వికలాంగులకు జీవిత భాగస్వామిని వెతికిపెడుతున్న మ్యాట్రిమోనియల్ !

వైకల్యం ఉన్నవారికి పెళ్లి సంబంధాలు కుదుర్చుతున్న వెబ్ సైట్-వికలాంగుల సేవలో అంకిత్ కపూర్, సందీప్ అరోరా

వికలాంగులకు జీవిత భాగస్వామిని వెతికిపెడుతున్న మ్యాట్రిమోనియల్ !

Wednesday January 06, 2016,

3 min Read

పెళ్లి ప్రతి మనిషి జీవితంలో మరపురాని ఘట్టం. కానీ పెళ్లినగానే అమ్మాయైనా అబ్బాయైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎదుటి వారి రూపానికే. అభిప్రాయాలు, అభిరుచులు ఇవన్నీ సెకండరీ. రంగు తక్కువుంటేనే దాన్నో పెద్ద లోపంగా భావిస్తారు. అదే శారీరక లోపం ఉంటే? వారి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొన్నిసార్లయితే శారీరక వైకల్యం ఉన్న వారి పెళ్లి కలగానే మిగిలిపోతుంది.

image


ప్రేమ గుడ్డిదంటారు. కానీ గుడ్డివారిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ఎందుకు ముందుకు రారు? మనసు ముఖ్యం అంటారు.. కానీ శరీరానికే ప్రాధాన్యమిస్తారు. వైకల్యం ఉన్న వారిని భాగస్వామి చేసుకునేందుకు ఎందుకు ఇష్టపడరు? వికలాంగులకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఎందుకింత కష్టపడాలి. లుథియానాకు చెందిన అంకిత్ కపూర్ ను వేధించిన ప్రశ్నలివి. ఈ ఆవేదనలోంచి పుట్టుకొచ్చిందే డిసేబుల్డ్ మ్యాట్రిమోనియల్. సందీప్ ఖురానా, జ్యోతిష్యుడైన వినయ్ ఖురానాతో కలిసి అంకిత్ ఈ మ్యాట్రిమోనియల్ సైట్ ను ప్రారంభించారు.

లక్ష్యం ముందు చిన్నబోయిన వైకల్యం

డిసేబుల్డ్ మ్యాట్రిమోనియల్ డాట్ కాం ను ప్రారంభించిన అంకిత్ కపూర్, సందీప్ అరోరా ఇద్దరూ దృష్టిలోపం ఉన్నవారే. అంకింత్ కు బాల్యం నుంచే చూపు లేదు. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో సందీప్ తన కంటిచూపు కోల్పోయాడు. లుథియానాలోని బ్లైండ్ స్కూల్ లో చదువుతున్న సమయంలో వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. చదువు పూర్తయ్యాక ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు. అప్పుడే జ్యోతిష్యుడైన వినయ్ ఖురానాతో పరిచయం ఏర్పడింది. ముగ్గురి ఆలోచన ఒక్కటే.. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని. ఆ సంకల్పాన్ని కొనసాగించేందుకు ముగ్గురు కలిసి ఆహుతి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. వికలాంగుల చదువు, పెళ్లి కోసం అవసరమైన సాయం చేస్తుందా ట్రస్ట్.

"కాలేజీలో ఉన్నప్పటి నుంచి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మేం చురుగ్గా ఉండేవాళ్లం. అలా మా పరిచయాలు విస్తృతం అయ్యాయి. లుథియానానే కాక దేశంలోని ఇతర ప్రాంతాల వారు కూడా మమ్మల్ని గుర్తుపట్టడం మొదలుపెట్టారు. వికలాంగులు ఐఏఎస్, లాయర్ లాంటి వృత్తుల్లో రాణిస్తున్నప్పటికీ పెళ్లి విషయంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు అని అనిపించింది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాలు చేస్తున్నా పెళ్లి మాత్రం కావడంలేదని బాధపడేవారు"- అంకిత్
image


వెబ్ సైటే ఎందుకు?

కాలం మారినా మనుషుల ఆలోచనా విధానంలో మాత్రం ఇంకా ఆశించిన రీతిలో మార్పు రాలేదు. వికలాంగుల పెళ్లంటేనే ఇప్పటికీ చాలా మంది భయపడతారు. అందుకే అందరూ ఇబ్బందిగా ఫీలయ్యే ఈ పనిని చేయాలని డిసైడయ్యామంటారు అంకిత్. నిర్ణయమైతే తీసుకున్నారు. కానీ పెళ్లి సంబంధాలు కుదర్చడం ఎలా? ఆలోచనల దొంతరలో నుంచి ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇంటర్నెట్ లో పెళ్లి సంబంధాలు కుదిర్చే వెబ్ సైట్లు చాలానే ఉన్నాయి. కానీ వికలాంగుల కోసం ప్రత్యేకించి ఒక్కటీ లేదు. అందుకే శారీరక వైకల్యం ఉన్నవారి కోసం వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. 6-7 నెలలు కష్టపడి 2014 మేలో డిసేబుల్డ్ మ్యాట్రిమోనియల్ డాట్ కాం ను అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి వైకల్యం ఉన్న జంటల్ని ఏకం చేసే పనిలో బిజీ అయిపోయారు ఈ ముగ్గురు మిత్రులు.

