గ్రామాల్లో విద్యావెలుగులు.. స్ఫూర్తి నింపుతున్న ఐఐటియన్

గ్రామాల్లో విద్యావెలుగులు.. స్ఫూర్తి నింపుతున్న ఐఐటియన్

Tuesday April 26, 2016,

2 min Read


కాలిఫోర్నియాలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం. ఆరంకెల జీతం. లైఫ్ బిందాస్. ఒక ఐఐటీ చదివిన కుర్రాడికి అంతకంటే ఇంకేం కావాలి? ఆ కలల ప్రపంచం నుంచి బయటకు రమ్మన్నా రారు. కానీ అతను వచ్చాడు. ఆకాశ హార్మ్యాలు దాటుకుని వెలుగు జిలుగులును కాదనుకుని, గ్రామీణ భారతావనికి అక్షరాలు దిద్దిస్తున్నాడు. 

చెప్పాలంటే మొహమాటం అడ్డొస్తుంది కానీ.. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో చాలామందికి పదో తరగతి దాకా వచ్చినా సరిగా చదవడం రాయడం రాదు. గ్రామీణ భారతంలో ఇదో చెప్పుకోలేని సమస్య. ఇదంతా ఉమేశ్ మల్హోత్రాకు వింతగా అనిపించింది. ప్రపంచం ఎక్కడుంది.. మనం ఎక్కడున్నాం.. అని ఆవేదన చెందాడు. టీచర్ల ఉదాసీనత, పిల్లల అమాయకత్వం వెరసి రేపటి భవిష్యత్ ఏంటని ఉలిక్కిపడ్డాడు. ఊహించుకుంటేనే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. వారికోసం ఏదో ఒకటి చేయాలనే తపన, ఆరాటం ఎక్కువైంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అమెరికాకు గుడ్ బై చెప్పి, విమానం ఎక్కేశాడు.

హిప్పో క్యాంపస్. అదొక ప్రీ లెర్నింగ్ సెంటర్. చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు గ్రామీణ భారతదేశంలో ఏర్పాటు చేసిన స్కూల్ కాన్సెప్ట్. కర్ణాటక రూరల్ ఏరియాలో సుమారు 300 దాకా ప్రీ ప్రైమరీ స్కూల్స్ స్థాపించారు. వాటిలో 11 వేలమంది చిన్నారులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. మరో మూడు నెలల్లో మహారాష్ట్రలో కూడా 30 దాకా ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేయాలనే ప్లాన్ తో ఉన్నారు. టైం చూసుకుని పట్టణ ప్రాంతాల్లోనూ లైబ్రరీలు స్థాపించాలనేది ప్లాన్. ఆల్రెడీ బెంగళూరులోని కొరమంగళలో లైబ్రరీ ఏర్పాటు చేశారు.

  ఉమేష్ మల్హోత్రా

  ఉమేష్ మల్హోత్రా


చిన్నారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని వారికి శిక్షణనిచ్చేందుకు గ్రో బై రీడింగ్ అన్న ప్రోగ్రాంను రూపొందించారు. ఇందులో ఆరు రీడింగ్ లెవెల్స్ ఉంటాయి. దాంతోపాటు మరెన్నో ప్రయోగాలు చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ట్యూషన్స్ చెప్తారు. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టిప్స్ అందిస్తారు. 2011లో హిప్పో క్యాంపస్ లెర్నింగ్ సెంటర్స్ పేరుతో 17 సెంటర్లు స్థాపించగా వాటి సంఖ్య ఇప్పుడు 300లకు చేరింది. వందల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

మూడేళ్ల ప్రోగ్రాం ముగిసేసరికి పిల్లలను అన్ని కోణాల్లోనూ అంచనా వేస్తుంది హిప్పో క్యాంపస్ లెర్నింగ్. ప్రస్తుతానికి 85 శాతం మంది పిల్లలకు ఇంగ్లిష్ సహా తమ తమ ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం వస్తోంది. చిన్న చిన్న లెక్కలు చేయగలగుతున్నారు. అందుకే హెచ్ఎల్సీ కార్యక్రమాలను కర్ణాటక ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పిల్లలకు మంచి బోధన అందించాలంటే ముందు టీచర్స్ కు శిక్షణనివ్వాలి. ఇదే కాన్సెప్ట్ తో తమ స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ కు ట్రయినింగ్ ఇస్తున్నారు.

హెచ్ఎల్సీలో ఫీజులు తక్కువగా ఉన్నా… పెట్టుబడి, నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం వల్ల 65 శాతం స్కూల్స్ లాభాల్లో నడుస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో 5 వేల ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్తోంది హిప్పో లెర్నింగ్ క్యాంపస్. గ్రామీణ విద్యార్థులనుంచి ఏడాదికి 3వేల రూపాయలు మాత్రమే తీసుకుంటుందీ సంస్థ. ఆ మూడువేల ఫీజు కూడా తల్లిదండ్రుల వీలునుబట్టి వాయిదాపద్ధతుల్లో కట్టొచ్చు.

క్రిసిల్ అంచనా ప్రకారం ప్రీస్కూల్ ఇండస్ట్రీ దేశంలో ఏడాదికి 20 శాతం చొప్పున పెరుగుతోంది. ఇది మొత్తంగా 9,900 కోట్ల రూపాయల వ్యాపారం. త్వరలో 22,000 కోట్లకు చేరుతుందని అంచనా.