పాతికేళ్లకే మూడు కంపెనీలు.. లక్షల్లో టర్నోవర్..!!

రాజస్థానీ యువ సీరియల్ ఆంట్రప్రెన్యూర్ సక్సెస్ స్టోరీ

పాతికేళ్లకే మూడు కంపెనీలు.. లక్షల్లో టర్నోవర్..!!

Saturday April 23, 2016,

3 min Read


సాధార‌ణంగా పాతికేళ్ల కుర్రాడి ఆలోచ‌న ఎలా ఉంటుంది?! 

వీలైతే ఓ సినిమా, కుదిరితే బైక్ మీద లాంగ్ డ్రైవ్, లేదంటే ఏ వాట్సాప్ లోనో ఫ్రెండ్ తో చిట్ చాట్..!!

ఇంతే! ఇంతకుమించి జీవితం గురించి పెద్ద‌గా ఆలోచ‌న‌లేమీ ఉండ‌వు..!

కానీ కొంద‌రుంటారు.. ఇర‌వైల్లో అర‌వైల్లా ఆలోచిస్తారు..!!

అతడు స‌రిగ్గా అలాంటి కుర్రాడే..! లైఫ్ ని ఎలా మోల్డ్ చేసుకోవాలో తెలిసిన నవ యువకుడు..!

పాతికేళ్ల వ‌య‌సులోనే మూడు కంపెనీలు..! దేశంలోని సీరియ‌ల్ ఆంట్ర‌ప్రెన్యూర్ల జాబితాలో పేరు..!!

మార్కెట్ లో ల‌క్ష‌ల రూపాయ‌ల ట‌ర్నోవర్..!అన్నింటికీ మించి సంఘంలో ఒక గౌర‌వం..!!

ఇదీ అత‌డి ట్రాక్ రికార్డ్..!!!

వినావ్ భ‌నావ‌ట్ రాజ‌స్థానీ. సొంతూరు ఉద‌య్ పూర్. పదమ్ పట్ సింఘానియా యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. ఇంజ‌నీరింగ్ చ‌దివేట‌ప్పుడే అత‌డిలో ఒక స్పార్క్ క‌నిపించేది. జీవితంలో అత‌డు ఉన్న‌త స్థానానికి ఎదుగుతాడ‌ని లెక్చ‌ర‌ర్లు అప్పుడే ఊహించారు. చ‌దువ‌య్యాక భ‌నావ‌ట్ ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేడు. ఎప్పుడూ ఏదో ఒక‌టి ఆలోచిస్తుండేవాడు. మార్కెట్ లో వ‌స్తున్న మార్పుల‌ను గ‌మ‌నించేవాడు. తాను కూడా బిజినెస్ మేన్ అయిపోవాల‌ని క‌ల‌లు క‌నేవాడు. పాతికేళ్ల వ‌య‌సున్న ప‌దునైన డ్రీమ్స్ అవి!

2012లో అత‌డి కెరీర్ మొద‌లైంది. ఎన్ఎమ్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ అనే ఐటీ కంపెనీకి కొబ్బరికాయ కొట్టిన రోజు ఇప్పటికీ గుర్తే అంటాడు. 2014లో ఒక ఆన్ లైన్ ఫ్యాషన్ స్టోర్, 2015లో నాన్ మూవింగ్ ఇన్వెంటరీ డాట్ కామ్ పేరుతో మరో కంపెనీ ప్రారంభించాడు. చిన్న వ‌య‌సులోనే సీరియ‌ల్ ఆంట్ర‌ప్రెన్యూర్ గా అవ‌తార‌మెత్తాడు.

image


స‌రికొత్త ఆలోచన..

భ‌నావ‌ట్ ప్రారంభించిన కంపెనీల్లో నాన్ మూవింగ్ ఇన్వెంట‌రీ డాట్ కామ్ ముఖ్య‌మైంది. అత‌డు కూడా ఈ కంపెనీ మీద‌నే ఎక్కువ శ్ర‌ద్ధ పెడుతుంటాడు. కంపెనీల‌కు భారంగా మారిన ఫ్యాక్ట‌రీ గూడ్స్ ను ఈ వెబ్ సైట్ అమ్మిపెడుతుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్, యంత్రాలు, మోటార్స్, కేబుల్స్, డీజిల్ జనరేటర్లు, టూల్స్, భూమిని తవ్వే యంత్రాల వంటి 25 వేల వ‌స్తువులు అందుబాటులో ఉన్నాయి. హిందుస్తాన్ జింక్ లిమిటెడ్, బిర్లా కార్పొరేషన్, జేకే టైర్, జేకే సిమెంట్, పైరోటెక్ ఎలక్ట్రానిక్స్, పీకాక్ ఇండస్ట్రీస్ వంటి బ‌డా బ‌డా కంపెనీలు వెబ్ సైట్ లో క్రయ,విక్రయాలు జ‌రుపుతుంటాయి. వెబ్ సైట్ లో ప్రాడక్ట్ పోస్ట్ చేయడానికి రూ.5 వేల నుంచి 20 వేల వరకు సబ్ స్క్రిప్షన్ ఫీజు వసూలు చేస్తారు.

