నాలుగు వేలతో నార్త్ ఇండియా, నేపాల్ టూర్

ఆదిత్య భూషణ్ ద్వివేది చేసిన పర్యటన ఆయన మాటల్లోనే ! తక్కువలో ప్రయాణం ఎలా సాధ్యమో చేసి చూపించాలాంగ్ జర్నీలో ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోండితక్కువ ఖర్చులో ఎక్కువ ప్రదేశాలు చూడడం ఎలా సాధ్యం ?

నాలుగు వేలతో నార్త్ ఇండియా, నేపాల్ టూర్

Sunday April 12, 2015,

8 min Read

మనం ఒక్కచోటే ఉండాలని దేవుడు కోరుకుంటే.. మనకు కాళ్ళకు బదులుగా వేర్లను ఇచ్చేవాడు.

20వ శతాబ్దంలో పర్యాటక రంగం గురించి.. బ్లాగుల్లో వేలకొద్దీ పోస్టులు ప్రచురితమయ్యాయి. ప్రయాణాల వల్ల గతంలో మీరు ఎన్నడూ అనుభూతి చెందని రీతిలో మీరు ఎదుగుతారు అని వారిలో ఎవరు చెప్పినా.. అది ముమ్మాటికీ నిజమే. పర్యటనలు బాగా ఖర్చుతో కూడుకున్నవన్న భావన చాలా మందిలో ఉంది. అయితే.. నిర్దిష్టమైన విధానాలు అనుసరిస్తే.. పర్యాటక వ్యయాన్ని మీ అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఒంటరి ప్రయాణాలు రొమాంటిక్ గా ఉంటాయి, తెలియని ప్రదేశాల్లో.. తెలియని వ్యక్తులతో పరిచయాలు థ్రిల్లింగ్ గా ఉంటాయి. కొన్నిసార్లు ఇవి లేనిపోని సమస్యలనూ తెచ్చే వీలుంది. ఎక్కువ మందితో కలిసి సాగించే ప్రయాణం కన్నా.. ఒంటరిగా వెళ్ళడమే కాస్తంత చవక. నేను ఈ మధ్యనే అమృత్ సర్, పఠాన్ కోట్, ధర్మశాల, డెహ్రాడూన్, ముస్సోరీల మీదుగా ఖాట్మండు వరకు ప్రయాణించి వచ్చాను. ఆ వివరాలను మీతో పంచుకోదలిచాను.

ప్రణాళిక:

అన్నింటినీ మనకు అనువుగా మార్చుకోవడమే... ప్రయాణ ఘట్టంలో అత్యంత కీలకం. ఢిల్లీకి బయలుదేరే ముందు.. నేను ఏఏ నగరాలను సందర్శించాలనుకుంటున్నానో.. ప్రయాణాలకు ఎంతెంత సమయం పడుతుందో అన్న వివరాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా సేకరించి సిద్ధం చేసుకున్నాను. ఫేస్ బుక్ లోని వివిధ ఫోరమ్స్ ద్వారా అందిన సూచనలు.. నేను వెళ్ళే నగరాల్లో నా వసతికి సంబంధించిన ప్రణాళికకు ఉపకరించాయి. అయితే ఈ ప్రణాళికలు శిలాశాసనాలేమీ కాదు. ప్రయాణ సమయంలో.. అక్కడికక్కడ లభించే సమాచారం ఆధారంగా నేను కొన్ని కొత్త ప్రదేశాలనూ నా ప్రణాళికలో చేర్చాను. అలాగే అంతకుముందే నిర్దేశించుకున్న కొన్ని ప్రదేశాలకు వెళ్ళకుండానే తిరిగి వచ్చేశాను. ఉదాహరణకు, నా ప్రయాణంలో.. కాంగ్రా లోయ, బొమ్మ రైలు గురించి విని, ధర్మశాలకు నేరుగా కాకుండా, ఫఠాన్ కోట్ మీదుగా వెళ్ళాలని ప్రణాళికను మార్చుకున్నాను. నేను ఎక్కువగా ఆన్ లైన్ గైడ్స్ ను ఉపయోగించుకున్నాను. స్థానికుల నుంచి నేను వెళ్ళాల్సిన ప్రదేశాల సమాచారాన్ని సేకరించాను.


