పేదపిల్లల చదువు కోసం కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి..
మదర్ థెరీసా స్ఫూర్తితో జీవితం త్యాగంఅన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని భావించిన శుక్లా
Thursday July 02, 2015,
4 min Read
ఈ రోజుల్లో కార్పొరేట్ ఉద్యోగం, లక్షల జీతం, లగ్జరీ లైఫ్ వదిలి మురికివాడల్లో పిల్లల కోసం ఎవరు పాటుపడతారు చెప్పండి! ఒకవేళ నిజంగా సమాజసేవ చేయాలని ఉన్నా- నిరుపేదల కోసం యావదాస్తినీ ధారపోసేవారిని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. సర్వస్వాన్ని వదిలేసి- కెరీర్నే త్యాగం చేసిన మహనీయులు నూటికో కోటికో ఒక్కరుంటారు! ఆ ఒకరే శుక్లా బోస్! అణువణువూ స్ఫూర్తి రగలించే ఆమె జీవితం గురించి తెలుసుకోవాలనుందా? అయితే లేటెందుకు చదివేయండి!
మదర్ థెరీసా స్ఫూర్తితో..
పేదవాడు పేదవాడుగానే మగ్గిపోతున్నాడు. డబ్బున్న మారాజు కోట్లకు పడగలెత్తుతునే ఉన్నాడు. ఒక్కోసారి అనిపిస్తుంది.. ఈ ఆర్ధిక అసమానతలను ఇంకో వందేళ్లయినా పూరించలేమా అని! సమానత్వం మీద, మానవత్వం మీద లెక్చర్లు దంచమంటే చాలామంది ముందుకొస్తారు. మరి పాటించమంటే అంతే స్పీడుగా వెనక్కి వెళ్తారు. మాటలు చాలామంది చెప్తారు. చేసిచూపించే వారే అసలైన ఆదర్శవంతులు. అలాంటి ఆదర్శవంతురాలే శుక్లా బోస్. పుట్టిపెరిగిందంతా వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లో. పరిక్రమ ఫౌండేషన్ స్థాపన వెనుక ఎంతో సంఘర్షణ ఉంది. మదర్ థెరీసా నుంచి పుణికిపుచ్చుకున్న మహత్తర స్ఫూర్తి ఉంది.
వ్యవస్థను కొంచెమైనా మారుద్దాం
వైద్యం సంగతి పక్కన పెడదాం కాసేపు. కనీసం విద్య అయినా ఈ స్వతంత్ర్యభారతావినిలో హక్కుగా పరిఢలవిల్లుతుందా? ఎంతమందికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతోంది? ఈ ప్రశ్నకు ఆన్సర్ అంత ఈజీగా రాదు. బేసిగ్గా స్కూళ్లు రెండు రకాలు. ఒకటి ధనవంతుల పిల్లలు చదివేది. రెండు పేదపిల్లలు వెళ్లేది. వ్యవస్థ ముందునుంచీ ఇలాగే ఉంది. దీనికంతటికీ పాపం ఎవరిది అని పోస్టుమార్టం చేసేబదులు- వ్యవస్థను కొంచెమైనా మారుద్దాం అని ముందుకొచ్చారు శుక్లా బోస్.
డబ్బు లేకుంటే చదువుకునే అర్హత లేదా?
ముందు నాలుక మీద సరస్వతి ఆడాలి. ఆ తర్వాత లక్ష్మి ఆటోమేటిగ్గా వస్తుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే ఎక్కడైనా ఏ రంగంలోనైనా రాణిస్తారు. అసలు చదువే లేకపోతే జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంటుంది. ధనవంతుల పిల్లలకు బెంగలేదు. ఎటొచ్చీ మురికివాడల్లో ఉండేవారికి చదువు అందని ద్రాక్షగా మారింది. ఎందుకు? పేదవారిగా పుట్టడమే వారు చేసుకున్న పాపమా? డబ్బు లేకుంటే చదువుకు దూరంగా ఉండాలా? ఈ సంఘర్షణలో నుంచే పుట్టుకొచ్చింది పరిక్రమ ఫౌండేషన్.