ఏ కంపెనీకి అయినా ఇన్వెంట‌రీ ప‌రిమితంగానే ఉండాలి. అవ‌స‌రానికి మించి సామ‌గ్రి ఉంటే త‌ల‌కుమించిన భార‌మే. మ‌నీ, ప్లేస్ రెండూ వేస్టే. దీనికి పరిష్కారం గురించి బాగా ఆలోచించాను. కంపెనీల‌తో మాట్లాడి సమస్య మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నా. ఆ తర్వాత నాన్ మూవింగ్ ఇన్వెంటరీ డాట్ కామ్ ప్రారంభించా- భ‌నావ‌ట్

కంపెనీ ఫ్యూచ‌ర్ ప్లాన్స్..

స్టార్ట‌ప్ కోసం భ‌నావ‌ట్ ఇప్ప‌టివ‌ర‌కు రూ.10 లక్షల పెట్టుబడి పెట్టాడు. 2016 ఫిబ్రవరిలో సిలికాన్ వ్యాలీలో జరిగిన బిజినెస్ సమ్మిట్ కు ఇండియా తరఫున హాజ‌రై, తన టాలెంట్ తో 15 వేల డాలర్ల ఫండ్ తెచ్చుకున్నాడు. వచ్చే ఏడాది కల్లా దేశవ్యాప్తంగా 200 కంపెనీలు, 50 వేల మంది వెండర్లు/బయ్యర్లకు చేరువ కావడమే అత‌డి టార్గెట్. సబ్ స్క్రిప్షన్ ఫీజు మోడల్ నుంచి కమీషన్ బేస్డ్ మోడల్ కు బిజినెస్ ను మార్చాలని భావిస్తున్నాడు. అమెరికా, చైనాలకు వ్యాపారం విస్తరించాలన్న‌ది అతని ప్లాన్. అంతకన్నా ముందు ఇండియాలో 500 మంది విక్రయదారులకు చేరువ కావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు.

కంపెనీ ప్రాడక్ట్ లిస్టింగ్ నెలనెలా 200 శాతం పెరుగుతోంది. ఇదే కంటిన్యూ అయితే 2016-17లో ప్రాడక్ట్స్ సంఖ్య 1,25,000కు చేరుతుంది. యావరేజీ ట్రాన్జాక్షన్ 50 వేల డాలర్లకు రీచ్ అవుతుందంటున్నాడు భనావట్.

నా టీం సంఖ్య‌ను పెంచుకుంటా. అమెరికా, ఇండియన్ ఇన్వెస్టర్ల నుంచి ఫండ్స్ సేకరిస్తాం. స్టార్టప్ ఇస్తాంబుల్- 2016లో మా కంపెనీ స్టాల్ ఒక‌టి ఏర్పాటు చేస్తాం. ప్ర‌స్తుతానికి ఇవే మా ముందున్న ల‌క్ష్యాలు- భ‌నావ‌ట్

బీ2బీ గ్రోత్ కి వెన్నుద‌న్ను..

మైక్రో, చిన్న, మధ్య తరహా అన్నీ కలుపుకొని ఇండియాలో 3.6 కోట్ల చిన్న పరిశ్రమలు ఉన్నాయి. అందులో ఇండస్ట్రియల్ గూడ్స్ కు సంబంధించిన బయ్యర్లు, సెల్లర్లు కూడా భాగమే. భ‌నావ‌ట్ కు చెందిన నాన్ మూవింగ్ ఇన్వెంటరీ డాట్ కామ్ కూడా అదే కోవ‌లోకి వ‌స్తుంది. వీళ్లంతా బీ2బీ ఈ-కామర్స్ గ్రోత్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 2020 నాటికి ఇండియాలో బీ2బీ సెగ్మెంట్ 2.5 రెట్లు వృద్ధి సాధిస్తుందని ఇండస్ట్రీ నిపుణుల అంచనా.

నాన్ మూవింగ్ ఇన్వెంట‌రీ వెబ్ సైట్