ఇదీ టూర్ ప్లాన్

ఇదీ టూర్ ప్లాన్


ప్యాకింగ్ :

నేను ట్రైపాడ్ బ్యాగ్ తో పాటు.. చాలా తేలికైన, కేవలం 12.5 కిలోల బరువు మాత్రమే ఉన్న బ్యాగ్ ను నావెంట తీసుకు వెళ్లాను. వీలైనంత ఎక్కువగా గాడ్గెట్స్ ని నాతో ఉంచుకునే వాణ్ణి. రెండు కెమరాలు, రెండు లెన్స్ లు, ఫిల్టర్లు, అదనపు బ్యాటరీలు, ఐదు మెమొరీ కార్డులు, ఒక ల్యాప్ టాప్, ఒక టిబి హార్డ్ డిస్క్, రెండు మైక్రో ఫోన్స్, ఒక వాయిస్ రికార్డర్, ఐదు జతల దుస్తులు మాత్రమే తీసుకు వెళ్ళాను. కాళ్ళకు శాండిల్స్ వేసుకున్నాను. షూస్ కూడా బాగానే ఉంటాయి. అది వేసవి కావడంతో ఢిల్లీలో ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెంటీగ్రేడ్ కు చేరింది. కడుపు నొప్పి, అతిసార నిరోధానికి సంబంధించిన కొన్ని మాత్రలను నా వెంట తీసుకు వెళ్ళాను.

పర్యటన అనుభూతి :

రెడ్ బస్ ను ఉపయోగించి, ఢిల్లీ నుంచి అమృత్ సర్ కి రూ. 600 వెచ్చించి, రాత్రి సర్వీసు బస్సులో టికెట్ బుక్ చేశాను. రాత్రంతా ప్రయాణం సాగింది. అమృత్ సర్ చేరేసరికి, సైకిల్ రిక్షా ఎక్కి స్వర్ణ దేవాలయానికి వెళ్లాను. ఆలయానికి చేరుకోగానే, అత్యంత చౌకగా లభించే వసతి ఎక్కడ లభిస్తుందో ఆరా తీశాను. హోటళ్ళు రూ.400 పైబడి అద్దెను వసూలు చేస్తున్నాయి. అయితే.. గురుద్వారా కాంప్లెక్స్ లోని హోటళ్ళలోనూ గదులున్నాయి. వాటికి రూ.300 నుంచి రూ.400 వసూలు చేస్తున్నారు. ఉచిత లాకర్ సదుపాయం కూడా ఉంది. దీంతో, లాకర్ తీసుకొని నా సరంజామాను అందులో ఉంచాక, స్వర్ణదేవాలయపు సరస్సులో స్నానం చేశాను. ఆలయ ప్రాంగణంలోనే భోజనం చేశాను. ఆ తర్వాత ఆలయం నుంచి ఐదు నిమిషాల నడక దూరంలో ఉన్న జలియన్ వాలా బాగ్ ప్రాంతాన్ని సందర్శించాను. జలియన్ వాలా బాగ్, అద్భుతమైన తోటగా మారిన గొప్ప చారిత్రక ప్రదేశం. తూటాల గాయాల పాలైన గోడలు, అమరవీరుల ప్రాణత్యాగాల బావి ఆకర్షిస్తాయి. చెంతనే ఉన్న మ్యూజియం, జలియన్ వాలా బాగ్ ఊచకోతకు సంబంధించిన విశేషాలను వివరిస్తుంది.


జలియన్ వాలాబాగ్ ప్రదేశం, అక్కడ కనిపించే బాక్సులే తూటాల గుర్తులకు చిహ్నాలు

జలియన్ వాలాబాగ్ ప్రదేశం, అక్కడ కనిపించే బాక్సులే తూటాల గుర్తులకు చిహ్నాలు


స్వర్ణదేవాలయ అందాన్ని ఆస్వాదించేందుకు ఓ గంట సమయం ఏమాత్రం చాలదు. దీంతో మరోమారు ఆలయాన్ని సందర్శించాను. ఆలయపు ఫోటోలు తీసుకున్నాను. సాయంత్రం, వాఘా సరిహద్దుల్లో పతాక మార్పిడి ఉత్సవాన్ని తిలకించేందుకు అత్తారికి వెళ్ళాను.అమృత్ సర్ నుంచి 30 నిమిషాలు ప్రయాణించాక భారత, పాకిస్తాన్ సరిహద్దుల్లోని అత్తారిచేరుకున్నాను. షేర్ క్యాబ్ రూ.100 వసూలు చేస్తే.. ఏసీ వాహనాలు రూ.150 వసూలు చేస్తారక్కడ. వాఘా సరిహద్దుల్లోని వాతావరణం దేశభక్తిని పెంపొందించేదిగా ఉంది. ఆ ప్రాంతం జనసమ్మర్దంగా ఉంది. వారాంతాల్లో చాలామంది వస్తారిక్కడికి. నీటి సీసా తీసుకు వెళ్లడం మాత్రం మరువకండి.

