అక్రమ రవాణా బారినపడ్డ అమ్మాయిలకు ఆపన్నహస్తం !

అక్రమ రవాణా బారినపడ్డ అమ్మాయిలకు ఆపన్నహస్తం !

Saturday January 23, 2016,

4 min Read

అమ్మాయిల అక్రమ రవాణా (సెక్స్ ట్రాఫికింగ్) ఈనాటిది కాదు. ఈ ఉచ్చులో చిక్కుకుని ఎంతో మంది అమ్మాయిలు నాశనమైపోయారు. ఎన్నో జీవితాలు మంటగలిసిపోయాయి. అభంశుభం తెలియని వాళ్లను ఎత్తుకెళ్లి.. ఎక్కడెక్కడో అమ్మేయడం, వాళ్లు అక్కడి నుంచి బయటకు రాలేక.. అక్కడే మగ్గిపోయి.. బుగ్గిపాలైన జీవితాల గురించీ ఎన్నో కథలు చదివాం. కానీ.. వాళ్ల టైం బావుండి.. ఒక వేళ అలాంటి వ్యవస్థ నుంచి బయటపడ్డారనే అనుకుందాం. అప్పుడైనా ప్రశాంతంగా బతకగలరా.. ? సమాజం వాళ్లను ఆదరిస్తుందా.. సాఫీగా బతకనిస్తుందా అంటే మాత్రం అవుననే సమాధానం రాదు. ఈ సమస్యకు పరిష్కారంగానే పుట్టుకొచ్చింది టోఫు (ToFu - Threads of Freedom and U). బెంగళూరుకు చెందిన ముగ్గురు యువకులు ఈ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. సెక్స్ ట్రాఫికింగ్ నుంచి బయటపడిన వాళ్లు గౌరవంగా తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థిక తోడ్పాటును అందించేందుకు సిద్ధమయ్యారు.

ఇందుకోసం తోఫు అనే ఓ అపెరల్ బ్రాండ్‌ను రూపొందించారు. వీళ్లు కొన్ని గార్మెంట్ కంపెనీలు గ్యారెంటీగా కొన్ని ఆర్డర్లు ఇస్తారు. ఇందుకు ప్రతిగా బాధితులను ఉద్యోగాల్లో నియమించుకుని వాళ్లకు ఉపాధిని చూపించాలి. తోఫుకు ToF అనేది మాతృసంస్థ. ఇది సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంటుంది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు, క్లోత్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. బాధితులకు కౌన్సెలింగ్, శిక్షణనివ్వడం, ఉద్యోగాలు కోసం తర్ఫీదునిచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయడం ఈ సంస్థ ఉద్దేశం. తోఫు బ్రాండ్ అమ్మకాల ద్వారా వచ్చిన లాభాలను మళ్లీ ToFలోకే మళ్లిస్తారు.

image


ఇంతటి బృహత్తర ప్రాజెక్టును 27 ఏళ్ల ప్రీతం రాజా, సౌమిల్ సురానా, ఆదర్శ్ నుంగూర్ నిర్వహిస్తున్నారు. ఒమన్‌లో పుట్టిపెరిగి ఈ సామాజిక సేవ కోసం ఇండియా వచ్చేశారు ప్రీతం. ''గృహహింసను అడ్డుకునే సంస్థల్లో పనిచేసిన అనుభవం నాకు ఉంది. జూదంలో ఓడిపోయినందుకు తన స్నేహితుడికి వశం కావాలని ఓ భర్త తన భార్యను వేధించిన ఘటన చూసి నాకు మతిపోయింది. మహిళా సమస్యలపై నేను చేసిన పరిశోధనలు నాలో అనేక మార్పులు తీసుకువచ్చాయి'' అంటారు ప్రీతం.

