పోరాటమే ఊపిరిగా జీవించిన పద్మ విజేతలు

పోరాటమే ఊపిరిగా జీవించిన పద్మ విజేతలు

Thursday January 26, 2017,

3 min Read

కొందరు తమ స్వార్థం తాము చూసుకుంటారు. మరికొందరు మాత్రం సమాజ సేవకే జీవితాన్ని అకింతమిస్తారు. ఆపన్నులను ఆదరించి చీకటి జీవితాల్లో వెలుగులు నింపేవారు కొందరైతే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనాలక్ష్యాన్ని చేరుకుని స్ఫూర్తి నింపేవారు మరికొందరు. పోరాటమే ఊపిరిగా జీవించిన వారంతా పద్మ పురస్కారాలు అందుకున్నారు. వారి గురించి మూడు ముక్కల్లో తెలుసుకుందాం.. 

image


వనజీవి రామయ్య. ఖమ్మం జిల్లాలో ఏ చెట్టూ పుట్టను అడిగినా ఆయన గురించి చెబుతుంది. పుడమి తల్లికి పచ్చని పందిరి వేయడమే జీవితాశయంగా బతుకుతున్న వనమాలి ఈ రామయ్య.. ఇప్పటికే కోటి మొక్కలునాటాడు. చెట్టూచేమల్ని కన్నబిడ్డల్లా సాకుతూ అభినవ అశోకుడయ్యాడు.

చింతకింది మల్లేశం. తల్లి పడుతున్న కష్టం ఆయనలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. చీరలు ఆసుపోయడానికి ఆయన కనిపెట్టిన లక్ష్మీ ఆసుయంత్రం.. యావత్ చేనేత బతుకుల్లోనే కొత్త వెలుగులు నింపింది.

మీనాక్షి అమ్మ. 76 ఏళ్ల వయసులో కత్తి చేతబట్టి, చీర కొంగు నడుముకు చుట్టి బరిలో దిగిందంటే ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తుంది. ప్రాచీన యుద్ధ కళల్లో ఒకటైన కలారియపట్టుకు మళ్లీ ప్రాణం పోస్తోంది ఈ బామ్మ. పురాతన యుద్ధ కళకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

బిపిన్ గణత్రా. ఫైర్ ఫైటర్. కోల్కతాలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా అక్కడ వాలిపోయి మంటల్ని ఆర్పడంలో సాయం చేస్తాడు. ఫైర్ ఫైటింగులో శిక్షణ లేకపోయినా ఎందరో ఫైర్ మెన్లకు మార్గదర్శి అయ్యాడు.

డాక్టర్ సునీతి సాల్మన్. దేశంలో తొలిసారి హెచ్ఐవీ వైరస్‌ ను గుర్తించడంతో పాటు దాని నిర్మూలనకు కృషి చేసిన యోధురాలు. ఈ ప్రాణాంతక వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి, సరైన చికిత్స అందించడానికి వైఆర్ గయ్‌ టోన్డ్ కేర్ ఫౌండేషన్ ప్రారంభించారు. ఎయిడ్స్ నిర్మూలనకు జీవితాన్ని అంకింతం చేసిన సునీతి 76ఏళ్ల వయసులో కన్నుమూశారు.

డాక్టర్ సుబ్రతో దాస్. హైవేలపై జరిగే ప్రమాదాల్లో బాధితులకు తక్షణ వైద్యం అందించి ప్రాణాలు కాపాడే దేవుడు. మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్ బెంగాల్ రాష్ట్రాల్లో 40వేల కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా 40నిమిషాల్లో అక్కడకు చేరుకుని బాధితులకు తక్షణ సాయం అందిస్తాడు. సుబ్రతో దాస్ ఇప్పటి వరకు 12వందల మందిని కాపాడాడు.

డాక్టర్ భక్తి యాదవ్. కానీ అందరూ డాక్టర్ దాదీ అని పిలుస్తారు. 91ఏళ్ల వయసులోనూ ఈమె మాత్రం ఇండోర్ ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. 68 ఏళ్లుగా ఈమె కొన్ని వేల మందికి పురుడు పోశారు.అదుకే ఇండోర్ వాసులు ఈ డాక్టరమ్మను భగవంతుడి ప్రతిరూపంగా భావిస్తారు.

గిరీష్ భరద్వాజ్. తక్కువ ఖర్చుతో పర్యావరణహితమైన వంతెనలు నిర్మిస్తున్న ఇంజనీర్. ఎకో ఫ్రెండ్లీ వంతెనల్ని కొన్ని నెలల్లోనే అందుబాటులోకి తెస్తున్నారు. కర్నాటక, కేరళ, ఏపీలోని ఎన్నోమారుమూల పల్లెలనుకలుపుతూ వందకుపైగా వంతెనలు నిర్మించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.