వాఘా సందర్శననాంతరం, ఆలయంలో రాత్రి భోజనం చేశాను. అక్కడే నిద్రకు ఉపక్రమించాను. ఆలయ పరిసరాల్లో నక్షత్రాల కాంతులు పరిశీలిస్తూ.. నిద్రించడం గొప్ప అనుభూతి. ఉన్నవాడైనా, లేనివాడైనా అక్కడ ఉన్న సౌకర్యం అదే. సహ యాత్రికులతో ముచ్చట్లాడుతూ.. నిద్రలోకి జారుకున్నాను.


వాఘా బోర్డర్ - అత్తారి

వాఘా బోర్డర్ - అత్తారి


మర్నాడు ఉదయం పఠాన్ కోట్ కి బయలుదేరాను. బొమ్మ రైలులో కాంగ్రా లోయ అందాలను ఆస్వాదించాను. ఈ రైలు టికెట్ ధర కేవలం రూ.20. సుమారు అయిదారు గంటల పాటు రైల్లో.. నగరవాసపు రణగొణధ్వనులకు దూరంగా, లోయ అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. ధర్మశాలకు నేరుగా వెళ్లకుండా, నా ప్రయాణంలో మార్పు చేసుకున్న కాంగ్రా లోయ ప్రదేశం ఇదే. రైలు ప్రయాణం తర్వాత రోడ్డుపై కాస్సేపు నడిచాను. తర్వాత పానీపూరి తిని.. ధర్మశాలకు వెళ్ళే బస్సును ఎక్కాను.

సమయం వేగంగా గడిచిపోతోంది. నేను మెక్ లియోగంజ్ చేరుకోవాలి. అక్కడికి వెళ్లేందుకు చివరి బస్సును అందుకోవాలి. మెక్ లియోగంజ్ చేరుకున్నాను. అక్కడ స్థానిక డాబాలో భోజనం చేశాను. అక్కడి నుంచి దాల్ సరస్సుకు వెళ్ళే మార్గం గురించి వివరాలు సేకరించాను. బస్సు స్టాప్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దాల్ సరస్సు అత్యంత నయన మనోహరంగా ఉంది. సరస్సు చుట్టూ అతి పొడవైన చెట్లు విస్తరించి ఉన్నాయి. స్థానికులకు ఇది గొప్ప పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతోంది. అక్కడ సుమారు గంట గడిపాక, తిరిగి ధర్మశాలకు వచ్చి.. అక్కడినుంచి డెహ్రాడూన్ బయలుదేరాను. ధర్మశాల నుంచి డెహ్రాడూన్ చేరడానికి పన్నెండు గంటలు పట్టింది. డెహ్రాడూన్ చేరగానే, బస్టాండ్ లోనే ఉన్న వసతి గృహంలో బస చేశాను. గెస్ట్ హౌస్ ల్లో గదుల ధర రోజుకి రూ.200 నుంచి రూ.300 ఉంటుంది. డార్మిటరీల్లో రూ.100 వసూలు చేస్తారు.

డెహ్రాడూన్ లో రెండు రోజులు గడిపాను. ముస్సోరీ, రామర్స్ గుహ, సహస్ర ధార ప్రాంతాలను సందర్శించాను. ఈ ప్రదేశాలు ఫోటోగ్రాఫర్లకు వరదాయకాలు. గుహ అంతటా మోకాలి లోతు నీళ్ళు పారుతూ ఉంటాయిక్కడ. గుహలోనే కొన్ని మీటర్లకు ఒకటి చొప్పున ఎన్నో జలపాతాలూ మనకు కనిపిస్తాయి. సహస్ర ధార అంటే వెయ్యి జలపాతాలు అని అర్థం. అక్కడ అడుగడుగుకు ఒక ధార మనకు గోచరమవుతూ ఉంటుంది. కొండపై భాగంలోని ఆలయానికి వెళ్ళేందుకు రోప్ వే సౌకర్యం ఉంటుంది. అక్కడినుంచి మొత్తం లోయను చూడడం అనిర్వచనీయమైన అనుభూతి. ఈ రెండు ప్రదేశాలు నగరానికి చాలా దూరంగా ఉంటాయి. స్థానికంగా బస్సు సదుపాయాన్ని ఉపయోగించుకొని అక్కడికి చేరుకున్నాను.


