తన గ్రామం కోసం ఒంటి చేత్తో కొండను తవ్విన మాంజీ

ప‌ట్టుద‌ల ఉంటే సాధించ‌లేనిది ఏదీ లేద‌ని నిరూపించాడు బీహార్‌కు చెందిన మౌంటెన్ మ్యాన్ ద‌శ‌ర‌థ్ మాంజీ. 22 ఏళ్ల‌పాటు ఒంట‌రిగా శ్ర‌మించి త‌న గ్రామానికి రోడ్డు మార్గాన్ని సృష్టించాడు. ప్ర‌భుత్వం, అధికారుల వ‌ల్ల సాధ్యం కాని ప‌నిని ప‌ట్టుద‌ల‌తో 22 ఏళ్ల‌పాటు శ్ర‌మించి 300 అడుగుల ఎత్తైన కొండ‌ను నిట్ట‌నిలువుగా చీల్చి ప‌క్క గ్రామానికి మార్గాన్ని వేశాడు. ప్ర‌ముఖ హీరో అమీర్‌ఖాన్‌కు కూడా స్ఫూర్తిగా నిలిచాడు.

తన గ్రామం కోసం ఒంటి చేత్తో కొండను తవ్విన మాంజీ

Friday May 01, 2015,

5 min Read

దేశ జ‌నాభా 120 కోట్లు. అందులో ఎక్కువ‌మంది గ్రామీణ ప్రాంతాల్లో.. అందులో చాలామంది మురికి వాడ‌ల్లో నివ‌సిస్తున్నారు. ప‌త్రిరోజు ఎంతో మంది మ‌న ముందు ఎద‌ర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేందుకు పోరాడుతున్నారు. కాని మ‌రికొంద‌రు మాత్రం ఎవ‌రో వ‌స్తార‌ని.. ఏదో చేస్తార‌ని ఎదురుచూస్తున్నారు. జీవితాల‌ను బాగు చేస్తార‌ని ఆశిస్తున్నారు. కానీ ఈ స్టోరీ మాత్రం అలాంటి ఆలోచ‌న‌ల‌ను ద‌రిచేర‌ని ఓ మ‌హోన్న‌త‌ వ్య‌క్తిది. ఎవ‌రో వ‌స్తార‌ని ఆలోచించ‌కుండా ప‌నిచేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న శిఖ‌ర స‌మానుడిదీ స్టోరీ. ఆలోచ‌న‌ల‌తోనే స‌రిపెట్ట‌కుండా, ఒట్టి చేతుల‌తోనే అనుకున్న‌ది సాధించి చూపాడు ద‌శ‌ర‌త్ మాంఝీ.

ఇంతకీ ఈ కొండేంటో.. ఈ కొండకు దశరధ్ మాంజీకి ఉన్న సంబంధమేంటో తెలుసుకుంటే అవాక్కవుతారు. అందులో సందేహం లేదు.

ఇంతకీ ఈ కొండేంటో.. ఈ కొండకు దశరధ్ మాంజీకి ఉన్న సంబంధమేంటో తెలుసుకుంటే అవాక్కవుతారు. అందులో సందేహం లేదు.


బీహార్ గ‌యా జిల్లాలోని గ‌హ్లోర్ అనే చిన్న గ్రామం కొండ‌ల మ‌ధ్య ఉంది. గ్రామంలోంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటే 75 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాలి. కొండ‌ను తొల‌చి రోడ్డు వేయ‌మ‌ని, అలా చేస్తే దూరం త‌గ్గుతుంద‌ని ఆ గ్రామ‌స్తులు చాలాసార్లు రాజ‌కీయ నాయ‌కుల‌కు, అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేసి నా ఫ‌లితం లేక‌పోయింది.

