కార్టూన్ సిలబస్ తో కొత్త చరిత్ర సృష్టిస్తున్న యాడ్ మేకర్

విద్యావ్యవస్థలో సమూల మార్పులకు ప్రయత్నిస్తున్న CSR స్టార్టప్

కార్టూన్ సిలబస్ తో కొత్త చరిత్ర సృష్టిస్తున్న యాడ్ మేకర్

Tuesday April 12, 2016,

4 min Read


స్కూలుకు వెళ్లనని మారాం చేసే పిల్లలను మనం ప్రతి రోజూ చూస్తూంటాం..! మన పిల్లలో.. పక్కింటి పిల్లలో అలా ఏడుస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు బలవంతంగా స్కూల్ వ్యాన్ ఎక్కించడమో.. తీసుకెళ్లి దిగబెట్టి రావడమో చేస్తుంటారు. పిల్లల్లో స్కూల్ పై విరక్తి పెరగడానికి ప్రధాన కారణం... క్లాసులో చెప్పే పాఠాలే.

మరి పాఠాలు చెప్పకుండా స్కూళ్లెందుకంటారా..? అయితే థింక్ డిఫరెంట్..!

అదే బ్లాక్ బోర్డు.. అదే చాక్ పీస్.. అదే పాఠం... అదే టీచర్ స్టైల్...!. విసుగొచ్చి చిన్నారులు ఆవలిస్తే టీచర్ వైపు నుంచి దూసుకొచ్చే చాక్ పీసు ముక్కలు. దాదాపు అన్ని స్కూళ్లలోనూ ఇవే సన్నివేశాలు. కరికులమ్ మార్చాలి.. మార్చాలి అని వేదికలెక్కి పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే పెద్ద మనుషుల స్కూళ్లలోనూ ఇదే తరహాల సిలబస్ ఉంటుంది. కాలంతో పాటు మార్పు చాలా ముఖ్యం.. కానీ భారతీయ విద్యావ్యవస్థలో ఈ మార్పు చాలా మెల్లగా వస్తోంది.

ఈ లోపు మారుతున్న కాలంతో పాటు నేర్చుకోవాల్సిన అంశాలను బాల్యం నేర్చుకోలేకపోతోంది. ఫలితంగా తరం వెనుకబడిపోతోంది. ప్రైవేటు పాఠశాలు ఒకడుగు ముందుకు వేసినా.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం టీచింగ్ స్టైల్ ఏ మాత్రం మెరుగు పడలేదు.

ఈ పరిస్థితిని మార్చేందుకు ముందడుగు వేశాడు విజయ్ శ్రీనివాస్ ప్రతివాది. కర్నాటకు చెందిన ఈ అడ్వర్టయిజింగ్ ప్రొఫెషనల్ "ఈఫండు" పేరిట ఓ స్టార్టప్ ప్రారంభించారు. దీని లక్ష్యం.. చిన్నారులకు సిలబస్ ని కార్టూనీకరించడం. అంటే కార్టూన్ ద్వారా.. పిల్లలకు ఇష్టమైన రీతిలో బాగా ఆర్థం చేసుకునేలా.. ప్రాక్టికల్ గా ఉండేలా పాఠాలను బోధించడం.

వీధి బాలుడు తెచ్చిన ఆలోచన

విజయ్ శ్రీనివాస్ ఓసారి బెంగళూరులో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు నిండా పదేళ్లు లేని చిన్న పిల్లవాడు వచ్చి చేయి చాచాడు. తన దగ్గరున్న బిస్కెట్ పాకెట్ ను విజయ్ శ్రీనివాస్ చిన్నారికి ఇచ్చారు. ప్యాకెట్ ను గబగబా చింపిన ఆ చిన్నారి... బిస్కెట్లు తింటూ ప్యాకేట్ రేపర్ ను తదేకంగా చూడటం ప్రాంభిచాడు. స్కూల్ మొహమే చూడని ఆ చిన్నారిని దానిపై ఉన్న బొమ్మల ఆధారంగానే అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడనే విషయం విజయ్ శ్రీనివాస్ కు అర్థం అయింది. అప్పుడే బాలల కోసం ఏమైనా చేయాలనే ఆలోచన వచ్చింది. నిరుపేదల బాల బాలికలు.. కార్పొరేట్ స్కూళ్లకు వెళ్లలేని వారికి చదువు విషయంలో సాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాడు.

