ఆ లూప్ హోల్స్ పూడ్చకుంటే నోట్ల రద్దు శుద్ధ దండుగ!

రాజకీయపార్టీలపై లోతైన పరిశీలన

ఆ లూప్ హోల్స్ పూడ్చకుంటే నోట్ల రద్దు శుద్ధ దండుగ!

Friday November 25, 2016,

3 min Read

కరెన్సీ రద్దు నిర్ణయం నల్లబాబుల భరతం పడుతుందని.. ఈ దెబ్బతో ఇండియన్ ఎకానమీ గాడిన పడుతుందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. కరెక్టే.. నిర్ణయం బావుంది. కానీ ఆ ఒక్క లూప్ హోల్ సంగతేంటి? దాని విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు?

మన దేశంలో పొలిటికల్ పార్టీలు విరాళాల మీద బతుకుతుంటాయి. అయితే అవి ఎన్ని వచ్చాయి.. ఎవరిచ్చారు.. అనే దానికి మాత్రం లెక్కాపత్రం ఉండదు. 20వేల కంటే తక్కువ వచ్చిన డొనేషన్లకు చిట్టాపద్దులు రాయరు. అదొక్క లొసుగు చాలు.. పార్టీలు పండగ చేసుకోడానికి. ఆర్టీఐకి కూడా దొరకకుండా పండగ చేసుకుంటాయి.

నవంబర్ 8న ప్రధాన మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తెల్లారి నుంచే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం ఎలా అనే దానిపైనే బడాబాబులు ఫోకస్ చేశారు. నల్లడబ్బును తేటగా మార్చేందుకు వీలైనన్ని దారులు వెతికారు. రోజుకో లూప్ హోల్ బయటపడంతో కేంద్రం కూడా రోజుకో నిబంధన పెడుతూ వచ్చింది. ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చింది. ఖాతాదారుల వేలికి సిరా మొదలుకొని గత రెండు వారాలుగా డిపాజిట్లు, నగదు మార్పిడి విషయంలో డజన్ల కొద్దీ రూల్స్ పాస్ చేసింది. ఇన్ని చేసిన కేంద్రం.. రాజకీయపార్టీల విరాళాల్లో ఉన్న లొసుగులను మాత్రం చూసీచూడనట్టు వదిలేసింది.

రాజకీయ పార్టీలు, వారి అనుచరులకు బ్లాక్ మనీని వైట్ గా మార్చడం మంచినీళ్లు తాగినంత ఈజీ. అదెలాగో కాస్త వివరంగా చర్చించుకుందాం..

image


->స్టెప్ 1 

మీ దగ్గరున్న బ్లాక్ మనీని ఒక్కో విరాళం 20వేల కంటే మించకుండా ఎంత మంది పేరుమీదనైనా, ఎన్ని కోట్ల రూపాయలైనా డొనేట్ చేయొచ్చు. పార్టీలు ఏం చేస్తాయంటే వాటన్నిటినీ గుప్త దానాల కింద చూపిస్తాయి.

ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆర్పీ యాక్ట్.. అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం 20వేల కంటే తక్కువ వచ్చిన వ్యక్తిగత చందాల బాపతు లెక్కలను ఎన్నికల సంఘానికి చూపించాల్సిన అవసరం లేదు. అప్పడేం చేస్తారంటే.. ఎల్లయ్య పేరుమీద, పుల్లయ్య పేరుమీద, ఆకాశ రామన్న పేరుమీద విరాళాలు వచ్చాయని రాస్తారు.

ఇదే కోణంలో ఒకసారి లెక్కలు చూద్దాం.. దేశంలో ఉన్న ఆరు జాతీయ పార్టీలు 2004 నుంచి 2012 మధ్యన సుమారు రూ. 4,368.75 కోట్లు చందాల రూపంలో వసూలు చేశాయని అనుకుందాం. ఆ మొత్తాన్ని రూ 20వేలకు మించకుండా భాగిస్తే, 22 లక్షల మంది 20వేలకు మించకుండా డొనేషన్లు ఇచ్చారని తేలుతుంది.

-> స్టెప్ -2

అప్పుడా డబ్బు మొత్తాన్ని దర్జాగా పార్టీ అకౌంటులో వేసుకోవచ్చు. ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. పొలిటకల్ పార్టీలకు ఇందులో వందశాతం మినహాయింపు ఉంటుంది.

