నాడు నిరుపేద కుటుంబం.. నేడు వందల మందికి ఉపాధినిచ్చే వ్యాపార రంగం

ముళ్లబాటనే పూలబాటగా మార్చుకున్న రాజు సక్సెస్ స్టోరీ

నాడు నిరుపేద కుటుంబం.. నేడు వందల మందికి ఉపాధినిచ్చే వ్యాపార రంగం

Saturday January 28, 2017,

4 min Read

ఆకలి దేన్నయినా నేర్పిస్తుంది. ఆకలి-అన్వేషణ ఎలా చేయాలో మార్గం చూపుతుంది. ఆకలి-పోరాటం ఎలా సాగించాలో నేర్పుతుంది. ఆకలి-అందివచ్చిన అవకాశాలను ఎలా ఒడిసిపట్టాలో బోధిస్తుంది. అలా అన్వేషించిన వాడికి అవకాశం దానంతట అదే తలుపుతడుతుంది. దాన్ని ఒడిసిపట్టుకున్నవాడే తెలివైనోడు. రాజుజోషి కథ కూడా అలాంటిదే. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, 1,250 రూపాయల జీతంతో, చాలీచాలని జీవితాన్ని నెట్టుకొచ్చి.. ఇవాళ వాటర్ ట్రీట్మెంట్ బిజినెస్ లో తిరుగులేని ఆంట్రప్రెన్యూర్ అయ్యాడు. పేదరికంతో అమ్మకు నాన్న సరైన వైద్యం చేయించలేని దైన్య స్థితి నుంచి, నేడు వందల మందికి ఉపాధి కల్పించే బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఔత్సాహిక ఆంట్రప్రెన్యూర్లకు స్ఫూర్తిరగలించే రాజు జోషి కథ మీరే చదవండి.. 

రాజు జోషి. పుట్టిపెరిగిందంతా థానేలో. ముత్తాతల కాలంలోనే కరాచీ నుంచి వలస వచ్చారు. మధ్యతరగతి కుటుంబం. అమ్మ, నాన్న, చెల్లి. తండ్రి సహకారీ భండార్ లో(ఇప్పుడు సూపర్ మార్కెట్లు అని పిలుస్తున్నారు) పనిచేసేవాడు. బొటాబొటి జీతం. కనీస అవసరాలకు కూడా సరిపోయేది కాదు. ఒక చిన్నగదిలో ఉండేవాళ్లు.

image


వీధి బడిలో చదివిస్తే నలుగురిలో నామూషీ అని, ఫీజు కట్టే స్తోమత లేకపోయినా, తాహతుకు మించి ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాడు తండ్రి. ఎందుకంటే వాళ్లుండే ఏరియాలో అందరూ ఎగువ మధ్యతరగతి ప్రజలు. వాళ్లంతా సింధీలు. వాళ్ల జీవన శైలి వేరు. అలాంటి ఏరియాలో ఉన్నప్పుడు, కనీసం పిల్లల్ని అయినా పేరున్న బడిలో చదివించాలని తండ్రి తపన పడ్డాడు. అందుకే వాళ్లకుండే డబుల్ బెడ్రూం ఫ్లాట్ అద్దెకిచ్చి, అందులోని ఒక గదిలో వీళ్లు సర్దుకున్నారు. అలా మనీ వాల్యూ ఏంటో పిల్లలకు చిన్నప్పుడే తెలిసొచ్చింది. బంధువుల ముందు నవ్వులపాలు కావొద్దంటే డబ్బు సంపాదించాలని చిన్నప్పుడే ఎంతో మెచ్యూర్డ్ గా ఆలోచించారు పిల్లలు.

రాజు జోషి పదో క్లాసుకి రాగానే ఆర్ధికంగాఇబ్బంది ఎదురైంది. ఫ్లాట్ అమ్మాలని నిర్ణయించారు. వచ్చిన డబ్బుని షేర్ మార్కెట్లో పెట్టారు. అందరూ ఒక చిన్నఇంటికి షిఫ్ట్ అయ్యారు.

రోజులు గడిచాయి. రాజు ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు. ఎస్సెల్ ప్యాకేజింగ్ అనే ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగానికి కుదరాడు. జీతం నెలకు రూ.1250. ఆ మాత్రం వచ్చినందుకైనా సంతోషించాడు. కానీ అంతకంటే సంతోషం ఎప్పుడు కలిగిందంటే.. వాళ్ల సెక్షన్ ఇంచార్జ్ బీఏ మ్యూజిక్ చేశాడని, అతను మీడియా మొఘల్ జీ టీవీ అధినేత సుభాష్ గోయెల్ కు క్లోజ్ ఫ్రెండ్ అని విన్నాడు. సుభాష్ గోయెల్ ని రాజు మూడుసార్లు కలిశాడు కూడా.

image


సరే సంగతి కాసేపు పక్కన పెడితే, ఇల్లు అమ్మి షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బులు.. హర్షద్ మెహతా కుంభకోణం మూలంగా పైసా లేకుండా ఊడ్చుకు పోయాయి. మళ్లీ జీవితం మొదటికొచ్చింది. చేసేదేంలేక తిరిగి సింగిల్ బెడ్రూం ఫ్లాట్ లోకి షిఫ్టయ్యారు. ఈలోగా రాజు ఉద్యోగం కూడా మారిపోయింది. అటు ఫుల్ టైం, ఇటు పార్ట్ టైం జాబ్ చేశాడు. రేయింబవళ్లు కష్టపడ్డాడు. రోజులు గడిచాయి. కొంతడబ్బు కూడబెట్టి చెల్లి పెళ్లి చేశారు.

ఆ టైంలో గల్ఫ్ లో జాబ్ ఆఫర్ వచ్చింది. నాలుగేళ్లు అక్కడ పనిచేయాలనే ఒప్పందంతో వెళ్లాడు. ఒకరోజు సడెన్ గా ఇంటినుంచి కాల్ వచ్చింది. అమ్మ ఆరోగ్యం బాగాలేదు వెంటనే రమ్మని.. ఫోన్ సారాంశం. చేసేదేంలేక తిరుగు గల్ఫ్ నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. అమ్మకు పల్మనరీ ఫైబ్రోసిస్. వ్యాధి అప్పుడప్పుడే ముదురుతోంది. తల్లిని చూసుకునేవాళ్లు ఎవరూ లేక, ఉద్యోగం వదిలి వచ్చేశాడు. ఆమె ఆలనాపాలనా చూసుకున్నాడు. వ్యాధి కొంత నయమైంది. అంతలోనే సింగపూర్ నుంచి ఆఫర్ వచ్చింది. అక్కడ ఏడాది పాటు పనిచేశాడు. మళ్లీ తల్లికి వ్యాధి తిరగబెట్టిందని ఫోనొచ్చింది. రాజు పెర్మనెంటుగా ఇండియాకి వచ్చేశాడు.

image


స్థానికంగా కెన్ స్టార్ కంపెనీలో బ్రాంచ్ సర్వీస్ మేనేజర్ గా జాయినయ్యాడు. అప్పుడే రాజుకి పెళ్లికుదిరింది. మూడేళ్లు ఆ కంపెనీలో పనిచేశాడు. కానీ జీతం మాత్రం గొర్రెతోకలాగే ఉంది. తను విదేశాల్లో తీసుకున్న జీతంతో పోల్చుకుంటే, వీళ్లిచ్చేది అందులో సగం కూడా కాదు.

వన్ ఫైన్ డే, ఎల్జీ కంపెనీ వాళ్లు ఒక మంచి ఫ్రాంచైజీ కోసం వెతుకుతున్నారని తెలిసింది. ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి కలిశాడు. ఒక భాగస్వామిని వెతుక్కుని ఫ్రాంచైజీ తీసుకున్నాడు. బిజినెస్ బాగానే రన్నయింది. ఏడాది తిరిగోలోగా ఎల్జీ నుంచి మరో ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఈసారి ఏసీలు. అలా ప్రతీ ఏడాది కొత్త కొత్త కంపెనీలతో బ్రాంచీలు ఓపెన్ చేస్తూ పోయారు. టాటా స్కై, ఎయిర్ టెల్ డీటీహెచ్ లాంటి ఫ్రాంచైజీలతో వ్యాపారాన్ని విస్తరించారు. ఆ సమయంలోనే ఒక ఎల్జీకి చెందిన ఒక మేజర్ ప్రాజెక్టు చేతుల్లోకి వచ్చింది. ట్రాన్స్ పోర్టులో డామేజీ అయిన వస్తువుల్ని రిపేర్ చేసి, మళ్లీ వాటిని కొత్తవాటిలా చేయడం. పైలల్ ప్రాజెక్టు కింద చేశారు. అది లక్కీగా క్లిక్కయింది. స్వయాన కొరియన్ వాళ్లే చూసి శెభాష్ అన్నారు.

