ఆర్థిక సలహాలకు 'అడ్వైజర్ ఖోజ్‌'లో వెతకండి

ఫైనాన్షియల్ ప్లానింగ్ సహా ఆర్థిక సేవకుల సెర్చ్ ఇంజిన్ఆర్థిక వ్యవహారాలకు జస్ట్ డయల్ తరహా సేవలు 25 ఏళ్ల అనుభవంతో అడ్వైడర్ ఖోజ్ ఏర్పాటు చేసిన ప్రదీప్బీమా ఏజెంట్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ఇప్పుడు అడ్వైజర్ ఖోజ్‌లో దాదాపు 40 వేల మంది ఆర్థిక సలహాదార్లు

ఆర్థిక సలహాలకు 'అడ్వైజర్ ఖోజ్‌'లో వెతకండి

Monday July 20, 2015,

3 min Read

మన దేశంలో యువతకు కొదవేం లేదు. ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా యూత్ ఎక్కువగా ఉన్న దేశం మనదేనని ఇప్పటికే ఎన్నో సార్లు విన్నాం. వింటూనే ఉన్నాం. అయితే 35 ఏళ్ల లోపు ఉన్న వాళ్ల సంఖ్య భారత్‌లో 65 శాతం వరకూ ఉందనేది ఓ లెక్క. ఒకవేళ ఇదే నిజమైతే వీళ్లందరికీ మున్ముందు అద్భుతమైన భవిష్యత్ ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా సంపాదించే వయస్సు. నాలుగు గంటలు ఎక్కువగా కష్టపడైనా నాలుగు రాళ్లు వెనకేయగలిగే సత్తా ఉ్న వయస్సు. ఇదే సమయంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఎంతో అవసరం. ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు.. ఎంత పొదుపు చేశావు, ఎక్కడ పొదుపు చేశావనేదే ఇప్పుడు ముఖ్యమైంది. ఇలాంటి వాళ్ల కోసమే పుట్టుకొచ్చింది అడ్వైజర్ ఖోజ్.

అడ్వైజర్ ఖోజ్ టీమ్

అడ్వైజర్ ఖోజ్ టీమ్


పది ఇళ్లకు ఓ ఎల్ఐసి బ్రోకర్, వీధికో ఇన్సూరెన్స్ బ్రోకర్, సందుకో షేర్ అడ్వైజర్ ఉన్న రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. ప్రతీ ఒక్కరూ ఏజెంట్ అని చెప్పుకుంటారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్లే కనిపిస్తారు. కానీ వీళ్లనుంచి నిపుణులైన వారిని ఎంపిక చేసుకోవడానికి పుట్టుకొచ్చిన సంస్థ అడ్వైజర్ కోజ్. ఇదో మొట్టమొదటి ఆన్ లైన్ డైరెక్టరీ. ఇక్కడ ఫైనాన్షియల్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు, డిస్ట్రిబ్యూటర్ల వివరాలన్నీ లభ్యమవుతాయి.

ఎవరి ఆలోచన ఇది ?

అడ్వైజర్ ఖోజ్‌ను ప్రదీప్ చక్రవర్తి ప్రారంభించారు. బెంగళూరులో టై (ది ఇండస్ ఆంట్రప్రెన్యూర్స్) సభ్యులు. ఈ రంగంలో దాదాపు 25 ఏళ్ల అనుభవం తనకు ఉంది. ఓ మల్టీనేషనల్ సంస్థలో కెరీర్ ప్రారంభించినప్పటికీ పార్ట్ టైం బీమా ఏజెంట్‌గా కూడా ఆయన పనిచేసేవారు. ఇంటింటికీ తిరిగి పాలసీలపై అవగాహన పెంచుతూ, అవసరమైన వారిని సభ్యులుగా చేరుస్తూ అదనపు ఆదాయాన్ని పొందేవారు. ఎనిమిదేళ్ల ఉద్యోగం తర్వాత పార్ట్ టైం ఉద్యోగాన్ని ఫుల్ టైం కెరీర్‌గా మార్చుకోవాలని అనుకున్నారు. 1994లో బీహార్‌లో మొదటి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సంస్థ రైట్ ఛాయిస్ సెక్యూరిటీస్‌ను ప్రారంభించారు.