అనురాధా కోయిరాలా అంగడి బొమ్మలుగా మారిన అమ్మాయిలను అక్కున చేర్చుకున్న అమ్మ . మదర్ థెరిస్సా స్ఫూర్తితో సమాజసేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఈమె ఇప్పటి వరకు 12వేల మందికి పైగా మహిళలు,బాలికలను కాపాడారు. మరో 45వేల మంది మానవ అక్రమ రవాణాను అడ్డుకున్నారు.

కరీముల్ హక్. 52 ఏళ్ల ఈ తేయాకు తోటకూలీ ఇప్పటి వరకు 3వేల ప్రాణాలు కాపాడాడు. అంబులెన్స్ అందుబాటులో లేక సకాలంలో వైద్యం అందక తల్లిని దూరం చేసుకున్న కరీముల్..తనలా మరొకరు బాధ పడకూడదనితన బైకునే అంబులెన్సుగా మార్చాడు. రాత్రి పగలన్న తేడా లేకుండా రోగులను ఆస్పత్రులకు చేరుస్తూ చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలకు కనిపించే దేవుడయ్యాడు.

బల్బీర్ సింగ్ చేవాల్. గుర్రపుడెక్క, పారిశ్రామిక వ్యర్థాలతో కంపు కొడుతున్న పంజాబ్ లోని కాలిబెయిన్ నదిని శుభ్రం చేసేందుకు నుడుం కట్టాడుఎనిమిదేళ్లలో 160 కిలోమీటర్ల నదీ పరివాహక ప్రాంతాన్ని శుభ్రంచేసి ప్రభుత్వం తలదించుకునేలా చేశాడు.

దర్గాభాయ్ పటేల్. గుజరాత్ సర్కారీ గోలియా ప్రాంతాన్ని ఒంటిచేత్తో కరువు కోరల నుంచి కాపాడాడు. సొంత ఖర్చుతో కొత్త విధానాల్లో సాగు చేస్తూ బీడు భూముల్ని బంగారు మాగాణం చేశారు. అత్యాధునిక సాగు విధానాలను అనుసరిస్తూ దేశంలోనే అత్యధికంగా దానిమ్మ పండ్లు పండే ప్రాంతంగా మార్చారు.

శేఖర్ నాయక్. అంధుల క్రికెట్లో రెండు ప్రపంచకప్పులు గెలిపించిన మరో ధోని. కృషి, పట్టుదల ఉంటే శారీరక లోపాలు ఏ మాత్రం అవరోధాలు కాదనడానికి నిలువెత్తు నిదర్శనం. అంధుల క్రికెట్ టీంకు కెప్టెన్ గా శేఖర్ నాయక్ టీ-ట్వంటీ వరల్డ్ కప్ తో పాటు 2014 ప్రపంచకప్పును దేశానికి అందించాడు.

మరియప్పన్ తంగవేలు. పారా ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన హై జంపర్. ఐదేళ్ల వయసులో జరిగిన బస్సు ప్రమాదంలో తంగవేలు శాశ్వత వికలాంగుడయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయకుండా కఠోరసాధనతో పారా ఒలంపిక్స్ కు అర్హతపొందాడు. హై జంప్ లో పసిడి పతకం గెలిచి గెలిచిన శెభాష్ అనిపించాడు.

దీపా కర్మకర్. రియో ఒలంపిక్స్ లో ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ విభాగంలో అర్హత సాధించడమే కాకుండా పోటీలో నాల్గో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది. త్రిపురకు చెందిన 23 ఏళ్ల దీపా కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్,ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొని ఎన్నో పతకాలు అందుకుంది.

సుక్రీ బొమ్మగౌడ. కర్నాటకలో అణగారిన వర్గాల ప్రజల్లో చైతన్యం నింపిన నైటింగేల్. 58 ఏళ్లుగా జానపద సంగీతంతో ఎందరిలోనో స్ఫూర్తి నింపారు. బడిగేరి హాండీలో లిక్కర్ అమ్మకాలపై వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నేతృత్వం వహించిన సుక్రీ.. తన పాటలతో హలక్కీ వక్కలింగ సంస్కృతిని కాపాడుతున్నారు.

జితేంద్ర హరిపాల్. ఒడిశాలో తన పాటల ద్వారా కోస్లీ, సంబల్ పురికి అండగా నిలిచిన గాయకుడు. పొట్టకూటి కోసం కూలీగానే కాక ఇతర పనులుచేసిన ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.

ఎలీ అహ్మద్. అసోంకు చెందిన విప్లవ రచయిత్రి. మహిళా, బాల సాహిత్యానికి ప్రధాన్యమిచ్చిన ఎలా.. మహిళా సాధికారత కోసం పోరాటం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా అస్సాం ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటుచేశారు.