నాడు నెలకు రూ.1200 జీతం.. నేడు రూ. 3 కోట్ల టర్నోవర్..!! వరంగల్ యువకుడి సక్సెస్ స్టోరీ !

నాడు నెలకు రూ.1200 జీతం.. నేడు రూ. 3 కోట్ల టర్నోవర్..!! వరంగల్ యువకుడి సక్సెస్ స్టోరీ !

Thursday April 21, 2016,

4 min Read


రాజిరెడ్డిది వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం మచుపహాడ్ గ్రామం. నాన్న అకాల మరణం కుటుంబాన్ని కుంగదీసింది. దాంతో రాజిరెడ్డి ఇంటర్ తోనే చదువుకు టాటా చెప్పాల్సివచ్చింది. ఆర్ధికంగా వేరే ఆసరా లేదు. ఎదిగీ ఎదగని కొడుకుతో బతుకు బండి సాగేదెలా అనే అమ్మ ఆవేదన కొడుక్కి అర్ధమైంది. హైదరాబాదుకు వెళ్లి ఏదో ఒక ఉద్యోగం చేస్తే ఎలా వుంటుంది? రాజిరెడ్డి మనసులో ఆలోచన తట్టింది. అంతపెద్ద మహానగరం. పైగా పరిచయాలు కూడా లేవు. అయినా సరే, ధైర్యం చేసి హైదరాబాద్ బస్సెక్కాడు. ఎలాగోలా ఒక ఉద్యోగం సంపాదించాడు. నెల జీతం రూ.1200.

అలా ప్రారంభమైన జీవితం.. ఇప్పుడు కోట్ల రూపాయల టర్నోవర్ చేసే కంపెనీ ఎండీ దాకా ఎదిగింది..

ఎలా సాధ్యమైంది..?

రాజిరెడ్డి ఏం చేశాడు..?

ఊహకందని అతని విజయాన్ని మీరూ ఆస్వాదించండి!!

image


ఒకపక్క చదువుకోవాలని ఉంది. మరోపక్క అమ్మకు ఆసరా ఎవరూ లేరన్న నిస్సహాయత గుర్తొస్తోంది. బాధ్యత తరుముతోంది. చదువు సంగతి తర్వాత.. అమ్మకు ఏదో రకంగా సాయం చేయాలి. రాజిరెడ్డి మనసులో గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అలా ఉద్యోగం చేస్తూనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకున్నాడు. మీడియా రంగంపై ఆసక్తితో కాకతీయ యూనివర్శిటీ నుంచి బీసీజే కంప్లీట్ చేశాడు. ఉస్మానియా నుంచి ఎల్ ఎల్ బీ పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత ఒక ఎనిమిదేళ్లపాటు ప్రముఖ మీడియా సంస్థల్లో ఫైనాన్షియల్ జర్నలిస్టుగా పనిచేశాడు. అలా చేస్తూనే ఎంబీయే ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాడు. అక్కడి నుంచి జీవితం ఆంట్రప్రెన్యూర్ ట్రాక్ ఎక్కింది. ఉద్యోగం అయితే జీవితం ఒక్కడిది. అదే వ్యాపారం అయితే జీవితం నలుగురిది. ముందునుంచీ ఇదే ఆలోచన రాజిరెడ్డిది.

అయితే పెట్టుబడి ఎవరు పెడతారు..? నమ్మి డబ్బులెవరిస్తారు..? అనేక ప్రశ్నలకు సమాధానం దరకలేదు. ఆలోచనలకు బ్రేకులు పడుతున్నాయి.

దారి చూపిన స్టార్టప్

రొటీన్ బిజినెసా? ఆవిష్కరణతో కూడిన వ్యాపారమా? కొంత మానసిక సంఘర్షణ. ఇంకొంత మార్కెట్ రీసెర్చ్. పోనీ ఈ కామర్స్ సైట్..? అనుకున్నంత ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించాడు రాజిరెడ్డి. నేలవిడిచి సాము చేయడం ఇష్టం లేదు. అలా మదిలో మొలకెత్తిన ఆలోచనే యాడ్ కామర్స్. పైకి చూడ్డానికి సాధరణ ఈ-కామర్స్ బిజినెస్ లాగానే ఉంటుంది. కానీ అందులో ప్రాడక్టుల డిస్ ప్లే తో పాటు వాటికి సంబంధించిన షాప్ యాడ్స్ కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు చెప్పులకు సంబంధించిన ప్రాడక్ట్స్ బ్రౌజ్ చేస్తున్నామనుకోండి.. పై బార్ లో ఆ ఫుట్ వేర్ ఏ షాపులో దొరుకుతుందో కూడా కనిపిస్తుంది. ఇష్టముంటే సైట్ లోనే ఆర్డరివ్వొచ్చు. లేదంటే అవే వస్తువులు ఏ షాపులో దొరుకుతాయో పైన వచ్చే యాడ్స్ ను బట్టి అక్కడికి వెళ్లి కొనుక్కోవచ్చు. మొదట్లో ఈ తరహా వ్యాపారం నడుస్తుందా అన్నారంతా. కానీ రాజిరెడ్డి అంచనాలు తప్పలేదు. ఫోన్ దగ్గర్నుంచి స్పూన్ దాకా ప్రతీదీ సైట్ లో దొరుకుతుంది. ఆన్ లైనంటే ఆన్ లైన్. ఆఫ్ లైనంటే ఆఫ్ లైన్.