-> స్టెప్ -3

జమ చేసిన డబ్బును ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత డ్రా చేసుకోవచ్చు. అదంతా వైట్ మనీకిందకే వెళ్తుంది. దాన్ని ఎలా ఖర్చు పెడతారో, ఎంత ఖర్చు పెడతారో పార్టీల ఇష్టం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే.. పొలిటికల్ పార్టీల ఆదాయ వ్యయాలు ఆర్టీఐ పరిధిలోకి రావు. ఎవరీకీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడిది అంత డబ్బు అని అడిగే హక్కు ఎవరికీ లేదు.

కొంతమంది వాదిస్తారు.. ఆ డబ్బంతా బ్యాంకులో పడ్డ తర్వాత ప్రతీ పైసా లెక్కే కదా అని.. దాన్నెలా కప్పిపుచ్చవచ్చో చెప్తా..

రూల్స్ ప్రకారం, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 75 రోజుల లోపు, లోక్ సభ ఎలక్షన్లు అయిన 90 రోజుల లోపు పొలిటికల్ పార్టీలు తమ ఖర్చుల లెక్కలేంటో ఈసీకి చూపించాలి. కానీ ఏమవుతుందంటే, నాన్ ఎలక్షన్ పీరియడ్ లో దేనికెంత ఖర్చయిందో లెక్కలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్- ఒక పార్టీ ఎన్నికల కోసమని రూ. 500 కోట్లు బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకుంది అనుకుందాం. అయితే అవి తీసిన పర్పస్ పక్కన పెట్టి, రోజువారీ అడ్మిన్ కోసం ఖర్చు పెట్టొచ్చు.

రెండోది- ఏడాదంతా ఖర్చు చేసిన లెక్కలను కూడా ఈసీకి సమర్పించే అవకాశమూ లేకపోలేదు. ఇదంతా నిజమా అబద్దమా అని ఆరా తీయడం ఈసీకి సాధ్యం కాదు. ఉదాహరణకు ఒక పార్టీ భారీ ర్యాలీ తీసింది అనుకుందాం. దానికోసం ఒక కోటి రూపాయలకు కేవలం వాటర్ బాటిల్స్ కోసమే ఖర్చు చేశాం అని రాస్తారు. నిజానికి వాటర్ బాటిల్స్ ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు. కచ్చితంగా ఇచ్చారా లేదా అనేది ఎన్నికల సంఘం తేల్చడం అసాధ్యం. ఎందుకంటే అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించలేరు కాబట్టి.

అందువల్ల ఏమవుతుందంటే- డబ్బు మొత్తం బ్యాంకు ద్వారానే వచ్చినా, అదంతా బ్లాక్ మనీ కిందకే పోతుంది. ఈ లొసుగులు, ఈ లూప్ హోల్స్ పూడ్చకుండా డిమానిటైజేషన్ చేస్తే ఇండియా ఎకానమీకి ఒరిగేది శూన్యం.

అందుకే ఏం చేయాలంటే..

రాజకీయ పార్టలు ఖర్చు చేసే ప్రతీ పైసాకు లెక్క చెప్పాలని మాండేటరీ పెట్టాలి. లెక్క చూపని డొనేషన్లకు 30 శాతం ఆదాయపన్ను ముక్కు పిండి వసూలు చేయాలి.

ప్రతీ రాజకీయ పార్టీని ఆర్టీఐ యాక్ట్ కిందకు తేవాలి.

తప్పుడు లెక్కలు చూపే పార్టీపై చర్యలు తీసుకునేలా ఈసీకి, ఐటీ శాఖకు అధికారాలు కట్టబెట్టాలి.

ఈ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించి ఒక చట్టం తేవాలని కోరుకుంటున్నా. అలా జరిగితే దేశం అనుకున్నట్టుగా అవినీతి నుంచి బయటపడుతుంది. లేకపోతే నోట్ల రద్దు నిర్ణయం ఒక చారిత్రక తప్పిదం అవుతుంది.

(గమనిక: పైన తెలిపిన అభిప్రాయాలు, సూచనలన్నీ రచయిత సొంత ఆలోచనలే. యువర్ స్టోరీ చెప్పినట్టుగా భావించ వద్దు.)

రచయిత నిశాంక్ వర్షిణి. ఇతను పబ్లిక్ పాలసీ స్కాలర్. గతంలో రాజకీయ సంస్కరణలకు న్యాయ సలహాలిచ్చే సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ లో పనిచేశారు.