అమ్మాయిల అక్రమ రవాణా ఈ యువ బృందాన్ని బాగా కదిలించి వేసింది. టెడ్ టాక్స్‌లో సునీతా కృష్ణన్‌ జీవితం గురించి తెలుసుకున్న తర్వాత ప్రీతమ్‌ ఆలచోనల్లో మరింత స్పష్టత వచ్చింది. యూఎస్‌లో మంచి ఉద్యోగావకాశం వచ్చినా దాన్ని వదులుకుని ఇండియా వచ్చేశారు. 

''హైదరాబాద్ వెళ్లి సునీతా కృష్ణన్‌తో చాలా సుదీర్ఘంగా మాట్లాడాను. మా నుంచి ఎలాంటి సాయం అందితే ప్రయోజనం ఉంటుందో అడిగి తెలుసుకున్నాను. రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొనే వాళ్లకు శిక్షణ లేదనే విషయాన్ని గ్రహించినా, అందులో మాకు కూడా అనుభవం లేదని నిర్ధార్ధించుకున్నాం '' అంటారు ప్రీతం.

నరక కూపం నుంచి బయటపడిన తర్వాత మహిళలకు అసలు సమస్య మొదలవుతుందనే విషయాన్ని వీళ్లు గ్రహించారు. వాళ్లను ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎవరిపైనా ఆధారపడకుండా వాళ్లు ఎలా గౌరవంగా బతకగలరు అనే అనుమానం మాకు కలిగింది అంటారు. ఇక్కడ ఉన్న గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు ప్రీతం, అతని స్నేహితులు సౌమిల్, ఆదర్శ సిద్ధమయ్యారు. వీళ్లలో సౌమిల్ ఐఎస్‌బి నుంచి గ్రాడ్యుయేషన్, జార్జియా టెక్ నుంచి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేశారు. ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థలో రీ ఇంటిగ్రేషన్ బాధ్యతలను అతను చూసుకుంటారు. వివిధ భాగస్వాములతో చర్చించి ఓ వ్యవస్థను రూపొందిస్తారు.

అక్రమ రవాణా బారిన పడిన వాళ్ల పునరావాసం అంత సులువు కాదు. వాళ్లను రక్షించినప్పటికీ.. ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఇంట్లోని వాళ్లే ఆ పాపానికి ఒడిగట్టడం వల్ల అక్కడికీ పోలేరు. సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు కంపెనీలు సిద్ధంగా ఉండవు. వాళ్లలో మానసిక స్థైర్యం తగ్గిపోవడం వల్ల ఏళ్లతరబడి శిబిరాల్లోనే జీవితాలను వెళ్లదీస్తూ ఉంటారు అని తన అనుభవాలను పంచుకుంటారు ప్రీతం.

image


ఈ సమస్య పరిష్కారం కోసం మా వంతు మేం కృషి చేస్తున్నాం. టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలకు వెళ్లి వాళ్లతో మాట్లాడుతున్నాం. గ్యారెంటీగా ప్రతీ నెలా ఇన్ని గార్మెంట్లకు ఆర్డర్లు ఇస్తాం. దీనికి ప్రతిగా మా వాళ్లను ఉద్యోగాల్లో నియమించుకోండి.. అంటూ వాళ్లను అడుగుతాం. దీని వల్ల వాళ్లకు- మాకూ ఇద్దరికీ ప్రయోజనమే కదా అంటారు.

ఫ్యాక్టరీల నుంచి తీసుకున్న బట్టలను తోఫు బ్రాండ్ కింద కస్టమర్లకు విక్రయిస్తారు. ఈ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమే ఈ ప్రోగ్రాం నడిచేందుకు దోహదపడ్తుంది. అదే మరింత బాధితులను అక్కున చేర్చుకునేందుకు వీళ్లకు శక్తినిస్తుంది.