అది 1960. గ‌హ్లోర్ కు అవ‌త‌లి వైపున్న వంజీర్‌గంజ్ ప‌ట్ట‌ణానికి ఈ ప‌ల్లెకు మ‌ధ్య 300 అడుగులు ఎత్తైన కొండ అడ్డుగా ఉంది. కొండ ఇవ‌త‌లివైపు గ‌హ్లోర్ గ్రామం ఉంటే.. అవ‌త‌లి వైపు మాంఝీ ప‌నిచేసేవాడు. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో మాంఝీ భార్య ఫ‌ల్గుణీ దేవీ భోజ‌నం తీసుకొచ్చేది.గ‌హ్లోర్ నుంచి కొండ ఇవ‌త‌లికి వ‌చ్చేందుకు స‌రైన రోడ్డు మార్గం లేదు. ఈ వైపుకు రావాలంటే కొండ ఎక్కి దిగాల్సిందే. ఇందుకు కొన్ని గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఇవ‌త‌లివైపు ఓ భూస్వామి వ‌ద్ద‌ క్వారీలో మాంఝీ ప‌నిచేసేవాడు. క్వారీలో కొన్ని గంట‌లపాటు ప‌నిచేసిన మాంఝీ అల‌సిపోయాడు. ఆక‌లితో క‌డుపు నకనకలాడుతుంటే.. ప‌రిగెడుతూ భార్య తీసుకొచ్చే భోజ‌నం కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ ఆ రోజు ఫ‌ల్గుణీ ఒట్టి చేతుల‌తో భ‌ర్త వ‌ద్ద‌కు వ‌చ్చింది. అదీ వంటినిండా గాయాల‌తో.. ఆ రోజు ఎండ తీవ్రంగా ఉండ‌టంతో ఫ‌ల్గుణీ కొండ ఎక్క‌బోతూ కాలుజారి కింద‌ప‌డింది. చేతిలో ఉన్న భోజ‌నం, నీళ్లు నేల‌పాల‌య్యాయి. కొండ‌మీది నుంచి ప‌డిపోవ‌డంతో ఆమెకు గాయాల‌య్యాయి.. చాలాసేప‌టి త‌ర్వాత ఆమె భ‌ర్త వ‌ద్ద‌కు చేరుకుంది. ఆల‌స్యంగా వ‌చ్చిన భార్య‌ను కొట్టాల‌న్న కోపంతో ఉన్న మాంఝీ ఆమె ప‌రిస్థితి చూసి తీవ్ర ఆవేద‌న‌కు లోన‌య్యాడు.

ఇదే ఆ 300 అడుగుల ఎత్తైన కొండ. రెండు గ్రామాల మధ్య అడ్డుగా ఉండేది

ఇదే ఆ 300 అడుగుల ఎత్తైన కొండ. రెండు గ్రామాల మధ్య అడ్డుగా ఉండేది


కొండకు అవతల ఉన్న ఈ ప్రాంతంలోనే మాంజీ ఒకప్పుడు పనిచేసేవాడు

కొండకు అవతల ఉన్న ఈ ప్రాంతంలోనే మాంజీ ఒకప్పుడు పనిచేసేవాడు


కొండ దాటాలంటే ఎలాంటి వాళ్లకైనా గంటల కొద్దీ సమయం పట్టేది

కొండ దాటాలంటే ఎలాంటి వాళ్లకైనా గంటల కొద్దీ సమయం పట్టేది


కొండ‌తో యుద్ధం

భార్యకు గాయాల‌వ‌డం మాంఝీని తీవ్రంగా క‌లిచివేసింది. దీంతో కొండ‌ను ఎలాగైనా తొల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. 300 అడుగుల ఎత్తైన కొండ‌లోంచి రాతిని తొల‌చి మార్గాన్ని ఏర్పాటు చేసే ప‌నికి శ్రీకారం చుట్టాడు. అందుకోసం త‌న వ‌ద్ద వున్న గొర్రెల‌ను అమ్మి స‌మ్మెట‌, ఉలి, గున‌పాన్ని కొనుగోలు చేశాడు. ఈ ప‌నిముట్ల‌తో కొండ‌పైకి ఎక్కి కొండ‌ను త‌వ్వ‌డం ప్రారంభించాడు. కొండ‌ను త‌వ్వ‌ుతున్న మాంఝీని చూసి గ్రామ‌స్తులు అత‌ణ్ణి పిచ్చివాడిగా చూశారు.