తండ్రి విలువలే ఆస్తి
శుక్లాబోస్. సాంప్రదాయం, క్రమశిక్షణ కలగలిసిన ఫ్యామిలీ. తండ్రి ప్రభుత్వోద్యోగి. లేకలేక కలిగిన సంతానం శుక్లాబోస్. అపురూపంగా పెంచుకున్నారు. అందమైన బాల్యం. ఆస్తులు అంతస్తుల కంటే నమ్ముకున్న సిద్ధాంతం, పాటించే విలువలే గొప్ప పేరు తెస్తామని నమ్మే తండ్రి. తండ్రిబాటలోనే తనయ. పోర్టికోలో ఏడు లగ్జరీ కార్లు పార్కు చేసి ఉంటాయి. అవన్నీ ఆఫీస్ పర్పస్. కానీ వాటిలో ఏ ఒక్కటీ సొంత అవసరాలకు వాడుకోలేదు. కనీసం పాపను స్కూల్లో డ్రాప్ చేసిరావడనికి కూడా ససేమిరా అనేవారు. అలా తండ్రి నుంచి విలువల్ని నేర్చుకున్నారు శుక్లాబోస్. ఆరు కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్లేదాన్ని అని చెప్తారామె. 19 ఏళ్లకు పెళ్లయింది. భర్తకు భూటాన్లో పోస్టింగ్. ఖాళీగా ఉండటం ఇష్టం లేక అక్కడ ఇండియన్ ఆర్మీ పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. సిలబస్ రూపొందించడం, రోజువారీ స్కూల్ కార్యకలాపాలతో ఎంతోకొంత బిజీగా ఉండేవారు. జీవితం సంతృప్తికర మార్గంలోనే వెళ్తోందని అనిపిస్తున్న టైంలో - భూటాన్ వాటర్ పడలేదు. దాంతో ఇండియాకు తిరిగిరావాల్సి వచ్చింది.
అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పది
మళ్లీ చదువు మీద దృష్టి. కంపారెటివ్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేశారు. సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఎంబీయే పూర్తయింది. ఆ తర్వాత హాస్పిటాలిటీ రంగంవైపు మళ్లారు. కోల్కతాలోని ఒబెరాయర్ గ్రాండ్లో కరియర్ మళ్లీ ప్రారంభం. కార్పొరేట్ ఉద్యోగం. లక్షల జీతం. విలాసవంతమైన జీవితం. ఏ టెన్షనూ లేదు. కానీ శుక్లా పాయింట్ ఆఫ్ వ్యూలో- తను ప్రయాణిస్తున్న దారి అది కాదు. నేను నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలని మెంటాలిటీ అసలే కాదు. గుండెనిండా సమాజసేవ ఆవరించింది. మనసంతా మురికివాడల పిల్లల చుట్టూ తిరుగుతోంది. వారికి డబ్బు ఇవ్వొచ్చు. కానీ అది ఇవాళ ఉంటుంది. రేపు ఖర్చవుతుంది. అలా కాదు. దానం చేస్తే శాశ్వతంగా ఉండాలి. దానికి చదువొక్కటే మార్గం. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం మహా గొప్పది. అది వాళ్లకు ప్రసాదించాలి. అలా అని ఏవో నాలుగు అక్షరాలు దిద్దించాం.. ఐదు పాఠాలు బట్టీ పట్టించాం అన్నట్టు ఉండొద్దు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. జీవితానికి దారి చూపించాలి. ఇంటర్నేషనల్ సాండర్ట్ విద్య అందించాలి. వాళ్డకు ఏమాత్రం తీసిపోని ఇంగ్లీష్ నేర్పించాలి. కాలేజీ రోజుల్లో మదర్ థెరీసాతో కలిసి ప్రయాణించిన రోజులు గుర్తొస్తున్నాయి. నిర్మల్ హృదయ్ ద్వారా ఎలాంటి సేవ చేశారో ఒక్కొక్కటీ కళ్లముందు కదులుతున్నాయి. ఆశయం, అడుగులు స్లమ్ ఏరియాకు దారితీయడానికి బహుశ అప్పుడు రగిలిన స్ఫూర్తి కావొచ్చు.
మమతంటూ లేనోళ్లే నిరుపేదలు
అప్పటికే కార్పొరేట్ కరియర్ పీక్ స్టేజీలో ఉంది. 26 ఏళ్ల జర్నీ. ఒక్కసారిగా గుడ్బై చెప్పాలంటే మామూలుగా అయితే సాధ్యం కాదు. కానీ మనసులో ఒక కమిట్మెంట్ అనుకున్నాక పరిత్యాగిలా మారాలి. 2000 సంవత్సరంలో ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు శుక్లాబోస్. అందరూ నవ్వారు. విలాసవంతమైన జీవితం వదిలి మురికివాడల్లోకి మారిపోవడమేంటి అని రకరకాల కామెంట్లు వినిపించాయి. కాక్టెయిల్ పార్టీల్లో చర్చంతా శుక్లాబోస్ మీదనే నడిచేది. తను మార్చుకున్న చిన్నకారుని కూడా వదల్లేదు. కానీ అదృష్టమేంటంటే కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన కూతురు కాదనలేదు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. అదొక్కటి చాలు. ఎవరేం అనుకుంటే తనకేంటి? మమతంటూ లేనోళ్లే నిరుపేదలు.
