రైతు నేస్తం నానో గణేష్

మొబైల్ ఫోన్లతో ఆధునిక వ్యవసాయంమెసేజ్ పెడితే ఆన్, ఆఫ్ అయ్యే పంపుసెట్లుదేశంలో ఐదు రాష్ట్రాల్లో నానోగణేష్ఇప్పటికే మూడు దేశాలకు విస్తరణనిధుల కొరత, వర్షాభావ సమస్యలు

రైతు నేస్తం నానో గణేష్

Saturday April 18, 2015,

3 min Read

2012లో మనదేశంలో సాధారణ వర్షపాతం కంటే 20శాతం తక్కువ నమోదైంది. ఇది దేశంలో నీటి నిర్వహణ పద్ధతుల్లో మార్పులు రావాల్సిన అవసరముందనే విషయాన్ని చెబ్తోంది. ముఖ్యంగా తాము మరింతగా జాగ్రత్తపడాలనే విషయం రైతులకు అవగతం కావాలి. వ్యవసాయ పద్ధతులు, ధరలు, ఆధునికతపై రైతులకు అవగాహన పెంపొందించేకు మొబైల్ ఫోన్లు ఉపయోగపడ్తున్నాయి. అవే మొబైల్ ఫోన్లతో నీటి నిర్వహణా పద్ధతులను మార్చవచ్చని నిరూపించింది ఓ సంస్థ. ఓషియన్ ఆగ్రో ఆటోమేషన్ అనే సంస్థ నానో గణేష్ అనే ఓ ఎక్విప్మెంట్‌ను రూపొందించింది. ఇది రైతులకు తమ పంపుసెట్లను రిమోట్ ఆధారంగా స్విచ్ ఆన్, స్విచాఫ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా కిలోమీటర్ల కొద్దీ నడిచి కరెంట్ ఉన్న సమయానికి పొలానికి చేరుకుని పంటలకు నీళ్లందించడం కోసం మోటార్లను ఆన్ చేసుకునే కష్టం నుంచి తప్పించింది నానో గణేష్.


సంతోష్ ఓస్త్వాల్, ఓషియన్ ఆగ్రో ఆటోమేషన్ సిఈఓ

సంతోష్ ఓస్త్వాల్, ఓషియన్ ఆగ్రో ఆటోమేషన్ సిఈఓ


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15వేలకుపైగా పొలాల్లో నానో గణేష్ ఇన్‌స్టాలేషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లలో దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. అలాగే ఈజిప్ట్, టాంజానియా, ఆస్ట్రేలియాల్లోనూ వినియోగం మొదలైంది. సెల్ ఫోన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఒక్క నానో గణేష్ పరికరం అమర్చడం 8మంది సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుందనే విషయం మనం గ్రహించాలి. రైతు, ఆ రైతు కుటుంబం, పంపు సెట్లు నిర్వహించే వ్యక్తి, నానో గణేష్‌ను అమర్చే స్థానిక టెక్నీషియన్‌ల జీవితాల్లో దీని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది.


నానో గణేష్ ప్రొడక్ట్

నానో గణేష్ ప్రొడక్ట్


అయితే దీనికి రిపేర్లు వస్తే ఎలా అనే ప్రశ్న రైతుల నుంచి ఎదురైందంటారు ఓషియన్ సంస్థ వారు. “ ప్రారంభంలో మేము ఆయా ఉత్పత్తులను నేరుగా పూనే ఫ్యాక్టరీకి పంపాల్సిందిగా కోరాం. మా నెట్వర్క్ విస్తృతంగా పెరిగే వరకూ సర్వీసింగ్ విషయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశాం. అయితే రైతులకు పట్టణ ప్రాంతాలతో పరిచయం లేకపోవడం కారణంగా... వారికే దాని నిర్వహణపై అవగాహన కలిగేలా చేయాల్సి వచ్చింది. అయితే నానో గణేష్‌ను అమర్చుకోవడం ద్వారా పనివారికిచ్చే మొత్తం, ఇంధన ఖర్చుల రూపంలో తమకు 50నుంచి 60వేల రూపాయల వరకూ మిగిలాయని రైతులు చెప్పడం ఎంతో ఆనందం కలిగించిందంటారు'' ఓషియన్ సంస్థ వ్వవస్థాపకుడు సంతోష్ ఓస్త్వాల్.

ఒక్కో నానో గణేష్ ఖరీదు మోడల్‌ను బట్టి రూ. 560 నుంచి 2800వరకూ ఉంటుంది. ప్రస్తుతం రెండు రకాల అమ్మకాలను నిర్వహిస్తోంది ఓషియన్ కంపెనీ. నేరుగా సంప్రదించిన వారికి డైరెక్ట్ సేల్స్ ద్వారానూ, 300లకు పైగా డీలర్ నెట్వర్క్‌తోనూ అమ్మకాలు జరుపుతున్నారు. జాతీయస్థాయి దినపత్రికలు, టీవీల్లో ప్రకటనలుకూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిధుల లేమి. 

“గత రెండేళ్లుగా ఏ వెంచర్ కేపిటల్ నాకు అందలేదు. ప్రస్తుతం కొంతమందితో చర్చిస్తున్నాం. కానీ వాళ్లకు అమ్మకాలపై ఖచ్చితమైన అంచనాలు, వివరాలు, లక్ష్యాలు ఉండాలి. వ్యవసాయ రంగంలో ఇది చాలా కష్టమైన విషయం. రైతులను ఈ విషయంపై చైతన్యపరచి, వారికి అవగాహన కల్పించేందుకు సమయం అవసరమవుతోంది. ఈ ప్రొడక్టు ఉపయోగంపై వారికి నమ్మకం కలిగించాలంటారు సంతోష్.

నిధుల కొరతే కాకుండా... వర్షాభావ పరిస్థితులు కూడా ఈ ప్రాజెక్టు పురోగతిని దెబ్బతీశాయి. రైతులు కరువు కోరల్లో చిక్కుకుపోవడంతో... కొనుగోళ్లు గణనీయంగా మందగించాయి. సీజన్ కాని సమయంలోనే వాటర్ పంపుల వాడకం ఉంటుంది మన దేశంలో. “మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ జూలై వరకూ పంటలు పండిస్తారు. అయితే వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఈ ప్రభావం నేరుకు వాటర్ పంపులు, వాటి ఆధారిత వ్యాపారంపై ఉంటుంది. రైతులు బాధల్లో ఉన్నపుడు వ్యాపారదృక్పథంతో వ్యవహరించడం సరికాదు. ఈ సమయంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని కోరడం కూడా సరికాదు. నీటి నిర్వహణ వారికి మరింత సహకరిస్తుందనే సత్యాన్ని వారే గ్రహించాలి” అంటున్నారు సంతోష్ ఓస్త్వాల్. 

కొంత కాలం గడ్డు పరిస్థితులు ఎదురైనా.. ఈ ప్రాజెక్టుపై చాలా నమ్మకంగా ఉంది ఓషియన్ యాజమాన్యం. రెండు మల్టీ నేషనల్ కంపెనీలతో కూడా చర్చలు నిర్వహిస్తున్న ఈ సంస్థ... త్వరలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.