మహింద్రా ఎస్ యూవీ కారుని ఫ్లిప్ కార్ట్ ప్రమెట్ చేసింది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా యాడ్ ఇచ్చి ప్రాడక్టును సేల్ చేయడం అదే మొదటిసారి. ఆ రకమైన యాడ్ కామర్స్ బిజినెస్ కచ్చితంగా వర్కవుట్ అవుతుంది. భవిష్యత్ లో అందరూ యాడ్ కామర్స్ కి మారకుంటే రెవెన్యూ రావడం కష్టమే అంటారు రాజిరెడ్డి.

image


యాడ్రోబ్ పనితీరు

యాడ్రోబ్ ప్రారంభించిన ఆరు నెలల్లోనే 5వేల మంది రెజిస్టర్ అయ్యారు. వేయి మంది వెండర్లు టై అప్ చేసుకున్నారు. యాడ్రోబ్ కి ఆండ్రాయిడ్ వర్షన్ లో యాప్ కూడా ఉంది. అవి కూడా దాదాపు ఆరు వేల దాకా డౌన్ లోడ్స్ ఉన్నాయి. ఆన్ లైన్ సేల్స్ ఉన్నప్పటికీ ఆఫ్ లైన్ వ్యాపారులకు కస్టమర్లను కూడా ఎంగేజ్ చేసే ప్లాట్ ఫాం ఇది. అయితే ఇది హైపర్ లోకల్ స్టార్టప్. జియో లొకేషన్ తో మనం ఉండే ప్రాంతంలో ఎలాంటి డీల్స్ ఉన్నాయనే విషయాన్ని పుష్ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ లో యాడ్రోబ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ ఏడాది చిరికల్లా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో విస్తరించాలని చూస్తున్నారు రాజిరెడ్డి.

యాడ్రోబ్ టీం.. ప్రధాన సవాళ్లు

టీం విషయానికొస్తే కేశిరెడ్డి రాజిరెడ్డి ఫౌండర్/మేనేజింగ్ డైరెక్టర్. కో ఫౌండర్ ప్రనూష. ఉస్మానియా నుంచి బీఎస్సీ కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్ చేసింది. ఆమె ఆపరేషన్స్ చూస్తున్నారు. వారితోపాటు 18మంది ఉద్యోగులున్నారు. 10 మంది ఫ్రీ లాన్సర్స్ పనిచేస్తున్నారు.

ఇక సవాళ్ల విషయానికొస్తే.. బిజినెస్ మోడల్ ను వివరించి వెండర్లనుర ఒప్పించడం కొంచెం కష్టమే అంటారు రాజిరెడ్డి. ప్రాడక్టు డిస్ ప్లే చేసుకోడానికి రెంట్ అడుగుతారు. ప్రాడక్టు సేల్ పై కమిషన్ కంటే ఇది వెండర్లకు మంచి ఆఫర్. దాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పడం.. ఒప్పించడం సులువైన పనేం కాదంటాడు రాజిరెడ్డి. ఆన్ లైన్ వైపు రాడానికి వాళ్లు ఇంట్రస్ట్ చూపించరు అనేది అతని అభిప్రాయం. 

image


ఆదాయ మార్గాలు

1.రెవెన్యూ జనరేట్ చేసే విషయంలో సాధారణ ఈ కామర్స్ సైట్ కంటే యాడ్ కామర్స్ మెరుగైంది. ప్రాడక్టులతో పాటు యాడ్స్ రూపంలో కూడా రెవెన్యూ వస్తుంది.

2. వెండర్లు నెలల కొద్దీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం కంటిన్యూ అయితే ఆదాయానికి ఢోకా ఉండదు.

3. బీటుబీ- బీటుసీ ఉండటం వల్ల రెండు మార్గాల్లో ఆదాయం సమకూర్చుకోవచ్చు.

ఫండింగ్

ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి ఇప్పటి వరకూ యాడ్రోబ్ కోసం ఒక కోటి రూపాయిలు సీడ్ ఫండింగ్ జమచేశారు రాజిరెడ్డి. బ్రేక్ ఈవెన్ ఎప్పుడో దాటిపోయింది. ఈ ఏడాది చివరికల్లా 3 కోట్లకు చేరుకుంటుందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో విస్తరణకు ఫండ్స్ ఉన్నాయి. బెంగళూరుతో పాటు దక్షిణాది ఇతర నగరాల్లో ఎక్ప్ పాండ్ చేయడానికి కలసి వచ్చే ఫండర్స్ తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాజిరెడ్డి ప్రకటించారు.

image


నెరవేరిన సంకల్పం

మొదటిసారి హైదరాబాద్ వచ్చాక మహానగరంలో ఎలా బతుకుతానో అని ఒకప్పుడు భయపడిన రాజిరెడ్డి.. ఇప్పుడు పదిమందినీ బతికిస్తున్నాడు. చేసే పనిలో చిత్తశుద్ధి, మంచి మనసు ఉండాలేగానీ పట్టిందల్లా బంగారమే అవుతుంది అనడానికి రాజిరెడ్డి జీవితమే ఉదాహరణ. రోజుకి 20 గంటల పాటు పనిచేసిన రోజులను మరిచిపోలేనంటున్నారు.

“నా దగ్గర పనిచేస్తున్న వాళ్లంతా నా కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తాను. ఎక్కువ లాభాలు సాధించాలని నాకేం కోరిక లేదు. నాతో పాటు పదిమంది ఎదగాలనేదే నా తాపత్రయం”-రాజిరెడ్డి


వెబ్ సైట్