ఇతడే ఆ మౌంటెన్ మ్యాన్ దశరథ్ మాంజీ

ఇతడే ఆ మౌంటెన్ మ్యాన్ దశరథ్ మాంజీ


" నా భార్య గాయ‌ప‌డ‌టం త‌ట్టుకోలేక‌పోయాను. నా జీవితం మొత్తం క‌రిగిపోయినా స‌రే.. ఈ కొండ‌ను తవ్వి మ‌ధ్య‌లో రోడ్డును నిర్మిస్తాను " అని మాంఝీ ధీమా వ్య‌క్తంచేశాడు.

కొండ‌ను త‌వ్వేందుకు అంత‌కుముందు చేస్తున్న ప‌నిని మాంఝీ వ‌దిలేశాడు. ప‌నిలేని కార‌ణంగా ఆ కుటుంబం త‌ర‌చుగా ప‌స్తుల‌తో ప‌డుకునేది. అదే స‌మ‌యంలో మాంఝీ భార్య ఫ‌ల్గుణీ అనారోగ్యం పాలైంది. వ‌జీర్‌గంజ్ నుంచి మాంఝీ గ్రామం గ‌హ్లోర్ రావాలంటే అడ్డుగా ఉన్న కొండ కార‌ణ‌గా 75 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి రావాల్సి వ‌చ్చేది. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు తీసుకువెళ్ల‌లేక‌పోవ‌డం కార‌ణంగా ఫ‌ల్గుణీ చ‌నిపోయింది. భార్య చ‌నిపోవ‌డంతో మాంఝీలో ప‌ట్టుద‌ల మ‌రింత పెరిగింది.

ఇవే మాంజీ ఆస్తి. వీటి ముందు కొండ కూడా దిగుదుడుపే

ఇవే మాంజీ ఆస్తి. వీటి ముందు కొండ కూడా దిగుదుడుపే


కొండ‌ను పిండి చేయ‌డం అంత ఈజీ కాదు. కొండ‌ను త‌వ్వుతున్న స‌మ‌యంలో రాళ్లు చాలాసార్లు మాంఝీని గాయ‌ప‌ర్చాయి. అయినా ఆ గాయాల నుంచి కోలుకున్న త‌ర్వాత మ‌ళ్లీ అదే ప‌ని.. కొండ‌ను త‌వ్వ‌డం. ఈ స‌మ‌యంలో కొండ ఇవ‌త‌లి ప‌క్క నుంచి అవ‌త‌లి ప‌క్క‌కు సామ‌గ్రిని త‌ర‌లించేందుకు ప్ర‌జ‌ల‌కు స‌హ‌క‌రించి వారివ‌ద్ద కొద్ది మొత్తంలో డ‌బ్బు తీసుకునేవాడు. ఇలా వ‌చ్చిన డ‌బ్బుతో కుటుంబ అవ‌స‌రాల‌ను తీర్చేవాడు. ప‌దేళ్ల త‌ర్వాత మాంఝీ కొండ‌ను చీల్చాడు. కొండ మ‌ధ్య‌లో చీలిక‌ను ప్ర‌జ‌లు గుర్తించారు. దీంతో కొండ మ‌ధ్య‌లో రోడ్డు వేసేందుకు మ‌రికొంద‌రు కూడా ముందుకొచ్చారు. 1982లో ఆశ్చ‌ర్యం చోటు చేసుకొంది. స‌మ్మెట‌, ఉలి, గున‌పంల‌తో శ్ర‌మించి మాంఝీ కొండ‌ను పిండి చేసి నిజంగానే చిన్న‌పాటి మార్గాన్ని సృష్టించాడు. 22 ఏళ్ల పాటు శ్ర‌మించి ఓ సామాన్య భూమిలేని నిరుపేద కూలి ప‌ర్వ‌తాన్ని జ‌యించాడు. 360 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడ‌ల్పుతో కొండ‌ను నిట్ట నిలువుగా చీల్చాడు ద‌శ‌ర‌థ్ మాంజీ. ఇప్పుడు వ‌జీర్ గంజ్‌లో ఉన్న హాస్పిట‌ల్స్‌కు, స్కూల్స్ కు చేరాలంటే కేవ‌లం ఐదు కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తే స‌రిపోతుంది. ఆ చుట్టుప‌క్క‌ల‌ ఉన్న 60 గ్రామాల ప్ర‌జలు ఆ మార్గాన్ని ఉప‌యోగించుకుంటున్నారు.