వెబ్ సైట్ స్పెషాలిటీ

ప్రస్తుతం డిసేబుల్డ్ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో 800లకు పైగా వికలాంగ యువతీ యువకుల ప్రొఫైళ్లు ఉన్నాయి. ఈ వెబ్ సైట్ లో ఎవరైనా ఫొటో అప్ లోడ్ చేసి ఫ్రీ గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించకుండానే వెబ్ సైట్ లో ఉన్న ప్రొఫైల్ చూడొచ్చు. అవసరమనుకుంటే ఆన్ లైన్ లో మాట్లాడుకోవడమే కాకుండా... ఇరువర్గాల వారు పరస్పర అంగీకారంతో కాంటాక్ట్ డిటెయిల్స్ కూడా ఇచ్చిపుచ్చుకోవచ్చు. టెక్నాలజీతో అంతగా పరిచయం లేని వారు వెబ్ సైట్ లో ఉన్న అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని వివరాలు నింపి పోస్ట్ ద్వారా పంపితే సరైన సంబంధం దొరికితే నిర్వాహకులు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు.

image


నిధుల కొరత

వైబ్ సైట్ కు అవసరమైన నిధుల్ని సమీకరించడం కోసం అంకిత్, సందీప్ చాలానే శ్రమపడ్డారు. వికలాంగ పిల్లల స్కూల్ ఫీజు, పెళ్లి కోసం డబ్బు ఇచ్చేందుకు చాలా మంది ముందుకొస్తారు కానీ వెబ్ సైట్ కోసం ఇచ్చేందుకు ఎవరూ ఇష్టపడరు. ఈ అనుభవం అంకిత్ కు కూడా ఎదురైంది. దీంతో అంకిత్, సందీప్ సొంత డబ్బును ఇందుకోసం ఉపయోగించారు. అంతేకాదు ఈ వెబ్ సైట్ ఆలోచన వచ్చినప్పుడే దాన్ని వికలాంగుల సౌకర్యం కోసమే తప్ప వ్యాపార లాభం కోసం ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారు. మొత్తానికి వారి శ్రమకు ప్రతిఫలం దక్కింది. నిత్యం 15 నుంచి 20 మంది డిసేబుల్డ్ మ్యాట్రిమోనిని చూస్తున్నారు. త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలన్నది ఈ ఫ్రెండ్స్ ఆలోచన. దీనికి అవసరమైన పెట్టుబడి పెట్టేందుకు ఎవరైనా ముందుకొస్తేనే అది సాధ్యమవుతుంది.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా అంకిత్, సందీప్ డిసేబుల్డ్ మ్యాట్రిమోనియల్ పనులు చూసుకునేందుకు కొంత సమయం కేటాయిస్తారు.

“ఇది సామాజిక బాధ్యత. మేం టెక్నాలజీని దుర్వినియోగం చేయడం లేదు. ఈ పని ప్రారంభించిన తర్వాత మాకు ఎన్నో కొత్త విషయాలు అనుభవంలోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో జనం నిరక్షరాస్యులను కూడా వికలాంగుల కేటగిరీలో చేరుస్తున్నారు. డిసేబుల్డ్ మ్యాట్రిమోనియల్ లో చాలా మంది తమ కూతురు లేదా కొడుకు నిరక్షరాస్యులని వారికి వికలాంగ భాగస్వామిని చూసిపెట్టమని కోరుతున్నారు.” -అంకిత్.

ధైర్యం ముందు ఎంత పెద్ద సమస్య అయినా చిన్నబోతుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకుసాగితే గమ్యాన్ని చేరుకోవడం సులభమవుతుంది. అంకిత్ కపూర్, సందీప్ అరోరా తొలి లక్ష్యాన్ని సాధించారు. టెక్నాలజీ గురించి తెలియని వికలాంగులకు కూడా సాయపడాలన్నదే ఇప్పుడు వారి తపన. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్న వారిద్దరు అనుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించాలని యువర్ స్టోరీ మనస్పూర్తిగా కోరుకుంటోంది.