బాధితులు పూర్తిగా కోలుకుని ధైర్యం తెచ్చుకునేందుకు వరకూ స్థిరమైన ఉద్యోగం, శిక్షణ, వసతి, కౌన్సిలింగ్, ఆర్థిక తోడ్పాడు, ఆరోగ్య రక్షణ వంటి బాధ్యతలన్నీ తోఫునే చూసుకుంటుంది. ఇతర బ్రాండ్లకు అవసరమైన బట్టల ఆర్డర్లను తీసుకోవడం, సొంత బ్రాండ్‌కు అవసరమైన గార్మెంట్స్‌ను తయారు చేయించడం వీళ్ల కాన్సెప్ట్. వీటి ద్వారా వచ్చిన లాభాలన్నింటినీ స్వచ్ఛంద సంస్థలోకి మళ్లిస్తారు. అలా ఈ వ్యవస్థ ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్న ఓ మ్యానుఫ్యాక్చరర్‌తో కలిసి తోఫు పనిచేస్తోంది. తాము పంపిన బాధితులకు గౌరవం, మెరుగైన జీతం అందించేంత వరకూ తోఫూనే బాధ్యత తీసుకుంటుంది. తమ తోఫు బ్రాండ్‌తో కూడా త్వరలో రిటైల్ స్టోర్లలోకి కూడా అడుగుపెట్టబోతున్నారు.

image


సవాళ్లు

బాధిత మహిళలను ఉద్యోగాల్లో చేర్చడం అంత సామాన్య విషయమేమీకాదు. వాళ్లు అలాంటి కూపంలో నుంచి వచ్చారు అని ఇతరులకు తెలిస్తే.. మరింత కుంగిపోతారు. ప్రత్యేకంగా చూడడం కూడా అవమానంగా భావిస్తారు. అందుకే మా తరపు నుంచి వెళ్లే వాళ్ల వివరాలు మాకు, ఆ కంపెనీలో పనిచేసే హెచ్‌ఆర్‌కు తప్ప ఎవరికీ తెలియవు. ఆ భరోసా మేం వాళ్లకు, వాళ్లు మాకూ ఇస్తున్నారు. మా తరపు నుంచి వెళ్లిన ఉద్యోగులకు ఇచ్చే ఒక్కో పనిగంటకూ ఒక్కో క్రెడిట్ పాయింట్ కంపెనీకి ఇస్తున్నాం. మేం ఆర్డర్ ఇచ్చిన ప్రతీ సారీ డెబిట్ పాయింట్లు యాడ్ అవుతాయి. అలా కంపెనీ వాళ్లు ఎన్ని ఎక్కువ గంటలు మా వాళ్లకు పనిస్తే.. అన్ని ఎక్కువ ఆర్డర్లు వాళ్లకు వస్తాయి. ఈ కాన్సెప్ట్ వాళ్లకు కూడా నచ్చింది అంటారు ప్రీతం.

ప్రస్తుతం విస్తరణపై తోఫు దృష్టిపెట్టింది. సాధ్యమైనంత ఎక్కువ మందికి సేవ చేయాలని చూస్తోంది. గతేడాది యూఎస్‌లో నిర్వహించిన క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ద్వారా 25 వేల డాలర్లను సమీకరించింది. ఈ నిధుల ద్వారా కర్నాటక అంతా తమ నెట్వర్క్‌ను విస్తరించేందుకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం కర్నాటకలోని శిశు, మహిళాభివృద్ధి శాఖ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్, స్నేహ - విద్యారణ్య అనే స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.

ఇప్పటివరకూ 28 మంది మహిళలకు తోఫు ద్వారా ఉపాధి, ఉద్యోగం లభించింది. వీళ్ల దగ్గరికి వచ్చిన ప్రతీ బాధితురాలికీ ఉద్యోగం దక్కింది. ప్రస్తుతం 100 మంది వరకూ ఉద్యోగులను నియమించుకునే స్థాయికి వీళ్లు ఎదిగారు.

''ప్రతీ ఏడాదీ 3 నుంచి 4 వేల మంది సెక్స్ ట్రాఫికింగ్ బారినుంచి బయటపడతారు. వాళ్లందరినీ చేరుకోవాలనేదే మా ఆశయం '' అంటూ ముగించారు ప్రీతం.