ఈ స్మార్ట్ ఫోన్ ఖరీదు జస్ట్ 251 రూపాయలే..!!

ఈ స్మార్ట్ ఫోన్ ఖరీదు జస్ట్ 251 రూపాయలే..!!

Wednesday February 17, 2016,

3 min Read

గుర్తుందా.. స్టీవ్ జాబ్స్ ఐ పాడ్ లాంఛ్‌ చేసినప్పుడు ప్రపంచం ఎలా నివ్వెరపోయిందో! అది ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో ఇప్పుడప్పుడే మరిచిపోలేం. ముఖ్యంగా మీ పాకెట్లో వెయ్యి పాటలు అనే టాగ్ లైన్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

ఆ సంగతి కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు నడిచేదంతా స్మార్ట్ ఫోన్ హవా. చిన్నాపెద్దా తేడాలేదు. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోనే. మీ టూత్ పేస్టులో ఉప్పుందా అని అడిగినట్టు.. మీ ఫోన్‌లో వాట్సాప్ ఉందా, ఫలానా యాప్ ఉందా అని అడుగుతున్నారు. పుసుక్కున స్మార్ట్ ఫోనే లేదని చెప్తే ఎంత పరువు తక్కువ. అందుకే చిన్నదో పెద్దదో- తక్కువ ధరదో ఎక్కువ రేటుదో- ఏదో ఒక స్మార్ట్ ఫోన్ కొనేస్తున్నారు.

image


మరి స్మార్ట్ అంటే డబ్బులు కూడా అంతే స్మార్ట్ ఉంటాయిగా మరి! ఎన్ని ఎక్కువ ఫీచర్లు కావాలంటే అన్ని ఎక్కువ డబ్బు పెట్టాలి. సింపుల్ గా చెప్పాలంటే పిండికొద్దీ రొట్టె! రేటు కొద్దీ స్మార్ట్ ఫోన్‌! అందుకే మనదేశంలో పట్టణప్రాంతాలు మినహా గ్రామీణ ప్రజానికానికి చెప్పుకోదగ్గ స్థాయిలో స్మార్ట్ ఫోన్ దగ్గర కాలేదు. డబ్బులు ఎక్కువ అన్న కారణం ఒకటైతే, ఆపరేటింగ్ మరో సమస్య. నిజానికి స్మార్ట్‌ ఫోన్ ఆపరేట్ చేయడం పెద్ద బ్రహ్మవిద్యేం కాదు. దానికోసం మాస్టర్ డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కామన్ సెన్స్ తో ఆపరేట్ చేయొచ్చు. ఆ పాయింట్‌ని జనాల్లోకి తీసుకుపోగలగాలి. రూరల్ ఏరియాలో ఆ భయం పోగొడితే చాలు.. మార్కెట్ దున్నేయొచ్చు.

ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టి మేకిన్ ఇండియా కాన్సెప్ట్ కూడా అదే. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ వాడకం పెరగాలి. స్మార్ట్ ఫోన్‌ అందరి చేతుల్లో ఉండాలి. డిజిటల్ ఇండియా పేరు సార్ధకం కావాలి. ఈ కాన్సెప్టులోంచి వచ్చిందే ఫ్రీడం స్మార్ట్ ఫోన్ ఐడియా. రింగింగ్ బెల్స్ అనే కంపెనీ ఈ ఫోన్ తయారు చేయడానికి ముందుకొచ్చింది. అదికూడా జస్ట్ 251 రూపాయలకే.

ఇవాళరేపు బేసిక్ స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్ మార్చాలంటేనే రెండువేలకు తక్కువ కాదు. అంతెందుకు ఫోన్ పౌచ్ కొనాలంటేనే మినిమం రూ. 500 అవుతుంది. అలాంటిది 251 రూపాయలకే ఏకంగా ఫోనే ఇస్తున్నారంటే నమ్మశక్యం కాదు. అసలు తయారుచేయడం, మాన్యుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఇవన్నీ లెక్కలేసుకుంటే సాధ్యమేనా అన్న ప్రశ్న రాకమానదు. కానీ కేంద్రం ఇచ్చిన మద్దతుతో రింగింగ్ బెల్స్ సంస్థ సబ్సిడీ స్మార్ట్ ఫోన్ తయారుచేయడానికి ముందుకొచ్చింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఈ ఫోన్ భారీగా ఊతమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

రూ. 251 అంటున్నారు కదాని ఇదేదో తేడా ఫోన్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కాస్ట్ తక్కువే కానీ ఫీచర్లకేం ఢోకాలేదు. డుయెల్ కెమెరా దీంట్లో అన్నికంటే బెస్ట్ ఫీచర్. 3మెగా పిక్సెల్ రియర్ కెమెరా.. 3ఎంపీ ఫ్రంట్ కెమెరా. ఈమాత్రం కెమెరా ఉన్న స్మార్ట్‌ ఫోన్ కావాలంటే ఇండియాలో అట్లీస్ట్‌ 4 వేల రూపాయలైనా కావాలి.

ఇంకో ఖతర్నాక్‌ ఫీచర్ ఏంటంటే- లో కాస్ట్ ఆండ్రాయిడ్ విత్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. మిగతా ఫోన్లలో ఇలాంటి ఫీచర్ ఊహించడమే కష్టం. రింగింగ్ బెల్స్ సంస్థకు అదేం పెద్ద కష్టం కాలేదు. లాలిపాప్ ఆండ్రాయిడ్‌తో ఫోన్ రిలీజ్ చేస్తోంది. దాంతో ఫ్యూచర్ అప్‌ డేట్స్ కూడా ఈజీ అవుతాయి.

కనెక్టివిటీ డిసప్పాయింట్ చేయదు. త్రీజీ ఉంది. వైఫై, జీపీఎస్‌, వన్ జీబీ రామ్, 8జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్ పాండబుల్. ఇంకో విశేషం ఏంటంటే ఫోన్లో కొన్ని యాప్స్ ముందే ఇన్ స్టాల్ చేసి ఉంటాయి. అవి రైతులు, మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినవి. మహిళలు సేఫ్టీ కోసం వేరే యాప్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. 450mAh బ్యాటరీ. ఎంతలేదన్నా హాఫ్ డే వస్తుంది. 251 రూపాయల స్మార్ట్ ఫోన్‌లో ఇంతకు మించి ఫీచర్స్ ఆశించడం అన్యాయం కదా! అందుకే బుకింగ్ కోసం త్వరపడండి. ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్. ఆలసించినా ఆశాభంగం.