కంగ్రా వ్యాలీ టాయ్ ట్రైన్ ప్రయాణం. ఆరు గంటల  అద్భుత యాత్ర

కంగ్రా వ్యాలీ టాయ్ ట్రైన్ ప్రయాణం. ఆరు గంటల అద్భుత యాత్ర


తర్వాత గమ్యస్థానం ముస్సోరీ. అక్కడికి బస్సులో బయలుదేరాను. రస్కిన్ బాండ్ ను సందర్శించడమూ నా అజెండాలో ఉంది. డెహ్రాడూన్ నుంచి ముస్సోరీకి టికెట్ ధర రూ.50. ముస్సోరీ ఓ చిన్న పట్టణం. అక్కడ నడక దారే శరణ్యం. నేను రస్కిన్ బాండ్ గృహానికి వెళ్లాను. కొండల్లో తిరుగాడేటప్పుడు నడకే శరణ్యం. ఆ ఇంటికి చేరాక, దుమ్ము కొట్టుక పోయిన నా దుస్తులను మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాను. దగ్గర్లోని దుకాణానికి వెళ్ళి, నా దుస్తులు మార్చుకొని, మరికొన్నింటిని ఇస్త్రీ చేయించాను.


దాల్ లేక్, మెక్ లాయిడ్ గంజ్

దాల్ లేక్, మెక్ లాయిడ్ గంజ్


రస్కిన్ బాండ్ గృహాన్ని చేరుకునేసరికి, ప్రేమ్ నాకు స్వాగతం పలికారు. రస్కిన్ బాండ్ కథలను చదివిని వారికి ప్రేమ్ తప్పక గుర్తుకు వస్తాడు. బాండ్ రచనల్లో ఆపేరుతో ఓ ప్రత్యేక పాత్ర ఉంది. ఆ తర్వాత డెహ్రాడూన్ కు బయలుదేరాను. ఉదయమే గెస్ట్ హౌస్ లో గదిని ఖాళీ చేశాను. అయితే నా స్నేహితుడొకరు మిలిటరీ అకాడమీకి సమీపంలో మరో అతిథిగృహంలో గదిని బుక్ చేసి ఉంచాడు.


రస్కిన్ బాండ్, ప్రేమ్

రస్కిన్ బాండ్, ప్రేమ్


తర్వాతి గమ్యస్థానం ఖాట్మండు. అక్కడికి వెళ్ళేందుకు రెండు మార్గాలున్నాయి. గోరఖ్ పూర్ వైపుగా దక్షిణ నేపాల్ నుంచి గానీ, బన్ బాసా మీదుగా పశ్చిమ నేపాల్ మీదుగా గానీ అక్కడికి చేరవచ్చు. నేను బన్ బసా మార్గాన్ని ఎంచుకున్నాను. డెహ్రాడూన్ నుంచి బన్ బసా కు రెగ్యులర్ బస్సులు ఉన్నాయి. డెహ్రాడూన్ నుంచి అక్కడికి పన్నెండు గంటల ప్రయాణం. ఈ ప్రాంతానికి ఎలాంటి ఎయిర్ కండిషన్ బస్సులూ నడవవు. వేసవిలో మీ ప్రయాణం బాగా గుర్తుండిపోయేలా సాగుతుంది.

మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో డెహ్రాడూన్ వదిలి అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో బన్ బసా చేరాను. నేను ఒక్కడినే అక్కడ దిగాను. నాచుట్టూ ఎవరూ లేరు. సమీపంలో ఓ దుకాణం కనిపించింది. ఓ పది పన్నెండు మంది అక్కడి ఓ చెక్క మంచంపై కూర్చుని ఉన్నారు. వారి కళ్ళు ఎర్రగా ఉండడాన్ని బట్టి చూస్తే.. వారు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. అందులో ఒకడు నిద్రపోవాలా అని అడిగాడు. అవునన్నాను. మరొకడు నన్ను గదికి చేర్చాడు. అక్కడ మూడు చెక్క మంచాలున్నాయి. ఒక బల్బు వెలుగుతోంది. గదికి అద్దె వంద రూపాయలు. బయట చూస్తే డజన్ దాకా మనుషులున్నారు. వారు అర్ధరాత్రి నావద్దనున్నదంతా దోచుకుంటే.. నా పరిస్థితి ఏంటి అని కొంత భయం వేసింది. దీంతో నావద్దనున్న చాకును బయటికి తీసి, పక్కలో పెట్టుకుని నిద్రించాను. అదృష్టవశాత్తూ నేను ఊహించిన ప్రమాదమేదీ జరగలేదు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో నన్ను గదిలోకి తీసుకు వచ్చిన మనిషే వచ్చి నిద్ర లేపాడు.