అలా ధైర్యం గుండెలోకి ఎగజిమ్మింది..
12 ఏళ్ల క్రితం బెంగళూరు రాజేంద్రనగర్లో ఓ చిన్న స్కూల్తో మొదలైంది ప్రయాణం. 165 మంది విద్యార్ధులతో మిషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం జయానగర్, సహకారనగర్, కోరమంగళ, నందిని లేఅవుట్. నాలుగు ప్రాంతాల్లో 17వందల మందికి పైగా విద్యార్ధులకు చదువు చెప్తున్నారు. పెట్టుబడి కోసం చాలా డబ్బు ఖర్చయింది. దాన్నిబట్టి చెప్పొచ్చు. విద్య కార్పొరేట్ అనే రెక్కల గుర్రమెక్కి ఎలా దౌడు తీస్తోందో! అయినా- డబ్బు కారణంగా ఆశయం పక్కదారి పట్టొద్దు. అందుకే ఎంత ఖర్చయినా వెనుకాడలేదు. ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులొచ్చాయి. అయినా తట్టుకుని నిలబడ్డారు. అంతకు ముందు పనిచేసిన రంగంలో గడించిన అనుభవం పనికొచ్చింది. అక్కడి వ్యూహాలే ఇక్కడ విజయానికి బాటలు వేశాయి. అయితే అవి అందరికీ నచ్చలేదు. కొందరే సపోర్టు చేశారు. ఆ కొందరు అన్నమాట చాలు అనుకున్నారు శుక్లా. గమ్యాన్ని ముద్దాడుతాననే ధైర్యం గుండెలోకి ఎగజిమ్మింది. ఆ ఆత్మవిశ్వాసమే పరిక్రమ ఫౌండేషన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. ఇప్పుడా ఫౌండేషన్కు వస్తన్న ప్రతీ ప్రశంసా గతంలో పడ్డ కష్టానికి ప్రతిఫలమే. ఈ మధ్యే ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థకు కీలక బాధ్యతలు కూడా చేపట్టారు. ఇప్పుడు పరిక్రమ ఫౌండేషన్ కార్నెల్ యూనివర్సీటీ, ఐఐఎం బెంగళూరులోని కోర్సులలో ఒక పాఠ్యాంశం అంటే ఆశ్చర్యమేస్తుంది.
ఆ ముగ్గురే ఆదర్శం
చదవడం అంటే శుక్లాకు ప్రాణం. క్లెమెంటివ్ ఆగివ్లీ స్పెన్సర్- చర్చిల్ బయోగ్రఫీని ఈమధ్యే పూర్తి చేశారు. ఆ పుస్తకం రాసింది ఎవరో కాదు. శుక్లా కూతురే. అన్నట్టు తను వంటకూడా బాగా వండుతుంది. టైం దొరికితే కొన్ని సీరియల్స్ ఫాలో అవుతారు. ట్రెకింగ్ అంటే కూడా ఇష్టం. శుక్లాకు ముగ్గురు రోల్ మోడల్స్. అందులో ముఖ్యమైన వ్యక్తి మదర్ థెరీసా. రెండోది- సర్ నికోలస్ వాట్సన్. ఇతను రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నాజీలు ఆక్రమించిన జెకోస్లేవేకియా నుంచి 669 మంది చిన్నారులను కాపాడిన బ్రిటిష్ మానవతావాది. మూడో వ్యక్తి దలైలామా. వారిలోని నిరాడంబరత, మానవతా దృక్పథాలు నన్ను ఆకర్షించాయంటారు శుక్లా. ప్రచారం చేసుకోవాలనే ఆలోచన లేకపోవడమే వారిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిందంటారామె.
చివరిగా ఒక కల
శుక్లాబోస్కు ఇంకో కల కూడా ఉంది. ఇంకో ఇరవై ఏళ్ల తర్వాత- పరిక్రమ ఫౌండేషన్ స్టూడెంట్ ఒకతను సొంతంగా ఒక స్కూల్ పెట్టాలి. ఆ బడికి పొద్దున్నే 8.15 కల్లా శుక్లా బోస్ వెళ్లాలి- అసెంబ్లీలో నించోవాలి. అక్కడి విద్యార్ధులందరూ శుక్లాని అక్కా అని ఆప్యాయంగా పిలవాలి. ఫైనల్గా అదే ఆవిడ డ్రీమ్. బాగుంది కదా!