ఆఫీసు ప్రయాణాన్ని హాయిగా మార్చేసిన ట్రిపుల్ ఐటి విద్యార్థులు

ఆఫీసు ప్రయాణాన్ని హాయిగా మార్చేసిన ట్రిపుల్ ఐటి విద్యార్థులు

Wednesday December 02, 2015,

4 min Read

హైదరాబాద్‌లో ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి ప్రయాణమంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అది కూడా పీక్ ఆఫీస్ టైంలో ట్రావెలింగ్ అంటే- ఇక ఆ కష్టాలను మాటల్లో వర్ణించలేం. ఎన్ని బస్సులు ఉన్నా, ఎన్ని అధిక సర్వీసులను ఎంఎంటీఎస్ నడిపినా.. అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. అలా అని వందలకు వందలు పోసి ఆటోల్లోనో, క్యాబుల్లోనో వెళ్లడం కూడా సామాన్య ఉద్యోగులకు కుదిరేపని కాదు. కాస్ట్ కటింగ్‌లో భాగంగా.. అన్ని కంపెనీలూ క్యాబ్ సేవలను అందించడం లేదు. ఈ నేపధ్యంలో ఉద్యోగులందరికీ ఆఫీసు ప్రయాణం ఇబ్బందిగా మారింది. దీన్నే అవకాశంగా మార్చుకుని స్టార్టప్ మొదలుపెట్టారు ట్రిపుల్ ఐటి విద్యార్థులు. తక్కువ ఖర్చులో సులువైన, సౌకర్యవంతవైన ఏసీ ప్రయాణాన్ని అందిస్తూ.. ఆకట్టుకుంటున్నారు. 'కమ్యూట్' పేరుతో ప్రారంభమైన ఈ స్టార్టప్ తక్కువ కాలంలోనే ఎక్కువ రెస్పాన్స్ అందుకుని వేగంగా విస్తరణ బాటలో అడుగులు వేస్తోంది.

image


ఈ ట్రాఫిక్ గందరగోళం, బస్సులు, రైళ్లలో గంటల తరబడి ప్రయాణంలో ఆఫీసుకు వెళ్లేసరికే సగం ఎనర్జీ కాస్తా ఆవిరైపోతుంది. ఇక అక్కడికి వెళ్లి పనిచేయాల్సింది పోయి గంటో, రెండో గంటలో రిలాక్స్ కావడానికే సరిపోతుంది. దీంతో ప్రొడక్టవిటీపై కూడా ఎంతో కొంత ప్రభావం పడకతప్పదు. ఇక లేడీస్ విషయంలో ఈ కష్టం మరింత ఎక్కువ. సొంతంగా అంతంత దూరాలు బైకులపై ప్రయాణం చేసే ఓపిక ఉండదు. అలా అని బస్సులు, ఆటోలో వెళ్లడం కూడా కొద్దిగా ఇబ్బందే. అందుకే ఈ కమ్యూట్ వీటన్నింటికీ పుల్ స్టాప్ పెడ్తోంది. ఓ అంచనా ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల మంది ఐటి ఉద్యోగులు ఆఫీసులకు చేరుకునేందుకు వివిధ ప్రయాణ సాధనాలు ఉపయోగిస్తున్నారు. వీళ్లలో 30 శాతం మంది మహిళలు ఉన్నారు. భద్రత విషయంలో కూడా ఎక్కువగా రిస్క్ ఉన్న జనాభా కూడా వీళ్లే. సెక్యూరిటీతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం పుట్టిందే ఈ కమ్యూట్.

మళ్లీ బస్సులో ప్రయాణమేనా ?

ఇప్పటికే బస్సులు, షేరింగ్ ఆటోలు, క్యాబ్స్ ఉన్నాయిగా.. మళ్లీ వీళ్లు వచ్చి ఏం చేస్తారు అనే ప్రశ్న సాధారణంగానే తలెత్తుతుంది. కచ్చితంగా వీళ్లు ఈ పాయింట్‌నే పట్టుకున్నారు. ఇతరులు ఎవరూ ఇంతవరకూ అడ్రస్ చేయని కఠినమైన సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూట్ అనేది ఓ మొబైల్ ఆధారిత మినీ బస్ సౌకర్యం అందించే ఓ సంస్థ. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులనే టార్గెట్‌గా పెట్టుకుని మొదలైన స్టార్టప్. పాపులర్ రూట్లలో మినీ ఏసి బస్సులు అధిక ఫ్రీక్వెన్సీలో నడపడం వీళ్ల ప్రత్యేకత.

ఉదాహరణకు దిల్‌సుఖ్‌నగర్ నుంచి కొండాపూర్‌కు ఆఫీస్ పీక్ వేళల్లో ఆర్టీసీ ఎన్ని బస్సులు వేసినా రద్దీ ఎక్కువే. వాటిని కాదనుకుని అంత దూరం నుంచి క్యాబ్స్, ఆటోల్లో రోజూ ఉద్యోగులు రాలేరు. అలాంటి వారినే దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు.