మాంజీ తొలిచిన కొండ ఇదే...

మాంజీ తొలిచిన కొండ ఇదే...


ప‌హాడీ ఆద్మీ (మౌంటెన్‌మెన్‌)..

గ్రామ‌స్తులు ద‌శ‌ర‌థ్‌కి ప‌ర్వ‌త మ‌నిషి (ప‌హాడీ ఆద్మీ.. మౌంటెన్‌మెన్‌) అని పేరు పెట్టారు. మాంఝీ సాధించిన ఘ‌న‌త దిన‌ప‌త్రిక‌ల్లో రావ‌డంతో ప్ర‌భుత్వం కూడా ఈయ‌న శ్ర‌మ‌ను గుర్తించింది. ఇంటిని నిర్మించుకునేందుకు భూమిని కేటాయించింది. ఐతే ఈ భూమిని కూడా హాస్పిట‌ల్ నిర్మించేందుకు మాంఝీ ప్ర‌భుత్వానికే దానంగా ఇచ్చాడు. 2006లో మాంఝీ పేరును ప‌ద్మ శ్రీ అవార్డుకు బీహార్ ప్ర‌భుత్వం సిఫార్సు చేసింది. కానీ అట‌వీశాఖ అడ్డంకులు సృష్టించ‌డంతో ఆ అవార్డును మాంఝీ అందుకోలేక‌పోయాడు. అట‌వీ సంప‌ద అయిన కొండ‌ను తవ్వ‌డం అక్ర‌మ‌మ‌ని అధికారులు కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు. అయితే వీటిని మాంఝీ ప‌ట్టించుకోలేదు.

“ఈ అవార్డుల‌ను, కీర్తి ప్ర‌తిష్ఠ‌లు, డ‌బ్బును నేనెప్పుడూ ప‌ట్టించుకోను. నాకు కావాల్సింది ప్ర‌ధాన ర‌హ‌దారితో మా గ్రామానికి రోడ్డు అనుసంధానం. పిల్ల‌ల‌కు స్కూల్‌, ప్ర‌జ‌ల కోసం వైద్య‌శాల‌. ఇది అంత సుల‌భ‌మేమీ కాదు. కానీ అదే జ‌రిగితే మా ఊరి మ‌హిళ‌ల‌కు, పిల్ల‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది” అని మాంజీ చెప్పాడు.

ఐదు నిమిషాల సీఎం..

కొండ‌ను త‌వ్వాను క‌దా అని మాంఝీ ఆగిపోలేదు. అప్ప‌టి నుంచి ప్ర‌తి అధికారి త‌ల‌పు త‌డుతూ ఆ మార్గంలో రోడ్డు వేసి, ప్ర‌ధాన మార్గానికి అనుసంధానం చేయాల‌ని కోరాడు. త‌న గ్రామ ప్ర‌జ‌ల‌కు రోడ్డు, హాస్పిట‌ల్‌, స్కూల్‌, నీటి వ‌స‌తి క‌ల్పించాల‌ని క‌నిపించిన అధికారిన‌ల్లా వేడుకొన్నాడు. 2006లో అప్ప‌టి బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ నిర్వ‌హిస్తున్న “జ‌న‌తా ద‌ర్బార్‌”కు వెళ్లాడు మాంఝీ. అప్ప‌టికే మాంఝీ చేసిన ఘ‌న‌త గురించి తెలుసుకున్న‌నితీష్‌కుమార్ ఆయ‌న‌ను వేదిక‌పైకి ఆహ్వానించాడు. ఓ ఐదు నిమిషాలు ముఖ్య‌మంత్రిగా ఉండ‌మంటూ త‌న కుర్చిమీద కూర్చోబెట్టారు.

క్యాన్స‌ర్ చేతిలో ఓట‌మి..

కొండ‌ను పించి చేసిన ద‌శ‌ర‌థ్ మాంజీ క్యాన్స‌ర్‌ను మాత్రం జ‌యించ‌లేక‌పోయాడు. ఆగ‌స్ట్ 17, 2007న క్యాన్స‌ర్‌తో మృతి చెందాడు. బీహార్ ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో మాంఝీ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది.