image


2011లో నోకియా ఫోన్ సర్వీస్ సెంటర్ ఒకటి ఓపెన్ చేశారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అది ప్రారంభించిన రోజే.. రాజు తండ్రి గుండెపోటుతో కన్నుమూశాడు. నాన్న మరణం రాజని కుంగదీసింది. ఒక వైపు అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఇటు ఫాదర్ దూరమయ్యాడు. ఒకరకమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. కొన్నాళ్లు శూన్యం. తల్లినైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో, ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడు. టైంకి మందులు, మెరుగైన చికిత్స చేయించాడు. ఆవిడ నెమ్మదిగా కోలుకుంటోంది అనుకునేలోపే, సడెన్ గా తల్లికూడా కన్నుమూసింది. తండ్రి చనిపోయి ఏడాది తిరగకముందే అమ్మ కూడా తనను విడిచిపెట్టి వెళ్లిపోయింది.

రాజు మరింత కుంగిపోయాడు. ఆఫీసుకు వెళ్లడం లేదు. బిజినెస్ ఎలా నడుస్తుందో పట్టించుకోలేదు. ఏడాదిన్నర పాటు అటు మొహమే చూడలేదు. జీవచ్ఛవంలా బతికాడు. రాజు భార్యే ఆఫీసు బాధ్యతలు చూసుకునేది. వందమంది ఉద్యోగులు. వాళ్లకు జీతాలివ్వడం, స్టాక్, అమ్మకాలు.. వగైరా వగైరా ఆమెనే చేసేది. ఇంకా ఎన్నాళ్లిలా అనుకుని తనకు తాను సర్దిచెప్పుకుని మళ్లీ ఆఫీసు బాట పట్టాడు.

image


మళ్లీ నోకియాతో ఒప్పందం కురిరింది. ఆ టైంలోనే సామ్ సంగ్ వాళ్లు కూడా అవకాశం ఇచ్చారు. మునిగిపోయే నావలాంటి నోకియా ఎందుకులే అనుకుని, సామ్ సంగ్ తో ఫిక్సయ్యారు.

అలా సామ్ సంగ్ తో బిజినెస్ రన్నవుతున్న క్రమంలోనే, నాగ్ పూర్ కు చెందిన అభిఅన్ష్ టెక్నాలజీతో కొలాబరేట్ అయ్యారు. అదొక చిన్నపాటి వాటర్ ట్రీట్మెంట్ బిజినెస్. దానికి ఒక పేరున్న జెర్మనీ కంపెనీ టెక్నికల్ సపోర్ట్ చేసింది. వెంటనే నెక్సీ అనే సింగపూర్ బేస్డ్ కంపెనీతో అసోసియేట్ అయ్యారు. ఇటీవలే కెనడియన్ సంస్థతోనూ టై అప్ అయ్యారు. ఆ సంస్థకు ఇండియాలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ బిజినెస్ ఒక రేంజిలో ఉంది. సంస్థ మంచి లాభాల్లో ఉంది. వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

త్వరలో కన్స్యూమర్ డ్యూరబుల్ ఇన్సూరెన్స్ సర్వీసుని అందుబాటులో తీవాలనే ప్లాన్ లో ఉన్నారు. అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలు పెట్టామంటున్న రాజు జోషి.. మరెంతో దూరం వెళ్లాల్సి ఉందని అంటున్నాడు.

రచయిత: అర్వింద్ యాదవ్, ఇండియన్ లాంగ్వేజెస్ మేనేజింగ్ ఎడిటర్, యువర్ స్టోరీ

అనువాదం: యువర్ స్టోరీ తెలుగు