ఒకేరోజు 169 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం

ఒకేరోజు 169 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం

Monday June 12, 2017,

2 min Read

2017-18 విద్యా సంవత్సరంలో కొత్తగా 255 రెసిడెన్షియల్స్ ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగాే సోమవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో 169 రెసిడెన్షియల్స్ స్కూళ్లు ప్రారంభించింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి కేవలం 259 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవి. ఈ మూడేళ్ళలో కొత్తగా 527 స్కూళ్లు ప్రారంభించి, మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను 786కి పెంచారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, వారికి అత్యంతభద్రత, సౌకర్యం కల్పిస్తూ సగం రెసిడెన్షియల్స్ ను బాలికల కోసం కేటాయించింది ప్రభుత్వం. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటును లక్షా 25వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

image


రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 169 రెసిడెన్షియల్ స్కూళ్లలో 119 బీసీ, 50 మైనారిటీ రెసిడెన్షియల్స్ స్కూళ్లు ఉన్నాయి. ఈనెల 15న మరో 50, 19న ఇంకో 21 మైనారిటీ రెసిడెన్షియల్స్ ప్రారంభం కానున్నాయి. ఇవి కాకుండా 15 ఎస్టీ మహిళా డిగ్రీ కాలేజీలు కూడా ఇదే విద్యా సంవత్సరం మొదలవుతాయి. దీంతో 2017-18 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభిస్తున్న రెసిడెన్షియల్స్ సంఖ్య 255కి చేరుకుంటుంది. 

మొదటి ఏడాది 5,6,7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించారు. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్ల చొప్పున మొదటి ఏడాది ఒక్కో రెసిడెన్షియల్ లో 240 మంది పిల్లలకు ప్రవేశం కల్పించారు. ఐదేళ్ల సమయంలో ఒక్కో ఏడాది ఒక్కో తరగతిని పెంచుకుంటూ 12వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తారు. అప్పుడు ఒక్కో రెసిడెన్షియల్ లో విద్యార్థుల సంఖ్య 640 కు చేరుతుంది. ఐదేళ్లలో మొత్తం బీసీ గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య 91,520కి చేరుకుంటుంది. 

గతేడాది 71 మైనారిటీ రెసిడెన్షియల్స్ ను ప్రారంభించగా, ఈ ఏడాది121 ప్రారంభమవుతున్నాయి. గతేడాది 5,6,7 వ తరగతుల్లో ప్రవేశాలు జరిగాయి. వాటిలో ఈసారి 8వ తరగతి వరకు విస్తరిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభించే మైనారిటీ స్కూళ్లలో 5,6,7 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రతీఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతారు. ప్రస్తుతం మైనారిటీ విద్యాసంస్థల్లో 50 వేల మంది విద్యార్థులకు ప్రవేశంకల్పించారు. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య లక్షా 30వేలకు చేరుకుంటుంది. ఈ లెక్కన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ స్కూళ్లలో రాబోయే ఐదేళ్లలో 4 లక్షల 74 వేల 240 మంది విద్యార్థులకు అవకాశం లభిస్తుంది.

ప్రస్తుతం కిరాయి గదులు తీసుకుని స్కూళ్లు ప్రారంభించారు. రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణానికి స్థలం సేకరించాల్సిందిగా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ లో దాదాపు 24 వేలమంది అధ్యాపకులు అవసరమవుతారు. వీరిని దశల వారీగా నియమించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. రెసిడెన్షియల్ విద్యార్థులకు యూనిఫారాలు సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వం తెలంగాణ స్టేట్ హండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆదేశించింది. విద్యార్థులకు కావల్సిన పాఠ్య, నోటు పుస్తకాలను కూడా ప్రభుత్వమే సరఫరా చేయబోతోంది.