సాధారణ విద్యా విధానం ఎంత రొటీన్ గా ఉంటుందో విజయ్ శ్రీనివాస్ అంచనా వేశాడు. ముఖ్యంగా ప్రైమరీ క్లాసుల్లో ఈ పరిస్థితి మరీ దారుణం. అందుకే పిల్లలకు ఆసక్తి కలిగేలా టెక్ట్స్ బుక్స్ ను రూపొందించాలనే ఆలోచన చేశాడు. పాఠాలను కథలుగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. టెక్ట్స్ బుక్స్ పాఠాలన్నింటినీ కార్టూన్ కథల రూపంలోకి మార్చేందుకు సంకల్పించారు. దాని కోసం ప్రారంభించిన వెంచరే "ఈఫండు". ఇండియా మొట్టమొదటి కార్టూన్ సిలబస్ తయారు చేసిన ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. పాఠాల్లో చిన్నారులు లీనమయ్యేలా కార్టూన్ క్యారెక్టర్లే పాఠాలను వివరిస్తూ విద్యార్థులను ఇంటరాక్ట్ చేస్తూ సాగేలా సిలబస్ ను రూపొందించారు.

image


ఈ-ఫన్-డు - ఫన్ ఇన్ ఎడ్యుకేషన్

చదువును అంత సీరియస్ గా చెప్పడం దండగ. ఉల్లాసంగా ఉన్న మెదడు మరింత వేగంగా నేర్చుకుంటుంది. ఇది విజయ్ శ్రీనివాస్ నమ్మే సిద్దాంతం. అయితే తరతరాలుగా భారతీయ విద్యావిధానంలో మార్పు రావడం లేదు. ఇది కొత్త తరానికి చాలా కీడు చేస్తుందంటారు మేఘశాల ఫౌండేషన్ జ్యోతి త్యాగరాజన్. ఈఫండు కార్టూన్ సిలబస్ కంటెంట్ ఎనలైజింగ్ లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

" నేటి తరం పిల్లలకు బహుముఖ ప్రజ్ఞతో పాఠాలు చెప్పాలి. ఎందుకంటే గత తరాల కంటే ఎంతో అదనపు సమాచారాన్ని ఈ తరం పిల్లలు చాలా త్వరగా తెలుసుకుంటున్నారు. లేకపోతే మనం చాలా విలువైన విషయాలను చెప్పలేకపోతాం. దాంతో పిల్లలు నష్టపోతారు" జ్యోతి త్యాగరాజన్

అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను వివిధ రకాల యాక్టివిటీస్ లో భాగం చేస్తారు. ఇండియాలో ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఇంకా చాక్ అండ్ డస్టర్ విధానమే ఉంది. బ్లాక్ బోర్డు మీద రాసేవి అన్ని సత్యాలే. కానీ వాటిని నిజ జీవితంలో ఎలా ఆచరించాలో చెప్పే విధానమే మన దగ్గర లేదు. పిల్లలను సొంతంగా ఆలోచించేలా చేయడమే అతి ముఖ్యమైన పని. మెకానికల్ గా చెప్పుకుంటూ పోతే ప్రయోజనం ఉండదు. వారిని ఆలోచింప చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. నిజానికి భారత విద్యావిధానం మాటల్లో కొంచెం అడ్వాన్స్ గానే ఉంటుంది. కానీ అమలు చేసే విషయంలో మాత్రం ఎక్కడో వెనుకబడి ఉంది. ప్రభుత్వం, అధికారగణం నిర్లక్ష్యం వల్ల గొప్ప పాలసీ కూడా చేతకానిదానిగా ఉండిపోతోంది. ఈఫండు లాంటి స్టార్టప్స్ రూపొందించిన రూపొందించిన ప్రత్యామ్నాయ టీచింగ్ మెథడ్స్- ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి బాగా ఉపయోగపడతాయి. CBSE, ICSE బోర్డుల సిలబస్ మధ్య సమన్వయం సాధించేందుకు ఈఫండు కార్టూన్ సిలబస్ ప్రయత్నం చేస్తోంది.