ఆ తర్వాత 2002లో కోల్‌కతాలో తన వ్యాపారాన్ని విస్తరించారు. అలా అంచలంచెలుగా ఎదుగుతూ తూర్పు రాష్ట్రాల్లోనే పేరున్న సంస్థగా ఎదిగింది. రెండు దశాబ్దాల పాటు ఈ రంగంలో పనిచేసి అపారమైన అనుభవం గడించిన తర్వాత ప్రదీప్ తన మిత్రుడైన ద్వైపాయన్‌ బోస్‌తో కలిసి 2012లో అడ్వైజర్ ఖోజ్ ప్రారంభించారు. ''ఫైనాన్షియల్ అడ్వైజర్లను ప్రపంచానికి పరిచయం చేసి వాళ్ల వ్యాపారాన్ని ఇంటర్నెట్ ఆధారంగా విస్తృతం చేయాలనేది నా ఆలోచన. ఈ రంగంలో వ్యాపారం సాధారణంగా వ్యక్తిగతమైన రెఫరెన్సుల ద్వారా మాత్రమే అధికంగా నడుస్తుంది. అయితే కేవలం రెఫరెన్సుల ద్వారా మాత్రమే పూర్తిస్థాయి వ్యాపారం జరగదు. ఈ ఇంటర్నెట్ యుగంలో వ్యాపారం సోషల్, మీడియా ఆధారంగా జరుగుతోంది. ఇదే ఫైనాన్షియల్ అడ్వైజరీ రంగానికి కూడా వర్తిస్తుంది. ఓ స్వతంత్ర ఫైనాన్షియల్ అడ్వైజర్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో నిలదొక్కుకోవడం కష్టం. ఆ సమస్యను పరిష్కరించడమే మా ముందున్న లక్ష్యం. ఎవరికైతే ఇలాంటి ఆర్థిక సలహాలు అవసరమో.. అలాంటి వాళ్లకు తమ సమీపంలో ఉన్న వారి వివరాలను అందజేస్తున్నాం'' అని చెబ్తున్నారు ప్రదీప్.

ఏంటి బిజినెస్ మోడల్ ?

అడ్వైజర్‌ఖోజ్ దగ్గర 1100 ప్రాంతాల్లో 38,000 మంది ఫైనాన్షియల్ అడ్వైజర్లు రిజిస్టర్ అయి ఉన్నారు. 20కి పైగా సేవలను 5800 పైగా పోస్టల్ కోడ్స్‌లో అందిస్తున్నారు ఈ సభ్యులు. ప్రస్తుతానికి నెలకు మూడు వేల మంది సభ్యులుగా వచ్చి చేరుతున్నారు. జస్ట్ డయల్ లాంటి మోడల్‌లోనే అడ్వైజర్ ఖోజ్ పనిచేస్తుంది. ఎవరైతే అధిక సబ్‌స్క్రిబ్షన్‌తో తమ దగ్గర చేరుతారో వాళ్లే సర్చ్ ర్యాంకింగ్స్‌లో మొదటగా కనిపిస్తారు. అన్ని వివరాలూ పరిశీలించిన తర్వాతే ఇందులో లిస్టింగ్‌కు సభ్యులను చేర్చుకుంటారు. వాళ్ల సర్టిఫికేషన్స్ ఎప్పుడు ముగుస్తాయో కూడా సభ్యులు నోటిఫికేషన్స్ కూడా వెళ్తూ ఉంటాయి.

సర్టిఫైడ్ ఫైనాన్షియర్ ప్లానర్ల వివరాలు తెలియజేసే పేజ్

సర్టిఫైడ్ ఫైనాన్షియర్ ప్లానర్ల వివరాలు తెలియజేసే పేజ్


క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఏ ఏ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌లో విశేష అనుభవం ఉంది, ఎన్ని రివ్యూస్ రాశారు, మీరు ఉన్న ప్రాంతానికి ఎంత దూరంలో ఉన్నారు వంటి అనేక పారామీటర్లను విశ్లేషించి వివరాలను అందజేస్తారు.

అడ్వైజర్‌కు సంబంధించిన వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా యూజర్లకు పంపిస్తారు. ఈ సేవలకు గాను ఎలాంటి రుసుమునూ వసూలు చేయరు. ఎవరైనా యూజర్ ఓ అడ్వైజర్‌ సేవలను వినియోగించుకుంటే వాళ్లు రేటింగ్ ఇవ్వడంతో పాటు తమ అనుభవాన్ని వీళ్లతో పంచుకుంటే చాలు. దీని వల్ల ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుందనేది ఆలోచన.

టీమ్, పోటీ ?

అడ్వైజర్ ఖోజ్‌ పదిహేను మంది సభ్యుల బృందంతో నడుస్తోంది. బూట్ స్ట్రాపింగ్‌ ద్వారా నిధులు సమీకరించుకున్నారు. డయల్ ఏ బ్యాంక్, పాలసీ బజార్ వంటి సంస్థలు ఇలాంటి తరహా సేవలే అందిస్తున్నప్పటికీ.. ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌ను వెతికిపెట్టే వ్యవస్థ మాత్రం ఇప్పటివరకూ లేదు.