భారత్ లోని బన్ బసా నుంచి నేపాల్ లోని మహేంద్రనగర్ వరకు గుర్రపుబగ్గీలు తిరుగుతాయి, పదిహేను కిలోమీటర్ల దూరంలోని ఈప్రాంతానికి సరిహద్దు దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. గుర్రపు బగ్గీల వాళ్ళు, రూ80 నుంచి రూ 100 వరకూ వసూలు చేశారు. నేపాల్ పోలీసులు, సరిహద్దు రక్షణ దళాలతో సమస్యలు సృష్టించకుండా ఉండేందుకు. అనుమానాస్పద వస్తువులు తరలించకుండా ఉండేందుకు, ముందస్తుగా ఓ యాభై రూపాయలను అదనంగా వసూలు చేశారు. ఇతర సరిహద్దుల్లో మాదిరిగా పెద్ద పెద్ద గేట్లు, గోడలు ఏవీ లేవక్కడ. సరిహద్దు దాటగానే, నేపాల్ స్వాగతం అంటూ బోర్డు కనిపిస్తుంది. తమ భూభాగంలోకి రాగానే.. నేపాల్ పోలీసులు, ప్రయాణికులను ఆమూలాగ్రం తనిఖీ చేస్తారు.

మహేంద్ర నగర్ నుంచి ఖాట్మండుకు ఏసీ బస్సులో టికెట్ బుక్ చేసుకున్నాను. నేపాల్ లో చాలా వస్తువులు అత్యంత చౌకగా దొరుకుతాయి. మహేంద్ర నగర్ నుంచి ఖాట్మండుకు దాదాపు 17 గంటల పాటు సాగే ప్రయాణానికి రూ.1300 వసూలు చేశారు. అందులోనే భోజనమూ అందించారు. నేపాల్ ప్రజలు పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తారన్న విషయాన్ని గుర్తించాను. రహదారి కూడళ్ళలో చెత్త కుండీలను పరిశుభ్రంగా ఉంచడం గమనించాను. బస్సు ఆపరేటర్ మధ్యమధ్యలో నీటిని అందిస్తూ.. భోజనానికి మంచి హోటల్ కుతీసుకు వెళ్ళారు. 3 స్టార్ తరహా హోటల్ లో భోజనం బాగుండింది.


గార్డెన్ ఆఫ్ డ్రీమ్స్, ఖాట్మండు

గార్డెన్ ఆఫ్ డ్రీమ్స్, ఖాట్మండు


దాదాపు 29 గంటల పాటు ప్రయాణించి మర్నాడు ఉదయం ఖాట్మండు చేరుకున్నాక, థామెల్ వద్ద ఓ హోటల్ లో గది తీసుకున్నాను. ఈ ప్రదేశం పర్యాటకుల కూడలి లాంటిది. అక్కడ ఫ్రెషప్ అయ్యాక, నా స్నేహితుల్లో ఒకరు నన్ను బుద్ధుడి స్తూపం వద్దకు తీసుకు వెళ్ళాడు. ఇది నేపాల్ లోని అతి పెద్దదైన బౌద్ధ విగ్రహం. దాని తర్వాత మేము పశుపతినాథ ఆలయానికి వెళ్ళఆము. ఖాట్మండు నుంచి మూడు గంటల ప్రయాణం చేశాక, ప్రపంచంలోనే మూడోది, నేపాల్ లో తొలిదీ అయిన ప్రమాదకర బంగీ జంప్ స్పాట్ లు ఉన్నాయి. అయితే వాటిని ప్రస్తుతం మూసేశారు. నేను కాసేపు అక్కడ గడిపాను. తర్వాత కలల తోటగా ప్రసిద్ధమైన అందమైన ప్రదేశానికి వెళ్ళాను. అస్తమించే సూర్యుడి అందాలు పడి ఆ ప్రదేశం ద్విగుణీకృత శోభన సంతరించుకుంది. నా పర్యటనలో ఖాట్మండు చివరి మజిలీ. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యాను.