కర్నాటకలో రాష్ట్ర ప్రభుత్వం CBSE సిలబస్ ను ఫాలో అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తోంది. NCERT సిలబస్ ను మేము బేస్ గా తీసుకున్నాం. టీచర్ల ఇన్ పుట్స్ తో స్టోరీని రిఫైన్ చేసి మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నాం" విజయ్ శ్రీనివాస్  

గత ఏడాది ఐదో తరగతి ఎన్విరాన్ మెంటల్ స్టడీస్ లో NCERT సిలబస్ ప్రకారం పైలట్ పేరుతో ఓ పాఠ్యాంశాన్ని విడుదల చేశారు. ఇందులో ఓ గ్రహాంతరవాసి తన ఇద్దరు మిత్రులకు అన్ని విషయాలను వివరించి చెబుతూ ఉంటుంది. ప్రముఖ కార్టూనిస్టు బీజీ గుజ్జూరప్ప ఈఫండు కోసం కార్టూన్స్ డిజైన్ చేస్తున్నారు.

మాతృభాషను ప్రేమించాలి. అలాగే ఇంగ్లిష్ ను ప్రొఫెషనల్ లాంగ్వేజ్ గా అంగీకరించాలి. అందుకే ఈఫండు కార్టూన్ సిలబస్ మొత్తం బైలింగ్వల్ గా ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఇంగ్లిష్ ను వేగంగా అర్థం చేసుకోలేరు. అందుకే ఇంగ్లిష్ లో పాఠాలు చెబుతూ ఉంటే కన్నడలో టీచర్లు నెరెట్ చేస్తూంటారు. దీని వల్ల రెండు భాషలను పిల్లలు సులువుగా అర్థం చేసుకోగలరని విజయ్ శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. ఐదో తరగతి కోసం రెండో పుస్తకాన్ని, నాలుగో తరగతి కోసం మూడో పుస్తకాన్ని ఈ ఏడాది మే కల్లా అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఇంగ్లిష్ - హిందీ, ఇంగ్లిష్ - కన్నడ బైలింగ్వల్ లో ఉండేలా రెడీ చేస్తున్నారు. వీటిని ప్రభుత్వ స్కూళ్లకు పంపిణి చేసేందుకు మేఘశాల ఫౌండేషన్, ఎన్ ఫోల్డ్ ఇండియా లాంటి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నారు. ఇప్పటికే పదకొండు వందల ప్రభుత్వ స్కూళ్లలో పదివేల కాపీలను పంచారు. ఈ మొత్తం కార్టూన్ సిలబస్ యజ్ఞంలో మరికొన్ని అక్షయపాత్ర ఫౌండేషన్, శిక్షణ, డ్రీమ్ స్కూల్ ఫౌండేషన్ లాంటి సంస్థలు కూడా సహకారం అందిస్తున్నాయి.

వ్యాపారంగా విస్తరణ

నిజానికి విజయ్ శ్రీనివాస్ ఈ స్టార్టప్ ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద చేపట్టారు. తత్వ క్యూ లైఫ్ ల్యాబ్స్ అనే కార్పొరేట్ సంస్థకు చెందిన MSTQ ఫౌండేషన్ దీనికి ఫండింగ్ చేసింది. అలాగే ఇరవై వేల డాలర్ల పెట్టుబడిని జీవీ అయ్యంగార్ అనే ప్రవాస భారతీయ విద్యావేత్త అందించారు. అయితే ఇప్పుడు దీన్ని వ్యాపారపరంగా విస్తరించాలని విజయ్ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారు. మరికొంత ఇన్వెస్ట్ మెంట్ కోసం చూస్తున్నారు. గత రెండునెలలుగా ఈ కార్టూన్ సిలబస్ ను అమెజాన్ లో అందుబాటులో ఉంచుతున్నారు. కొత్త కార్టూన్ సిలబస్ పుస్తకాల రూపకల్పన కోసం పన్నెండు మందితో టీం పనిచేస్తోంది. వెంచర్ క్యాపిటల్ ఫండ్ పిలిచేవరకూ ప్రతి అంట్రపెన్యూర్ ఐడియా కలవరానికి గురిచేస్తూనే ఉంటుందంటారు విజయ్. అంతా అనుకున్నట్లుగా సాగితే స్కూల్ ఎడ్యుకేషన్ లో విప్లవాత్మకమైన మార్పులకు "ఈఫండు" శ్రీకారం చుట్టినట్లేనని విజయ్ శ్రీనివాస్ దీమాగా చెబుతున్నారు.

వెబ్ సైట్ :