మాంఝీ మార్గ్‌

గ‌హ్లోర్ గ్రామానికి రోడ్డు కావాల‌న్న ద‌శ‌ర‌థ్ మాంఝీ క‌ల మూడు ద‌శాబ్దాల త‌ర్వాత నెర‌వేరింది. మాంఝీ చ‌నిపోయిన త‌ర్వాత 2007లో అప్ప‌టి బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్‌కుమార్ మూడు కిలోమీట‌ర్ల పొడ‌వైన రోడ్డును నిర్మింప‌జేసి, దానికి ‘మాంజీ మార్గ్‌’ అని పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించారు. అలాగే ఆ గ్రామంలో ద‌శ‌ర‌థ్ మాంఝీ పేర ఓ హాస్పిట‌ల్ కూడా నిర్మించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

‘ నా భార్య‌పై ప్రేమ‌తో నేను కొండ‌ను త‌వ్వ‌డం ఆరంభించాను. ఆ త‌ర్వాత మా గ్రామ ప్ర‌జ‌ల కోసం ప‌నిని కొన‌సాగించాను. ఒక‌వేళ ఆ ప‌నిని నేను చేయ‌క‌పోయి ఉంటే.. వేరెవ‌రూ చేసి ఉండేవారు కాదు’ అని మాంఝీ అనేవారు.

ఎంత పెద్ద కొండైనా.. ఆశయం ముందు తలవంచాల్సిందే అనేందుకు ఈ దారే నిదర్శనం

ఎంత పెద్ద కొండైనా.. ఆశయం ముందు తలవంచాల్సిందే అనేందుకు ఈ దారే నిదర్శనం


సిల్వ‌ర్ స్క్రీన్‌పై..

ద‌శ‌ర‌థ్ మాంఝీ జీవితాన్ని ఓ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సినిమాగా తెర‌కెక్కించాడు. ద‌శ‌రథ్ హాస్పిట‌ల్‌లో ఉండ‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌నీష్ ఝా అత‌ని జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తీయ‌డానికి అన్ని హ‌క్కుల‌ను ఉచితంగా వేలిముద్ర‌ల ద్వారా తీసుకొన్నాడు. జులై 2012లో ‘మాంఝీ’ పేర సంజ‌య్‌సింగ్ నిర్మాత‌గా ఆ సినిమా నిర్మింప‌బ‌డింది. క‌న్న‌డంలో కూడా ‘ఒలావే మంద‌ర‌’ పేరుతో సినిమా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు కేత‌న్ మెహ‌తా కూడా మాంఝీ జీవితాన్ని 'పూర్‌మెన్స్ తాజ్‌మ‌హ‌ల్' పేరుతో సినిమా నిర్మించారు. అలాగే ప్ర‌ముఖ హీరో అమీర్ ఖాన్ రూపొందించిన స‌త్య‌మేవ‌జేయ‌తే టీవీ సీరియ‌ల్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌ను మాంఝీకి అంకిత‌మిచ్చారు. మాంఝీ పోరాటం త‌న‌కు స్ఫూర్తినిచ్చింద‌ని అమీర్ పేర్కొన్నారు.

మాంజీ మార్గ్‌ను వినియోగించుకుంటున్న గ్రామస్థులు

మాంజీ మార్గ్‌ను వినియోగించుకుంటున్న గ్రామస్థులు


స్ఫూర్తి కొన‌సాగాలి..

ఇప్ప‌డు మాంఝీ లేడు. కాని మాంఝీ వార‌స‌త్వం, స్ఫూర్తి అత‌నితోపాటు అంత‌రించిపోలేదు. మ‌న‌లాంటి భార‌తీయుల్లో అది ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. స‌మ్మెట‌ల‌ను చేత‌బూని మ‌న‌చుట్టూ ఉన్న అధిగ‌మించ‌లేని స‌మ‌స్య‌ల‌ ప‌ర్వ‌తాల‌ను పిండి చేసే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మాంఝీ బాట‌లో న‌డిచి ఎవ‌రి కోస‌మూ వేచి చూడ‌కుండా స‌మ‌స్య‌ల‌ను మ‌నంత‌ట మ‌న‌మే ప‌రిష్క‌రించుకుందాం..