కాలంతో కనుమరుగైన సిక్కుల వీరోచిత పోరాటగాథ !
Thursday January 28, 2016,
2 min Read
ఆ రాణి ప్రేమ పురాణాలు, ఆ ముట్టడికైన ఖర్చులు, కైఫియతులూ, మతలబులూ, ఇవి కావోయి చరిత్ర సారం అన్నారు మహాకవి శ్రీశ్రీ. నిజమే.! కానీ.. చరిత్రను మలుపుతిప్పిన సంఘటలన్నీ ఎప్పుడెప్పుడు చోటుచేసుకున్నాయో చూస్తే.. తారీఖులన్నీ అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదని మనకు అర్ధమవుతుంది. మన భారతదేశ చరిత్ర వరకూ అలాంటి కొట్టిపడేయలేని తారీఖులు లేక్కలేనన్ని ఉన్నాయి.
ఆయా సమయాల్లో జరిగిన ఉద్యమాలు, పోరాటాలూ, యుద్ధాలు.. ఇలా ప్రతీ తేదీ భారతదేశ చరిత్రలో ఒకొక్క పేజీని లిఖిస్తూ పోయాయి. ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్ష రగిల్చిన పోరాటాలూ.. చనిపోతామని తెలిసి కూడా వెన్నుచూపకుండా శతృవులపై పోరాడి గెలిచిన సందర్భాలు.. ఇలా ఎన్నో సంఘటనలకు మన దేశం సజీవ సాక్ష్యం. అలాంటి భారతదేశంలో జరిగిన ఓ పోరాటం.. ఇప్పటికీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.కానీ.. గ్రీకు యుద్ధాన్ని తలదన్నేలా జరిగిన ఈ వీరోచిత పోరాటం.. కాలంతో పాటే మరుగునపడిపోయింది.
అది సెప్టెంబర్ 18, 1897. సారాగర్హి యుద్ధానికి తెరలేచిన రోజు. బ్రిటీషువారు పూర్తిగా మనదేశంపై పట్టు సాధించినా కూడా.. అక్కడక్కడా బ్రిటీష్ వ్యతిరేక పోరాటాలు జరుగుతున్న రోజులవి. ఉత్తరభారతంలో మహారాజు.. రంజిత్ సింగ్ అప్పటికి సిక్కులనందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి అక్కడ గొడవలు జరగకుండా ఆపడానికి అనేక చిన్న చిన్న దుర్గాలు కట్టించాడు. అలా కట్టించిన వాటిలో ఒకటే.. మన కథకు మూలమైన సారాగర్హి.
బ్రిటీష్ పాలన కొనసాగుతున్న ఆ సమయంలో సారాగర్హి దుర్గాన్ని పరిరక్షించేందుకు హలవిల్దార్ సింగ్ నేతృత్వంలో 36 సిక్కు ట్రూప్స్కి చెందిన 21 మంది జవాన్లను కాపలాగా పెట్టారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆఫ్ఘన్ తెగలవాళ్లు.. అదే రోజు దుర్గంపై దాడికి దిగారు. సారాగర్హిని తమ చేతుల్లోకి తీసుకోవడం ద్వారా పక్కనే ఉన్న(ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న) కీలక ప్రదేశాలైన లాక్హార్ట్, గులిస్తాన్ దుర్గాలను కూడా తమ వశం చేసుకోవాలన్నది వాళ్ల ప్లాన్.
మట్టి గోడలు, చెక్క తలుపులతో తయారు చేయబడిన ఈ దుర్గాన్ని టెలిగ్రాఫ్ సమాచారాలను పంపించేందుకు వినియోగించేవారు. అంతమంది సైన్యాన్ని చూసి.. తమ ఓటమి ఖాయమని నిశ్చయించుకున్నప్పటికీ.. ఎదురొడ్డి పోరాడాలనే నిర్ణయించుకున్నారు హవిల్దార్ సింగ్ నేతృత్వంలోని సైన్యం. గులిస్తాన్ దగ్గరకు ప్రత్యర్ధులు చేరుకునే సమయానికి అక్కడ తమ వాళ్లను ఏర్పాటు చేసుకోగలిగితే.. కనీసం దాన్నయినా కాపాడుకోవచ్చన్నది వాళ్ల ఆలోచన.
భీకర యుద్ధం మొదలయింది. సారాగర్హి చెక్క తలుపులను పగులకొట్టేందుకు ఆఫ్ఘన్లు తీవ్రప్రయత్నం చేస్తున్నప్పటికీ.. సిక్కుసైనికులు వెన్నుచూపలేదు. పోరాడారు. ఎదురొడ్డి నిలిచారు. దీంతో ఏమీ చేయలేక శతృవులు యుద్ధనీతిని మరచి చుట్టు ఉన్న ముళ్లకంపలకు మంటపెట్టి.. ఆ హడావుడిలో లోపలికి ప్రవేశించారు. సారాగర్హి చేజారిపోయింది. అదే ఉత్సాహంతో గులిస్తాన్ కోటవైపు శతృవుల దండయాత్ర మొదలయింది. కానీ.. చావులోనూ సిక్కులు జయాన్నే చూడాలనుకున్నారు. ఆ సమయానికి అక్కడ సిక్కు సైనికులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఆఫ్ఘన్ల ఓటమి ఖాయమైంది. 21 మంది సిక్కులు వీరోచిత పోరాటం ఫలితంగా ఒక కీలక స్ధావరం శతృవుల చేతికి వెళ్లకుండా ఆగింది.
ఆఫ్ఘన్ల తిరుగుబాటును అణచివేసిన తర్వాత.. బ్రిటీష్ ఆర్మీ సారాగ్రాహిని తిరిగి వశం చేసుకుంది. అప్పుడు కానీ.. సిక్కు సైనికుల వీరోచిత పోరాటం బాహ్యప్రపంచానికి తెలియలేదు. దుర్గంలో ఏకంగా 600 మృతదేహాలు దొరికితే.. అందులో 21 మృతదేహాలు.. యూనిఫాంలో ఉన్న సిక్కు సైనికులవే! ప్రాణాలను గడ్డిపోచలా భావించి.. ప్రాణత్యాగం చేసిన ఈ వీరజవానులకు ఇప్పటికి వీరచక్రకు సమానమైన.. Indian Order of Merit Class III అవార్డు ఇచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. 1987, సెప్టెంబఱ్ 12న మొత్తం బ్రిటన్ పార్లమెంట్ సభ్యులంతా మన సైనికుల వీరోచిత పోరాటానికి సలామ్ కొట్టింది. ఆ దేశ అత్యున్నత సభలో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇప్పటికీ బ్రిటన్ సైన్యం యుద్ధం జరిగిన సెప్టెంబర్ 12న సారాగ్రహి పేరుతో స్మరించుకుంటూ ఉంటుంది.భారతీయులంతా ఎంతో గర్వంగా చెప్పుకునే ఈ వీరోచిత పోరాటాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం అక్కడి పిల్లలకు పాఠశాలల్లో నేర్పుతోంది.