప్ లోని క్రాస్ ఆఫీసులకు డజన్ సార్లకు పైగా వెళ్లాడు యశ్. ఆ బ్రాండ్ పేరుతో లాంగ్ టర్మ్ లైసెన్స్ వచ్చింది.

image


మరిన్ని లైసెన్సులే టార్గెట్

మాతృసంస్థ అయిన మెట్రోపోలీ నుంచి నేర్చుకున్న పాఠాలతో కొత్త వ్యూహాలు రూపొందించాడు యశ్. మేధా సంపత్తి, డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, సమర్థవంతమైన వ్యాపార నిర్వహణ... టొరెరోను నడిపించే శక్తులివి. అంతే కాదు సరికొత్త టెక్నాలజీ, ఆపరేషన్స్, సేల్స్, హెచ్ఆర్ లాంటి విభాగాలకు ప్రొఫెషనల్ మేనేజర్లతో ఎక్కడా ఏ లోటు లేకుండా సంస్థను నడిపిస్తున్నాడు యశోవర్ధన్. ఐఎస్ బీలో తన స్నేహితుడైన వరుణ్ నారాయణ్ ను సీఓఓగా నియమించుకున్నాడు. వీరి కృషి ఫలితంతోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. టొరెరో రూపొందించిన క్రాస్ క్లాసిక్ సెంచరీ గ్లోబల్ పాస్ పోర్ట్ వ్యాలెట్ కు ప్రతిష్టాత్మక ఫ్రంటియర్ బయర్స్ ఫోరమ్ సీల్ ఆఫ్ అప్రూవల్ దక్కింది. ఇక బ్లూటూత్ సౌకర్యం ఉన్న యాంటీ థెఫ్ట్, లాస్ ప్రూఫ్ ప్రొటెక్షన్ క్రాస్ గ్రాబెడో టెక్+ వ్యాలెట్ కు రెడ్ డాట్ అవార్డ్స్ 2015 పురస్కారం దక్కింది. ఐదు వేల దేశాలు ఎంట్రీ ఇస్తే టొరెరో రూపొందించిన వ్యాలెట్ కు పురస్కారం రావడం గొప్ప విషయమే. క్రాస్ సంస్థ కోసం ఉపయోగించిన మోడల్ కోసం మరిన్ని బ్రాండ్స్ క్యూకట్టాయి. ఇలా మరిన్ని లైసెన్సులను పొందడమే ఈ సంస్థ లక్ష్యం.

"మేం ప్రస్తుతం లైసెన్సులను సొంతం చేసుకుంటున్నాము. భవిష్యత్తులో మొత్తం బ్రాండ్లను ఎందుకు సొంతం చేసుకోలేం" అంటూ భవిష్యత్తు గురించి ఉత్సాహంగా చెబుతున్నాడు యశ్.

సొంత బిజినెస్ ను ప్రపంచవ్యాప్తంగా పరుగులు తీయిస్తున్న యశోవర్ధన్... ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో గెస్ట్ లెక్చర్స్ ఇస్తున్నాడు. ఎంబీఏ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆపరేషన్స్ మేనేజ్ మెంట్ లో పాఠాలు చెబుతున్నాడు.