కమ్యూట్ యాప్ ద్వారా పికప్, డ్రాపింగ్ పాయింట్లను సెలెక్ట్ చేసుకుని రైడ్ బుక్ చేసుకోవచ్చు. పే యు మనీ ద్వారా డబ్బు చెల్లించేయవచ్చు. దూరాన్ని బట్టి ఒక్కో రైడ్‌కు రూ.30 నుంచి రూ.70 వరకూ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతానికి 3 రూట్లలో మూడు మినీ బస్సుల(వింగర్లు)ను కమ్యూట్ నడిపిస్తోంది. ఎల్‌బి నగర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు, దిల్‌సుఖ్‌నగర్ మీదుగా రహేజా వరకూ, దిల్‌సుఖ్‌నగర్ మీదుగా వేవ్‌రాక్ వరకూ అప్ అండ్ డౌన్ సర్వీసులను తిప్పుతున్నారు. వారానికి సగటున 60 శాతం వృద్ధితో వీళ్లు దూసుకుపోతున్నారు. ఇప్పటివరకూ 500 మంది యూజర్లు వీళ్ల దగ్గర రిజిస్టర్ అయ్యారు. ఒక్క నెల క్రితం ప్రారంభమైన ఈ స్టార్టప్ అప్పుడే 600కి పైగా బుకింగ్స్‌ను పూర్తిచేసుకుంది. వాహనాల్లో ఆక్యుపెన్సీ కూడా 60 శాతానికి పైగానే ఉంటోంది.

స్టూడెంట్ పవర్

ఈ కమ్యూట్ స్టార్టప్‌ను ట్రిపుల్ ఐటి విద్యార్థులే నిర్వహిస్తున్నారు. సిఈఓగా ప్రశాంత్ గారపాటి, సీఓఓగా హేమంత్ జొన్నలగడ్డ, ఆపరేషన్స్ మేనేజర్‌గా సృజయ్ వరికూటి, డిజైన్ మార్కెటింగ్‌ బాధ్యతలను చరణ్ తోట, డెవలపర్‌గా సందీప్ కాచవరపు ఉన్నారు. అందరూ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాగా, సందీప్ మాత్రం ఓ టెక్నాలజీ కంపెనీలో ఏడాది పనిచేసి.. ఇప్పుడు వీళ్లతో చేతులు కలిపారు.

image


ఎలా వచ్చిందీ ఆలోచన ?

ఈ టీంలో కొంత మంది దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు. అక్కడి నుంచి కాలేజ్, ఉద్యోగాల కోసం ఆ బస్సులు పట్టుకుని 25-30 కిమీ దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇతర ట్రాన్స్‌పోర్ట్ ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో అలా ఇబ్బందులు పడ్తూనే ప్రయాణం చేసేవారు. అప్పుడే తట్టింది ఈ ఆలోచన. అలా కొంత మంది ప్రయాణీకులతో మాట్లాడి.. వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకుని ఓ మోడల్ రూపొందించుకున్నారు. అయితే ట్రిపుల్ ఐటీలో బిటెక్, ఎంఎస్ చేసి.. ఇలాంటి స్టార్టప్ కోసం పనిచేయడం ఎంత వరకూ కరెక్ట్ అని ఒక్కసారి ఆలోచించుకున్నారు. కానీ ఓ అతిపెద్ద సమస్యకు పరిష్కారం చూపుతున్నామనే భావనే వీళ్లకు స్టార్టప్ ఏర్పాటు వైపు మళ్లేలా చేసింది.

70 శాతం మహిళలే !

కమ్యూట్ టీం ఊహలకు భిన్నంగా అధిక శాతం మంది మహిళా ఉద్యోగులే వీళ్లకు ఫ్యాన్స్ అయిపోయారు. రైడ్ బుక్ చేసుకోవడం, దాన్ని ట్రాక్ చేసే అవకాశం ఉండడం, అదే రూట్లో ఒకేసారి పది నుంచి పన్నెండు మంది వరకూ ప్రయాణించడంతో భయపడాల్సిన అవసరం లేదనే భరోసా మహిళలకు కలుగుతోంది. ట్రాఫిక్ పద్మవ్యూహాలను చేధించుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా, ప్రతీ స్టాపులో ఆగకుండా ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి కూడా రెండు సర్వీసులు వెళ్లడంతో టైం బాగా కలిసొస్తోందని మహిళా ప్రయాణికులు అంటున్నారు. అంతే కాకుండా ఓనర్ కమ్ డ్రైవర్‌గా ఉన్నవాళ్ల మినీ బస్సులనే కమ్యూట్ టీం బుక్ చేసుకుంటోంది. వాళ్లకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ సహా వాళ్ల ఇళ్లకు వెళ్లి మరీ పరిశీలన చేసిన తర్వాతే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.

image


ఫ్యూచర్ ప్లాన్స్

ప్రస్తుతానికి మూడు రూట్లలో నాలుగు సర్వీసులను మాత్రమే నడుపుతున్నారు. పూర్తిగా సొంత నిధులతోనే నడుస్తున్న సంస్థ.. త్వరలో మరిన్ని రూట్లకు వెళ్లాలని చూస్తోంది. ఇందుకోసం యాప్‌లోకి వెళ్లి రూట్లను రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకుంటున్నారు. ఎక్కువ మంది ఒక రూట్ నుంచి మొగ్గుచూపితే.. అక్కడ మినీ బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఒక్క సర్వీస్ మాత్రమే నడుపుతున్న రూట్లలో ఫ్రీక్వెన్సీ కూడా పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. కార్ ఫ్రీ థర్స్‌డే, రాహ్‌గిరి, హైసియా లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని.. మార్కెటింగ్ చేసుకుంటున్నారు. కొంత మంది ఇండస్ట్రీ పెద్దలు కూడా వీళ్లు మెంటార్లుగా వ్యవహరిస్తూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.

Website, App