మొత్తం ఖర్చు :

ఢిల్లీ నుంచి అమృత్ సర్ : రూ. 600

బస : రూ 20

వాగా సరిహద్దు వరకు : రూ, 100

అమృత్ సర్ నుంచి పఠాన్ కోట్ : రూ. 80

పఠాన్ కోఠ్ నుంచి కాంగ్రా లోయ మీదుగా ధర్మశాల : రూ. 45

ధర్మశాల నుంచి మెక్ లియోడ్ టంజ్ (రాను పోను) : రూ. 20

ధర్మశాల నుంచి డెహ్రాడూన్ : రూ. 550

డెహ్రాడూన్ నుంచి ముస్సోరి (తిరుగు ప్రయాణం) : రూ. 100

బస : రూ. 200

డెహ్రాడూన్ నుంచి శాస్త్రధార _ రాబర్స్ గుహలు : రూ. 50

డెహ్రాడూన్ నుంచి బ్యాన్ బాసా : రూ. 350

బ్యాన్ బాసా నుంచి మహేంద్రనగర్ : రూ. 130

మహేంద్ర నగర్ నుంచి ఖాట్మండు : రూ 1300

బస : రూ. 500

బౌద్ధ స్తూపం, పశుపతినాథ్ : రూ 50

మొత్తం ఖర్చు కేవలం రూ.4100. ఇది 70 అమెరికన్ డాలర్లతో సమానం. భోజనం ఖర్చులను ఇందులో చేర్చలేదు. నేను చాలా చోట్ల రోడ్డుపక్కన హోటళ్ళు, బడ్డీ కొట్లలోనే ఆహారం తిన్నాను. కాబట్టి వాటి వివరాలు నాకు గుర్తు లేవు. ఖాట్మండు నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చాను కాబట్టి, ఆ వివరాలనూ ఈ జాబితాలో చేర్చలేదు. గోరఖ్ పూర్ మీదుగా ప్రయాణించడం మరో మంచి ప్రత్యామ్నాయం. దీని వల్ల కనీసం వెయ్యి రూపాయల ఖర్చు తగ్గుతుంది.

చేయాల్సినవి.. కూడనివి

  • ట్యాక్సీల్లో ఎప్పుడూ ప్రయాణించ వద్దు. బస్సు లేదా షేర్ క్యాబ్స్ లో ప్రయాణించండి. ఇవి, డబ్బును పొదుపు చేసే కీలక నిర్ణయాలు
  • రాత్రిళ్ళే ఎక్కువగా ప్రయాణించండి. దీని వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి.
  • దీనివల్ల హోటల్ వసతి ఖర్చులు మిగులుతాయి
  • రాత్రి ప్రయాణం అనంతరం మీ గమ్యాన్ని చేరేసరికి మీరు తాజాగా ఉంటారు. పరిసర ప్రాంతాల్లో పర్యటించే శక్తి ఉంటుంది. పగటి పూట ప్రయాణం చేస్తే.. మీ గమ్యాన్ని చేరేసరికి మీరు బాగా అలసి పోయి ఉంటారు. నిద్ర ముంచుకు వస్తుంటుంది. ఫలితంగా హోటళ్ళలో బస చేయాల్సి వస్తుంది. సాయంత్రమే మీరు హోటల్ లో చేరినా.. వాళ్ళు, మీ అనివార్యతను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఖర్చు అదుపు తప్పి పోతుంది.
  • మీతో ఎప్పుడూ ఒక మంచినీళ్ళ సీసాను వెంట ఉంచుకొండి. అది ఖాళీ అయితే.. కొత్త నీటి బాటిళ్ళు కొనకుండా, స్థానికంగా హోటళ్ళలోని నీటితో భర్తీ చేసుకోండి.
  • మీ వసతి కోసం.. సిగ్గపడకుండా, అతి చవకైన హోటల్ ఎక్కడుందో స్థానికుల నుంచి ఆరా తీయండి. మీ లగేజి భద్రత కోసం, మీరు రిఫ్రెష్ అవడం కోసమే హోటల్ గది అని గుర్తించండి.

Aditya Bhushan Dwivedi Twitter at @adi_bhushan